సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ మొదటి విద్యా శాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ ఘనంగా నివాళులర్పించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి వైఎస్సార్సీపీ నేతలు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా శాఖా మంత్రిగా దేశానికి ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. లౌకిక జాతీయవాదాన్ని బలంగా సమర్ధించారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో వైఎస్ జగన్ హయాంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, ఎస్ఈసీ మెంబర్ షేక్ మెహబూబ్, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, బొందిలి విభాగం అధ్యక్షుడు సింగ్, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.సాయిబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి పాల్గొన్నారు.


