బిహార్ క్యాడర్ ఐపీఎస్ సునీల్ నాయక్ సంచలన ట్వీట్
లేదంటే నన్ను నిందితుడిగా చేర్చి అక్రమ కేసు పెడతామని బెదిరించారు
అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ పేరు కూడా చెప్పాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు
అవాస్తవాలు చెప్పేందుకు నేను నిరాకరించడం వల్లే నాపై అక్రమ కేసులు
నేను చెప్పేవాటికి అన్ని ఆధారాలున్నాయ్.. సరైన సమయంలో బయటపెడతా
ఎస్టీగా పుట్టడమే నా నేరమా..! ఉన్నతస్థానాల్లో ఉంటే జీర్ణించుకోలేరా?
ఎస్పీ దామోదర్ భూ దందాలు, ఇసుక, మైనింగ్ దందాలపై విచారణ ఏది?
నా తల్లి పట్ల అసభ్యంగా, అవమానకరంగా వ్యవహరించారు
అవమానించిన అందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతా
సాక్షి, అమరావతి: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు తనపై బనాయించిన అక్రమ కేసులో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ పేర్లు చెప్పాలని తనపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన వాస్తవాలను బహిర్గతం చేశారు. రఘురామకృష్ణరాజు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని.. ఆయన ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో ఫోన్కు మెస్సేజ్ చేశారని వెల్లడించారు.
‘వైఎస్ జగన్మోహన్రెడ్డి, పీవీ సునీల్ కుమార్ పేర్లు చెప్పకపోతే నిన్ను నిందితుడిగా చేరుస్తాం..’ అని ఆ మెస్సేజ్లో బెదిరించారని పేర్కొన్నారు. అవాస్తవాలను చెప్పేందుకు సమ్మతించకపోవడం వల్లే తనపై అక్రమ కేసు నమోదు చేశారని స్పష్టం చేశారు. రఘురామకృష్ణరాజు కాల్ డేటా తీస్తే అవన్నీ బయటపడతాయని, చాలామందిని ఈ కేసులో అక్రమంగా ఇరికించారన్నది వెల్లడవుతుందన్నారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని ఆధారాలు చూపిస్తానని ప్రకటించారు.

ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ దామోదర్ తన తల్లి పట్ల అసభ్యంగా, అవమానకరంగా వ్యవహరించారని సునీల్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎస్టీగా పుట్టడమే నేను చేసిన నేరమా..? చిన్న కులాల వారు కష్టపడి చదివి ఐపీఎస్ లాంటి ఉన్నత స్థానాలకు చేరితే జీర్ణించుకోలేరా?..’ అని సునీల్ నాయక్ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రస్తుతం బిహార్లో అగ్నిమాపక శాఖ, హోంగార్డ్స్ విభాగం ఐజీగా ఉన్న సునీల్ నాయక్ను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు పట్నాలో సోమవారం హల్చల్ చేసిన విషయం విదితమే. గతంలో డిప్యూటేషన్పై ఏపీలో పనిచేసిన సునీల్ నాయక్పై అక్రమంగా బనాయించిన కేసులో కనీసం అరెస్టు వారెంట్, కేసు డైరీ లేకుండా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు యత్నించారు. అయితే ఎస్పీ దామోదర్ నేతృత్వంలో ఏపీ పోలీసుల అరాచకాన్ని బిహార్ పోలీసులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు.
ఏపీ పోలీసుల తీరుపై పట్నా కోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఏపీ పోలీసులు అవమాన భారంతో తిరుగుముఖం పట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తనపట్ల వ్యవహరించిన తీరుపై సునీల్ నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన ఎక్స్ ఖాతాలో మంగళవారం సంచలన పోస్టు పెట్టారు. అందులో ఏమన్నారంటే..
» ఎస్టీగా పుట్టడమే నేను చేసిన నేరమా..? గిరిజన లంబాడి కుటుంబంలో పుట్టి చెన్నై ఐఐటీలో గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యా. చిన్న కులాల వాళ్లు ఉన్నత స్థానంలో ఉంటే జీరి్ణంచుకోలేరా..? రఘురామకృష్ణరాజు కేసులో నన్ను అక్రమంగా ఇరికించారు. 2021లో జరిగినట్లు చెబుతున్న సంఘటనపై 2024లో కేసు నమోదు చేశారు. అందులో నా పాత్ర ఏమాత్రం లేకపోయినా ఇరికించారు.
» హెచ్డీఎఫ్సీ బ్యాంకు మహిళా మేనేజర్ను అడ్డు పెట్టుకుని ఆయన (ఎస్పీ దామోదర్) ఎన్నో భూ దందాలకు పాల్పడితే ఇప్పటికీ విచారణ లేదు. ఇసుక, గ్రానైట్, మైనింగ్ దందాలకు పాల్పడితే విచారణ లేదు. ధోతీ కార్యక్రమం నిర్వహించి రూ.4 కోట్లు విలువైన బంగారం, బహుమతులు పొందితే నేటికీ విచారణ లేదు.
కానీ లంబాడీ కులంలో పుట్టిన నేను ఐపీఎస్ అధికారిని కావడమే నేను చేసిన నేరమా..? అందుకే నాపై అక్రమ కేసు పెట్టారా? అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఐడీ చీఫ్ పీవీ సునీల్కుమార్ పేర్లు చెప్పమని ఎంతోమంది నాపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నాతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డులు, ఇతర ఆధారాలన్నీ నా వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. తగిన సమయంలో ఆ ఆధారాలన్నీ బయటపెడతా. లంబాడీ కులంలో పుట్టిన నాకు మాట్లాడే హక్కు ఉండదనే అహంకారంతో వారు అలా వ్యవహరించారు.
» పట్నాలో నా నివాసంలోకి అక్రమంగా ప్రవేశించిన ఏపీ పోలీసు అధికారి (ఎస్పీ దామోదర్) నిబంధనలకు విరుద్ధంగా, దురుసుగా వ్యవహరించారు. తన దగ్గర బాడీ కెమెరా ఉందంటూ మా ఇంట్లో అల్లరి చేశారు. ఆయనతో వచ్చిన పోలీసు అధికారులు నా తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అవమానపరిచారు. నా తల్లిని అవమానించిన అందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతా.


