బాబు బోర్డు తిప్పేశారు | Agrigold victims hunger strike in Vijayawada from today | Sakshi
Sakshi News home page

బాబు బోర్డు తిప్పేశారు

Mar 2 2026 2:33 AM | Updated on Mar 2 2026 2:33 AM

Agrigold victims hunger strike in Vijayawada from today

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామన్న హామీని తప్పిన చంద్రబాబు 

ఆందోళన కార్యక్రమాలకూ స్పందించని వైనం 

నేటి నుంచి విజయవాడలో బాధితుల నిరాహార దీక్ష

సాక్షి, అమరావతి: హామీలతో నమ్మించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, తమను ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంతో అగ్రిగోల్డ్‌ బాధితులు మరోసారి ఆందోళన బాట పట్టారు. కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో బాధితులకు అగ్రిగోల్డ్‌ కంపెనీ ఆస్తులు అమ్మి సొమ్ము చెల్లిస్తామనే హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడంతో బాధితులు మహా విజ్ఞాపన దినం, కన్నీటి పాదయాత్ర, అగ్రిగోల్డ్‌ ఆవేదన దీక్ష వంటి ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు.  

అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మరోసారి ఉద్యమ కార్యాచరణ చేపట్టారు. తొమ్మిది ప్రధాన డిమాండ్లపై ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి అనితతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నెల 2వ తేదీ నుంచి మరోసారి విజయవాడ ధర్నా చౌక్‌లో నిరాహార దీక్షలు చేపట్టి తాజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు అగ్రిగోల్డ్‌ బాధిత సంఘం ప్రకటించింది. 

4వ తేదీ వరకూ రిలే నిరాహార దీక్షాలు చేపట్టి, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే 5వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని ఆదివారం విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం, దానికి తోడు ప్రభుత్వం అలసత్వం, మోసపూరిత విధానాలను ఈ సందర్భంగా నిరసించారు.

హామీ ఇచ్చి ఆదుకున్న జగన్‌  
2019 ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు అగ్రిగోల్డ్‌ బాధితుల వేదనను పట్టించుకోకపోవడంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి.  అప్పట్లో వారిని కలిసి సంఘీభావం తెలిపిన వైఎస్‌ జగన్, బాధితుల పక్షాన పోరాడేందుకు ప్రస్తుత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘాన్ని ఏర్పా­టు చేశారు. బాధితులకు అండగా అనేక ఆందోళనల్లో వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొని మద్దతు పలికారు. 

అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య పరిష్కారానికి చంద్రబాబుకు మనస్సు రాకపోతే తాను అధికారంలోకి వచ్చాక రూ.20వేల లోపు డిపాజిట్లు చెల్లించి ఆదుకుంటామని అప్పట్లో జగన్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి  2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10వేలు, రూ.20వేలు చొప్పున డిపాజిట్లు ఉన్న 10.40­లక్షల మందికి రెండు విడతల్లో మొత్తం రూ.­905.57 కోట్లు చెల్లించి జగన్‌ ప్రభుత్వం ఆదుకుంది. వైఎస్‌ జగన్‌ తరహాలో మిగిలిన బాధితులను ఆదుకుని ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని చంద్రబాబుకు అగ్రిగోల్డ్‌ బాధితులు అల్టిమేటం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement