ట్యాంకర్ను ఢీకొన్న లారీ
యడ్లపాడు: అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మండలంలోని తిమ్మాపురం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైవే సెంట్రల్ డివైడర్ మొక్కలకు నీరు పోస్తున్న మహిళా కూలీ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చైన్నె నుంచి విజయవాడ వైపు వెళ్తున్న తమిళనాడుకు చెందిన లారీ, తిమ్మాపురం 16వ నంబర్ జాతీయరహదారి పక్కనే నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపానికి రాగానే అదుపు తప్పింది. ఆ సమయంలో రహదారి డివైడర్పై ఉన్న మొక్కలకు హైవే సిబ్బంది ట్యాంకర్తో నీరు పోస్తున్నారు. వేగం నియంత్రణ కాక ట్యాంకర్ను లారీ వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో మొక్కలకు నీరు పోస్తున్న హైవే ఆధ్వర్యంలో పనిచేస్తున్న కార్మికురాలు బాసర నాగమ్మ(36)కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ట్యాంకర్ను ఢీకొన్న అనంతరం లారీ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని పసిగట్టిన లారీలోని ఇద్దరు కిందకు దూకారు. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు అయింది. ఈ క్రమంలో లారీలోని డ్రైవింగ్ సీట్లోనే ఉన్న తమిళనాడుకు చెందిన డ్రైవర్ కేబిన్లో చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న యడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కేబినన్లో చిక్కుకున్న డ్రైవర్ను చాకచక్యంగా వెలికితీశారు. డ్రైవర్ కాలికి తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన నాగమ్మ మృతదేహాన్ని చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతురాలు ఏడాది కిందట కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడం తాలూకా బాటికేరెక్క గౌట్ గ్రామ నుంచి కుటుంబంతో వలస వచ్చి హైవే క్యాంపులో ఉంటూ రోజువారీ కూలీలుగా పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
హైవే పనులు చేస్తున్న మహిళా కూలీ
మృతి
మృతురాలు కర్ణాటక వాసి


