మళ్లీ రూ.3,000 కోట్ల అప్పు
సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు చేయనున్న ప్రభుత్వం.. నోటిఫై చేసిన ఆర్బీఐ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ రూ.3,000 కోట్లు అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ అప్పు తీసుకోనుంది. 13 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,000 కోట్లు, 15 సంవత్సరాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 17 సంవత్సరాల వ్యవధితో రూ.1,000 కోట్లు చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయనున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నోటిఫై చేసింది.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే బడ్జెట్ పరిధిలో రూ.1,79,264 కోట్లు అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేసే రూ.3,000 కోట్ల అప్పుతో కలిపి మొత్తం బడ్జెట్ పరిధిలోనే చంద్రబాబు సర్కారు 21 నెలల్లో చేసిన అప్పు రూ.1,82,264 కోట్లకు చేరనుంది.


