breaking news
Bapatla District Latest News
-
టిష్యూ కల్చర్ అరటికి రాయితీ
కొల్లూరు: ఉద్యాన పంటల సాగుపై ఆధారపడిన రైతులు ప్రభుత్వం ద్వారా రాయితీ అందే పంటల సాగుకు మొగ్గు చూపాలని, దీంతో అధిక దిగుబడులతోపాటు, సబ్సిడీ రూపంలో నగదు ప్రతి ఫలం చేకూరుతందని జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎస్ఎంకే ఖలీమ్ అన్నారు. మంగళవారం మండలంలోని చిలుమూరు, ఈపూరు గ్రామాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు నిర్వహించిన ఒక్క రోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. టిష్యూ కల్చర్ అరటి హెక్టార్కు రూ. 70 వేలు, హైబ్రిడ్ కూరగాయల పంటలకు హెక్టార్కు రూ. 24 వేలు చొప్పున ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. అరటి సాగులో టిష్యూ కల్చర్ మొక్కలను వినియోగించడం వల్ల వ్యాధి రహిత మొక్కలు అందుబాటులో ఉండి అధిక దిగుబడులకు ఆస్కారం ఉంటుందన్నారు. వ్యవసాయానికి వినియోగించే మినీ ట్రాక్టర్, పవర్ వీడర్, తైవాన్ స్ప్రేయర్ వంటి వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. శాస్త్రవేత్త కె.వెంకటసుబ్బయ్య పసుపు, కంద పంటలలో తెగుళ్ల నివారణ, సస్యరక్షణ చర్యలను వివరించారు. మండల ఉద్యాన శాఖాధికారి జి.కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
గుంటూరు మెడికల్: జిల్లాలో మంగళవారం నాటికి ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జీజీహెచ్లో జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న మంగళగిరికి చెందిన 53 ఏళ్ల మహిళకు, లాంకు చెందిన 44 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తాజాగా నిర్ధారించారు. బాపట్ల జైలులో ఉన్న 21 ఏళ్ల యువకుడికి సైతం కరోనా ఉన్నట్లు నిర్ధారించారు. జిల్లాలో తొలుత కరోనా పాజిటివ్ కేసులు మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు ఈ నెల 16న నిర్ధారించారు. మంగళగిరికి చెందిన 18 ఏళ్ల యువతికి, నవులూరుకి చెందిన 27 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. తొలుత కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారించిన మంగళగికి కేసుకు సంబంధించిన కుటుంబ సభ్యులకు మంగళవారం కరోనా సోకినట్లు నిర్ధారించారు. -
చోరీ కేసులో నిందితుడు అరెస్టు
కర్లపాలెం: చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టలవానిపాలెం మండలం రెడ్లపాలెం గ్రామంలో జరిగిన చోరీ కేసును చందోలు పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం చందోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ కె.మాధవరావు కేసు వివరాలు వెల్లడించారు.. పిట్టలవానిపాలెం మండలం రెడ్లపాలెం గ్రామానికి చెందిన ముచ్చు సుబ్బారావమ్మ ఈనెల 8వ తేదీన ఇంటికి తాళం వేసి వరి నాట్ల కూలీ పనుల నిమిత్తం నల్గొండకు వెళ్లారు. 9వతేదీన మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాను ధ్వంసం చేసి ఇంటి అంతటా కారం పొడి చల్లివేసినట్లు స్థానికులు ఆమెకు సమాచారం అందించారు. దీంతో ముచ్చు సుబ్బారావమ్మ 20వతేదీన ఉదయం ఇంటికి వచ్చి పరిశీలించగా, ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.2,23,000 విలువగల రెండు సవర్ల బంగారు చైన్, ఏడు తులాల వెండి పట్టీలు, గోకతాడు దొంగిలించబడినట్లు గుర్తించారు. దీనిపై చందోలు పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. బాపట్ల రూరల్ సీఐ బి.హరికృష్ణ పర్యవేక్షణలో, చందోలు ఎస్ఐ కె.మాధవరావు నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా 21 సాయంత్రం 4.30 గంటల సమయంలో పిట్టలవానిపాలెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద రెడ్లపాలెం గ్రామానికే చెందిన పిట్టు వెంకట శివారెడ్డి (34)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన వస్తువులన్నీ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
భక్తిశ్రద్ధలతో ఆషాఢ మాస సారె సమర్పణ
తెనాలిటౌన్ : లోక కల్యాణార్థం ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శ్రీ పరంజ్యోతి భగవతి పద్మావతి అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అచ్యుత దాసాజీ పేర్కొన్నారు. తెనాలి రూరల్ మండలం బుర్రిపాలెంలోని శ్రీకల్కి సేవ ఆలయంలో మంగళవారం తెనాలి, బుర్రిపాలెం, పరిసర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు హాజరై భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించారు. అచ్యుత దాసాజీ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కరవు, కాటకాలను పోగొట్టి, లోక సమృద్ధిని కాంక్షిస్తూ వర్షాలను ప్రసాదించమని కోరుతూ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏఎన్యూ(పెదకాకాని): పర్యావరణ పరిరక్షణ ప్రతి విద్యార్థి సామాజిక బాధ్యతగా స్వీకరించాలని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) విభాగం, ధరిత్రీ సంరక్షణ చైతన్యం సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ప్లాంట్ ప్రొటెక్షన్ ఛాలెంజ్ వాల్పోస్టర్ను వర్సిటీ వీసీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు ప్రకృతిని ప్రేమిస్తూ, బాధ్యతతో వ్యవహరించినప్పుడే సుస్థిర సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం, కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్ ఆచార్య బబిత, ధరిత్రీ సంరక్షణ చైతన్యం సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై మంగళవారం తిరునక్షత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళా శాసనాలతో సుదర్శన పెరుమాళ్ళ వారికి తిరునక్షత్ర మహోత్సవం వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఉదయం పంచామృతాలతో స్వామివారికి అభిషేకం, 10 గంటలకు సుదర్శన హోమం, పూర్ణాహుతి, మంగళశాసనం, వేద ఆశీర్వవచనం, తీర్థ ప్రసాద గోష్టి గావించామని తెలిపారు. 27 అడుగుల ఏకశిలా శ్రీ విఘ్న విమోచక హనుమాన్కు మల్లెలతో సహస్రనామార్చన జరిగిందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. మాచర్ల: ఆషాఢ మాసం సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మైసమ్మ అమ్మవారికి మంగళవారం రెండవ రోజు బోనాల సమ ర్పణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం మాచర్లలోని రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి వందలాది మంది మహిళలు దేవాలయం వద్దకు చేరుకొని మైసమ్మకి ప్రత్యేక పూజలు చేశారు. నాయీ బ్రాహ్మణులు, సంఘ పెద్దలు మాచర్ల వెంకటేశ్వర్లు, కృష్ణ, శ్రీనివాస్, హనుమంతరావు, పలువురు పెద్దల ఆధ్వర్యంలో ఊరేగింపు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు కోలాట ప్రదర్శన చేసి ఊరేగింపు జరుపుతూ మైసమ్మ తల్లికి జేజేలు పలికారు. -
ఊపిరి పోయండి
రేపల్లె ఆస్పత్రిలో నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్ రేపల్లె: కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ప్రాణాలను నిలిపిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ నేడు నిరుపయోగంగా మారి మూలన పడింది. ప్రాణాలకు సంబంధించిన అత్యవసర సదుపాయాన్ని కూడా మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన పాలకులు, అధికారుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం ఉప్పొంగుతోంది. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వైద్య వర్గాలు హెచ్చరిస్తుండగా ఇలాంటి కీలక ప్లాంట్ను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ప్రజలు, ప్రజాసంఘాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. వెంటనే ఆక్సిజన్ ప్లాంట్కు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రాణదాతగా నిలిచిన ప్లాంట్ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సకాలంలో ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిన దుర్భర స్థితులను చూశాం. ఆ సమయంలో రేపల్లెలో సరైన వైద్య సదుపాయాలు లేక పలువురిని తెనాలి, గుంటూరు ప్రాంతాలకు తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో స్థానికంగానే ఆక్సిజన్ అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచింది. ఆస్పత్రిలోని ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ మరమ్మతులకు గురైంది. దాని పునరుద్ధరణకు ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం రోగులకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే ప్లాంట్కు మరమ్మతులు చేయించి, వినియోగంలోకి తీసుకువస్తాం. – కొలసాని పృథ్వీ గణేష్, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో 2022 జనవరి 21న అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రేపల్లె రెడ్ క్రాస్ సొసైటీ, హిందుస్థాన్ కోకో కోలా బెవరేజెస్ సంస్థల సహకారంతో ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పలువురికి ఆక్సిజన్ అందిస్తూ ప్రాణాలను నిలబెట్టింది.. కోవిడ్ సమయంలో క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందిన వారికి కూడా ఆక్సిజన్ సరఫరా చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్లాంట్ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
మహిళలకు రక్షణ కరువు
టీడీపీ కీచకపర్వంపై కదం తొక్కిన మహిళాలోకంబాపట్ల: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఏట్రా అశ్వినీరెడ్డి పేర్కొన్నారు. గుంటూరులో మహిళపై జరిగిన దాడికి నిరసనగా మహిళలపై దాడులు సిగ్గు చేటు.. చంద్రబాబు నాయుడు డౌన్..డౌన్ అంటూ బాపట్ల పట్టణంలో మంగళవారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి గడియార స్తంభం మీదుగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సర్కిల్ వరకు చేరుకుంది. అనంతరం నిరసన చేపట్టి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. రెడ్బుక్ రాజ్యాంగం మేరకే దాడులు అనంతరం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జరిగిన కార్యాక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఏట్రా అశ్వినీరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం మహిళలకు రక్షణ లేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. అధికారాన్ని, పోలీసు వ్యవస్థను అండగా పెట్టుకుని టీడీపీ నాయకులు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ స్టాంప్ ఉంటే చాలు.. ఏ నేరం చేసినా తమను పోలీసులు కాపాడతారనే ధైర్యం అధికార పార్టీ నాయకుల్లో పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వ కార్యాలయమైనా, పోలీస్ స్టేషన్ అయినా పచ్చ స్టాంప్ను చూసి ఎదురుగా సీటు వేయాలని, వారు చెప్పినట్లు వినాలి అన్న పరిస్థితులను రాష్ట్రంలో సృష్టించారని పేర్కొన్నారు. పోలీసులు కేసు పెట్టాలంటే స్థానిక టీడీపీ నాయకుడి అనుమతి తీసుకోవాలా? టీడీపీ నాయకుడు వద్దంటే బాధితులు ఫిర్యాదులను తొక్కిపెడతారా అని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోజుల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలని, గట్టిగా నిలదీస్తే బాధితులపైనే ఎదురు కేసులు పెట్టే దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. భారత పార్లమెంటు రూపొందించిన చట్టాలకన్నా రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగమే వీళ్లకు పరమావధిగా మారిందని పేర్కొన్నారు. బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ సెక్షన్లకన్నా నారా చంద్రబాబు సెక్షన్లు, లోకేష్ సెక్షన్లే రాష్ట్రంలో అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ దారుణాలకు బలైపోతున్నది ప్రధానంగా మహిళలు, చిన్నారులు, దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజలేని చెప్పారు. వైరల్ అయ్యేంతవరకు స్పందించకపోవడం శోచనీయం ప్రతిపక్ష కార్యకర్త సోషల్మీడియాలో పోస్టు పెడితే నిమిషాల్లో కేసులు, అర్ధరాత్రి అరెస్టులు జరుగుతున్నాయని, కానీ ఓ మహిళపై అధికార పార్టీ నేత దాడి చేసి, వివస్త్రను చేస్తే.. ఆ వీడియో వైరల్ అయ్యేవరకు పోలీసులు కదలకపోవటం సిగ్గుచేటన్నారు. రాజకీయకక్ష సాధింపులకు అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. గుంటూరులో దాడి జరిగి ఇంతకాలం అవుతున్నప్పటికీ పోలీసులు విచారణ చేపట్టకపోవటం ఏమేరకు న్యాయమో అర్ధంకావటం లేదన్నారు. మహిళలు అధైర్యపడొద్దని, వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. మహిళా నాయకులు వేల్పుల మీరాభి, కానుగంటి లక్ష్మీరాఘవ, నాగలక్ష్మి, సీతారావమ్మ, శివపార్వతి, గొర్రుముచ్చు పుష్పరాజ్యం, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, నాయకులు కోకి రాఘవరెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, నక్కా వీరారెడ్డి, జయభారత్రెడ్డి, వడ్డిముక్కల డేవిడ్, గంగిశెట్టి రత్తయ్య, నర్రావుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల భారంతో వ్యక్తి బలవన్మరణం
పర్చూరు(చినగంజాం): అప్పుల భారంతో ఓ వ్యక్తి మనస్తాపానికి గురై బలవన్మరణం పొందిన సంఘటన పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడవాడ గ్రామ శివారులోని పంట పొలాల్లో వీరన్నపాలెం గ్రామానికి చెందిన తిమ్మనపల్లి శ్రీనివాసరావు(50) పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఈ ఘటన గురించి స్థానికంగా గొర్రెలు మేపుకుంటున్న గొర్రె కాపర్లు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పర్చూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా శ్రీనివాసరావు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అప్పుల భారం వల్ల మనస్తాపానికి గురై శ్రీనివాసరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పర్చూరు పోలీసులు ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో ఐదుగురు అరెస్టు
నగరంపాలెం: రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసుని తాడికొండ పోలీసులు ఛేదించగా, ఐదుగుర్ని అరెస్టు చేసి బంగారు సొత్తు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈనెల ఏడున తాడికొండ మండలం ఫణిదరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాడుగుల శంకరరావు (52) అదృశ్యమైనట్లు ఫిర్యాదివ్వగా తాడికొండ పీఎస్లో కేసు నమోదైంది. ఐదు రోజులు గడిచాక నల్లపాడు క్వారీ గుంతల్లో కుళ్లిన స్థితిలో ఓ మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులను తీసుకెళ్లగా, మృతుడు శంకరరావు అని నిర్ధారించారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా, మృతుని మొబైల్ లాం, వైజాగ్లో ఉన్నట్లు చూయించడంతో విచారణ కొనసాగించారు. మొబైల్ఫోన్ లాం గ్రామంలో చూయించగా, గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన దేవరకొండ నాగేశ్వరరావు అలియాస్ ఓంకార్, గుజ్జర్లపూడి శ్యామూల్ అలియాస్ సీమోను, కనపర్తి మణికంఠ, ఘట్టమనేని పుష్ప, దేవళ్ల పద్మను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో ఐదుగుర్ని అరెస్ట్ చేసి నాలుగు ఉంగరాలు, ఒక బంగారు గొలుసు, రూ.70 వేలు, కారు, మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు ప్లాన్లతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో ఏ–1 నాగేశ్వరరావుకు మిగతా నలుగురితో పరిచయం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శంకరరావుతో శ్యామూల్కు పరిచయం ఉంది. అతను ఆర్థికంగా స్థిరపడ్డాడని, అతన్ని బెదిరిస్తే డబ్బులు వస్తాయని శ్యామూల్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో యడ్లపాడులో భూమి కొనాలని శంకరరావుని నమ్మించి, ముందస్తుగా ప్లాన్ వేశారు. ఈనెల ఏడు సాయంత్రం రియల్ ఎస్టేట్ వ్యాపార్ని అద్దె కారులో తీసుకెళ్లారు. వంకాయలపాడు గ్రామ సమీపాన ఐదుగురు ఏకమై, అతనిపై దాడికి పాల్పడ్డారు. కొరియా తాడుతో అతను గొంతుకి బిగించి హత్య చేశారు. అనంతరం మృతుని ఒంటిపై నాలుగు బంగారు ఉంగరాలు, బంగారు గొలుసు, రూ.72 వేలు తీసేసుకున్నారు. మృతదేహానికి సిమెంట్ రాయి, బైండింగ్ వైరు కట్టేసి పొత్తూరు పరిధిలోని క్వారీ గుంతలో పడేశారు. అక్కడ్నుంచి అందరూ పరారయ్యారు. అయితే మృతు ని మొబైల్ఫోన్ లోకేషన్ వైజాగ్, లాం గ్రామంలో చూయించగా ఆ దిశగా విచారించారు. మరో హత్య కేసు వెలుగులోకి.. తాడికొండ పోలీసుల విచారణలో మరో యువకుడి హత్య కేసు వెలుగు చూసింది. వెంగళాయపాలెంకు చెందిన నాగరాజు, నాగేశ్వరరావు వద్ద ఉండేవాడు. నాగేశ్వరరావు కుమార్తె వేరొకరితో వెళ్లిపోయింది. అందుకు నాగరాజు సహకరించినట్లు నాగేశ్వరరావు పగ పెంచుకున్నాడు. రెండు నెలలు కిందట నాగరాజుని దారుణంగా హత్య చేశారు. అతని మృతదేహన్ని మాచర్ల సమీపాన సాగర్ కుడి కాలువలో పడేశారు. మాచర్ల పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. కుమారుడు అదృశ్యంపై తల్లిదండ్రులు నల్లపాడు పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఇక ఏ–1 నాగేశ్వరరావుపై మహిళా పీఎస్, ఎకై ్సజ్ పీఎస్లో కేసులు, మణికంఠపై మూడు కేసులు, ఇద్దరు మహిళలపై చీటింగ్ కేసులు ఉన్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. వీరందరిపై రౌడీషీట్లు తెరుస్తామని చెప్పారు. నాగేశ్వరరావు, మణికంఠపై పీడీ యాక్ట్కు సిఫార్సు చేస్తామని అన్నారు. అదృశ్య కేసులను చేధించిన తాడికొండ పీఎస్ సీఐ ఆర్.ఉమేష్, ఎస్ఐ జేత్యనాయక్, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు. తుళ్లూరు డీఎస్పీ టి.మురళీకృష్ణ పాల్గొన్నారు. మిస్సింగ్ కేసులను ఛేదించిన తాడికొండ పోలీసులు -
ఓటమి భయంతో అధికార పార్టీ కుయుక్తులు
పర్చూరు (చినగంజాం): రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో అధికార పార్టీకి చెందిన కొందరు దురుద్దేశంతో కుట్రపూరిత చర్యలకు తెరతీశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పావులూరులోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ వ్యక్తులు తమ బూటకపు ఎత్తుగడల్లో భాగంగా ఇటీవల కాలంలో ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో ఓటర్లకు నేరుగా ఫోన్ కాల్ చేసి అభిప్రాయ సేకరణ నిర్వహిస్తూ ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు తెరలేపారన్నారు. నియోజకవర్గంలోని పలువురు ఓటర్లు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించడంతోపాటు విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేస్తుందని, తర్వాత సాధారణ ఎన్నికల్లో గెలిచి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు తమ బూటకపు ఫోన్ కాల్స్ ద్వారా నియోజకవర్గంలో మధుసూదనరెడ్డి పనితీరు, అక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఆయనే ఉండాలా? మార్చాలా? ఫలానా వ్యక్తికి ఇన్చార్జ్గా పెట్టి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? వంటి పలు ప్రశ్నలను ఓటర్లను అడగటం ద్వారా చీప్ ట్రిక్స్ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కాల్స్ రావని, కొందరు అధికార పార్టీలోని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఆడుతున్న నాటకమని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఈ కుట్రను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. -
మమ్మల్ని బతికించండి
20వ రోజు కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేతల నిరాహార దీక్ష మంగళగిరి రూరల్: మంగళగిరి మండలం చినకాకాని పరిధిలోని ఎన్నారై జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద 20 రోజులుగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు తమకు రావాల్సిన సబ్సిడీ బకాయిలను విడుదల చేయాలని నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఇది కచ్చితంగా వివక్షేనని అన్నారు. మేము పారిశ్రామికవేత్తలమే కాని అసాంఘిక శక్తులం కాదు. దేశ ప్రగతిలో, జీఎస్టీలో మేము భాగస్తులమే ఈ విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయి మా డిమాండ్లు నెరవేర్చకుండా నిరాహార దీక్ష చేస్తున్న పట్టించుకోకుండా చిత్రహింసలుకు గురి చేస్తుందని వాపోయారు. పోలీసులు, పారిశ్రామికవేత్తల మధ్య వాగ్వాదం మంగళగిరి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ర్యాలీగా బయలుదేరుగా పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. అనుమతులు తీసుకున్నామని పారిశ్రామికవేత్తలు చెప్పినప్పటికీ పోలీసులు నిరాకరించారు. ఈ దశలో పోలీసులకు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామివేతల మధ్య వాగ్వాదం జరిగింది. అమరావతి ఓఎస్డీ మనోజ్ హెగ్డే పారిశ్రామికవేత్తలతో మాట్లాడిన అనంతరం మరొకసారి అనుమతి తీసుకొని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తామని వారు నిరాహార దీక్ష శిబిరానికి వెళ్లారు. సీపీఎం, కేవీపీఎస్ మద్దతు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల నిరాహార దీక్ష శిబిరాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేస్తానన్నా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఊబిలో ముంచుతుందని దుయ్యబట్టారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు అండా మాల్యాద్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సమస్య పరిష్కారం కోసం దళిత సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. ఏపీ ఎమ్మార్పీఎస్ మద్దతు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఆనర్బాబు, వైస్ ప్రెసిడెంట్ రామ్మూర్తి నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బారోతు రమేష్, కారం సత్యనారాయణమ్మ, కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చిన మౌలాలి, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. -
జీడీసీసీ బ్యాంకు అభివృద్ధికి నోడల్ వ్యవస్థ కీలకం
బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లిఖార్జునరావుకొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (జీడీసీసీబీ) శాఖలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరును మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు నోడల్ అధికారుల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లిఖార్జునరావు అధికారులను ఆదేశించారు. గుంటూరు బ్రాడీపేటలోని బ్యాంక్ పరిపాలన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నోడల్ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంక్ అభివృద్ధిలో నోడల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి నోడల్ అధికారి తమ పరిధిలోని శాఖల పనితీరు మెరుగుపడేలా అవసరమైన సూచనలు అందించడంతో పాటు లోపాలను వెంటనే గుర్తించి పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంక్లో 11 మంది నోడల్ అధికారులతో నోడల్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని బ్యాంక్ సీఈఓని ఆదేశించారు. బ్యాంక్ శాఖలు, సహకార సంఘాల మధ్య సమన్వయం పెంచుతూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో బ్యాంకు సీఈవో వీవీఎస్ ఫణి కుమార్, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
భూరక్షణ.. అరణ్యరోదన!
