కాలేజీ బస్సును ఢీకొట్టిన బైక్
ఏలూరులో ప్రమాదం
ఏలూరు టౌన్: కష్టపడి పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బైక్పై వేగంగా వెళ్తూ, వేగంగా వస్తున్న కళాశాల బస్సును ఢీకొట్టడంతో పైకెగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్రగాయాలై చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు ఏలూరు నుంచి జానంపేట వైపు వేగంగా వెళుతుండగా.. ఎఫ్సీఐ గోడౌన్స్ వద్ద మోటార్ సైకిల్పై ఎదురుగా వస్తున్న ముగ్గురు యువకులు బస్సును వేగంగా ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులూ ఎగిరి రోడ్డుపై పడటంతో తలలకు తీవ్రమైన గాయాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పెదవేగి సీఐ రాజశేఖర్, ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు.
ముగ్గురూ కష్టజీవులే
కష్టపడి పనిచేస్తూ కుటుంబాలను పోషించుకునే ముగ్గురు యువకులు ఒక్కసారే రోడ్డు ప్రమాదంలో మృతిచెందటంతో విషాదఛాయలు అలముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ఏలూరు రూరల్ బీడీ కాలనీకి చెందిన చిట్టి ఆంజనేయులు (23) గ్రానైట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా.. అదే ప్రాంతానికి చెందిన బొంతు దుర్గారావు (24) పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. ఎస్కే అహ్మద్ (25)ఏలూరులోనే తాపీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరంతా జానంపేట వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.


