అదనపు భారం తగ్గించుకునేందుకు తిప్పలు
సత్తెనపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలపై బాదుడు కొనసాగుతూనే ఉంది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా భూముల విలువ పెంపునకు చర్యలు చేపట్టింది. దీంతోపాటు స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చార్జీలను రెండోసారి భారీగా సర్కార్ పెంచింది. పట్టణాలు, పట్టణ శివారు ప్రాంతాలే కాదు .. గ్రామాల్లోనూ ఇప్పటికే రిజిస్ట్రేషన్ అదనపు భారం ఉంది. పెంచిన చార్జీలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు కసరత్తు చేశారు. జిల్లాలో నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, క్రోసూరు, పెదకూరపాడు, అమరావతి, పిడుగురాళ్ల, గురజాల, మాచర్లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ విలువ స్థిరాస్తి ఉన్న ప్రాంతాన్ని బట్టి 10 నుంచి 30 శాతం వరకూ పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది రూ. 382 కోట్లు ఈ కార్యాలయాల నుంచి ఆదాయం సమకూరింది. ఈ ఏడాదికి రూ.510 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్ని మరింత పెంచేలా తాజా మార్పులు ఉన్నాయి. మరోవైపు అదనపు భారం తగ్గించుకునేందుకు క్రయవిక్రయదారులు గడువు పెంపునకు ముందు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు రావడంతో కిటకిటలాడాయి. నిత్యం 200– 300 వరకు రిజిస్ట్రేషన్లు జిల్లా వ్యాప్తంగా జరిగేవి. గడువుకు రెండు రోజుల ముందు శుక్రవారం దాదాపు రెట్టింపు సంఖ్యలో జరిగాయి. గతంలో కొనుగోలు చేసుకుని అగ్రిమెంట్ల మీద ఉన్న వారు వీరిలో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
చార్జీల పెంపునకు ముందు రోజు రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిట


