సాక్షి, విజయవాడ: తాను ఎస్టీగా పుట్టడమే నేరమా? అంటూ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన పోస్ట్ చేశారు. ‘‘ఉన్నత ఉద్యోగాల్లో చిన్నకులాల వారు ఉంటే తట్టుకోలేరా?. రఘురామ కేసులో ఉద్దేశపూర్వకంగా నన్ను ఇరికించారు. 2021లో జరిగిన ఘటన ఇది. 2024లో ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు. నా పాత్ర లేకున్నా నన్ను నిందితుడిగా చేర్చారు’’ అంటూ సునీల్ నాయక్ ట్వీట్ చేశారు. రఘురామ కాల్ డేటా తీస్తే ఎంతమందిని బెదిరించారో తెలుస్తుందని.. సరైనా సమయంలో ఆధారాలు బయటపడతానంటూ సునీల్ నాయక్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

రెడ్బుక్ రాజ్యాంగ వేధింపులను బిహార్లో కూడా అమలు చేసేందుకు బరితెగించిన ఏపీ పోలీసులు ఘోర పరాభవానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిహార్లో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఐపీఎస్, ఐజీ స్థాయి అధికారి సునీల్ నాయక్ను అక్రమంగా అరెస్టు చేసేందుకు అక్కడకు వెళ్లిన సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ దామోదర్ తన బృందంతో కలసి బీభత్సం సృష్టించారు. సోమవారం తెల్లవారుజామున పట్నాలోని సునీల్ నాయక్ నివాసం గోడదూకి మరీ ఎస్పీ దామోదర్ బృందం కిడ్నాపర్ల మాదిరిగా చొరబడటం తీవ్ర విభ్రాంతికి గురి చేసింది. ఏపీ పోలీసుల దౌర్జన్యాన్ని బిహార్ పోలీసు యంత్రాంగం యావత్తూ ఒక్కటై అడ్డుకుంది.
మరోవైపు, ఏపీ పోలీసుల తీరుపై పట్నా కోర్టు తీవ్రంగా మండిపడింది. ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారులు పాటించాల్సిన కనీస నిబంధనలను కూడా అనుసరించకుండా ఓ ఐపీఎస్ అధికారి నివాసంలో చొరబడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఎఫ్ఐఆర్లో పేరు లేదు.. కేసు డైరీ లేదు.. స్థానిక కోర్టు నుంచి వారెంట్ లేదు.. ఇవేవీ లేకుండా ఒక సామాన్యుడిని కూడా అరెస్టు చేయడానికి వీల్లేదు.. అటువంటిది ఒక ఐపీఎస్ అధికారిని అరెస్టు చేయడానికి ఏపీ నుంచి పోలీసులు బిహార్ రావడం ఏమిటి..? సునీల్ నాయక్ అరెస్టును అనుమతించేది లేదు.. ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసే ప్రసక్తే లేదు..‘‘ అని పట్నా సివిల్ కోర్టు మండిపడింది. సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది.