తీరం తరిగిపోతోంది. అక్రమార్కులు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుండటంతో పెనుముప్పు కలిగే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిసార్ట్ యజమానులు, రియల్టర్లు కలిసి ఇక్కడి అటవీ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వంలో కనీస చలనం కలగడం లేదని తీర ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేటపాలెం: అటవీ భూముల్లో సరుగుడు తోటల పెంపకం ఓ తంతుగా మారింది. అటవీ అధికారుల నిర్లక్ష్యంతోపాటు కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు సిబ్బంది తీరుతో తీరప్రాంత గ్రామాల మధ్య చిచ్చు రగులుతోంది. ఫలితంగా తుఫాన్లు, ఉప్పెనలు, సునామీ వంటి ఉపద్రవాల సమయంలో ముంపు నుంచి కాపాడే సరుగుడు తోటలు కనుమరుగై పోతున్నాయి. అసలు ఉద్దేశం ఇదీ.. జిల్లాలో 112 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో అనేక మత్స్యకార గ్రామాలు తీరంపై అధారపడి జీవిస్తున్నాయి. అందరికీ ప్రధానంగా చేపల వేటే జీవనాధారం. తీర రక్షణకు బీచ్ వెంట అటవీ శాఖ సరుగుడు తోటలు పెంచుతోంది. 2007 వరకు కొనసాగినా.. అ తరువాత సరుగుడు తోటల పెంపకాన్ని మత్స్యకార గ్రామాలకు వదిలేశారు. కేవలం ఆదాయ వనరులుగానే తోటలను పెంచుతున్నారు. ఒకసారి పెంచిన సరుగుడు తోటలను ఎనిమిది సంవత్సరాల వరకు కొట్టివేయకూడదు. వీటిని కాపాడాల్సిన అటవీశాఖ అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. తోటల పెంపకంలో గ్రామాల మధ్య సరిహద్దుల సమస్య తలెత్తినప్పటికీ ఆశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. -
మూడు మండలాల్లో వర్షం
నరసరావుపేట: గడిచిన 24 గంటల్లో జిల్లాలోని 28 మండలాల్లో కేవలం మూడు మండలాల్లోనే వర్షం కురిసినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. వెల్దుర్తిలో 3.2 మిల్లీమీటర్లు, రెంటచింతలలో 3.8, ముప్పాళ్లలో 4.6మి.మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. వినుకొండ: పట్టణ శివారు రజక కాలనీలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మర్రిపూడి సాయి (19) అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి రమణ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సోమవారం ఉదయం ఇద్దరూ పనులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయి ఫ్యాన్కు చీరతో ఉరివేసుకున్నట్లు తెలిపారు. సాయి పట్టణంలోని ఓ వ్యాపార సంస్థలో కూలీగా పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు సాయిని ఉరివేసుకున్న స్థితిలో గుర్తించి బోరున విలపించారు. ఈ ఘటనతో రజక కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు చదువుకుంటున్నాడని, రెండో కుమారుడైన సాయి అకారణంగా ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నాదెండ్ల: చిలకలూరిపేట నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు పక్కనే షిరిడీ సాయి ఆలయం ఎదురుగా మృతదేహం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..16వ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ షెడ్డులో సోమవారం రాత్రి స్థానికులు మృతదేహాన్ని గమనించారు. రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, నాదెండ్ల ఎస్ఐ ఆర్.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 50 ఏళ్ల వ్యక్తి వారం రోజుల కిందట షెడ్డులో మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడు భిక్షాటన చేసే వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు. మృతదేహం కుళ్లిపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. ఆనవాళ్లు గుర్తు పట్టలేని విధంగా మారిందని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రెంటచింతల: మండల కేంద్రమైన రెంటచింతల గ్రామ సమీపంలో నున్న జాతీయ రహదారి వెంబడి ఉన్న రెస్టారెంట్ వద్ద సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గోలి గ్రామానికి చెందిన ఉప్పిడి నాగేశ్వరరావు బంధువులకు గురజాల మండలం సమాధానపేటకు చెందిన నరసింహానాయక్కు గొట్టిముక్కల మేజర్ కాల్వలో వేసిన దొనే విషయంలో (సాగునీటికి సంబంధించిన) వివాదం ఉంది. ఈ నేపధ్యంలో స్థానిక రెస్టారెంట్ వద్ద నాగేశ్వరరావు టీ తాగుతున్న సమయంలో ఆక్కడకు వచ్చిన నరసింహా నాయక్ వర్గీయులకు నాగేశ్వరరావుకు, ఆయన కుమారుడు వెంకటేశ్వర్లుకు కాల్వ వ్యవహారంపై మాటమాట పెరిగింది. నరసింహా నాయక్ వర్గీయులు చేసిన దాడిలో నాగేశ్వరరావు ఆయన కుమారుడు వెంకటేశ్వర్లుకు గాయాలు కాగా వారిని వెంటనే గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో పూజలు చేసేందుకు సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ ట్రైబ్యునల్ చైర్మన్ ఎ.భారతి దంపతులు విచ్చేశారు. ఆలయ అధికారులు, పాలకమండలి చైర్మన్, అర్చకస్వాములు, వేదపండితులు వారికి సాదర స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి అభిషేక సేవలో దంపతులు పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి చిత్రపటం, ప్రసాదాలను పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు అందజేసినట్లు ఆలయ ఉపకమిషనరు గోగినేని లీలాకుమార్ తెలిపారు. -
‘ఆహా’ర్టికల్చర్ హబ్ !
రెంటచింతల: వేసవి కాలంలో రెంటచింతల పేరు వినని వారుండరు. భగభగమని అత్యధిక ఉష్ణోగ్రతలే కాదు.. ఇది మిర్చినారుకు కూడా ప్రసిద్ధి చెందింది. మేలురకమైన మిర్చిపంటకు కావాల్సిన నారుకు కేరాఫ్గా, హార్టికల్చర్ హబ్గా రెంటచింతల పేరు గడిస్తోంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా 54 నర్సరీలు ఏర్పాటు చేశారు. మొదట మూడు, నాలుగు నర్సరీలు ఏర్పాటు చేయగా ఉద్యాన శాఖాధికారులు అవగాహన కల్పించడంతో మూడు సంవత్సరాల్లో నర్సరీల ఏర్పాటుకు రైతులు ఉత్సాహం చూపారు. పలు రకాల మిర్చినారు ఒకే చోట.. గతేడాది పలు రకాలకు చెందిన మొక్కలకు వేర్వేరు రేట్లు పలికాయి. ఒక మొక్కను 80 పైసలు నుంచి రూ.1.75 వరకు రైతులు కొనుగోలు చేశారు. సుమారు 200 ఎకరాల్లో షేడ్ నెట్లలో నర్సరీలు ఏర్పాటు చేయగా ఎకరాకు 18 వేల ట్రేల చొప్పున నారును పెంచుతున్నారు. రైతులకు ఇక్కడ పలు రకాల హైబ్రీడ్ మిర్చి నారు ఒకే చోట దొరుకుతుంది. దీంతో రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులే కాక తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, మహబూబాబాద్, వరంగల్ తదితర జిల్లాలకు చెందిన వందలాది మంది రైతులు, కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు కూడా ఇక్కడ నర్సరీలలో పెంచిన మిర్చినారును కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కొందరు రైతులు విత్తనాలను ఇచ్చి ఒక్కొక్క ట్రేకి ఇంత నగదు అని ముందుగానే నిర్వహకులతో ఒప్పందం చేసుకుంటారు. రాష్ట్రంలోనే మిర్చి పంట సాగుకు ఈ ప్రాంతానికే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు నర్సరీల ద్వారా అనేక ప్రాంతాలకు మేలు రకాలైన మిర్చినారును సరఫరా చేసే కేంద్రంగా మారింది. పెద్ద సంఖ్యలో నర్సరీలను ఏర్పాటు చేయడం వలన మండలంలోని పలు గ్రామాలకు చెందిన వందలాది వ్యవసాయ కూలీలకు జీవనోపాధి కూడా లభిస్తోంది. ఈ ప్రాంతంలో సుమారు 54 నర్సరీలు ఏర్పాటు చేయడం వలన రైతులకు అవసరమైన మేలు రకమైన మిర్చినారు కచ్చితంగా దొరుకుతుంది. ఈ నమ్మకంతోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు ప్రతి ఏటా ఇక్కడకు వచ్చి మిర్చినారు కొనుగోలు చేస్తుంటారు. సుమారు 600 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నాం. – బద్దూరి బ్రహ్మానందరెడ్డి, నర్సరీ యజమాని ఈ ప్రాంతంలో షేడ్ నెట్ నర్సరీల నిర్వహకులు ఎక్కువ మంది రైతులు కావడం వలన మేలు రకమైన నారు దొరుకుతుందని మాకు నమ్మకం. మా ప్రాంతంలో మిర్చినారును పెంచుకునే విధానంపై అవగాహన లేదు. ఇక్కడ ఎక్కువ నర్సరీలు ఉండటం కారణంగా రెండు, మూడు రకాల మేలు రకాలైన హైబ్రీడ్ మిర్చినారును కొనుగొలు చేసుకోవచ్చు. – వడితే మునినాయక్, తిమ్మాయిపాలెం గ్రామం, నల్గొండ జిల్లా, తెలంగాణ -
నేటి విద్యార్థులే భవిష్యత్ నిర్దేశకులు
బాపట్ల: నేటి విద్యార్థులే దేశ భవిష్యత్ నిర్దేశకులని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వీ కన్వెన్షన్ హాలులో విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ – 2026 కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మున్ముందు ఉత్తీర్ణత శాతం పెంచడానికి అందరూ కృషి చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ టెన్త్లో 128 మంది, ఇంటర్లో 27 మంది విద్యార్థులకు రూ.20 వేల చొప్పున నగదు బహుమతి, ప్రశంసాపత్రం, పతకం అందించామని చెప్పారు. పదో తరగతి పరీక్షల్లో కొల్లూరు మండలం నుంచి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ రావడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఆ విద్యార్థిని, తల్లిదండ్రులకు ఆయన అభినందనలు తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ రాజు, బావుడా చైర్మన్ రాజశేఖర్బాబు, ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిలకపూడి పాపారావు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చూపుల దుర్గాప్రసాద్, డీఈఓ శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు. ‘ఎల్నినో’పై అవగాహన కల్పించాలి బాపట్ల: ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక పురపాలక సంఘ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ... ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని, వర్షాలు పడే అవకాశం తక్కువని రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఎరువుల నిల్వపై ఆరా తీశారు. నిబంధనల ప్రకారం ఎరువులను విక్రయించాలని, లేకుంటే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యాన పంటల సాగు, వాటి దిగుబడి, ఎరువుల వినియోగం గురించి తెలుసుకున్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని తెలిపారు. గోడౌన్లు పరిస్థితిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారిణి శ్రీలక్ష్మి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఖలీం, మార్క్ఫెడ్ ఎండీ కరుణశ్రీ , ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వినుకొండ సబ్ జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి
వినుకొండ: గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ సోమవారం వినుకొండ సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీల ఆరోగ్యం, భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంటగది, స్టోర్ రూమ్లను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని ఖైదీలకు లోక్ అదాలత్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్లు పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్, కట్ట కాళిదాస్, లోక్ అదాలత్ సిబ్బంది, జైలు అధికారులు పాల్గొన్నారు. లీకేజీ నీటిని పరిశీలించిన సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ విజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్ నుంచి నీటి విడుదల జరిగేటప్పుడు కుడి జల విద్యుత్ కేంద్రంలోకి వస్తున్న లీకేజీ వాటర్ను సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పి.కాంతారావు ఆధ్వర్యంలో అధికారులు సోమవారం పరిశీలించారు. గతంలో కెనాల్ బెడ్ కొట్టుకుపోవడంతో వాల్ దెబ్బతిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో నీరు పవర్ హౌస్లోకి లీక్ అవుతుండటంతో మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎస్ఈ వెంకటరమణ, ఇరిగేషన్ శాఖ ఈఈ మల్లికార్జునరావు, వపర్ హౌస్ డీఈఈ రాజారెడ్డి, సాగర్ ప్రాజెక్టు డీఈఈ గోపాలరావు, ఏఈలు శివయ్య, యుగంధర్ పాల్గొన్నారు. దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా భారతి పెదకాకాని: రాష్ట్ర దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్ పర్సన్గా విశ్రాంత న్యాయమూర్తి ఎం.భారతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా కోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన భారతిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దేవదాయశాఖ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా నియమించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గుంటూరు జిల్లా పెదకాకానిలోని రాష్ట్ర దేవదాయశాఖ ట్రిబ్యునల్ చైర్పర్సన్ పోస్టు ఖాళీగా ఉంది. రెండేళ్ల తర్వాత ఈ పదవిలో భారతి నియమితులయ్యారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.థామస్రెడ్డి, రాష్ట్ర కోశాధికారి సిద్దెల ప్రేమ్సాగర్ డిమాండ్ చేశారు. ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మను కలెక్టరేట్లో కలసిన వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. విద్యాహక్కు చట్టానికి సవరణ తెచ్చి, టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం దీనిపై ఒత్తిడి తెచ్చి ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించాలన్నారు. కలెక్టర్ను కలసిన వారిలో సంఘ జిల్లా అధ్యక్షుడు పి.శేషిరెడ్డి ఉన్నారు. -
వైభవంగా వీవీఐటీయూ జగన్నాథ రథయాత్ర
పెదకాకాని: విశ్వప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా నిర్వహించిన వీవీఐటియూ జగన్నాథ రథయాత్ర ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతూ వైభవంగా సాగింది. మండలంలోని నంబూరు వీవీఐటి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ రథయాత్రను విద్యార్థులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవాలయం నుంచి గోళ్లమూడి గ్రామం మీదుగా వీవీఐటియూ వరకు ఈ యాత్రను వివా, వీవీఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు కొలువుదీరిన రథం ముందు సంప్రదాయ క్రతువు చేరాపహరాతో (బంగారు చీపురుతో శుభ్రపరిచి) ప్రారంభించారు. వేలాది మంది భక్తులు, విద్యార్థులు, ఇస్కాన్ సభ్యుల భక్తిశ్రద్ధలతో, విదేశీ భక్తుల సంకీర్తనలు, జయ జయహే జై జగన్నాథ నినాదాలతో ఈ యాత్ర శోభాయమానంగా ముందుకు సాగింది. మార్గమధ్యలో విద్యార్థులు, అధ్యాపకుల కోలాట నృత్యాలు, గీతాలాపనలు అలరించాయి. వీవీఐటియూ అధ్యాపకేతర సభ్యుడు నంబూరు మణికుమార్ జగన్నాథుని వేషధారణలో ఆకట్టుకున్నాడు. ఈ కార్యక్రమంలో శివాలయం ఈవో గోగినేని లీలాకుమార్, వివా, వీవీఐటియూ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఇస్కాన్ మంగళగిరి ప్రతినిధులు, పెదకాకాని పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
యువ వైద్యుడి ప్రాణాలు తీసిన కల్వర్టు
వేటపాలెం: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కల్వర్టులోకి పల్టీ కొట్టిన ఘటనలో యువ పీజీ వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఓడరేవు నుంచి రామాపురం సముద్రతీరం కల్వర్టు వద్ద ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బాపట్ల బీమావారిపాలెం చెందిన డాక్టర్ లేళ్ల వెంకట అనిరుద్దీన్ (24) తన స్నేహితుడితో కలసి ఆదివారం రామాపురం బీచ్కు వచ్చారు. ఆనందంగా గడిపిన తర్వాత బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. రామాపురం నుంచి ఓడరేవు వెళ్లే రహదారి మధ్యలో మరమ్మతులో ఉన్న కల్వర్టు వద్ద బైక్ అదుపుతప్పింది. కల్వర్టులో పల్టీ కొట్టింది. అనిరుద్దీన్ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని 108లో చీరాల అసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ద్రోణాదులలో విషాదం..
రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, కుమారుడికి గాయాలు మార్టూరు: మండలంలోని ద్రోణాదుల గ్రామంలో సోమవారం ఓ దళిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన జెండ్రాజుపల్లి ఏసోబు తన తల్లి విన్నెమ్మ (60)తో కలిసి ద్విచక్ర వాహనంపై అద్దంకి నుంచి స్వగ్రామం ద్రోణాదుల వస్తున్నాడు. జాతీయ రహదారిపై ముప్పవరం సమీపంలోకి రాగానే వీరి బైకును వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు వెన్నెమ్మ రహదారిపై పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా ఏసోబు తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మార్టూరు 108 సిబ్బంది గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విన్నెమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేణింగివరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొల్లూరు: రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసిన సంఘటన కొల్లూరులో సోమవారం రాత్రి జరిగింది. అధికారుల కథనం మేరకు.. కొల్లూరుకు చెందిన సామా సత్యనారాయణ రేషన్ బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారంతో పౌరసరఫరాల శాఖ సీఎస్డీటీ ఫణికుమార్ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. సత్యనారాయణ ఇంటిలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ప్లాస్టిక్ గోతాల్లోకి మార్చి అక్రమ రవాణాకు సిద్ధం చేసి ఉంచడాన్ని గుర్తించారు. అక్రమంగా నిల్వ చేసిన 40 బస్తాల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తి సత్యనారాయణపై కేసు కేసు నమోదు చేశారు. తనిఖీలలో కొల్లూరు–3 వీఆర్ఓ నన్నెపాముల రాంబాబు, వీఆర్ఏలు పాల్గొన్నారు. 10 మందికి తీవ్ర గాయాలు విజయపురిసౌత్: ిపచ్చి కుక్క దాడి చేయడంతో పదిమంది తీవ్రంగా గాయపడిన సంఘటన మాచర్ల మండలం విజయపురిసౌత్లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే విజయపురిసౌత్ లోని దేశవరపు క్యాంపు తండాలో పలువురు వ్యక్తులు బయట ఉండగా పిచ్చి కుక్క వారిపై దాడి చేసింది. అక్కడున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సాగర్ మాత ఆలయం వద్ద ఉన్న ఉన్న ఆరుగురిని అదే పిచ్చికుక్క కరిచి గాయపరచింది. మొత్తం 10 మంది పిచ్చికుక్క దాడిలో గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ప్రాజెక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. -
కుమారుడి హత్య కేసులో తల్లిదండ్రులు, సోదరుడి అరెస్ట్
తెనాలి రూరల్: ఆస్తి, డబ్బు కోసం తల్లిదండ్రులను కన్న కొడుకు వేధింపులకు గురి చేస్తున్నాడు. సహనం సహించిన తల్లిదండ్రులు, సోదరుడు కలిసి అతడిని హత్య చేసి శవాన్ని కృష్ణా నదిలో మాయం చేసేందుకు ఆటోలో తరలిస్తున్న వేళ సమాచారం అందుకున్న పోలీసులు అడ్డుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్ధనరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లిపర భాస్కరరావు, బుల్లెమ్మ దంపతులకు ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు కోటేశ్వరరావు(28) ఆటో డ్రైవర్. చిన్న కుమారుడు మరియదాసు ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్. కోటేశ్వరరావుతో విభేదించిన భార్య కొంతకాలం క్రితం వెళ్ళిపోయింది. దీంతో నాజరుపేటలో తల్లిదండ్రులతో కలిసి కోటేశ్వరరావు ఉంటున్నాడు. వీరికి కొల్లిపరలో రెండున్నర సెంట్ల భూమి ఉంది. మద్యానికి బానిసైన కోటేశ్వరరావు ఆ భూమిని అమ్మి తనకు వాటా ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 రాత్రి కూడా ఆస్తి విషయంలో తల్లిదండ్రులతో తీవ్రంగా గొడవపడ్డాడు. దీంతో తల్లిదండ్రులు, రెండో కుమారుడు మరియదాసు, మరో మహిళ మున్నంగి నాగేశ్వరమ్మతో కలిసి నిందితుడిని కొట్టి, గొంతు కోసి హతమార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. హత్య కేసును వెంటనే ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారని డీఎస్పీ తెలిపారు. -
ఆక్రమించి రిసార్టులు కట్టి..
ఓడరేవు నుంచి వేటపాలెం మండలంలోని పొట్టిసుబ్బయ్యపాలెం వరకు పర్యాటక పాంత్రంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో రియల్టర్లు, రిసార్టు యాజమానుల కన్ను అటవీ భూములపై పడింది. తీరప్రాంత భూములను అక్రమించి రిసార్టులు నిర్మిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రిసార్టులకు ఎదురుగా సముద్రం కనిపించేలా ఉండాలనే దురుద్దేశంతో తీరం వెంట సరుగుడు తోటలు పెంచకుండా అధికారులకు, మత్స్యకారులకు కొంత ముట్టజెప్పి ఆ భూములను ఖాళీగా వదిలేస్తున్నారు. వారి రిసార్టుల నుంచి పర్యాటకులు నేరుగా సముద్రంలోకి వెళ్లడానికి తోటలను పెంచకుండా కుయుక్తులు పన్నుతున్నారు. -
వైభవంగా ప్రత్యేక హోమాలు, అన్నసంతర్పణ
రేపల్లె: బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులుగా కొనసాగుతున్న అద్దె బస్సు డ్రైవర్ల సమ్మెకు ఆదివారం తెరపడింది. నూతన వేతన ఒప్పందం కుదరడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి కార్మిక సంక్షేమ సదుపాయాలను అమలు చేయడానికి అద్దె బస్సు యజమానులు అంగీకరించడంతో డ్రైవర్లు ఆదివారం ఉదయం నుంచి విధుల్లో చేరారు. అద్దె బస్సు యూనియన్ (సీఐటీయూ) డిపో అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్.మణిలాల్లు మాట్లాడుతూ చీరాలలో అధిక సంఖ్యలో అద్దె బస్సులు ఉండటంతో చీరాల ఆర్డీవో ఆధ్వర్యంలో ఆర్టీసీ, పోలీసు అధికారులు, అద్దె బస్ యజమానులు, డ్రైవర్లు, సీఐటీయూ నాయకుల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయని తెలిపారు. ఒప్పందం ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న ఓటీ బస్ డ్రైవర్ రోజువారీ వేతనం రూ.1,100 నుంచి రూ.1,200, నైట్ అవుట్ బస్ డ్యూటీ వేతనం రూ.1,200 నుంచి రూ.1,300కు పెంచేందుకు యజమానులు అంగీకరించారన్నారు. ప్రతి డ్రైవర్కు నెలకు సుమారు రూ.1,500 అదనపు ఆదాయం లభించనుందని చెప్పారు. ఈ నూతన వేతన ఒప్పందాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారన్నారు. అదనంగా ప్రతి బస్సుకు పనిచేసే ఇద్దరు డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి చట్టబద్ధమైన కార్మిక సంక్షేమ సదుపాయాలను కార్మిక శాఖ సమక్షంలో అమలు చేయడానికి కూడా యజమానులు అంగీకరించినట్లు నాయకులు తెలిపారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కార్మిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు డ్రైవర్లు, యజమానులు, ఆర్టీసీ అధికారులు కలిసి క్రమం తప్పకుండా సంయుక్త సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మదర్ థెరిసా అద్దె బస్ డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) కన్వీనర్ కె.గోపి, కోశాధికారి జి.రవిబాబు, డ్రైవర్లు భాస్కర్, ఇమ్రాన్, బాషా, రవి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల: ఆషాఢ మాసంలో అత్యంత ప్రీతికరమైన ఆషాఢ శుద్ధ పంచమి (స్కంద పంచమి) పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలో సుబ్రహ్మణ్యస్వామి వారి లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో ఆదివారం (స్కంద షష్టి) రోజున విశేష పూజలు, సర్పసూక్త హోమం అత్యంత వైభవం నిర్వహించారు. నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు మాట్లాడుతూ ఉదయం కావడి ద్రవ్యాలతో సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అభిషేక కార్యక్రమం, అనంతరం హస్త, కృత్తిక, విశాఖ, ఆశ్లేష నక్షత్రాల జాతకుల కోసం, శని, రాహు, కేతు గ్రహ జపాలు జరిగాయి. సుబ్రహ్మణ్యస్వామి వారి మూల మంత్రంతో సర్పసూక్త మహా మంత్ర దివ్య హోమంతోపాటు లక్ష్మీ గణపతి, రుద్ర, మృత్యుంజయ మంత్రాలతో విశేష హోమ క్రతువులు జరిగాయి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన అఖండ పుష్పార్చన కార్యక్రమంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపులైన వేద విద్యార్థులకు, చిన్న పిల్లలకు బ్రహ్మచారుల పూజా కార్యక్రమంలో భక్తులు వేద విద్యార్థులను పూజించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులందరికీ స్వామి వారి అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బాపట్ల పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు రొంపిచర్ల కేశవాచార్యులు, శ్రీనివాసుల విఖనస మూర్తి, పరాశరం రఘురామ్, కౌండిన్య, సాయి వెంకట్ పాల్గొన్నారు. -
తాడికొండ గురుకుల పాఠశాలను కొనసాగించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ లక్ష్మీపురం: తాడికొండలోని బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలను మూసివేయటాన్ని, దీనిని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన విద్యార్థు తల్లిదండ్రులు, ఎస్.ఎఫ్.ఐ, కె.వి.పి.యస్ సంఘాల నాయకులపై పోలీసులు దౌర్జన్యంగా దాడిచేసి అరెస్టు చేయటాన్ని సీపీఎం జిల్లా కమిటీ ఖండిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా జిల్లాలోని పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురుకుల పాఠశాలను మూసివేయడం వల్ల దళిత, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతుందని అన్నారు. రాజధానిలో వేల ఎకరాల భూములను సేకరించి అనేక కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతున్నారని, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు కూడా అలాగే భూములు కేటాయించి నడపవచ్చని, ఏకపక్షంగా గురుకుల పాఠశాలను తరలించడం సరికాదన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో నీట్, జేఈఈ కోచింగ్ ఇవ్వడానికి ప్రైవేటు వారిని ఆహ్వానించి వారికి కట్టబెట్టటాన్ని సీపీఎం వ్యతిరేకిస్తుందన్నారు. అమర్యాదగా, దౌర్జన్యంగా ప్రవర్తించిన సీఐపై చర్య తీసుకోవాలని, తాడికొండలో అంబేద్కర్ గురుకుల పాఠశాలను కొనసాగించటానికి ప్రభుత్వం పూనుకోవాలని, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ అమరావతిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు, ఎన్.భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక సాంకేతికతతో జీవితంలో విజయం తథ్యం
తెనాలి: ఆండ్రాయిడ్ టెక్నాలజీ సెల్ఫోన్లలో గల వందలాది అప్లికేషన్స్ను విద్యార్థులు నేర్చుకుంటే జీవితంలో విజయం సాధించటం తథ్యమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్చార్జి రెక్టార్ ఆర్.శివవరామప్రసాద్ సూచించారు. పట్టణానికి చెందిన మొవ్వా విజయలక్ష్మి సేవాసమితి ఆధ్యర్యంలో ఆదివారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటైన ప్రత్యేక సభకు సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సభలో ఆర్.శివరామప్రసాద్ ‘విద్యార్థులు–భవిష్యత్ సవాళ్లు’ అంశంపై మొవ్వా విజయలక్ష్మి స్మారక ప్రసంగం చేశారు. సెల్ఫోన్లో అనవసర విషయాలను వీక్షించటం మానుకోవాలని స్పష్టం చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ జీవితంలో ఎదగాలని చెప్పారు. తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తన ప్రసంగంలో బాల్యం నుండే తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఈర్ష్య, అసూయలకు ఆస్కారం లేకుండా ఇతరులకు చేతనైన సేవ చేస్తూ సంతృప్తికరంగా గడపాలని సూచించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే తల్లికి నమస్కరించి చెడు పనులకు దూరంగా ఉంటూ, తోటివారికి సహాయం చేస్తూ, సన్మార్గంలో నడవాలని చెప్పారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లలు ప్రతి రోజూ కొంత సమయం మాట్లాడుకోవాలని సలహానిచ్చారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మంచి వ్యక్తిత్వాన్ని అలవరచుకుని క్రియాశీలత, లక్ష్యాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. గత మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షల్లో 550 పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.5 వేల చొప్పున మొత్తం 60 మందికి రూ.3 లక్షలను బహూకరించి, జ్ఞాపికలను అందజేశారు. బెల్లంకొండ వెంకట్ స్వాగతం పలికిన సభలో డాక్టర్ మొవ్వా ఏసుబాబు, పట్టణ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, నల్లూరి వెంకటేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, కొత్త హరిప్రసాద్, డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వరప్రసాద్, డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్, షేక్ బాష, వెంపటి సత్యనారాయణ, మొవ్వా విజయలక్ష్మి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
నియామక తేదీ ఆధారంగానే సీనియార్టీ జాబితాలు రూపాందించాలి
ఎస్టీయూ నాయకులు గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల ఉద్యోగ నియామక తేదీ ఆధారంగానే సీనియార్టీ జాబితాలు రూపొందించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉగ్గం మహంకాళరావు, జె.శంకర వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కంకరగుంటలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కొత్త జిల్లాల వారీగా చేపడుతున్న ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా రూపొందిస్తున్న జిల్లా సీనియారిటీ జాబితాల్లో ఉపాధ్యాయులందరికీ పూర్తి న్యాయం జరగాలని, వారి అసలు నియామక తేదీని ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీని కల్పించాలన్నారు. సుదీర్ఘకాలంగా ప్రభుత్వ సేవలో ఉంటూ విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే విధంగా సీనియారిటీ జాబితాల రూపకల్పన ఉండకూడదని పేర్కొన్నారు. ముఖ్యంగా కింది వర్గాల ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జిల్లా పునర్విభజన అనేది కేవలం ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ప్రక్రియ అని, దీని ప్రభావంతో దశాబ్దాలుగా ప్రభుత్వ సేవలో ఉన్న ఉపాధ్యాయులు తమ సీనియారిటీని కోల్పోయే పరిస్థితి రావడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏ ఒక్క ఉపాధ్యాయుడికి అన్యాయం జరిగినా ఎస్టీయూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యాశాఖ, ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉపాధ్యాయుల అసలు నియామక తేదీ ప్రకారమే తుది సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి, ఉపాధ్యాయ లోకానికి నమ్మకం కలిగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ గుంటూరు జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షుడు కొరివి విజయబాబు, తదితరులు పాల్గొన్నారు. యడ్లపాడు: రోడ్డు ప్రమాదంలో రెండు బైక్లు ఢీకొన్ని ప్రమాదంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని బోయపాలెం గ్రామంలోని మసీదు వద్ద ఈనెల 17వ తేదీన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యడ్లపాడు పాత రెవెన్యూ కార్యాలయం వద్ద నివాసం ఉండే ఒంటిపులి శ్రీనివాసరావు(34) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం సుమారు రాత్రి 9.50 గంటలకు జరిగిందని, మసీదు సమీపంలోని వాటర్ ప్లాంట్ వద్ద వాటర్ డంబెల్ను స్కూటీపై తీసుకెళ్తున్న క్రమంలో అదే సమయంలో శ్రీనివాసరావు ఆ వైపు రావడంతో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శ్రీనివాసరావు రోడ్డుపై పడిపోవడంతో తలకు, కంటికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, 108 వాహనంలో కాటూరు మెడికల్ వైద్యశాలకు తరలించారు. ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్య త్రివేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణాలు ఎస్ఐ టి శివరామకృష్ణ ఛేదించారు. బోయపాలేనికి వలస వచ్చిన ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉద్దమ్సింగ్నగర్ జిల్లాకు చెందిన సోనిబ్గా గుర్తించామన్నారు. గ్రామంలోనే సెలూన్షాపులో పనిచేస్తున్న అతన్ని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చిలకలూరిపేటలో ఆటో బోల్తా
ఐదుగురికి గాయాలు చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని పురుషోత్తమపట్నం వినాయక గుడి వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ముందు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న ఆటో ఢీకొని బోల్తా పడింది. ఆటో డ్రైవర్ వేముల కోటేశ్వరరావుతోపాటు ప్రయాణికులు తోక చెంచు, నాగేంద్రం, మేడికొండి చంద్ర, పలపర్తి మేరీ, పలేపు వెంకాయమ్మలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నాగేంద్రంను మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.బాధితులంతా ఆదివారం ప్రార్థనలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెనాలిరూరల్: హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ నాజరుపేటలో ఈ నెల 15వ తేదీ పొద్దుపోయాక కొల్లిపర కోటేశ్వరరావును అని తల్లిదండ్రులు భాస్కరరావు, బుల్లెమ్మ, తమ్ముడు మరియదాసు దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన నేపథ్యం, దారి తీసిన ఘటనలు వంటి వివరాలను సోమవారం నిర్వహించనున్న విలేకర్ల సమావేశంలో అధికారులు వెల్లడించనున్నారు. గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాలల్లో వ్యవసాయ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు గతంలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 21, 22వ తేదీలలో రెండవ విడత వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డాక్టర్ ఎ.మణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. మాజీ సైనికుడు గోవిందరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ మాజీ సైనిక సంఘాల జేఏసీ ఏర్పాటైంది. ఆదివారం గవర్నర్పేటలోని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో మాజీ సైనిక సంఘాల అఖిలపక్ష సమావేశం జరిగింది. మాజీ సైనికుడు గోవిందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేఏసీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ శాఖలతో సమన్వయం, పెండింగ్ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించామన్నారు. రాష్ట్రంలో మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను సమర్థంగా పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. మాజీ సైనికులకు ఎలాంటి సమస్య ఎదురైనా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారం చూపడానికి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. సమావేశంలో ఏపీ మాజీ సైనిక హక్కుల పోరాట సమితి, ఏపీఎక్స్–సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీఆర్ఎంఎస్ఎస్ఎస్, ఎన్ ఎక్స్ సీసీ, ఏబీపీఎస్ఎస్పీ, ఏఐఈఎస్ఎల్ఎస్, ఎక్స్ సైలర్స్ ఆఫ్ ఇండియన్ నేవీ, రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి మాజీ సైనిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రత్యేక టెట్లో మార్పులు చేయాలి
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు గుంటూరు ఎడ్యుకేషన్: దసరా సెలవుల్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) లో పలు కీలక మార్పులు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాంబశివపేటలోని ఏసీ కళాశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ తెలుగు అవగాహన తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డీఎస్సీకి అనుసంధానంగా నిర్వహించే టెట్కు, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్లో మార్పులు లేనట్లయితే అది స్పెషల్ టెట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. స్పెషల్ టెట్లో కామన్గా అందరికీ పాస్ మార్కు తగ్గింపుగా ఉండాలని, ఆఫ్లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2ఏ పరీక్షలో ఉపాధ్యాయుడు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు వరకే సిలబస్ ఉండాలని, తనవి కాని సబ్జెక్టును తొలగించాలన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్వహించిన సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు అవగాహన తరగతులు విజయవంతమయ్యాయని, మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. టెట్ అవగాహన తరగతులను నిర్వహించేందుకు సహకారం అందించిన ఏసీ కళాశాల యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. తరగతుల ముగింపు కార్యక్రమంలో తెలుగు రీసోర్స్ పర్సన్ ఆర్.వెంకటరావును సత్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమకుమారి, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టీఎస్ఎల్ఎన్ మల్లేశ్వరరావు, రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి ఎండీ దౌలా, యూత్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
కొల్లూరు: భర్త అనారోగ్య సమస్యలు.. వైద్యం కోసం చేసిన అప్పులతో మానసిక వేదనకు గురవుతున్న ఓ వివాహిత ఉరి పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని తోకలవారిపాలెంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. తోకలవారిపాలేనికి చెందిన వర్రె నాగమల్లేశ్వరరావు పెద్ద కుమార్తె వైష్ణవిని అదే గ్రామానికి చెందిన బంధువు వై. శ్రీనివాసరావుకు ఇచ్చి తొమ్మిదేళ్ల కిందట వివాహం చేశారు. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్య, చిన్నారులైన ఓ కుమారుడు, కుమార్తెతో కలసి గుంటూరులో నివసించేవారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాసరావు గుంటూరు నుంచి వచ్చి తన తల్లిదండ్రులు, భార్య పిల్లలతో కలసి ఉంటున్నాడు. ఉద్యోగ రీత్యా వెళ్లి వస్తున్న ఆయన అనారోగ్యం కారణంగా వైద్యం కోసం అప్పులు చేయడంతో అప్పులపాలయ్యాడు. ఆవేదనతో వైష్ణవి కొద్ది రోజులుగా మానసికంగా కుంగిపోతుంది. శనివారం మధ్యహ్నం అదే గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వెళ్లిన వైష్ణవి తన తండ్రికి అప్పులు, తన భర్త అనారోగ్య సమస్యల గురించి చెప్పి ఆవేదన చెందింది. అన్నీ సర్దుకుంటాయని ధైర్యం చెప్పి పంపారు. సాయంత్రం సమయంలో వైష్ణవి అత్తింటి వద్ద భారీగా జనం ఉండటంతో వెళ్లి చూసిన ఆమె తండ్రి వైష్ణవి ఉరి పెట్టుకొని ఉండటం గమనించాడు. బంధువుల సాయంతో ఆమెను హుటాహుటిన వేమూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కిశోర్బాబు తెలిపారు. -
ఇనుపరాడ్లతో కారు అద్దాలు ధ్వంసం
నరసరావుపేట రూరల్: ఇనుప రాడ్లతో కారు అద్దాలు ధ్వంసం చేసి చంపుతామని బెదిరింపుపై మండలంలోని లింగంగుంట్ల గ్రామానికి చెందిన సాగిరెడ్డి వెంకటరెడ్డి రూరల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గ్రామంలోని తన ఇంటిపక్కనే తన తండ్రిపేరుపై ఉన్న తొమ్మిది సెంట్ల స్థలం తమది అంటూ సమీపంలో నివాసం ఉండే కందుల మర్రిరెడ్డి, విజయలు గత కొంతకాలంగా తమతో గొడవలు బడుతున్నారన్నారు. దీనిపై అనేకమార్లు గ్రామ పెద్దలతో పంచాయితీ నిర్వహించినా వారు ఆ స్థలం తమదే అంటూ ఆ స్థలంలో చెత్త వేస్తున్నారన్నారు. ఆదివారం తాను ఒక కూలీ సహాయంతో స్థలంలోని చెత్తను శుభ్రం చేస్తుండగా మర్రెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్రెడ్డి అసభ్యపదజాలంతో తిడుతూ ఇనుపరాడ్లతో తన ఇంటిముందున్న కారు ముందు, వెనుకా అద్దాలను పగులకొట్టారన్నారు. దీంతోపాటు తనపై దాడిచేయగా తాను తప్పించుకొని ఇంట్లోకి వెళ్లగా ఈసారి నిన్ను ప్రాణాలతో వదిలేశామని, స్థలం జోలికి వస్తే చంపుతామని బెదిరించారన్నారు. వెంటనే వారిపై కేసు నమోదుచేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖలో ప్రమాదం.. ఇనిమెళ్లలో విషాదం
