నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన డ్యాం పనులు
సాంకేతిక లోపాలను సీడబ్ల్యూసీ ఎత్తిచూపడమే నిదర్శనం
గతంలో కాఫర్ డ్యాంలు నిర్మించకుండా డయాఫ్రం వాల్ వేయడం వల్ల అది కోతకు గురై దెబ్బతింది
ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.3 వేల కోట్ల వ్యయం
గుణపాఠం నేర్చుకోవాల్సిందిపోయి మళ్లీ అవే తప్పులు చేస్తున్నారు
సాంకేతిక లోపాలను సరిదిద్దకుండా డ్యాంను పూర్తి చేస్తే ప్రమాదమే
భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వాటిల్లితే భారీ ప్రాణ, ఆస్తి నష్టం
తక్షణమే సాంకేతిక లోపాలను సరిదిద్దండి
సీడబ్ల్యూసీ డిజైన్లు, మార్గదర్శకాల మేరకు పనులు చేపట్టండి
సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ లేఖ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో ప్రధాన(ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం పనులను నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రధాన డ్యాం గ్యాప్–2లో చేస్తున్న పనుల్లో సాంకేతిక లోపాలపై సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) అభ్యంతరాలు వ్యక్తం చేయడం దీనికి నిదర్శనమన్నారు. తక్షణమే సాంకేతిక లోపాలను సరిదిద్ది సీడబ్ల్యూసీ డిజైన్లు, మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టు పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబుకు ఉండవల్లి గురువారం లేఖ రాశారు.
ఈ లేఖను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి కందుల దుర్గేష్ లకు కూడా పంపారు. గతంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి, గోదావరి ప్రవాహాన్ని మళ్లించాల్సి ఉండగా, ఆ పనులు చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మించడంతో వరద ఉద్ధృతికి అది కోతకు గురై దెబ్బతిందని, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం కోతకు గుౖరె విధ్వంసం చోటుచేసుకుందని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
దానివల్లే ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ నిర్మించడానికి, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు రూ.3 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఆ మేరకు ప్రజాధనం వృథా అయిందంటూ ఎత్తిచూపారు. ఆ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిందిపోయి చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అవే తప్పులను చేస్తోందంటూ దుయ్యబట్టారు. సాంకేతిక లోపాలను సరిదిద్దకుండా ప్రాజెక్టును పూరి్తచేస్తే భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వాటిల్లితే దిగువ ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని సీఎం చంద్రబాబును హెచ్చరించారు.
ఉండవల్లి లేఖలో ప్రధానాంశాలు ఇవీ..
⇒ పోలవరం ప్రాజెక్టు పనులను జనవరి 19, 20, 21 తేదీల్లో నిపుణుల కమిటీ, పలు సాంకేతిక సంస్థలు, ఆఫ్రి వంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రతినిధులతో సీడబ్ల్యూసీ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు పనులపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ సమావేశం మినిట్స్ను జనవరి 30న లేఖ రూపంలో సీడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.
⇒ ప్రధాన డ్యాం గ్యాప్–2లో గోదావరి నదీ గర్భం సముద్రమట్టానికి 8.32 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి ప్రధాన డ్యాం నిర్మించాలి. కానీ.. 15.50 మీటర్ల నుంచి ప్రధాన డ్యాంను నిరి్మస్తున్నారు. దీని వల్ల డ్యాం కింద ఇసుక పొరలు కోతకు గురై డ్యాం కోతకు గురై ప్రమాదం ఉంది.
⇒ టెయిల్ వాటర్ లెవల్ను ఎలాంటి బలమైన సాంకేతిక కారణం లేకుండా 25 మీటర్ల నుంచి 16 మీటర్లు, 13.5 మీటర్లకు తగ్గించడం వల్ల నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్ని ప్రధాన డ్యాం దెబ్బతినే ప్రమాదం ఉందని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తం చేసింది.
⇒ ఫిల్టర్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ, వేవ్ రన్ అప్(అలల తాకిడి ప్రభావం) తదితర డిజైన్లు డిజైనర్ ఆఫ్రి నుంచి ఇంకా అందలేదని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. డ్యాం భూకంపాలకు తట్టుకోగలదా అనే అంశంపై ఆఫ్రి ఇచి్చన నివేదికలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని సీడబ్ల్యూసీ ఎత్తిచూపింది.
⇒ డిజైన్లు ఆమోదం పొందకుండా పనులు పూర్తి చేయడం.. ఆ తర్వాత వాటికి ఆమోదం పొందడం(పోస్ట్ ఫ్యాక్టో ఆప్రూవల్స్) అత్యంత ప్రమాదకరమని సీడబ్ల్యూసీ హెచ్చరించింది. ఒక సారి డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత దానిలో లోపాలు కన్పిస్తే వాటిని మార్చడం సాంకేతికంగా అసాధ్యమని.. దీని వల్ల భారీగా నష్టం వాటిల్లుతుందని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది.


