సాక్షి కథనంపై ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో శేఖర్బాబు
సాక్షి, అమరావతి: ఔను.. రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 44 శాతం మేర రాయితీలిచ్చిన మాట వాస్తవమేనని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో డాక్టర్ గెడ్డం శేఖర్బాబు స్పష్టం చేశారు. ‘రాధికకు ఇన్ని రాయితీలా?’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై గురువారం ప్రభుత్వం తరఫున ఆయన వివరణ ఇచ్చారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం రూ.200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే వాటిని మెగా పరిశ్రమలుగా పరిగణిస్తున్నామన్నారు.
రూ.200 కోట్లకు పైగా ఉన్న మెగా ప్రాజెక్టులకు ఈ పాలసీ ప్రకారం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చే వెసులుబాటు ఉందన్నారు. రాధిక వెజిటబుల్ ఆయిల్స్ లిమిటెడ్ ప్రాజెక్టు మూలధన పెట్టుబడి రూ.218 కోట్లకు పైగా ఉన్నందున పాలసీ ప్రకారం స్థిర మూలధన పెట్టుబడిలో 75 శాతం వరకు ప్రోత్సాహకాలు మంజూరు చేయవచ్చన్నారు. ఈ మేరకు రాయితీలిచ్చామని చెప్పారు.