● శుభకార్యానికి వెళుతుండగా కబళించిన మృత్యువు ● ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు దుర్మరణం ఈపూరు: విశాఖపట్నం సమీపంలోని పెందుర్తి– ఆనందపురం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలో విషాదం అలముకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన ముగ్గురు, నరసరావుపేటకు చెందిన డ్రైవర్ మృతి చెందారు. ఇనిమెళ్లకు చెందిన మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నరసరావుపేటలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శుభకార్యం ఏర్పాటు చేశారు. ఇనిమెళ్ల గ్రామానికి చెందిన పాలగాని రామాంజనేయులు, షేక్ మీరావలి, మందపాటి చంద్రశేఖర్, అతని కుమారుడు మందపాటి భవాని శంకర్లు వాహనంలో శనివారం సాయంత్రం అక్కడికి బయలు దేరారు. తెల్లవారుజామున విశాఖ సమీపంలోని ఆనందపురం జాతీయ రహదారిపై వీరి వాహనం ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొంది. పాలగాని రామాంజనేయులు (51), షేక్ మీరావలి (55), మందపాటి భవాని శంకర్ (11) అక్కడికక్కడే మృతి చెందారు. మందపాటి చంద్రశేఖర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్ద దిక్కును కోల్పోయాం... పాలగాని రామాంజనేయులుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం భార్య, వృద్ధురాలైన తల్లి, ఇద్దరు కుమారులతో కలసి ఆయన ఉంటున్నారు. తనకున్న కొద్దిపాటి పొలంతోపాటు మరికొంత కౌలుకు సాగు చేస్తుంటారు. కుటుంబానికి అండగా ఉండే ఆయన మృతి చెందడంతో పెద్ద దిక్కును కోల్పోయామని బాధితులు కన్నీరుమున్నీరు అయ్యారు. బడికి సెలవు కావడంతో.. మందపాటి చంద్రశేఖర్కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారిలో చిన్నవాడైన మందపాటి భవాని శంకర్ ఆరో తరగతి చదువుతున్నాడు. తండ్రి చంద్రశేఖర్ కారులో శుభకార్యానికి వెళుతుండగా ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో వస్తానని చెప్పి తండ్రితోపాటు వెళ్లి మృత్యువాత పడ్డాడు. కుమారుడు మరణించి, భర్త ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉండటంతో బాధిత కుటుంబం విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఇక దిక్కెవరు... షేక్ మీరావలికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కెనడాలో ఉద్యోగి. చిన్న కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం తండ్రికి తోడుగా ఇంటి వద్ద ఉంటున్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్దను కోల్పోవడంతో కుటుంబం విషాదంలో మునిగింది. నిన్నటివరకు తమ కళ్లముందే తిరిగిన వారు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని గ్రామస్తులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మృతదేహాల కోసం ఆయా కుటుంబాల వారు కన్నీటితో ఎదురుచూస్తున్నారు. -
మహంకాళికి నిమ్మకాయల అలంకరణ
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకరించారు. భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు వేలాది సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించి, మొక్కులు తీర్చుకున్నారు. అసౌకర్యం కలగకుండా ఆలయ ఈఓ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. జాతీయ స్థాయిలో రెండోస్థానం కైవసం గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ పోలవరపు కృష్ణప్రియ క్విజ్ పోటీల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. న్యూఢిల్లీలో శనివారం ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు జాతీయ స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఏపీ తరఫున గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి పాల్గొన్న డాక్టర్ కృష్ణప్రియ జాతీయస్థాయిలో రెండోస్థానంలో నిలిచారు. ఇటీవల ఏపీలో జరిగిన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీల్లో స్టేట్ ఫస్ట్ సాధించిన డాక్టర్ కృష్ణప్రియ జాతీయ స్థాయిలో చేరుకున్నారు. ఆదివారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీ సుందరాచారి, న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. గాజుల రామకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అజ్మ, పలువురు పీజీ వైద్య విద్యార్థులు ఆమెకు అభినందనలు తెలిపారు. డాక్టర్ గాజుల రామకృష్ణ 2014లో జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో ప్రథమస్థానం సాధించి రికార్డు సృష్టించగా.. నేడు గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీకి చెందిన డాక్టర్ కృష్ణప్రియ రెండో స్థానంలో నిలిచారు. తద్వారా గుంటూరు వైద్య కళాశాల పేరు మరోమారు జాతీయస్థాయిలో మారుమోగేలా చేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో ఆదివారం రికార్డు స్థాయిలో భక్త బృందాలు సారెను సమర్పించాయి. జగన్మాత దుర్గమ్మను భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించి పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, చీర, మిఠాయిలను సమర్పించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, తిరిగి సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 9.30 గంటల వరకు సారె సమర్పణలు కొనసాగాయి. దీంతో ఉదయాస్తమాన సేవగా సారె సమర్పణ కార్యక్రమం జరుగుతుందా అనే భావన భక్తుల్లో కలిగింది. ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. అన్ని టికెట్ల విక్రయాలు రద్దు.. గతంలో శుక్రవారం, ఆదివారాల్లో కేవలం అంతరాలయ దర్శనాలను మాత్రమే రద్దు చేసేవారు. అయితే ఆదివారం భారీగా భక్తులు తరలిరావడంతో అన్ని టికెట్ల విక్రయాలను రద్దు చేసి ఉచితంగా ఆయా క్యూలైన్ మార్గాల్లో భక్తులను దర్శనానికి అనుమతించారు. ముందుగా ఆన్లైన్లో రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ప్రత్యేక సమాయాన్ని కేటాయించారు. వారికి మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించారు. -
బాపట్ల
సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026తీరంలో భూఆక్రమణల చెర ● తీరప్రాంత అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ దందా ● ఎన్వోసీల కోసం రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు ● సర్వేయర్లకు బెదిరింపులు, కోర్టు కేసులు ● ప్రశ్నార్థకంగా మారిన ప్రభుత్వ భూముల పరిరక్షణ విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.40 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. చీరాల నియోజకవర్గం పరిధిలో దాదాపు 40 శాతం వరకు అసైన్డ్, ప్రభుత్వ భూములున్నాయి. సముద్ర తీరం పరిధిలోని ఓడరేవు నుంచి రామచంద్రాపురం వరకు వందల ఎకరాల అసైన్డ్ భూములుగా రికార్డులున్నాయి. తీరాన్ని ఆనుకుని ఉన్న ఈ భూములు ప్రస్తుతం భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారాయి. చీరాల ప్రాంతంలో ఓడరేవు నుంచి వేటపాలెం మండలం రామాపురం, కఠారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామల పరిసరాల్లో పర్యాటక కార్యకలాపాలు పెరగడం, రిసార్టులు ఏర్పడటంతో భూముల విలువ ఒక్కసారిగా భారీగా పెరిగింది. దీంతో ప్రభుత్వానికి చెందిన అసైన్డ్ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణలకు తెరలేపినట్లు తెలిపారు. -
గుంటూరు నగరంలో భారీ వర్షం
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు భారీ వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలోనే కురిసిన భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా మూడు వంతెనలు, కొత్తపేట, విద్యానగర్, కొరిటెపాడు, పాతగుంటూరు, అమరావతి రోడ్డులోని ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో చెరువును తలపించింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మోకాలి లోతున నీరు చేరింది. దీంతో ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు, ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే స్వల్ప వ్యవధిలో కురిసిన వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కరోనా కలకలం
● మంగళగిరిలో ఇరువురికి కరోనా పాజిటివ్ ● తాజాగా బాపట్ల జిల్లావాసికి నిర్ధారణ ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు జీజీహెచ్లో ప్రత్యేక వార్డు గుంటూరు జీజీహెచ్లో కరోనా బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేకంగా కరోనా టెస్టింగ్ కేంద్రాన్ని, బాధితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి మొత్తం ప్రతి పడకకు ఆక్సిజన్ పైపులైను ఏర్పాటు చేయడంతోపాటు, సహజంగా ఆక్సిజన్ తయారు చేసే భారీ ఆక్సిజన్ ప్లాంట్లను సైతం ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఎమర్జన్సీ మెడిసిన్ వైద్య విభాగం వద్ద గతంలో స్టెప్డౌన్ ఐసీయూ వార్డుగా ఉన్న దానిని కరోనా వార్డుగా ఏర్పాటు చేశామని సూపరింటెండెంట్ వెల్లడించారు. -
స్వర్ణాంధ్రకు పునాది
బాపట్లఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026స్వచ్ఛ గ్రామాలే జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 29.480 టీఎంసీలు. సాగునీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.నిజాంపట్నం (రేపల్లె): స్వచ్ఛ గ్రామాలే స్వర్ణాంధ్రకు పునాది అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ చెప్పారు. స్వచ్ఛ ఆంద్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని అడవులదీవి గ్రామ జడ్పీహైస్కూల్ ఆవరణంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణమే స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు తొలి అడుగని పేర్కొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అన్నారు. అనంతరం జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన సభలో కలెక్టర్ పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం లక్ష్యాలు, ప్రభుత్వ ఆశయాలు, ప్రజల భాగస్వామ్యం అవసరాన్ని వివరించారు. గ్రామాల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పారిశుధ్య నిబంధనలు పాటించడం, మొక్కలు నాటడం వంటి చర్యలను ప్రతి కుటుంబం అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాలు, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే స్వచ్ఛ గ్రామాల లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చని చెప్పారు. తొలుత గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్డీవో బూసి శ్రీదేవి, డీపీఓ ఎల్.ప్రభాకరరావు, సీపీఓ ఏఎస్ రాజు, డ్వామా పీడీ విజయలక్ష్మి, డిఆర్డీఏ పీడీబీ సింగయ్య, ఐసీడీఎస్ పీడీ రాధమాదవి, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఎంపీడీవో నర్రా నాగలక్ష్మి, నాయకులు అనగాని శివప్రసాద్, హెచ్ఎం ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా అభివృద్ధి బాపట్ల : పరిశ్రమల ఏర్పాటుతోనే బాపట్ల జిల్లా అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. పరిశ్రమల ఏర్పాటుకు అధికారులంతా సహకరించాలని కలెక్టర్ చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా సహకరించాలన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం ఆన్ లైన్ లో నమోదైన 27 దరఖాస్తులను ఏకపక్ష పద్ధతిలో ఆమోదించేందుకు వేగంగా దరఖాస్తులను పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ వై. రామకృష్ణ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావు, బాపట్ల ఆర్డీవో హరికుమార్, కమిటీలోని ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. మాతృ, శిశు మరణాలు పూర్తిగా నివారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. పీఎం సురక్షిత్ మంత్రిత్వ అభియాన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. మాతృ, శిశు మరణాల నిర్మూలన లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ అన్నారు. కాన్పుల సమయాలలో మరణాలు అరికట్టగలిగితే నవజాత శిశువు అభివృద్ధికి తోడ్పాటునందించగలమన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్. విజయమ్మ, డీసీహెచ్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పద్మావతి, కమిటీలోని అనుబంధ శాఖల జిల్లా అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ
నరసరావుపేట రూరల్: లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా విద్యార్థినులకు 101 సైకిళ్లను పంపిణీ చేశారు. పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంక్ జోనల్ హెడ్ ఎం.పిచ్చయ్య, రీజినల్ హెడ్ జీవీ రమణారావు, నరసరావుపేట శాఖ మేనేజర్ పి.వెంకట రవికుమార్లు అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థినులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతో సైకిళ్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. హెచ్ఎం పార్వతి, ఉపాధ్యాయులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకటరామిరెడ్డి జయంతిని పురస్కరించుకొని శనివారం వెంకటరామ్ మెమోరియల్ జీబీఆర్ హాస్పిటల్లో సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి భవనం చేసిన సేవలను కొనియాడారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం సారె సమర్పించారు. ఈ మేరకు మంగళగిరి మెయిన్ బజారులోని ఆర్యవైశ్య కల్యాణ మండపం నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వరకు పెద్ద ఎత్తున మహిళలు తరలివెళ్లారు. తొలుత మెయిన్ బజారులోని ఆరవైశ్య కల్యాణ మండపం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు మహిళా సంఘం ప్రతినిధులు చీర, పూలు, పండ్లు, స్వీట్లతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ధ్వజ స్తంభం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య మహిళ సంఘం ప్రధాన కార్యదర్శి త్రిపురమల్లు అపర్ణ పార్వతి, కోశాధికారి వెంకట కీర్తి, కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘాల సమైఖ్య అధ్యక్షుడు సంకా బాలాజీ గుప్త హాజరయ్యారు. మంగళగిరి టౌన్: ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య కార్యక్రమంలో మూడు లక్షల జనాభాకు పైబడిన పట్టణ స్థానిక సంస్థల విభాగంలో మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించింది. ఈ మేరకు గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా అవార్డును, ప్రశంసా పత్రాన్ని శనివారం అందుకున్నారు. స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో ఎంటీఎంసీ కనబర్చిన విశిష్ట పని తీరుకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు అధికారులు తెలిపారు. నగర పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలులో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధించినట్లు పేర్కొన్నారు. -
మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ విద్యార్థుల ప్రతిభ
యడ్లపాడు: మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో రెండురోజుల వైజ్ఞానిక ప్రదర్శన శనివారం ముగిసింది. జేఎన్ఎస్ హైదరాబాద్ రీజియన్ పరిధిలోని 9 జవహర్ నవోదయ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు 60 రకాల ప్రాజెక్టులతో హాజరై ప్రదర్శనలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో విద్యాలయ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో బాల శాస్త్రవేత్తలు రూపొందించిన అంశాలు అందర్నీ ఆకట్టుకుని ఆలోచింపజేశాయి. ముఖ్య అతిథులు చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తీవ్ర పోటీ నడుమ సాగిన ఈ ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యాలయాల వివరాలు ఇలా ఉన్నాయి. -
గుర్రపు డెక్క తొలగింపు వేగవంతం చేయాలి
భట్టిప్రోలు(వేమూరు): డ్రైనేజీ శాఖ అధికారులు గుర్రపు డెక్క తొలగించే కార్యక్రమం వేగవంతం చేయాలని వైఎస్సార్ సీపీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్బాబు పేర్కొన్నారు. భట్టిప్రోలు కనగాల కెనాల్లో గుర్రపు డెక్క ఏళ్ల తరబడి పేరుకు పోయి పంట పొలాలు దెబ్బతినడం జరుగుతుంది. గుర్రపు డెక్క తొలగించేందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం శనివారం ఆయన అదేపల్లి కనగాల కెనాల్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువల్లో మళ్లీ భారీగా గుర్రపు డెక్క పెరిగి పోవడంతో సాగునీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడిందన్నారు. రైతులకు ఇప్పటికి అందాల్సిన సాగునీరు ఆలస్యమైందన్నారు. గుర్రపు డెక్క తొలగింపుపై వారం రోజులుగా డ్రైయినేజీ శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే మళ్లీ దీక్ష చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. గతేడాది గుర్రపు డెక్క తొలగింపుపై అదేపల్లి కనగాల డ్రైనేజీపై జల దీక్ష చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది కూడా గుర్రపు డెక్క తొలగించక పోతే దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు. దీంతో అధికారులు స్పందించి శని వారం గుర్రపు డెక్క తొలగించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పడమటి శ్రీనివాసరావు, టౌన్ ప్రెసిడెంట్ కుందేటి రమేష్, పెద్ద బుజ్జి, బొల్లెదు ప్రతాప్, వేల్పూరి చిన్నారి, వెంకట్రామయ్య, మోర్ల కోటయ్య, సయ్యద్ నభీ, రత్నబాబు, అంకబాబు తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్ సీపీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్బాబు -
ఘనంగా జగన్నాథ రథయాత్ర మహోత్సవం
బాపట్ల: పట్టణంలో శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్య రథయాత్ర మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఇస్కాన్ కొత్తపేట, చీరాల శాఖలు, బాపట్లకు చెందిన కన్నెగంటి మంజుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు భక్తులు పోటెత్తారు. పురవీధులన్నీ భక్తజన సంద్రంగా మారాయి. భక్తుల జయజయ ధ్వానాలు, హరినామ స్మరణతో పట్టణం మారుమోగింది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు శృంగారపురంలోని తాలింఖానాలో స్వామికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుండిచా మందిరం నుంచి ఈ దివ్య రథయాత్ర ప్రారంభమైంది. పాత బస్టాండ్ మీదుగా జీబీసీ రోడ్డులోకి ప్రవేశించింది. గడియారస్తంభం చేరుకుని, సూర్యలంక రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి గుడి, జీబీసీ రోడ్డులో పోలేరమ్మ గుడి మీదుగా మళ్లీ తిరిగి వచ్చింది. యాత్ర పొడవునా ఇస్కాన్ ప్రతినిధులు, భక్తులు భజనలు, కీర్తనలు, నృత్యాలతో అలరించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గురువుల ఆధ్యాత్మిక ప్రసంగం, భోగ సమర్పణ, కనులపండువగా మహా హారతి వంటి విశేష కార్యక్రమాలను నిర్వహించారు. -
డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన
బాపట్లటౌన్: ఏళ్ళ తరబడి ఇదే వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం...ఎంతో మంది కక్షిదారులకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్న మాపై కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అమానుషమని డాక్యుమెంట్ రైటర్ల సంఘం బాపట్ల అధ్యక్షులు కె. నారాయణరావు తెలిపారు. కూటమి సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 396 కు నిరసనగా శనివారం బాపట్లలో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేశారు. తొలుత బాపట్ల సబ్ రిజిస్ట్రార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్షులు కె. నారాయణరావు మాట్లాడుతూ మేం ఏ ఒక్క కక్షిదారుడిని ఇబ్బందులకు గురిచేయటం లేదు. కక్షిదారుడికి సకాలంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేస్తున్నాం. అలాంటి మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ జారీ చేసిన జీవో 396ను రద్దు చేసేవరకు పోరాటం సాగిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డాక్యుమెంట్ రైటర్ల సంక్షేమసంఘం సెక్రటరి టి. కొండలరావు, జాయింట్ సెక్రటరి టి. సంతోష్గోకుల్ గుప్తా, ట్రెజరర్ వి. సాయి శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలి -
వర్షంతో పంటలకు జీవం
కొల్లూరు: చుక్క నీటి కోసం అర్రులు చాస్తున్న పంటలకు వర్షం జీవం పోసింది. గురువారం రాత్రి మండలంలో భారీగా కురిసిన వర్షానికి వాణిజ్య పంటలు, ఖరీఫ్లో సాగు చేసిన వరి పంటకు మేలు చేకూరింది. కూటమి ప్రభుత్వం కాలువలకు సాగు నీరు విడుదల చేయడంలో వైఫల్యంతో రైతులు పంటలకు నీరందించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సాగు నీటి కొరతకుతోడు ఎల్నినో ప్రభావంతో విపరీతంగా ఎండలు కాస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు మాడిపోయి ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో వరుణుడు కరుణించడంతో పంటలు జీవకళను సంతరించుకున్నాయి. తీవ్ర నీటి ఎద్దడి కారణంగా బోర్ల కింద పంటలకు నీరందించినా ప్రయోజనం లేక విలవిలాడుతున్న రైతుల మోములు వర్షంతో కాస్త కళకళలాడుతున్నాయి. -
వినియోగదారుల హక్కుల పరిరక్షణ ముఖ్యం
కర్లపాలెం: వినియోగదారుల హక్కుల పరిరక్షణ ముఖ్యమని, సంబంధిత చట్టాలపై అందరికీ అవగాహన అవసరం అని గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సయ్యద్ జియాఉద్దీన్ చెప్పారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జియాఉద్దీన్ మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు పారా లీగల్ వలంటీర్లను సంప్రదించాలని చెప్పారు. జనన, మరణ, వివాహ ధ్రువపత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. న్యాయవాదులు కట్టా కాళిదాసు, సీహెచ్ రామాంజనేయులు, శ్రీనివాసరావు, తహసీల్దార్ రవీంద్రకుమార్, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
దివ్యాంగులకు అండగా భవిత కేంద్రాలు
రేపల్లె: పట్టణానికి నిజమైన హీరే తమరేనని ఐఈఆర్పీ అనూరాధను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అభినందించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు విద్యాబుద్ధుల్ని నేర్పే భవిత సెంటర్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంకితభావంతో పనిచేస్తున్న ఐఈఆర్పీలు సమాజానికి నిజమైన హీరోలని అభినందించారు. వారి సేవలు అమూల్యమైనవని, ఇలాంటి ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శప్రాయులని పేర్కొన్నారు. అనంతరం ఐఈఆర్పీ అనూరాధను సత్కరించారు. డీఎంహెచ్వో డాక్టర్ విజయమ్మ, ఆర్డీఓ బూసి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ కాకర్ల సాంబశివరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఎంపీడీఓ రవిబాబు, ఐఈఆర్పీ సుకన్య తదితరులు పాల్గొన్నారు. అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలి బాపట్ల: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. ఆన్లైన్లో నమోదైన అర్జీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి సూచనలు చేశారు. అర్జీదారులతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. నిజాంపట్నం మండలం పలపట్ల గ్రామానికి చెందిన బేతపూడి సీతారావమ్మ భూమి సమస్య గురించి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తక్షణమే భూ రికార్డుల శాఖ సహాయ సంచాలకుడితో ఆయన నేరుగా మాట్లాడారు. ఆమెకు హక్కు కల్పించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ -
సీనియర్ మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ నాగార్జున
గుంటూరు మెడికల్: ఐదు జిల్లాల పరిధి వరకు విస్తరించి ఉన్న గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ (సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం) వెల్ నెస్ కార్యాలయంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా సేవలందిస్తున్న డాక్టర్ కొండా నాగార్జున చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీ.ఎం.ఓ) గా పదోన్నతి పొందారు. ఆయనను గుంటూరుకు కేటాయిస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం అధికారికంగా గుంటూరు నగరంపాలెంలోని సీ.జీ.హెచ్ ఎస్ కార్యాలయం లో సీ.ఎం.ఓ గా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. నాలుగు రోజుల క్రితం నెల్లూరు సీ.జీ.హెచ్.ఎస్ నుంచి బదిలీ పై వచ్చిన దాసరి రమేష్ సీ.ఎం.ఓ గా ప్రస్తుతం గుంటూరులో విధులు నిర్వహిస్తున్నారు. కొండా నాగార్జునకు కూడా పదోన్నతి లభించడంతో సీ.జీ.హెచ్.ఎస్ కేంద్రాలలో ఎక్కడా లేని విధంగా గుంటూరులో ఇద్దరు సీ.ఎం.ఓ లు విధులు నిర్వహించడం విశేషం. పదోన్నతి పొందిన కొండా నాగార్జున ను గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ లోకల్ ఎడ్వైజరీ కమిటీ మెంబర్లు గుమ్మడి సీతారామయ్యచౌదరి, కట్టా వెంకటేశ్వర్లు, పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు, వైద్య సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. -
అంగన్వాడీ సేవల్లో నాణ్యత పాటించండి
రేపల్లె: అంగన్వాడీ కేంద్రాల్లో అందించే సేవల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని ఐసీడీఎస్ జిల్లా అధికారి రాధా మాధవి ఆదేశించారు. రేపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఆయా కేంద్రాల పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. సేవల అమలు విధానం, లబ్ధిదారులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను నిర్ణీత సమయాలకు కచ్చితంగా నిర్వహించడంతో పాటు మరుగుదొడ్లు, తాగునీరు, ఫ్యాన్లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పిల్లల ఎత్తు, బరువులను క్రమం తప్పకుండా నమోదు చేసి పోషణ్ ట్రాకర్ యాప్లో నిరంతరం అప్డేట్ చేయాలని ఆదేశించారు. ప్రీ స్కూల్ విద్యలో భాగంగా బోధన ఉపకరణాలను వినియోగించి చిన్నారులకు ఆసక్తికరమైన బోధన అందించాలన్నారు. ఏఐ ఆధారిత వ్యవస్థలో నమోదయ్యే రెడ్ ఫ్లాగ్ కేసులను సూపర్వైజర్లు నిరంతరం పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీడీపీవో ఎం.సుచిత్ర, సూపర్వైజర్లు సీహెచ్.హిమబిందు, ఎస్.సునీత, టి.రాధిక, జ్యోతిలక్ష్మి, వెంకట రమణ, నాగలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ జిల్లా అధికారి రాధా మాధవి -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పర్చూరు(చినగంజాం): జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ హెచ్చరించారు. బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని పర్చూరు పోలీస్ స్టేషన్, మార్టూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ కార్యాలయ పరిసరాలను, వివిధ నేరాలలో సీజ్ చేసిన వాహనాలను ఆయన పరిశీలించారు. ప్రతి శనివారం రాష్ట్రమంతటా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. క్రైమ్ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. స్టేషన్లోని సీసీ కెమెరాల వ్యవస్థను, సరిహద్దులను సూచించే మ్యాప్ను పరిశీలించారు. హెల్మెట్ధారణపై వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్బీ ఇన్స్పెక్టర్ నారాయణ, మార్టూరు రూరల్ సీఐ నాగభూషణం, పర్చూరు ఎస్ఐ పులి గోపి తదితరులు పాల్గొన్నారు. -
రేపు మొవ్వా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానోత్సవం
తెనాలి: పట్టణానికి చెందిన మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవాసమితి ఆధ్వర్యంలో మొవ్వా విజయలక్ష్మి స్మారక 5వ వార్షిక అవార్డు ప్రదానోత్సవం ఈనెల 19వ తేదీన జరగనుంది. స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆరోజు ఉదయం 9 గంటలకు ఏర్పాటయే ప్రత్యేక సభలో గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఈ అవార్డును బహూకరిస్తారు. ఇదే వేదికపై గత మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.5 వేల చొప్పున దాదాపు రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకం, జ్ఞాపికను బహూకరిస్తారు. సంబంధిత ఆహ్వానపత్రికను శుక్రవారం కవిరాజు పార్కులోని వీజీకే భవన్లో సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. ● అవార్డు ప్రదానోత్సవ సభలో తెనాలి ఆర్డీవో కె.శ్రీరమణి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఇన్ఛార్జి రెక్టార్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ ఫాకల్టీ ప్రొఫెసర్ ఆర్.శివరామప్రసాద్, తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, మానవత, తెనాలి చైర్మన్, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ పాల్గొంటారని వివరించారు. ● సేవాసమితి పేరుతో 2018 నుంచి మొవ్వా విజయలక్ష్మి స్మారకార్థం పట్టణంలో పలు ప్రజోపయోగ శాశ్వత నిర్మాణ కార్యక్రమాలను చేపడుతున్నట్టు సత్యనారాయణ గుర్తుచేశారు. ● 2022లో ఆమె పేరుతో అవార్డును ప్రవేశపెట్టి, వివిధ రంగాల్లో ప్రముఖులకు బహూకరిస్తూ, విద్యార్థులకు విజయలక్ష్మి స్మారకోన్యాసం ఇప్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఐపీఎస్ అధికారిణి, సీఐడీ అడిషనల్ ఎస్పీ కేజీవీ సరిత, తెనాలి సబ్కలెక్టర్ గీతాంజలి శర్మ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గురిజాల రాధారాణి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపకు బహూకరించినట్టు వివరించారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో ప్రసాదం పూర్ణచంద్రరావు, ఎన్.హనుమారెడ్డి, ఎ.రామూర్తి, వి.శరత్, వెనిగళ్ల శివప్రసాద్, రామకృష్ణ పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి బహూకరణ 10వ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకాలు -
నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం
గుంటూరు ఎడ్యుకేషన్: నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని సంస్థ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. శుక్రవారం గుంటూరు లక్ష్మీపురంలోని సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు జోన్ నుంచి అఖిల భారతస్థాయిలో అన్ని కేటగిరీల వారీగా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నట్లు తెలిపారు. సీహెచ్ మోహన నాగశ్రీ సాయి అఖిల్ 115వ ర్యాంకు, కె.సిద్ధార్థ 164వ ర్యాంకు, షేక్ నిహాల్ పర్వేజ్ 935వ ర్యాంకు, ఏ. నికేత్ రామ్ చౌదరి 1514వ ర్యాంకు, బి. శశిధర్ 1620వ ర్యాంకుతో పాటు ఐదువేల లోపు 46 మంది, 10వేల లోపు 89 ర్యాంకులతో పాటు 179 మంది విద్యార్థినీ, విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించనున్నారని వివరించారు. విద్యార్థులకు సంస్థ అకడమిక్ డైరెక్టర్ బొప్పన సుష్మ, ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్, ఏజీఎం ఎల్టీసీ శ్రీనివాస్, ఆయా క్యాంపస్ల ప్రిన్సిపాల్స్ అభినందనలు తెలియజేశారు. -
బాజీ కుటుంబానికి ఆర్థిక సహాయం
మేడికొండూరు : జగనన్న బాటలోనే పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు నాయకుడికి కుటుంబ సభ్యులుగా అండగా ఉంటామని మేడికొండూరు జెడ్పీటీసీ సభ్యులు కందుల సిద్ధయ్య జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ హబీబుల్లా, అవుతు శ్రీనివాస్ రెడ్డి, బుర్ర సుబ్బారెడ్డి పాములపాటి జయరావు, రాజేంద్రప్రసాద్ అన్నారు. మేడికొండూరు గ్రామానికి చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించాడు. శుక్రవారం వీరంతా బాజీ కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన బాజీ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని మేడికొండూరు మండలంలో పార్టీకి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడికొండూరు మండల ఉపాధ్యక్షులు ఉడతా ప్రభాకర్, చావుపాటి బాజీ షేక్ హుస్సేన్ మీరా, జలంధర్ బాజీ, మన్నవ బ్రహ్మయ్య, జోకర్ గఫార్, షేక్ సుభాని, పాల్గొన్నారు. -
చివరికి సాగు నీరేది?
కురవని వర్షాలు నామమాత్రంగా సాగు ప్రత్యామ్నాయ పంటలు మేలు జిల్లాలో వరి సాగుకు దాదాపు 80 టీఎంసీలు అవసరం కాగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేవలం 46 టీఎంసీలే కేటాయించింది. దీంతో ఖరీఫ్లో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నీటితో సాధారణ విస్తీర్ణంలో సగం కూడా సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వానలు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కనీసం వారిని అప్రమత్తం చేయడం, ప్రత్యామ్నాయ పంట ప్రణాళిక రూపకల్పనలో చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
మూలాంకురేశ్వరికి విశేష పూజలు
ఫిరంగిపురం: మండలంలోని అమీనాబాద్ గ్రామంలోని మూలాంకురేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాస శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు అయ్యన్నశాస్త్రి, కార్తీక్శాస్త్రిలు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించారు. పసుపు, కుంకుమలతో లలిత అష్టోత్తర, సహస్రనామ అర్చనలు చేశారు. ముఖమండపంలో ఉన్న శ్రీచక్రానికి ఖడ్గమాల స్త్రోత్రంతో కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బగళాముఖి అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం మూడవ రోజున అమ్మవారు శాకంబరి వారాహిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శాకంబరి దేవి అలంకరణ కోసం సుమారు 800 కిలోల పలు రకాల కూరగాయలు, పండ్లు వినియోగించారు. మూడవ రోజున రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు చేశారు. నవరాత్ర మహోత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు వారాహి హోమం విశేష పూజలు నిర్వహించారు. చందోలు గ్రామానికి చెందిన సుమారు 60 మంది ఆర్యవైశ్య మహిళలు సంప్రదాయ బద్ధంగా సారెలు, పూజా ద్రవ్యాలు శిరస్సున ధరించి మంగళ వాయిద్యాలతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని విశేష పూజల అనంతరం అమ్మవారికి సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఒంగోలుకు చెందిన తెల్లపాటి శ్రీనివాసరావు, కనకదుర్గ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 20న జగన్నాథ రథయాత్ర తెనాలి టౌన్: ఇస్కాన్ టెంపుల్ తెనాలి ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన పట్టణంలో శ్రీశ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. స్థానిక నాజరుపేటలోని టెంపుల్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ ఇన్చార్జి సింహ గౌరదాస్ వివరాలను తెలిపారు. 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు పట్టణ శివాజీచౌక్లో ఇందుకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 2 గంటల నుండి శ్రీశ్రీ జగన్నాథ రఽథయాత్ర మహోత్సవం ప్రారంభమవుతుందని వెల్లడించారు. శివాజీచౌక్, గాంధీచౌక్, నెహ్రూ రోడ్డు, లక్ష్మీ డీలక్స్ రోడ్డు, మెయిన్ రోడ్డు మీదుగా బోసురోడ్డులోని శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థానం వరకు రథయాత్ర జరుగుతుందని చెప్పారు. దేవాలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనం, 108 పదార్థాలతో భోగ నివేదన, మహా హారతి ఉంటాయని తెలిపారు. అన్నప్రసాద వితరణ ఉంటుందని వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు అప్పారావు, శ్రీనివాసరెడ్డి, ప్రసాద్, గోపాలకృష్ణ, కార్తీక్ తదితరులున్నారు. దుర్గమ్మకు ఆషాఢ సారె మంగళగిరి టౌన్: పట్టణంలోని బైపాస్రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలోని శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆంజనేయ కాలనీ భక్తబృందం శుక్రవారం సారె సమర్పించింది. కాలనీలోని ప్రధాన సెంటర్ నుంచి మహిళలు సారెతో ఊరేగింపుగా వచ్చారు. మేళతాళాలు, కనక తప్పెట్ల మధ్య ఊరేగింపు భక్తి శ్రద్ధలతో సాగింది. ఆయా వీధుల్లోని వారు సారెకు భక్తి శ్రద్ధలతో నీరు వారబోశారు. అనంతరం ఊరేగింపు ఆలయం వరకు చేరుకుంది. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో భక్తబృందం ప్రతినిధులు మల్లేశ్వరి, అంజలి, సత్యవతి, లేఖ, సుజాత, వాణి పాల్గొన్నారు. -
తెనాలి పోలీసులపై క్రమ శిక్షణ చర్యలు
● ఇద్దరు కానిస్టేబుళ్ల బదిలీ, డీఎస్పీ సహా అధికారులకు మెమోలు ● ‘సాక్షి’ కథనానికి స్పందన తెనాలిరూరల్:తెనాలి పోలీసు లపై అక్రమ వసూళ్లు, అవినీతి దందాల ఆరోపణలు హెచ్చుమీరుతున్న నేపథ్యంలో పోలీ సు ఉన్నతాధికారులు చర్యల కు శ్రీకారం చుట్టారు. ‘పేరుకే పోలీసు.. చట్టం అంటే అలుసు’ పేరిట ఈ నెల 10వ తేదీన తెనాలిలో పోలీసుల వ్యవహారాన్ని కళ్లకుకట్టినట్టు చెబుతూ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. పేకాట దందాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న అరోపణలతో వన్ టౌన్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ ఎం. రమేష్ను కాకుమాను స్టేషన్కు, తెనాలి రూరల్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ డి.రవిని ఫిరంగిపురం బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేశారు. తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్.సాంబశివరావు, వన్ టౌన్ సీఐ సీహెచ్.రాంబాబు, రూరల్ ఎస్ఐ కె.ఆనంద్లకు చార్జ్ మెమోలు జారీ చేసిన ట్టు తెలిసింది. వేరే మహిళతో సహజీవనం చేస్తూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇల్లు మార్చిన సీఐ ప్రస్తుతం ఎక్కడ అద్దెకు తీసుకున్నారన్న అంశాన్ని విచారిస్తున్నట్టు తెలిసింది. -
గురుకుల పాఠశాలలో పాలకుల దాష్టీకం
తాడికొండ: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులు, తల్లిదండ్రులపై చంద్రబాబు ప్రభుత్వం దాష్టీకానికి దిగింది. పోలీసులను ఉసిగొల్పి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులను బెంబేలెత్తించింది. తమకు చదువు కావాలని బతిమాలుతూ ‘అయ్యా మా పిల్లలను రోడ్డున పడేయకండి.. చదువుకుంటారు. పాఠశాల ఉంచండి..’ అని అడిగినందుకు దళిత తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు చితకబాదారు. అనంతరం అరెస్టు చేసి స్టేషన్లో బంధించారు. ఇప్పటికే ఈ విషయంపై మూడు సార్లు రోడ్డెక్కి నిరసనలు తెలియజేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఇక కన్నీరే మిగిలింది. పేద విద్యార్థులకు అన్యాయం ఐఐటీ– జేఈఈ, నీట్ ఎక్స్లెన్స్ సెంటర్ల ఏర్పాటు పేరుతో ఇటీవల ప్రభుత్వం మంత్రివర్గ తీర్మానం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న మూడు గురుకుల పాఠశాలలను ఖాళీ చేయించి వాటిలో ఎక్స్లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసింది. వీటిని ప్రభుత్వమే నిర్వహిస్తుందా.. అంటే అదీ కాదు. పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. అనుకున్నదే తడవుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు తాడికొండతోపాటు తిరుపతి జిల్లా కోట, విశాఖ జిల్లా మేఘాద్రి గడ్డలోని గురుకుల పాఠశాలలకు చెందిన 1,500 మంది విద్యార్థులను బలవంతంగా బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశం ఏర్పాటు చేసి పేరుకు కూడా తెలియజేయలేదు. ఫోన్లు మాత్రమే చేసి ఇక్కడ గురుకుల పాఠశాల సెంటర్ను తీసివేస్తున్నారని, ఐఐటీ సెంటర్ వస్తున్నందున పిల్లలను తీసుకెళ్లాలని హుకుం జారీ చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద విద్యార్థులు విషయం ఏమిటా అని సోమవారం పాఠశాలకు చేరుకొన్నారు. విషయం తెలిసిన తర్వాత ఆవేదనతో నిరసన వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. తర్వాత విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి సమాచారం తెలియజేయాలని చెప్పినా నిబంధనలు ఉల్లంఘించి పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక రోడ్డెక్కారు. అండగా నిలిచిన వైఎస్సార్సీపీ బాధితులకు వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు అండగా నిలిచారు. గురువారం బాధితులతో కలసి పాఠశాలకు చేరుకొని పాఠశాలను తరలిస్తే సహించేది లేదని, ఐదు ఎకరాల విలువైన స్థలం ఉందని గుర్తుచేశారు. కావాలంటే భవనాలు నిర్మించుకోవాలని, కానీ పేదల ఉసురుపోసుకుంటే ఒప్పుకోబోమని హెచ్చరించారు. గురుకులాలను పూర్తిగా తొలగించి విద్యార్థులను రోడ్డుపాలు చేయడం తగదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ప్రక్రియ కొనసాగించాలని హెచ్చరించారు. దీంతో ఆ రోజుకు వాయిదా వేసి శుక్రవారం పేరెంట్స్ మీటింగ్ పేరుతో పిలిచారు. తర్వాత పిల్లలను తీసుకెళ్లాలని హుకుం జారీ చేశారు. అధికారుల తీరుపై నిరసనగా వారందరూ రోడ్డెక్కితే పోలీసులను రంగంలోకి దించారు. తల్లిదండ్రులను అమానుషంగా కొట్టి బెదిరించారు. విద్యార్థులను బయటకు పంపించేశారు. నారాయణ విద్యా సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియ అంతా కొనసాగిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని వసతులు ఉన్న 3 గురుకులాలను ఎంచుకొని దందాకు పక్కాగా స్కెచ్ గీసినట్లు చెబుతున్నారు. తాడికొండలోని గురుకుల పాఠశాల 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రాజధానికి కూతవేటు దూరంలో ఉండటంతో ఎకరం రూ.10 కోట్లకు పైగా పలుకుతుంది. దీంతో అన్ని వసతులు ఉన్న ఈ పాఠశాలలను పీపీపీ పద్ధతిలో ‘నారాయణ’కు కట్టబెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ సెంటర్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఒక్కో సెంటర్కు రూ. 3.90 కోట్ల చొప్పున రూ. 11.7 కోట్లకు ప్రభుత్వం టెండర్లను ఇప్పటికే పిలిచింది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ అధికారులు పనులు చేపట్టేందుకు సెంటర్కు వచ్చి పరిశీలించి వెళ్లారు. ఈ ఏడాది విద్యాభ్యాసం ప్రారంభించేందుకుగాను ఇప్పటికే కంటెయినర్ లోడు ఐఐటీ– జేఈఈ మెటీరియల్ను గుంటూరులోని అడవి తక్కెళ్ళపాడు గురుకులానికి నారాయణ సంస్థల నుంచి చేర్చినట్లు సమాచారం. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా ప్రభుత్వం ఐఐటీ– జేఈఈ పేరుతో 1,500 మంది పేద విద్యార్థుల చదువులను దెబ్బతీయడం పట్ల పలువురు మండిపడుతున్నారు. పోలీసుల జులంతో దిక్కుతోచని స్థితిలో చిన్నారులను వెంటబెట్టుకొని చంకన పుస్తకాలు బ్యాగు, ట్రంకు పెట్టెలతో తల్లిదండ్రులు తరలిపోయారు. -
అత్తింటికి కన్నం వేసిన అల్లుడు అరెస్ట్
