నేలవాలిన అరటి ధర | Banana farmers suffered losses under Chandrababu Naidu government | Sakshi
Sakshi News home page

నేలవాలిన అరటి ధర

Mar 5 2026 3:01 AM | Updated on Mar 5 2026 3:01 AM

Banana farmers suffered losses under Chandrababu Naidu government

టన్ను రూ.5 వేలకు పడిపోయిన వైనం

దిక్కుతోచని అరటి రైతులు.. స్పందించని చంద్రబాబు ప్రభుత్వం  

రాయలసీమ జిల్లాల్లో 96 వేల ఎకరాల్లో సాగు  

వైఎస్సార్‌సీపీ పాలనలో టన్ను ధర గరిష్టంగా రూ.30 వేలు  

కర్నూలు (అగ్రికల్చర్‌): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఏ పంటకూ కనీస గిట్టుబాటు ధర కూడా రాకపోగా, అన్నదాతలు నష్టాలపాలయ్యారు. ఆ జాబితాలో ఇప్పుడు అరటి రైతులు కూడా చేరారు. సాగు కలిసిరాక.. పంటకు ధరలేక దిక్కుతోచని రైతులు తోటలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఒకప్పుడు రూ. 30 వేలు పలికిన టన్ను అరటి ధర ఇప్పుడు రూ. 5 వేలకు పడిపోయింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించడంలేదు. దీంతో దిక్కుతోచని రైతులు తోటలను దున్నేస్తున్నారు. 

కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలంలోని కర్లకుంట, బాపనదొడ్డి, కోయిలకొండ గ్రామాల్లో దాదాపు 50 ఎకరాల్లో అరటిని తొలగించేశారు. అరటిరైతులను ఆదుకునేదిశగా చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించడంలేదు. రాయలసీమ జిల్లాల్లో మామిడి తర్వాత అరటి ప్రధాన పంట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 13,500, అనంతపురం జిల్లాలో 40 వేలు, వైఎస్సార్‌ కడప జిల్లాలో 36 వేలు, చిత్తూరు జిల్లాలో 6,500 ఎకరాల్లో.. మొత్తం 96 వేల ఎకరాల్లో అరటి సాగవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది, ఓర్వకల్లు మండలాల్లో సుగంధాలు, చిన్న పచ్చ అరటి సాగుచేస్తారు. 

మిగిలిన అన్ని ప్రాంతాల్లో టిష్యూకల్చర్‌ (గ్రాండ్‌ నైన్‌) అరటి మాత్రమే సాగుచేస్తారు. అనేకమంది రైతులు ల్యాబ్‌ల్లో వృద్ధిచేసిన పిలకలు తెచ్చి నాటుతున్నారు. అరటిసాగు కలిసి వస్తుండటం, గిట్టుబాటు ధరలు లభిస్తుండటంతో 2024–25, 2025–26 సంవత్సరాల్లో కూడా దీని సాగుపై ప్రత్యేకదృష్టి కేంద్రీకరించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ధరలు తారుమారవడంతో నష్టాలు తప్పని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది అక్టోబర్, నవంబర్‌ నెలల్లో ధరలు పడిపోయినపుడు చంద్రబాబు ప్రభుత్వం హడావుడి చేసింది.  అరటి రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించకుండా ఫ్రూట్‌కేర్‌ యాక్టివిటీస్‌ చేపట్టాలని సూచించింది.

ధరాఘాతం: గత ఏడాది నుంచి ఒక్కసారిగా ధరలు నేలను తాకడంతో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. టిష్యూకల్చర్‌ అరటిలో ఎకరాకు 25 టన్నుల దిగుబడి వస్తుంది. టన్నుకు కనీసం రూ.25 వేల ధర ఉంటే రైతుకు మేలు కలుగుతుంది. విదేశాలకు ఎగుమతి చేసే రకాలకే ధరలు పడిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

గత అక్టోబర్, నవంబర్‌ నెలల్లో జి–9 అరటి టన్నుకు సగటున రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు మాత్రమే ధర లభించిందంటే రైతులు ఏ స్థాయిలో నష్టపోయారో తెలుస్తుంది. తర్వాత ధరలు పెరిగినప్పటికీ అరటి కోతలు చురుగ్గా జరుగుతున్న వేళ ఇప్పుడు మళ్లీ ధరలు పడిపోయాయి. ఇటీవల టన్ను ధర రూ.20 వేల వరకు వెళ్లినా.. సరుకు మార్కెట్‌కు వచ్చే సమయానికి ఉన్నట్టుండి టన్ను ధర రూ.5 వేలకు పడిపోయింది.

