బయోవ్యర్థాల ప్లాంట్ల కేటాయింపులో పీసీబీ బరితెగింపు
సీపీసీబీ ఆదేశాలకు విరుద్ధంగా రెండుప్లాంట్ల నిర్వహణ కాంట్రాక్టులు
నామినేషన్ విధానంలో ట్రైమెక్స్, గోదావరి బయో సంస్థలకు ఇచ్చేందుకు తీర్మానం
చైర్మన్, అధికారుల తీరుపై అనుమానాలు
సాక్షి, అమరావతి: కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కమీషన్లతో కలుషితమవుతోందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. కావాల్సిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రాష్ట్రంలోని రెండు బయో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల నిర్వహణ కాంట్రాక్టులు ఇచ్చేందుకు నిబంధనలకు తిలోదకాలిచ్చింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నామినేషన్ విధానంలో తమకు కావాల్సిన సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చేందుకు బోర్డు తీర్మానం కూడా చేసేసింది.
విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో బయో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల నిర్వహణ కాంట్రాక్టును ట్రైమెక్స్ ఎనర్జీ, గోదావరి బయో ఇండస్ట్రీస్ సంస్థలకు అప్పగించాలని గతనెల 13న జరిగిన పీసీబీ సమావేశంలో తీర్మానించారు. గతంలోనే ఈ ప్లాంట్లు ఏర్పాటైనా వాటి నిర్వహణ కాంట్రాక్టును ఇచ్చేందుకు గ్యాప్ ఎనాలసిస్ స్టడీ చేయాలని సీపీసీబీ సూచించింది. దీంతో పీసీబీ ఆ స్టడీ చేయించి 2025లో సీపీసీబీకి నివేదిక పంపింది. దాన్ని పరిశీలించిన సీపీసీబీ బయో వేస్ట్ నిర్వహణ అత్యంత జాగ్రత్తగా చేయాల్సిన పని కావడంతో టెండర్ల ప్రక్రియ ద్వారా అనుభవం ఉన్న కంపెనీలను ఎంపిక చేయాలని సూచించింది.
టెండర్లు పిలిస్తే తమకు కావాల్సిన కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడం సాధ్యం కాదనే ఉద్దేశంతో నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇవ్వాలని పీసీబీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రతిపాదనలు తయారు చేసి బోర్డు సమావేశంలో ఆమోదించింది. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉమ్మడిగా బయో వేస్ట్ను సేకరణను సేకరిస్తుండగా దాన్ని విడగొట్టి కొత్తగా విజయనగరం జిల్లాకు ప్రత్యేక కాంట్రాక్టును ట్రైమెక్స్ కంపెనీకి ఇవ్వనుంది.
తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం బయో వేస్ట్ను సేకరిస్తున్న కంపెనీకి పక్కనపెట్టి గోదావరి బయో ఇండస్ట్రీస్ కంపెనీని కాంట్రాక్టు ఇవ్వాలని నిర్ణయించింది. బోర్డు తీర్మానం కూడా చేయడంతో త్వరలో వారికి త్వరలో అధికారికంగా కాంట్రాక్టులు ఇవ్వనుంది.
ఆ సంస్థలతో కుమ్మక్కవడంతోనే !
నిర్వహణ కాంట్రాక్టు కోసం ఆ కంపెనీలు పీసీబీ చైర్మన్తో కుమ్మక్కయినట్లు ఆరోపణలున్నాయి. అందుకే సీపీసీబీ సూచనలు కూడా పట్టించుకోకుండా టెండర్లు లేకుండా నామినేషన్ల పద్ధతిలో అత్యంత కీలకమైన ప్లాంట్ల నిర్వహణను ఆ సంస్థలకు కట్టబెడుతున్నట్లు చెబుతున్నారు.
ఈ వ్యవహారంలో పీసీబీలోని కొందరు ఉన్నతాధికారులు కూడా చైర్మన్కు అండగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్లాంట్ల అప్పగింతతో భారీగా కమీషన్లు దండుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. పీసీబీ ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ శాఖ పరిధిలో ఉన్నా పీసీబీ చైర్మన్ చంద్రబాబుకు బాగా సన్నిహితమైన వ్యక్తి కావడం గమనార్హం.
ప్రజారోగ్యం పోయినా.. కమీషన్లే కావాలి
బయో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల నిర్వహణ అత్యంత సంక్లిష్ట ప్రక్రియ. వీటివల్ల ఆ ప్రాంతంలో పర్యావరణం తీవ్రంగా ప్రభావితమవుతుంది. బయో వ్యర్థాలను కాల్చినప్పుడు ప్రమాదకరమైన డయాక్సిన్స్ వంటి వాయువులు విడుదలవుతాయి. వాటిని నియంత్రించే హై స్టాండర్డ్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉండాలి. అందుకే ఎన్జీటీ, కేంద్ర పర్యావరణశాఖ, సీపీసీబీ.. సరైన సామర్థ్యం ఉన్న కంపెనీలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నాకే అనుమతి ఇస్తుంది.
లేకపోతే ఆయా ప్రాంతాల్లో ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో సీపీసీబీ విజయనగరం, తూర్పుగోదావరి ప్లాంట్ల నిర్వహణ కాంట్రాక్టులు ఇచ్చేందుకు సీపీసీబీ ఇచ్చిన పలు స్పష్టమైన మార్గదర్శకాలను పీసీబీ బుట్టదాఖలు చేసింది. ప్రజల ఆరోగ్యం పోయినా, పర్యావరణం నాశనమైనా సరే.. తమకు కమీషన్లు ఇచ్చే సంస్థలకే కాంట్రాక్టులు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది.