తెనాలి రూరల్: భార్య పుట్టింటికి వెళ్లి రాకపోతుండడంతో అత్తపై కోపం పెంచుకుని అత్తింటికి కన్నం వేసిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాయబ్రసూల్ వివరాలు వెల్లడించారు. మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన సుద్దపల్లి సుజాత మనవరాలు మంగళగిరి ఎయిమ్స్లో చికిత్స పొందుతోంది. మనవరాలి వద్దకు కుటుంబమంతా ఈ నెల 8వ తేదీన వెళ్లి, మరుసటి రోజు తిరిగి వచ్చారు. ఇంటికి వేసి ఉన్న తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెల్లి చూడగా ఇంట్లో ఉంచిన రూ. 10 వేల నగదు, సుమారు 70 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసులను ఆశ్రయించగా రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీకి పాల్పడింది సుజాత అల్లుడే అని నిర్ధారణకు వచ్చారు. సుజాత కుమార్తె శిరీష తన భర్త, బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడికి చెందిన అయ్యంకి పసితో కుటుంబ కలహాల నేపథ్యంలో కొలకలూరులోని పుట్టింటికి వచ్చింది. ఎన్నిసార్లు అడిగినా భార్య కాపురానికి రావడానికి నిరాకరిస్తోంది. ఇందుకు అత్త సుజాత కారణమని అల్లుడు కక్ష పెంచుకున్నాడు. 8వ తేదీన ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని చోరీకి పాల్పడ్డాడని సీఐ తెలిపారు. నిందితుని నుంచి చోరీ సొత్తు స్వాధీనపర్చుకున్నట్టు వివరించారు. సమావేశంలో ఎస్ఐ ఆనంద్, సిబ్బంది ఉన్నారు. -
డిగ్రీ ప్రవేశాలపై కొరవడిన స్పష్టత
చీరాల: అధికారులు, ప్రభుత్వం అలసత్వం కారణంగా విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్పై చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడి రెండు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు నోటిఫికేషన్కు సంబంధించి ఎటువంటి సమాచారం రాకపోవడంతో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు నిరాశే మిగులుతోంది. రెండేళ్లుగా ఇదే గందరగోళాన్ని సృష్టిస్తోందనే విమర్శలు సర్కారుపై వినిపిస్తున్నాయి. అంతా అయోమయం.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలో మొత్తం 88 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో డిగ్రీ మొదటి సంవత్సరం బీఎస్సీ, బీకాం, బీఏ కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. నోటిఫికేషన్ వెలువడకుండా అడ్మిషన్లు తీసుకునే పరిస్థితి లేదు. చీరాలలో వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకి మంచి పేరుంది. ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ నెలలో రాగా సప్లమెంటరీ ఫలితాలు కూడా జూన్ 18న విడుదలయ్యాయి. డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ఇప్పటి వరకూ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. నోటిఫికేషన్ ఎప్పుడిస్తారు? ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారు? తరగతులు ఎప్పుడు మొదలవుతాయోనని విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు అడ్మిషన్లను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సీట్ల సంఖ్య ఆధారంగా అడ్మిషన్లు ఫేజ్ల వారీగా భర్తీ చేస్తారు. విద్యార్థులు కాలేజీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకుని సిబ్బంది వెనక్కి పంపించి వేస్తున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు కౌన్సెలింగ్ ప్రక్రియకు షెడ్యూలు కూడా ప్రకటించారు. గతేడాది కూడా ఇదే తీరు.. ఈ ప్రక్రియ గత రెండేళ్లుగా ఆలస్యంగా సాగుతోంది. డిగ్రీ తరగతులు 2024–25 విద్యా సంవత్సరంలో ఆగస్టు నెలాఖరుకు ప్రారంభం కాగా, గత విద్యాసంవత్సరం కూడా ఇదే విధంగా జరిగింది. ఇప్పుడు కూడా జూలై నెల పూర్తి కావస్తున్నా నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఎంసెట్ చివరి కౌన్సెలింగ్ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తారేమోనని ప్రచారం నడుస్తోంది. కాలేజీల్లో చేరేందుకు విద్యార్థినులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. -
31న వినతి పాదయాత్ర ప్రారంభం
● ఆగస్టు 1న రాష్ట్ర డీజీపీకి వినతి పత్రం అందజేయటంతో ముగింపు ● వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మంగళగిరి రూరల్: తన ఇంటిపై జరిగిన దాడి కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 31న తేదీన గుంటూరులోని తన నివాసం నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వరకు వినతి పాదయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. మండలంలోని ఆత్మకూరు పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. అంబటి మాట్లాడుతూ జనవరి 31న తన ఇంటిపై ఏకంగా ఏడు గంటలపాటు జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఒక్కరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ఏప్రిల్ 16వ తేదీన ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టి జిల్లా ఎస్పీకి వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదన్నారు. అందుకే డీజీపీ కార్యాలయానికి పాదయాత్ర చేసి వినతిపత్రం అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాజా గ్రామంలో 31వ తేదీ రాత్రి బస చేసి, ఆగష్టు ఒకటో తేదీన డీజీపీ కార్యాలయానికి చేరుకుంటామని అనంతరం డీజీపీకి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు వ్యవస్థ దాడి ఘటనపై స్పందించకపోవడం ఆందోళనకరమని, ప్రజలకు న్యాయం జరిగేలా ఒత్తిడి తీసుకురావడమే పాదయాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు), వైఎస్సార్ సీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, మంగళగిరి రూరల్ అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బురమ్రుక్కల వేణుగోపాల్రెడ్డి, తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షుడు అమర నాగయ్య, దుగ్గిరాల రూరల్ మండల అధ్యక్షుడు శివగోపయ్య, పార్టీ పంచాయతీరాజ్ కార్యదర్శి ఫిరోజ్, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డేవిడ్రాజు, జిల్లా ఆక్టివిటీస్ కార్యదర్శి మల్లావరపు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులుగా మారుటూరి
రేపల్లె: రేపల్లె సబ్ జైలులో సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన మన్నెం వెంకటేశ్వరరావు(59) మృతి చెందారు. సబ్జైల్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఉదయం వరకు నిద్రలేవక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇటీవల రిమాండ్ ఖైదీ బీముడు అజిత్ కుమార్ పరారీ ఘటన నేపథ్యంలో వెంకటేశ్వరరావును అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సహోద్యోగులు, సిబ్బంది ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుడు వెంకటేశ్వరరావుకు భార్య పార్వతి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చీరాల: ఇంటి నుంచి చెప్పకుండా వచ్చిన భార్యను వెతుక్కుంటూ చీరాల వచ్చిన భర్తకు సహకరించి భార్యాభర్తలను కలిపారు. ఈ ఘటన శుక్రవారం చీరాలలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు శక్తి టీం చీరాల రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడకు చెందిన మేరి, ఏసోబు ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరూ గొడవపడగా భార్య మేరి ఇంటిలో చెప్పకుండా రెండు రోజులు క్రితం రైలు ఎక్కి చీరాలకు వచ్చింది. భార్యను వెతుక్కుంటూ శుక్రవారం చీరాలకు రాగా రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శక్తి టీం సభ్యులకు విషయాన్ని వివరించారు. ఒన్టౌన్ సీఐ సోమశేఖర్కు విషయాన్ని తెలుపగా శక్తి టీం సభ్యులు, మహిళా ఏఎస్ఐ శివకుమారి, కానిస్టేబుల్ సుబ్బారావు, సునీత అందరూ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద గల పాడుపడిన రైల్వే క్వార్టర్స్ వద్ద చెట్టు కింద నిద్రిస్తున్న ఆమెను గుర్తించి భర్తకు అప్పగించారు. అనంతరం ఇద్దరితో మాట్లాడి విజయవాడ వెళ్లే రైలు ఎక్కించారు. -
గుంటూరు వైద్యురాలి ఘనవిజయం
గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్, లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పమిడిముక్కల విజయ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 18 మంది వైద్యులను మాత్రమే ఎంపిక చేసే వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎంపికై రికార్డు సృష్టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్కు ఎంపికై న మొట్టమొదటి వ్యక్తిగా డాక్టర్ విజయ రికార్డు సృష్టించారు. బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు అందిస్తున్న చికిత్సలకు, పక్షవాత బారిన పడకుండా ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలకు, బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సల్లో వైద్యులు, సిబ్బందికి లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన అంకినీడు స్ట్రోక్ సెంటర్ ద్వారా అందిస్తున్న అత్యుతన్నత వైద్య ప్రమాణాలకు అంతర్జాతీయ గౌరవం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలిగా ఆమె పనిచేసి రికార్డు సృష్టించారు. 1996 నుంచి సేవలు ఉమ్మడి ఏపీలోనే మొట్టమొదటిగా, దేశంలో రెండవదిగా 1996లో గుంటూరులో అంకినీడు స్ట్రోక్ సెంటర్ను డాక్టర్ విజయ ఏర్పాటు చేశారు. పక్షవాత ( బ్రెయిన్ స్ట్రోక్) చికిత్సలో అత్యున్నత ప్రమాణాలు, నాణ్యమైన వైద్యసేవలు అందించటంలో అంకినీడు స్ట్రోక్ సెంటర్ చూపుతున్న నిరంతర కృషికి గాను ఇటీవల జాతీయ అవార్డు లభించింది. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఏజెంల్స్ ఇనిస్టిట్యూట్ డైమండ్ స్టేటస్ అంతర్జాతీయ అవార్డు స్ట్రోక్ సెంటర్కు, డాక్టర్ విజయకు 2020 నుంచి 2025 వరకు వరుసగా ఐదుసార్లు లభించింది. తాత మరణం కలచివేసింది.. ఈ సందర్భంగా డాక్టర్ పి.విజయ ‘సాక్షి’తో మాట్లాడుతూ నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో తాత అంకినీడుకు పక్షవాతం వచ్చి సకాలంలో చికిత్స ఎక్కడా లభించక చనిపోయారని, కళ్లెదుటే ఆయన మరణం చూసి తట్టుకోలేక బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు నివారించాలని మనస్సులో గట్టిగా నిర్ణయించుకున్నానని తెలిపారు. తదనుగుణంగా న్యూరాలజిస్ట్గా సేవలు ప్రారంభించానని తెలిపారు. ఉమ్మడి ఏపీలోనే మొట్టమొదటిగా, దేశంలో రెండవదిగా మా తాత అంకినీడు పేరు మీదుగా 1996లో గుంటూరులో పక్షవాత మరణాలు నివారణే లక్ష్యంగా స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. అంకినీడు స్ట్రోక్ సెంటర్ డైరక్టర్గా ఉన్న తాను ప్రతినెలా 100 నుంచి 125 మంది స్ట్రోక్ బాధితులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వరల్డ్ స్ట్రోక్ అసోసియేషన్కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎంపికవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి స్ట్రోక్ మరణాలు తగ్గింపే లక్ష్యంగా చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ఇచ్చిన పదవికి దేశానికి గుర్తింపు వచ్చేలా పనిచేస్తానని తెలిపారు. కుటుంబమంతా వైద్యులే.. డాక్టర్ విజయ భర్త పి. వి.రాఘవశర్మ సీనియర్ కార్డియాలజిస్టుగా, కార్డియాలజీ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకుడిగా సేవలందిస్తున్నారు. పెద్దకుమారుడు డాక్టర్ అనురాగ్ కార్డియాజిస్ట్గా, పెద్ద కోడలు డాక్టర్ స్రవంతి క్యాన్సర్ వైద్య నిపుణులుగా చిన్న కుమారుడు డాక్టర్ నరేన్ న్యూరాలజిస్ట్గా, చిన్న కోడలు డాక్టర్ సిరి చందన నెఫ్రాలజిస్ట్గా సేవలందిస్తున్నారు. సీనియర్ న్యూరాలజిస్టుగా, స్ట్రోక్ స్పెషలిస్టుగా 35 సంవత్సరాలుగా డాక్టర్ విజయ సేవలందిస్తూ ఎన్నో అవార్డులు, సన్మానాలు పొందారు. నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ (యూఎస్ఏ), వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎస్ఓ), అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (ఏఏఎన్), యూరోపియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (ఈఎస్ఓ), ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ (ఏపీఎన్ఎస్ఏ), న్యూరలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. -
భక్తిశ్రద్ధలతో కార్మెల్మాత ఉత్సవాలు
ఫిరంగిపురం: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కార్మెల్మాత ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. కొండపై పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ విశ్వాసులు భక్తిశ్రద్ధలతో కార్మెల్మాతను దర్శించుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా బాల ఏసుదేవాలయంలో విచారణ గురువులు ఫాతిమామర్రెడ్డి ప్రధాన యాజకులుగా ఉండి దివ్యపూజా నిర్వహించారు. భక్తులకు దేవుని సందేశం వినిపించారు. కొండపై 9గంటలకు ఏర్పాటు చేసిన దివ్యపూజాబలి కార్యక్రమంలో విజయవాడ పీఠాధిపతి టి.రాజారావు పాల్గొని వాక్యోపదేశం చేశారు. కోరిన వరాల నిచ్చే మాతగా కార్మెల్ మాతను భక్తులు విశ్వసిస్తారన్నారు. మాతపై విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ప్రశాంతత, అమ్మ అనుగ్రహం లభిస్తాయని చెప్పారు. అనంతరం 10.30 గంటలకు కార్మెల్మాత సమిష్టి దివ్యపూజా బలి కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన యాజకులుగా గుంటూరు మేత్రాసన నూతన అభిషిక్త గురువులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు తాగునీరు, అన్నదానం, వైద్యసదుపాయాలు కల్పించారు. పోలీసు సిబ్బంది, వలంటీర్లు భక్తులకు రద్దీలేకుండా చేస్తూ వారిరాకపోకలు పర్యవేక్షించారు. ఉత్సవాలు ప్రశాత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. -
విజ్ఞాన్కు జాతీయ స్థాయిలో స్వయం ఎన్పీటీఈఎల్ ‘ఏఏ’ గ్రేడ్
చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి భారతీయ సాంకేతిక విద్యా రంగంలో ప్రతిష్టాత్మక గుర్తింపుగా నిలిచే ఐఐటీ మద్రాస్ స్వయం– ఎన్పీటీఈఎల్ విడుదల చేసిన జాతీయ స్థాయి ర్యాంకింగ్స్లో ‘ఏఏ’ గ్రేడ్ లభించిందని వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా స్వయం–ఎన్పీటీఈఎల్ లోకల్ చాప్టర్ల పనితీరు ఆధారంగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో విజ్ఞాన్ యూనివర్సిటీ 22వ జాతీయ ర్యాంక్ను సాధించి ‘ఏఏ’ గ్రేడ్ను కైవసం చేసుకుందని తెలిపారు. ఎన్పీటీఈఎల్ నిర్వహించిన వివిధ ఆన్లైన్ కోర్సుల్లో విజ్ఞాన్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొత్తం 5,851 కోర్సు సర్టిఫికెట్లను సాధించారని చెప్పారు. 2026 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎన్పీటీఈఎల్ విద్యార్థులు ప్రదర్శించిన విశిష్ట ప్రతిభ, కోర్సులలో నమోదు, ఉత్తీర్ణత శాతం, టాపర్ విజయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ‘ఏఏ’ గ్రేడ్ ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. గ్రేడ్ సాధించేందుకు కృషి చేసిన ఎన్పీటీఈఎల్ లోకల్ చాప్టర్ కోఆర్డినేటర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, విభాగాధిపతులను చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు. -
గంజాయి విక్రయ ముఠా అరెస్ట్
కర్లపాలెం: గంజాయి అమ్మినా, తాగినా, నిల్వ చేసినా చట్టప్రకారం నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి చెప్పారు. గురువారం కర్లపాలెం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ చంద్రమౌళి రూరల్ సీఐ హరికృష్ణ, కర్లపాలెం ఎస్ఐ రవీంద్రతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కర్లపాలెం పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలో గల ఎంపీఎఫ్సీ గోదాములో కొంతమంది వ్యక్తులు గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తున్నట్లు సమాచారం అందటంతో కర్లపాలెం ఎస్ఐ తమ సిబ్బందితో పాటు సీసీఎస్ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, ఇద్దరు మధ్యవర్తులను వెంటబెట్టుకుని సంఘటనా స్థలానికి వెళ్ళి నలుగురు వ్యక్తులను చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 500గ్రాముల గంజాయి, రూ.వెయ్యి నగదు, ఓ ఎస్యూవీ వాహనం, మూడు సెల్ఫోన్లు, 8 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో కర్లపాలెం గ్రామానికి చెందిన ప్రస్తుతం చెరుకుపల్లిలో నివాసం ఉంటున్న మున్నంగి మణికంఠ, చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన పొన్నపల్లి రోషన్, అలియాస్ శాస్త్రి, చెరుకుపల్లి మండలం నడుంపల్లి గ్రామానికి చెందిన ఖాజా కేశవ్ శ్రీరామ్, నగరం మండలం తోటపల్లి గ్రామానికి చెందిన గోనతోటి సుధాకర్, అలియాస్ సోనూ ఉన్నారని డీఎస్పీ తెలిపారు. మున్నంగి మణికంఠపై గతంలో కర్లపాలెం, నర్సీపట్నం, కేడిపేట పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని తెలిపారు. మరో నిందితుడు స్టువార్టుపురం వృక్షనగర్కు చెందిన మెండ్రగుట్టి ప్రతాప్ పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని తెలిపారు. గంజాయి విక్రేతలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రవీంద్రను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 500 గ్రాముల గంజాయి, వాహనం సీజ్ -
నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
మంగళగిరి టౌన్: నేషనల్ మాస్టర్స్ (మెడ్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ చాంపియన్షిప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లాకు చెందిన పవర్ లిఫ్టర్లు ఎంపికయ్యారని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరావు, సంధాని గురువారం తెలిపారు. ఈనెల 18 నుంచి 23 వరకు మహారాష్ట్ర ఛత్రపతి సంబోజి నగర్లో నిర్వహించనున్న పోటీలకు క్రీడాకారులు హాజరవుతారని చెప్పా రు. మాస్టర్స్–1లో 84 కిలోల విభాగంలో లక్ష్మీతులసి, మాస్టర్స్– 2లో 69 కిలోల విభాగంలో జ్యోతివర్మ, మాస్టర్స్–2 మెన్లో 93 కిలోల విభాగంలో మస్తాన్వలి టీమ్ తరఫున జిల్లాకు ఎంపికయ్యారని తెలిపారు. పోటీలకు ఎంపికైన పవర్లిఫ్టర్లు ఉత్తమ ప్రదర్శన చేసి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. -
కోవిడ్ కేసులపై భయపడాల్సిన పనిలేదు
మంగళగిరి రూరల్: మంగళగిరిలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్ )లో కోవిడ్ కేసు నమోదయిందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అయిన విషయంపై ఎయిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ రాకేష్ గురువారం స్పందించారు. కోవిడ్ కేసులపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ఎయిమ్స్లో ఎవరూ కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా ఔట్ పేషెంట్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఇద్దరు డాక్టర్లను ప్రత్యేకంగా నియమించామన్నారు. కోవిడ్ రోగుల కోసం ముందస్తు జాగ్రత్త చర్యగా 10 బెడ్లతో సపరేటు వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. గుంటూరు మెడికల్: విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గుంటూరు వైద్య కళాశాల మెన్స్ హాస్టల్లో టేబుల్ టెన్నిస్ కోర్టును ప్రారంభిస్తున్నట్లు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి చెప్పారు. గురువారం అమరావతి రోడ్డులోని మెన్స్ మెడికల్ హాస్టల్లో రూ. 2.50 లక్షలతో ఏర్పాటు చేసిన టేబుల్ టెన్నిస్ పరికరాలను ఆయన ప్రారంభించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శివగోపాల్, ఫిజికల్ డైరెక్టర్ అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెంటచింతల: పూర్వీకులు నిర్మించిన ఆలయాలు మన చరిత్రకు సజీవ సాక్ష్యాలని పల్నాడు జిల్లా దేవదాయ శాఖ అధికారి జీఏవీ శ్రీనివాసు అన్నారు. గురువారం తుమృకోట గ్రామంలోని పాత శివాలయం పునర్నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన రూ. 15 లక్షల చెక్కును ఆయన ఆలయ కమిటీ వారికి అందజేసి మాట్లాడారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలించిన తుమృకోట గ్రామంలో సుమారు 400 సంవత్సరాల చరిత్ర కిందట నిర్మించిన పాత శివాలయం శిథిలమైనట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుల కృషి మేరకు రూ. 15 లక్షల నిధులను టీటీడీ శ్రీ వాణి ట్రస్ట్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మండల దేవదాయ శాఖ అధికారి గాదె రామిరెడ్డి, ఆలయ అధ్యక్షుడు జంగాల వెంకటే శ్వర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: టెట్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల ప్రయోజనార్ధం ఈనెల 19న గుంటూరులోని ఏసీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి తెలుగు సబ్జెక్టుపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ తెలిపారు. గురువారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో అవగాహన తరగతుల పోస్టర్ విడుదల చేశారు. నెల్లూరుకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు ఆర్.వెంకట్రావు తరగతులు బోధిస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పాల్గొని జిల్లాల విభజనపై తాజా సమాచారాన్ని తెలియజేస్తారని పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, బి.ప్రసాద్, కె.రంగారావు, కె.కేదార్నాథ్, శ్రీధర్ పాల్గొన్నారు. -