వక్రభాష్యం: అరటి ఒకసారి నాటుకుంటే మూడేళ్ల పాటు గెలలు వస్తాయి. ఏటా పిలకలు అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. మెయిన్‌టెనెన్స్‌పై ప్రత్యేకదృష్టి పెడతారు. ఇప్పుడు ధరలు పడిపోవడానికి చెబుతున్న కారణాలు వింతగా ఉంటున్నాయి. అనేకమంది రైతులు తక్కువ పెట్టుబడితో మూడోపంట తీస్తారు. రైతులను ఆదుకోవడానికి ముందుకురాని చంద్రబాబు ప్రభుత్వం.. ధరలు పడిపోవడానికి మూడోపంటే కారణమని ఉద్యాన అధికారులతో చెప్పిస్తోంది. 

మూడోపంటలో నాణ్యత ఉండదని, అందువల్ల గిట్టుబాటు ధరలు లభించవని చెబుతున్నారు. కొన్నేళ్లుగా అరటిలో రైతులు మూడోపంట తీస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మాత్రమే ధరలు పడిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపోతున్న రైతులను ఆదుకునేదిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

వైఎస్సార్‌సీపీ హయాంలో విదేశాలకు ఎగుమతి   
రాయలసీమ జిల్లాల్లో  2019–20 నుంచి 2023–24 వరకు రైతులకు అరటిసాగు కలిసి వచి్చంది. అప్పట్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించే విధంగా టిష్యూకల్చర్‌ అరటిసాగుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. అప్పట్లో టన్ను ధర రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు లభించింది. నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాల నుంచి విదేశాలకు అరటి ఎగుమతి అయింది. వైఎస్సార్‌సీపీ హయాంలో రాయలసీమ జిల్లాల నుంచి రైతులు విదేశాలకు 1.25 లక్షల టన్నుల టిష్యూకల్చర్‌ అరటిని ఎగుమతి చేశారు.  

ఏ పంట సాగుచేసినా.. ఆదుకోని చంద్రబాబు ప్రభుత్వం   
చంద్రబాబు ప్రభుత్వం ఏం పంట సాగుచేసినా రైతులను ఆదుకున్న దాఖలాల్లేవు. 2024లో మిర్చి రైతులకు చేయూత ఇవ్వలేదు. మామిడి రైతులకు ఎలాంటి భరోసా దక్కలేదు.  పొగాకు రైతు నష్టపోకుండా మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయిస్తామని ప్రకటించి తర్వాత చేత్తులెత్తేశారు. ఉల్లి ధరలు పడిపోవడంతో క్వింటా రూ.1,200 మద్దతు ధరతో కొంటామని హడావుడి చేసి మూన్నాళ్ల ముచ్చటగా ముగించారు. త

ర్వాత ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లిస్తామని అరకొరగానే ఇచ్చారు. మొక్కజొన్న ధరలు పడిపోయి రైతులు గగ్గోలు పెట్టినా మద్దతు ధరతో కిలో కూడా కొనలేదు. ధరలు పడిపోయి టమాట రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయినప్పటికి చంద్రబాబు ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు.

20 ఎకరాల్లో అరటిని ట్రాక్టరుతో దున్నేశాం  
మాకు అరటి ప్రధానపంట. కొన్నేళ్లుగా సాగు­చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి అరటిసాగులో నష్టాలు మూట­గట్టుకున్నాం. మేం నాలుగెకరాల్లో 2024లో అరటి సాగుచేశాం. రెండేళ్లు పంట తీసుకున్నాం. నాలుగెకరాల్లో ఆరువేల మొక్కలున్నాయి. మొదటి ఏడాది మూడువేల గెలలే అమ్ముడుపో­యాయి. మరో మూడు­వేల గెలల్లో నాణ్యత లేదని వ్యాపారులు కొనలేదు. రూ.­ఆరులక్షల పెట్టుబడి పెడితే మొదటి ఏడాది పంట పెట్టుబడి వరకే వచ్చింది. 

రెండో ఏడా­ది నష్టాలు మూటగట్టుకున్నాం. మామూలు­గా మూడోపంట కూడా సాగుచేస్తాం. అయితే మార్కెట్‌లో ధరలు పడిపోవడం, మార్కెటింగ్‌ సదుపాయం లేకపోవడంతో మా కుటుంబానికి చెందిన 20 ఎకరాల్లో అరటి తోటలను ఫిబ్రవరి మొదటి వారంలో ట్రాక్టరుతో దున్నేశాం. అరటిలో మొదటిసారిగా నష్టాలొచ్చాయి.        – కృష్ణ, బాపనదొడ్డి, క్రిష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement