గుంటూరు జీజీహెచ్లో చేతులపై రోగిని ఎమర్జెన్సీ వార్డుకు మోసుకెళుతున్న బంధువులు
గుంటూరు జీజీహెచ్ ఎమర్జెన్సీ వార్డులో సేవలు మృగ్యం
స్ట్రెచ్చర్లు, వీల్చైర్లు లేక రోగుల అవస్థలు
నడవలేని రోగులను బంధువులే మోసుకెళ్తున్న దుస్థితి
గుంటూరు మెడికల్: సుస్థిర పాలన అని డబ్బాలు కొట్టుకుంటున్న చంద్రబాబు సర్కారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులూ కల్పించలేక చతికిలపడుతోంది. ఫలితంగా పేద రోగులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. గుంటూరు జీజీహెచ్ అత్యవసర వైద్యసేవల విభాగంలో దర్శనమిచ్చిన ఈ చిత్రమే సర్కారు ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఈ ఆస్పత్రిలో రోగులను వార్డులకు, వైద్యుల వద్దకు తరలించేందుకు వీల్చైర్లు, స్ట్రెచ్చర్లు లేవు. ఫలితంగా గురువారం అత్యవసర సేవల కోసం తీసుకువచ్చిన ఓ రోగిని బంధువులే మోసుకెళ్లారు.
ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సర్కారు తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా ఉంటే వైద్యులూ తమకు కేటాయించిన గదుల్లో అందుబాటులో ఉండడం లేదు. ఫలితంగా వైద్యసేవలు అందక రోగులు, వారి బంధువులు వార్డుల్లోనే పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పేద రోగులు ఎక్కువగా గుంటూరు జీజీహెచ్కి తరలివస్తుంటారు. రోజుకు సుమారు నాలుగు వేలకు పైగా ఓపీ ఉంటుంది.
ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ ఆస్పత్రిలోనే వసతుల కల్పనను ప్రభుత్వం గాలికొదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రివేళల్లో అయితే ఆస్పత్రిలో దుస్థితి మరీ ఘోరంగా ఉంటుందని రోగులు చెబుతున్నారు. డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఎమర్జెన్సీ, ఇతర వార్డుల్లో వైద్య సేవలు సక్రమంగా అందేలా చూడాల్సిన సివిల్ సర్జన్ ఆర్ఎంఓ వ్యవస్థ ఈ ఆసుపత్రిలో కానరాకపోవడం గమనార్హం.