రాగి తీగల దొంగలు అరెస్ట్
● 16 ట్రాన్స్ఫార్మర్లలో రూ. 1.50 లక్షల విలువైన 105 కిలోల వైరు చోరీ ● పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు నరసరావుపేట టౌన్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగి తీగలను అపహరిస్తున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు పల్నాడు జిల్లా అడ్మిన్ ఎస్పీ జె.వి.సంతోష్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నకరికల్లు మండలం కండ్లగుంట, నరసింగపాడు గ్రామాల పరిధిలో ఇటీవల వరుసగా ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులో విలువైన రాగితీగలను చోరీలకు పాల్పడుతున్న కేసులను డీఎస్పీ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో నకరికల్లు పోలీసులు ఛేదించారన్నారు. కండ్లగుంట గ్రామానికి చెందిన చండ్రా వెంకటేశ్వర్లు తన పొలంలోని ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి రాగి వైర్లను దొంగలించినట్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. బుధవారం చేజర్ల గ్రామ సమీపంలో ఎన్ఎస్పీ కుడి కాల్వ దగ్గర నకరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన తడపాల సాయిబాబు, ఉరాలశెట్టి మల్లయ్య, చలంచర్ల హనుమంతరావులు అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని, విచారించగా.. రాగివైర్లు దొంగతనానికి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారన్నారు. నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో 16 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులో విలువైన కాపర్ వైర్లను అపహరించినట్లు తేలిందన్నారు. కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మాచర్ల టౌన్కు చెందిన రాజు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.1.50 లక్షల విలువైన 105 కేజీల రాగి వైరును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ హనుమంతరావు, సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్, నకరికల్లు ఎస్ఐ సతీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అమ్మోనియా భద్రతపై అవగాహన
కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఫ్యాక్టరీల శాఖ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు జీటీ రోడ్లోని టుబాకో అసోసియేషన్ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు 81 ఫ్యాక్టరీల యాజమాన్యాలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్రెడ్డి మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్లలో వినియోగించే అమ్మోనియా గ్యాస్ అత్యంత ప్రమాదకరమైనదని, అందువల్ల భద్రతా ప్రమాణాలను ఏ మాత్రం విస్మరించరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా కంప్రెసర్ గదుల్లో ఉన్న అమ్మోనియా నిల్వ ట్యాంకులను బయట ఏర్పాటు చేయడం ద్వారా భారీ ప్రమాదాలను సమర్థంగా నివారించవచ్చని తెలిపారు. గ్యాస్ లీకేజీలు, పేలుళ్లు వంటి ప్రమాదాలు సంభవించకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జీరో ప్రమాద మరణాలే లక్ష్యం.. కోల్డ్ స్టోరేజ్ల అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్రబాబు మాట్లాడుతూ శివకుమార్ రెడ్డి చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, శిక్షణల వల్లే పరిశ్రమల యాజమాన్యాల్లో భద్రతపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందని చెప్పారు. ఈ చైతన్యమే అమ్మోనియా ట్యాంకుల స్థాన మార్పుతో పాటు భద్రతా ప్రమాణాల అమలుకు దోహదపడిందన్నారు. సదస్సులో కోల్డ్ స్టోరేజ్ అసోసియేషన్ కార్యదర్శి రాఘవయ్య, అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి, కోకాకోలా, సంగం డెయిరీ, సిసిల్ సంస్థల సేఫ్టీ అధికారులు, వివిధ పరిశ్రమల యాజమాన్యాలు, భద్రతా ప్రతినిధులు పాల్గొన్నారు. -
రైతు శ్రేయస్సే ధ్యేయంగా యార్డు అభివృద్ధికి కృషి
తెనాలిటౌన్: తెనాలి మార్కెట్ యార్డులో గణనీయంగా నిమ్మకాయల వ్యాపారం జరుగుతుందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ గుంటూరు డైరెక్టర్ పి.రవి సుభాష్ పేర్కొన్నారు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా యార్డును మరింత అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మార్కెట్యార్డుకు చెందిన అన్ని తనిఖీ కేంద్రాల్లో ఈ–పర్మిట్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని వ్యవసాయ మార్కెటింగ్శాఖ, గుంటూరు డైరెక్టర్ పట్టన్శెట్టి రవిసుభాష్ స్పష్టంచేశారు. స్థానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్యార్డును మార్కెటింగ్శాఖ, గుంటూరు డైరెక్టర్ పట్టన్శెట్టి రవిసుభాష్ గురువారం సందర్శించారు. అక్కడి నిమ్మకాయల వ్యాపార కేంద్రానికి వెళ్లి వ్యాపారులతో మాట్లాడి నిమ్మకాయల ఎగుమతి, ధరల వివరాలను తెలుసుకున్నారు. మార్కెట్యార్డు చైర్మన్ తోట దుర్గాప్రసాద్ అభివృద్ధి పనులపై డైరెక్టర్తో చర్చించారు. ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు ఎం.దివాకర్, విజయవాడ, సహాయ మార్కెటింగ్ సంచాలకులు, గుంటూరు పి.సత్యనారాయణచౌదరి, కార్యనిర్వాహక ఇంజినీరు కె.శేషగిరిరావు, ఉపకార్యనిర్వాహక ఇంజినీరు డి.కోటయ్య, మార్కెట్యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి డీసీహెచ్ సుబ్బారావు పాల్గొన్నారు. -
స్టీరింగ్ వదిలి.. కంచం పట్టి
రేపల్లె: స్టీరింగ్ పట్టి ప్రయాణికులను గమ్యానికి చేర్చే చేతులు.. గురువారం ఖాళీ కంచాలు పట్టి వీధుల్లోకి వచ్చాయి. జీతాల పెంపు, కార్మిక హక్కుల అమలు కోసం సమ్మె చేస్తున్న హైర్ బస్సు డ్రైవర్లు వినూత్నంగా బిక్షాటన చేపట్టి తమ ఆవేదనను చాటుకున్నారు. రేపల్లె ఆర్టీసీ డిపో నుంచి ప్రధాన రహదారి వరకు ఖాళీ కంచాలతో నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. స్థానిక కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా డ్రైవర్ల పోరాటానికి సంఘీభావం ప్రకటించాయి. జీతాల పెంపుదలతో పాటు కార్మిక హక్కుల అమలు కోరుతూ రేపల్లె, చీరాల డిపోల పరిధిలో హైర్ (అద్దె) బస్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ బాపట్ల జిల్లా కోశాధికారి సీహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రేపల్లె డిపో పరిధిలో ప్రతి రెండేళ్లకు ఒకసారి వేతనాల సవరణ జరుగుతుందన్నారు. రెండు సంవత్సరాల క్రితం రోజువారీ వేతనం రూ.1,000 ఉండగా కేవలం రూ.100 మాత్రమే పెంచి ప్రస్తుతం రూ.1,100 చెల్లిస్తున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర వ్యయాలు భారీగా పెరిగినా హైర్ బస్ యజమానులు వేతనాల పెంపుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ అధికారులు జోక్యం చేసుకోవాలి ఆర్టీసీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి డ్రైవర్కు కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పిస్తామని హైర్ బస్ యజమానులు హామీ ఇచ్చినా వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ అధికారులు జోక్యం చేసుకుని ఒప్పందాలను అమలు చేయించే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సమ్మెకు మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు వై.కిషోర్, కొప్పుల గోపి, ఎన్.రవి, పి.విజయ్ తదితరులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మదర్ థెరిసా హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, కోశాధికారి జి.రవిబాబు, నాగరాజు, వెంకటేశ్వరరావు, రాజు, ఇమ్రాన్ పాల్గొన్నారు. -
ఆస్తి వివాదంలో యువకుడు హత్య
తెనాలిరూరల్: ఆస్తి వివాదం చినికి చినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది. వేధింపులతో విసిగి వేసారారో లేక తట్టుకోలేకపోయారో గానీ ఆ కుటుంబ సభ్యుల పరస్పర ఘర్షణలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో కలకలం రేపిన ఘటనపై పట్టణ వన్టౌన్ సీఐ ిసీహెచ్ రాంబాబు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక నాజరుపేటలో నివాసం ఉండి, ఆటో డ్రైవర్గా జీవనం సాగించే కొల్లిపర కోటేశ్వరరావు(28)కు కొంతకాలంగా తల్లిదండ్రులతో ఆస్తి వివాదం జరుగుతోంది. కొల్లిపరలో ఉన్న నివేశన స్థలాన్ని అమ్మి తనకు కొంత డబ్బు ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులు భాస్కరరావు, విజయమ్మ, తమ్ముడు మరియదాసులపై కోటేశ్వరరావు ఒత్తిడి తెస్తుండడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి వరకు పరస్పరం వాదనలు, ఘర్షణ జరిగాయి. ఘర్షణలో తల్లిదండ్రులు సోదరుడు మరియదాసు చేతిలో తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని మూటలో పెట్టి ఆటోలో తరలించే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు గమనించి డయల్ 112 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐతో పాటు సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేసి.... కోటేశ్వరరావు డబ్బు కోసం తల్లిదండ్రులను తీవ్రంగా వేధింపులకు గురి చేసేవాడని తెలుస్తోంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి తెచ్చిన డబ్బును జల్సాల కోసం ఖర్చు చేసేవాడు. వివిధ రకాల పనులు చేసి తమ్ముడు కూడబెట్టిన సుమారు రూ.5 లక్షల వరకు సొమ్మునూ ఖర్చు చేశాడు. వేమూరు మండలం చదలవాడ గ్రామానికి చెందిన మహిళతో కోటేశ్వరరావుకు వివాహం కాగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. విభేదాల కారణంగా ఏడేళ్ల క్రితం భార్యతో విడిపోయాడు. కొందరు మహిళలతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకుని కుటుంబ సభ్యుల సంపాదనంతా వారికి ఖర్చు చేస్తుండడంతో తండ్రి భాస్కరరావు, తల్లి విజయమ్మ నాజరుపేట ఇంద్ర టవర్స్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డుకు మకాం మార్చారు. వీరితో కలిసి ఉంటున్న కోటేశ్వరరావు ఆటో నడుపుతూ తన జల్సాలను మాత్రం మానుకోలేదు. డబ్బు కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తీవ్రతరం చేశాడు. భాస్కరరావు బుధవారం కొల్లిపర వెళ్లి తమ బంధువులతో ఇంటి స్థలం విక్రయించాలని, బేరం త్వరగా చూడాలని కోరి, తమ పెద్ద కొడుకు వేధింపులు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వేధింపులు తాళ లేక హతమార్చి ఉంటారని బంధువులు చెబుతున్నారు. ఆటోలో ఉన్న కోటేశ్వరరావు మృతదేహం కొల్లిపర కోటేశ్వరరావు(ఫైల్) తల్లిదండ్రులు, తమ్ముడే అంతమొందించారని ఆరోపణలు -
వినుకొండలో పట్టపగలే చోరీలు
వినుకొండ: వినుకొండ పట్టణంలో గురువారం ఒకే రోజు నాలుగు ఇళ్లలో వరుస దొంగతనాలు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దొంగలు పట్టపగలే తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బీరువాలు పగలగొట్టి, భారీగా నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. స్థానిక కొత్తపేట ఐదో లైను, ట్రాన్న్స్ఫార్మర్ బజారుతో పాటు, కాలువ కట్టపై ఉన్న రెడ్డి నగర్ సమీపంలోని మూడు ఇళ్లలో ఈ చోరీలు జరిగాయి. కొత్తపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆవుల సుబ్బారెడ్డి ఇంట్లోకి చొరబడిన దొంగలు, బీరువా తాళాలు పగలగొట్టి సుమారు పది తులాల బంగారం, లక్ష రూపాయల నగదును అపహరించుకుపోయారు.మరో మూడు ఇళ్లలోనూ దొంగలు అదే పద్ధతిలో తాళాలు, బీరువాలు పగలగొట్టి విలువైన వస్తువుల కోసం వెతికారు. ఇళ్లలోని సామాన్లను, బట్టలను గదుల నిండా చెల్లాచెదురుగా పడేశారు. ఆ ఇళ్లలో జరిగిన నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే రోజు, అది కూడా పట్టపగలే నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే వినుకొండ పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకున్నారు. దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించి, వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దించి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒకే రోజు నాలుగు ఇళ్లలో చోరీ! -
మార్టూరులో భూచోళ్లు
బాపట్లశుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026● యథేచ్ఛగా ప్రభుత్వ భూముల పందేరం ● టీడీపీ నేతలకు అధికారుల అండదండలు ● ఫిర్యాదు చేసినవారిపైనే అధికారుల చిందులు మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో ప్రభుత్వ భూములను అధికార పార్టీ నాయకులకు రెవెన్యూ అధికారులే యథేచ్ఛగా కట్టబెడుతున్నారనే ఆరోపణు ఉన్నాయి. రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడంతో ప్రజా సంఘాల నాయకులు కొందరు తరచూ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ ఖాతరు చేయడంలేదు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా రాజుగారి పాలెం వెళ్లే రోడ్డులో గల రెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఇటీవల స్థానిక టీడీపీ నాయకుడి పేరుతో తహసీల్దార్ ఆన్లైన్ చేశారు. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.6కోట్ల విలువైన ఆ భూమిలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నారంటూ మార్టూరుకు చెందిన దళిత నాయకుడు రామకూరి విజయ్ కుమార్ అనే వ్యక్తి గత సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తహసీల్దార్ ప్రశాంతి అర్జీ ఇచ్చిన విజయ్ కుమార్ను మంగళవారం తన కార్యాలయానికి పిలిపించుకుని తిట్ల దండకం అందుకున్నట్లు బాధితుడు విలేకరులకు తెలిపాడు. ఈక్రమంలో విజయకుమార్ తహసీల్దార్తో ‘భూమిలేని నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తులకు సెంటు భూమి ఇవ్వడం కోసం అనేక షరతులు పెట్టే అధికారులు.. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా ఉన్నవారికి రూ.కోట్ల ప్రభుత్వ భూములు ఎలా కట్టబెడతారు? త్వరలో ప్రజాసంఘాలతో మీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం’ అని హెచ్చరించినట్లు తెలిపారు. అంతేకాక స్థానిక పోలీస్ స్టేషన్ పక్కన గల రూ.30 కోట్ల విలువైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అగ్రవర్ణానికి చెందిన ఓ టీడీపీ నాయకుడికి ఎలా కట్టబెడుతున్నారని.. దీనిపై కూడా పోరాడతాం అని అన్నట్లు విలేకరులకు చెప్పారు. వాస్తవానికి పోలీస్ స్టేషన్ పక్కన గల మూడు ఎకరాల భూమి అన్యాక్రాంతానికి ప్రయత్నం జరుగుతున్న విషయంపై గత నెలలో రాజశేఖర్ అనే వ్యక్తి నేరుగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్కు అర్జీ ఇచ్చారు. ఆ విషయమై ఎలాంటి చర్యలు తీసుకున్న విషయం తెలియదు కానీ సదరు నాయకుడు మాత్రం ఆ భూమిలో పంట వేయడం కోసం ఇటీవల దున్నిన విషయం ప్రస్తుతం మార్టూరులో చర్చనీయాంశంగా మారింది. త్వరలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు సిద్ధం కాబోతున్నట్లు విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. చెరుకుపల్లి: చెరుకుపల్లిలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘా వృతమై చల్లని గాలి వీస్తూ భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. -
హరే రామ.. హరే కృష్ణా..!
గుంటూరులో వైభవంగా జగన్నాథ రథయాత్ర నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గుంటూరు నగర పుర వీధుల్లో జగన్నాథ రథయాత్ర వైభవంగా కొనసాగింది. హరేకృష్ణ నామ సంకీర్తనతో వీధులన్నీ మార్మోగాయి. స్వామినామంతో భక్తులు పులకించిపోయారు. గుంటూరు ఏటీ అగ్రహారం పరిధిలోని మల్లారెడ్డినగర్లో ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో గురువారం జగన్నాథుని రథయాత్ర భక్తిశ్రద్ధలతో సాగింది. భక్తులు భారీగా తరలివచ్చి, హరే రామ, హరేకృష్ణ నామ సంకీర్తనల ఆలాపనతోపాటు కోలాటం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. యాత్ర మిర్చియార్డు, కలెక్టరేట్రోడ్డు, కంకగుంట రైల్వే ఫ్లై ఓవర్, పట్టాభిపురం, కుందుల రోడ్డు, బృందావన్గార్డెన్స్, లక్ష్మీపురం, కొరిటెపాడు మీదగా చంద్రమౌళినగర్ మాజేటి కల్యాణ మండపం వద్దకు చేరుకుంది. అనంతరం స్వామివారికి మంగళహారతి. మహాప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జగన్నాథ రథయాత్రకు హాజరై నామస్మరణ చేయడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తాయని తెలిపారు. ● అదేవిధంగా గుంటూరు తూర్పు పరిధిలో గురువారం రాత్రి శ్రీజగన్నాథస్వామి రథయాత్రను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. కొత్తపేట పశువుల ఆసుపత్రి ఎదురు శ్రీజగన్నాథ స్వామి వారి దేవస్థానంలో శ్రీబాలభద్ర సుభద్ర శ్రీజగన్నాథస్వామి వారి రథయాత్ర వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. గుంటూరు నగరంలో నివసించే ఒడిశా రాష్ట్ర భక్తులు తరలివచ్చి, స్వామి వారిని దర్శించుకున్నారు. -
సినీ రచయిత కోన వెంకట్కు మాతృ వియోగం
బాపట్ల: సినీ రచయిత నిర్మాత కోన వెంకట్కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కోన ధర్మావతి (82) బుధవారం రాత్రి వైజాగ్లో కన్నుమూశారు. ఆమె మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి వదిన. ధర్మావతి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైఎస్సార్ సీపీ లీగల్సెల్ రాష్ట్ర కార్యదర్శిగా మణిబాబు నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సత్తెనపల్లికి చెందిన చిన్నం మణిబాబును లీగల్సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాచర్లకు చెందిన మేరాజ్యోత్ హనుమానాయక్ను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి మాచర్ల: పట్టణంలోని గుర్తు తెలియని వ్యక్తి గురువారం తెల్లవారు జామున బస్టాండ్ ఎదురు వెంగమాంబ కాంప్లెక్స్ వద్ద మృతి చెందాడు. సుమారు 42 సంవత్సరాలు కలిగిన వ్యక్తి అపస్మారక స్థితిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పట్టణ పోలీసులు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్టు వారికి తెలుపగా పోలీసుల సహకారంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎవరైనా స్నేహితులు, బంధువులు సంబంధిత వ్యక్తిని గుర్తుపడితే మాచర్ల పట్టణ పోలీసు స్టేషన్ను సంప్రదించాలన్నారు. స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రి మార్చురీకి చేర్చారు. ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు నూజండ్ల: ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇరువురు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు ఐనవోలు ఎస్సై బి.వి.కృష్ణారావు గురువారం తెలిపారు. పల్నాడు జిల్లా పరిధిలో ఇటీవల ద్విచక్రాల చోరీ అధికమవుతున్నట్లు పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడమైందని అన్నారు. సీఐ బి.బ్రహ్మయ్య ఆదేశాలతో సిబ్బందితో కలిసి ముప్పరాజువారిపాలెం గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించమాన్నారు. గ్రామానికి చెందిన దుర్గంపూడి సుబ్బారావు, నందిగం వెంకటశివయ్యలుగా గుర్తించామన్నారు. వివిధ సంఘటనల్లో ఆరు ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు వారు అంగీకరించటంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కారెంపూడిలో ఐపీ దాఖలు చేసిన వ్యాపారి కారెంపూడి: ఒక వ్యాపారి రూ. కోటిన్నరకు పైగా ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) దాఖలు చేశారని సమాచారం గురువారం రాత్రి సంచలనం రేపింది. సదరు వ్యాపారి 22 మంది వద్ద మొత్తం రూ. 1,52,50,000లు అప్పుగా తీసుకుని వారందరికి ప్రాంసరీ నోట్లు రాసిచ్చారు. వారందరికి కూడా ఐపీ నోటీసులు సిద్ధం చేసినట్లు సమాచారం. అప్పు చెల్లించాలని అడుగుతున్నవారికి అప్పు చెల్లిస్తానని చెబుతూ వచ్చి తీరా ఐపీ దాఖలు చేయడంతో అప్పులిచ్చినవారంతా ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి, పొదుపు పథకాలు నడుపుతున్నాడనే నమ్మకంతో వ్యాపారులు అతనికి కూడా లక్షల్లో అప్పులిచ్చారని తెలుస్తోంది. -
చిత్తశుద్ధి జాడెక్కడ?
