పట్టణాలు, గ్రామాల్లో ఆస్తి, ఇంటి పన్ను వసూలు నిమిత్తం
సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు
మండిపడుతున్న ఉద్యోగ సంఘ నేతలు
సాక్షి, అమరావతి: ఇంటి పన్ను, ఆస్తి పన్ను వసూళ్ల నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈనెలలో సెలవులు రద్దుచేస్తూ రాష్ట్రంలో పలుచోట్ల అధికారులు ఆదేశాలు జారీచేశారు. సర్వేలు, పన్నుల వసూళ్ల టార్గెట్ కారణంగా పని ఒత్తిడి పెరిగి ఇప్పటికే పెద్ద సంఖ్యలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు చనిపోతున్నారని ఉద్యోగ సంఘం నేతలు ఆందోళన చెందుతుండగా.. తాజాగా ఈ నెలంతా సెలవుల రద్దు ఆదేశాల జారీపై వారు మండిపడుతున్నారు.
విజయవాడ కార్పొరేషన్ అధికారులు సోమవారం ‘ప్రస్తుత ఆరి్థక సంవత్సరం ఈనెల 31తో ముగుస్తున్నందున వార్డు ఆడ్మిన్ సెక్రటరీలు, నగర కార్పొరేషన్ రెవెన్యూ విభాగంలో పనిచేసే ఔట్ డోర్, ఇన్డోర్ సిబ్బంది, క్యాష్ కౌంటర్ల వద్ద పనిచేసే సిబ్బంది అందరూ 3వ తేదీ (మంగళవారం–హోలీ సెలవు) నుంచి ఈ నెలాఖరు వరకు సెలవు రోజులతో సహా అన్ని రోజులు పనిచేయాలి’.. అంటూ ఆదేశాలు జారీచేశారు.

రాష్ట్రంలో ఇంకా చాలాచోట్ల కార్యదర్శులకు ఇలాంటి ఆదేశాలు మౌఖికంగా జారీ అయినట్లు ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. మార్చిలోనే హోలీ, ఉగాది, శ్రీరామ నవమి, రంజాన్ వంటి పండుగలతో పాటు ఆది, శనివారాలు కలిపి దాదాపు 10 రోజులు అధికారిక సెలవులు ఉండగా.. పండుగ రోజుల్లో సైతం సెలవులు రద్దుచేయడాన్ని ఉద్యోగ సంఘ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.