గుర్రపుడెక్కతో రైతులకు కోలుకోలేని నష్టం ఏటా గుర్రపు డెక్క సమస్య రైతులకు సమస్యలు తెచ్చిపెడుతోంది. దీనివల్ల పంటలు దెబ్బతింటున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదు. రేపల్లె డ్రైనేజీ కాలువల్లో గుర్రపు డెక్క తొలగించకుంటే ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. తమ సంక్షేమంపై చిత్తశుద్ధి లేని చంద్రబాబు పాలనలో ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. – ఈపూరు బాబురావు, పోతుమర్రు –ఆల్లూరు యోనబాబు, జంపని -
కట్టను చెరబట్టి మట్టి దందా
అధికారమే అండగా... భద్రత ప్రశ్నార్థకం పంట పొలాల చుట్టూ మట్టి అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. చివరకు లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీరందించే కాలువపైనా కన్నేశారు. నీటి పారుదల శాఖలో ఇంటి దొంగల అండతో ఏకంగా కాలువ కట్టల అంచులను తవ్వి మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. వీరి దెబ్బకు కాలువ రూపురేఖలు మారిపోతున్నా.. కొల్లూరు మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి సిఫార్సులతో దందా యథేచ్ఛగా సాగిపోతోంది. కొల్లూరు నీటి పారుదల శాఖ కార్యాలయం సమీపంలోనే ఈ అక్రమం సాగుతున్నా అధికారులు నిద్రపోతున్నారు. – రవిబాబు, ఇరిగేషన్ ఇన్చార్జి ఏఈ -
కృష్ణా డెల్టాకు నీరు విడుదల
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా పశ్చిమ డెల్టాకు బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రకాష్లు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ కృష్ణానదిపై ఎగువన ఉన్న రిజర్వాయర్లలో నీటి నిల్వలు లేనందున కృష్ణా డెల్టాకు రాలేదన్నారు. కృష్ణా డెల్టా 13 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి అయోమయంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పులిచింతలలో 30 టీఎంసీలు నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా 16 టీఎంసీలు తరలించగలుగుతున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో వర్షాలు పడితే మరో 30 టీఎంసీలు, వెరసి ఈ సీజన్లో 75 టీఎంసీలు అందించే వీలు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. కృష్ణా డెల్టాలోని మొత్తం 13 లక్షల ఎకరాల సాగుకు 150 టీఎంసీలు అవసరమని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, కేడీఎస్ సీఈ రాంబాబు, రాష్ట్ర సాగునీటి సంఘాల ప్రతినిధులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. బగళాముఖి ఆలయంలో ప్రత్యేక పూజలు చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బగళాముఖి అమ్మవారి దేవస్ధానంలో శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి లఘు వారాహిదేవి అలంకరణ చేశారు. మహోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ ప్రాంగణం శుద్ధి చేయటంతోపాటు సుందరంగా అలంకరించారు. ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేశారు. అనంతరం ట్రస్టు బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అర్చకులు అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీకి రూ.30 లక్షల విరాళం గుంటూరు మెడికల్: టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్, బ్రిందా న్యూరో సెంటర్ అధినేత డాక్టర్ హనుమ శ్రీనివాసరెడ్డి రూ.10,00,116, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116, బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించింది. శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు బ్రింద హాస్పటల్ అధినేతలు డాక్టర్ భవన హనుమ శ్రీనివాసరెడ్డి, వసంత సిద్ధార్థలు ఈ విరాళం డీడీలను అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు, నాట్కో ట్రస్టు ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు. పొంగలి షెడ్డు నిర్మాణానికి విరాళం తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని 17వ వార్డులో ఉన్న శ్రీ గంగానమ్మ ఆలయంలో పొంగలి షెడ్డు నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ తన సొంత నిధుల నుంచి రూ. 1.50 లక్షల విరాళం అందజేశారు. ఆయన తరఫున బుధవారం టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాడిబోయిన భాస్కర్, గుద్దంటి నాగేశ్వరరావు, ఇట్టా భాస్కర్, నిర్మల, రాంబాబు, గోపి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
బాపట్ల: రైతులు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆధునిక మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలన్న లక్ష్యంతో జిల్లా వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిసాన్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు శాఖలు ఏర్పాటు ప్రదర్శన స్టాళ్లను తిలకించారు. పంటలు, విత్తనాలు, ఎరువుల వాడకం వంటి సమాచారంతో బ్రోచర్లు, కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. ఉత్తమ రైతులను సన్మానించారు. జిల్లా వ్యవసాయ అధికారిణి ఎ.లక్ష్మి, ఆత్మ పీడీ జి.వెంకటేశ్వరావు, పశు సంవర్ధక శాఖ జేడీ డి.వేణుగోపాల్, ఏపీఎంఐపీ పీడీ డి.నీలిమ, ఉద్యాన శాఖ డీడీ ఖలీం, మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ , పౌర సరఫరాల శాఖ డీఎం ఎం. శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రైలు నుంచి జారిపడిన యువతి
తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు వేజండ్ల(చేబ్రోలు): చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామ పరిధిలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువతికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం జరిగింది. తెనాలి నుంచి గుంటూరు వెళ్తున్న రైలు నుంచి మధ్యాహ్న సమయంలో సుమారు 20 సం.ల వయస్సు కలిగిన యువతి జారిపడి పొలాల్లో పడిపోయింది. తలకు, ముఖానికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ట్రాక్టర్తో పొలం దున్ను తున్న రైతులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి వెళ్లిన సిబ్బందికి సంఘటనా ప్రాంతం నుంచి తీసుకురావటానికి ఇబ్బందులు పడ్డారు. సుమారు కి.మీ దూరం వరకు రైలు పట్టాలపై, రాళ్లలో నడుచుకుంటూ అపస్మారక స్థితిలో ఉన్న యువతిని స్ట్రెక్చర్పై 108 సిబ్బంది కోట ఉదయ్ కిరణ్, బి.యహోషవాలతో పాటు స్థానిక రైతులు అంబులెన్స్ వాహనం వరకు అతికష్టం మీద తీసుకువచ్చి అత్యవసర వైద్య సేవలు అందించి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమెను ఒడిశాకు చెందిన యువతిగా భావిస్తున్నారు. రైలు గేటు వద్ద ఉన్న సమయంలో పొరపాటున జారిపడి ఉంటుందా లేక ఎవరైన ఉద్దేశపూర్వకంగా కిందకు నెట్టి ఉంటరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రీడల్లో సత్తాచాటిన కానిస్టేబుల్కు ఎస్పీ అభినందనలు
బాపట్ల: జిల్లా పోలీస్ శాఖ ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ కొనియాడారు. 2026 జూలై 6 నుంచి 8వ తేదీ వరకు మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్లో నిర్వహించిన 14వ సీనియర్ నేషనల్ పెన్కాక్ సిలాట్ చాంపియన్షిప్ 2026–27 పోటీల్లో కర్లపాలెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించే వీరంకి నరేంద్ర సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేంద్రను ఎస్పీ అభినందించి మెడల్తో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూనే జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. షిల్లాంగ్లో జరిగిన 14వ సీనియర్ నేషనల్ పెన్కాక్ సిలాట్ ఛాంపియన్షిప్ 2026–27 పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి జిల్లా పోలీస్ శాఖ కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయడం గర్వకారణమన్నారు. గతంలో కూడా నరేంద్ర అనేక జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించారని తెలిపారు. ఇప్పటివరకు ఆయన ఒక గోల్డ్, రెండు సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ జాతీయ స్థాయిలో సాధించడం గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటాలని ఆకాంక్షించారు. క్రీడల ద్వారా ఒత్తిడిని సునాయాసంగా అధిగమించవచ్చని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మెడికల్ షాపులో చోరీకి యత్నం
సెక్యూరిటీ అలారం మోగడంతో పరారీ మంగళగిరి టౌన్: మెడికల్ షాపులో చోరీకి వచ్చి అలారమ్ మోగడంతో వారు పరారీ అయిన ఘటన మంగళవారం తెల్లవారుజామున మంగళగిరి పట్టణంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి పట్టణ పరిధిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ సమీపంలో గౌతమబుద్ధ రోడ్డు వెంబడి శ్రీ ధాత్రి సాయి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ను పట్టణానికి చెందిన ఫణీంద్ర అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తన ఫోన్లో అలారం మోగడంతో వెంటనే షాపు సీసీ కెమెరాలను తన ఫోన్లో చూశాడు. అదే సమయంలో అలారం ఏర్పాటు చేసిన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ వారు కూడా ఫణీంద్రకు ఫోన్లో సమాచారం అందించారు. అయితే సీసీ కెమెరాల్లో ఏమీ కనబడకపోవడంతో నిద్రపోయాడు. వెంటనే మరుక్షణంలోనే అలారం మోగడంతో తన ఫోన్లో సీసీ కెమెరా ఓపెన్ చేయగా షట్టర్ పగలకొట్టి లోపలకు ఓ వ్యక్తి ప్రవేశించడం గమనించాడు. వెంటనే తన ఫోన్లో అలారం బటన్ నొక్కి తన షాపులో మోగే విధంగా ఏర్పాటు చేశాడు. దీంతో దుండగుడు వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. ఇంటి వద్ద నుంచి షాపు వద్దకు వచ్చి చూడగా షట్టర్ తాళాలు పగలకొట్టి, పైన ఉన్న సీసీ కెమెరా పక్కకు వంచి ఉండడం, సైరన్ బాక్స్ పగలకొట్టి ఉండడం గమనించాడు. వెంటనే పట్టణ పోలీస్స్టేషన్కు సమాచారం అందించాడు. అయితే పోలీసులు సరిగా స్పందించలేదని బాధితుడు తెలిపాడు. షాపులో ఎటువంటి నష్టం వాటిల్లకపోవడంతో ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడు. గతంలో ఇదే తరహాలో.... మూడేళ్ల క్రితం 2023 జూలై నెలలో ఇదే తరహాలో షాపు పైభాగంలో రంద్రం చేసి దుండగుడు లోపలకు ప్రవేశించాడని, షాపులో వున్న అధిక మొత్తంలో నగదును, హార్డ్డిస్క్ అపహరించుకుపోయినట్లు బాధితుడు ఫణీంద్ర తెలిపాడు. పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీస్ అధికారులు, క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించి విచారించారని, కానీ నేటికీ ఆ కేసుపై ఎటువంటి పురోగతి లేదని, అందువల్లే ఇప్పుడు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయడానికి నిరాకరించినట్లు పేర్కొన్నాడు. లోయలో పడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలింపు మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఎగువ సన్నిధి కొండపై వున్న గండాలయ స్వామిని దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కొండపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్లో ద్విచక్రవాహనాల ద్వారా భక్తులు ప్రయాణాలు చేస్తారు. అమావాస్య కావడంలో భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి కొండపైకి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఘాట్రోడ్లో వస్తుండగా రెండు ద్విచక్రవాహనాలు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయాయి. వాటిపై ఉన్న ఇద్దరు యువకులు లోయలోకి జారుకున్నారు. గమనించిన పలువురు భక్తులు వారిని పైకి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద భరితంగా ఉన్న ఘాట్రోడ్లో ప్రమాదాలు జరగకుండా ఆలయ అధికారులు, సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్సకోసం స్థానిక దేవస్థానం సిబ్బందిని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా గుంటూరు ఎడ్యుకేషన్: కాలానుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతిక విద్యాబోధన నైపుణ్యాలు అలవర్చుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా అన్నారు. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మంగళవారం డివిజన్ స్థాయిలో వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమంతో పాటు డీఆర్పీలకు జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని పట్టాభిపురం, వేణుగోపాల్నగర్లోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించారు. ఈసందర్భంగా డీఈఓ సలీమ్ బాషా మాట్లాడుతూ మారిన సిలబస్, లీప్ యాప్, తదితర అంశాలపై శిక్షణలో నేర్చుకున్న అంశాలను డివిజన్ స్థాయిలో శిక్షణ కల్పించాలని సూచించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో తరగతి గదిలో విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే విధంగా బోధించి, పాఠశాలలను అభివృద్ధి బాట పట్టించాలన్నారు. కోర్సు కో–ఆర్డినేటర్ కె.విజయభాస్కర్ మాట్లాడుతూ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ రెండు రోజులపాటు జరిగే శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో స్టేట్ రీసోర్స్ పర్సన్, డైట్ అధ్యా పకులు, డీఆర్పీలు పాల్గొన్నారు. దాచేపల్లి: గూడ్స్ రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రాత్రి రాత్రి 8:30 గంటల సమయంలో పొందుగల–నడికుడి రైల్వేస్టేషన్ల మధ్య ఓ మహిళ నడుచుకుంటూ వెళుతోంది. గమనించిన గూడ్స్రైలు లోకో పైలట్ పలు మార్లు గట్టిగా హారన్ మోగించినప్పటికి సదరు మహిళ పట్టాలపై నుంచి పక్కకు తప్పుకోలేదు. దీంతో గూడ్స్రైలు కిందపడి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి శరీరంపై పింక్ కలర్ పూల డిజైన్చీర, నలుపు రంగు జాకెట్ ఉన్నది. నడికుడి రైల్వే పోలీస్లు మృతదేహాన్ని పరిశీలన చేసి కేసు నమోదు చేసి పోస్ట్మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
హామీలను ప్రభుత్వం అమలు చేయాలి
ఫ్యాప్టో నాయకుల డిమాండ్ బాపట్ల: ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు చింతల సుబ్బారావు, కొమ్మోజు శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు బాపట్ల కలెక్టరేట్ వద్ద ర్యాలీ, పికెటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఫ్యాప్టో చైర్మన్ పి.డి.సోషలిజం పికెటింగ్ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ సాగతీత ధోరణి సరైనది కాదన్నారు. వేతన కమిటీ ఆలస్యమయ్యేకొద్దీ ఉద్యోగులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఫ్యాప్టో కార్యదర్శి కె. పిచ్చయ్య, జిల్లా ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాల జిల్లా బాధ్యులు నారాయణ, అమర్నాథ్, వినయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడతామన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి ఫ్యాప్టో నాయకత్వం వినతిపత్రం అందజేసింది. కార్యక్రమంలో అడుగుల శ్రీనివాసరావు, బడుగు శ్రీనివాసరావు, మచ్చ వెంకటేశ్వరెడ్డి, నాగరాజు, సుభాని, రాజేష్, శివ పాల్గొన్నారు. -
కార్మెల్మాత ఉత్సవాలు ప్రారంభం
ఫిరంగిపురం: మండల కేంద్రంలోని కార్మెల్ కొండపైనున్న కార్మెల్ మాత ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. బాల ఏసు దేవాలయంలో విచారణ గురువు ఫాతిమా మర్రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను ప్రారంభించారు. కొండపై దివ్యపూజాబలి నిర్వహించారు. కొండవీడు విచారణ గురువు సీహెచ్ అలెక్స్ వాక్యోపదేశం చేశారు. దివ్యపూజాబలి కార్యక్రమంలో మొదటిరోజు సెయింట్ ఆన్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మఠకన్యలు పాల్గొన్నారు. అనంతరం మరియమాతను ప్రత్యేకంగా అలంకరించారు. తేరులో ఉంచి ఆలయ ప్రదక్షిణ చేయించారు. గుంటూరు మెడికల్: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 7 నుండి 13వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. పట్టణ ఆరోగ్యకేంద్రాలలో 20 ఫార్మసిస్ట్, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో 20 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేశామన్నారు. ఎంపికై న వారికి మంగళవారం నియామకపు ఉత్తర్వులు గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో డాక్టర్ విజయలక్ష్మి అందజేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని ఆమె సూచించారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని పానకాల లక్ష్మీనరసింహ స్వామి కొండపై ఉన్న గండాలయ స్వామికి మంగళవారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు కొండపైకి చేరుకున్నారు. గండాలయ స్వామివారిని దర్శించుకున్నారు. తమ గండాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ పూజలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు, ఎండోమెంట్ అధికారులు తగిన సౌకర్యాలు కల్పించారు. పెదకాకాని: శివాలయంలో అమావాస్య మంగళవారాన్ని పురస్కరించుకుని రాహుకేతు పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో తెల్లవారు జాము నుంచే భక్తుల సందడి నెలకొంది. మధ్యాహ్నం రాహుకాలం 3 గంటల వరకు భక్తులు పాలుపంచుకున్నట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావులు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పూజా టికెట్ల విక్రయం ద్వారా స్వామి వారికి రు. 5.30 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. దుర్గమ్మకు బంగారు హారం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గుంటూరుకు చెందిన భక్తుడు మంగళవారం రూ. 3 లక్షల విలువైన బంగారుహారాన్ని సమర్పించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిచంద్రపురానికి చెందిన సీహెచ్ వంశీకృష్ణ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి సుమారు 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. -
వృద్ధులే లక్ష్యంగా దోపిడీలు
తెనాలిరూరల్: వృద్ధులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల నకిలీ పోలీసులను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్ధనరావు వివరాలను వెల్లడించారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కావటి కిరణ్కుమార్, సదుపాటి మురళి స్నేహితులు. కిరణ్కుమార్ గతంలోనే నకిలీ పోలీస్ అవతారమెత్తి, పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. గుంటూరు, చీరాల, ఇంకొల్లు, వేటపాలెం, ఒంగోలు, నందిగామల్లో నేరాలకు పాల్పడ్డాడు. ఇతనిపై 12 కేసులు ఉన్నాయి. మురళి 12 ఏళ్లు బీఎస్ఎఫ్లో పనిచేసి 2012లో ఉద్యోగం వదిలి వచ్చేశాడు. మద్యం, ఇతర వ్యసనాలకు బానిసైన మురళి కిరణ్కుమార్తో కలిసి ఇటీవలి కాలంలో నేరాలకు పాల్పడుతున్నాడు. ఈనెల 7వ తేదీన కొల్లిపర చెందిన మల్లికార్జున రెడ్డి నందివెలుగు నుంచి స్కూటీపై తెనాలి వస్తుండగా ఆటోనగర్ వద్ద అతడిని ఇద్దరు నిందితులు అడ్డగించి పోలీసుల పేరుతో బెదిరించారు. స్కూటీని చెక్ చేయాలంటూ భయపెట్టి డిక్కీలో ఉన్న రూ. 1.60 లక్షల నగదులో రూ.50,000 లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. అదే రోజు దుగ్గిరాల సమీపంలోని కొత్త పెట్రోల్ బంకు వద్ద మోపెడ్పై వెళుతున్న వృద్ధుడు మహమ్మద్ ఫరూక్ను కూడా బెదిరించి అతని వద్ద ఉన్న రూ 7వేలు తీసుకొని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 57 వేల నగదు, పల్సర్ బైక్ స్వాధీనపర్చుకున్నారు. నిందితులను తక్కువ సమయంలోనే గుర్తించి అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులను డీఎస్పీ అభినందించారు. సయావేశంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్, సిబ్బంది ఉన్నారు. -
సేంద్రియ సాగుతో నాణ్యమైన పంటలు
కర్లపాలెం: సేంద్రియ వ్యవసాయంతో నాణ్యమైన పంటలు పండించవచ్చునని బాపట్ల జిల్లా వ్యవసాయాధికారి లక్ష్మి తెలిపారు. మంగళవారం కర్లపాలెం గ్రామంలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులతో ఆమె మాట్లాడుతూ పైర్లకు వ్యవసాయాధికారులు సూచించిన మోతాదు మేరకే ఎరువులు వేయాలని చెప్పారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించటం వలన భూసారాన్ని కాపాడుకోవచ్చునన్నారు. తప్పనిసరిగా పంట నమోదు చేయించాలని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ లోపు పంటల బీమా నమోదు చేయించుకోవాలని రైతులకు తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సుమంత్కుమార్, విస్తరణాధికారి భాగ్యలక్ష్మి, శ్రీకాంత్, వినయ్, రైతులు తదితరులు ఉన్నారు. బాపట్ల: ఆస్తి విషయంలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన బాపట్ల మండలం స్టూవర్టుపురం గ్రామంలో చోటు చేసుకుంది. బాపట్ల డీఎస్పీ సీహెచ్ చంద్రమౌళి తెలిపిన వివరాల మేరకు... మండలంలోని స్టూవర్టుపురం గ్రామానికి చెందిన కర్రెద్దుల జేబుదాసు(30)అనే తన మామ దేవర కృష్ణాల మధ్య అస్తి విషయంలో కొన్ని రోజుల నుంచి వివాదం ఉంది. ఈ నెల 9వ తేదీన జేబుదాసు కృష్ణా వద్దకు ఈ విషయం అడిగాడు. కృష్ణా సూచన మేరకు అతని అనుచరుడు కిషోర్ కుమార్ ట్రాక్టర్ సైలెన్స్ర్ గొట్టంతో జేబుదాసును తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ నెల 11వ తేదీన మృతి చెందాడు. జేబుదాసు తల్లి మణిమ్మ ఫిర్యాదు మేరకు వెదుళ్లపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 13వ తేదీన కిషోర్ కుమార్ను చీరాల మండలం బోయినవారిపాలెం పంట కాలువ బ్రిడ్జి వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. కృష్ణా కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ చెప్పారు. మార్టూరులో వెలుగు చూసిన ఘరానా మోసం మార్టూరు: కారు యజమానుల నుంచి వాహనాలను బాడుగ పేరుతో తీసుకోవడం వాటిని ఇతరుల వద్ద తాకట్టు పెట్టి నగదు దండుకొని జల్సాలు చేస్తున్న యువకుడి ఉదంతం మంగళవారం మార్టూరు పోలీసులు ఛేదించారు. ఎస్సై బాబురావు, బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి. మార్టూరుకు చెందిన పొదిలి నరేంద్ర వాహనాల యజమానుల నుంచి ప్రతిరోజూ వాహనాలను బాడుగకు తిప్పి ఏ రోజుకు ఆ రోజు సాయంత్రం రూ.2వేలు బాడుగ ఇచ్చే ప్రాతిపదికన కార్లను అద్దెకు తీసుకుంటుంటాడు. అనంతరం ఆ వాహనాలను ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో నగదు తీసుకొనేవాడు. వాహనాల యజమానులకు ప్రతిరోజూ సాయంత్రం రూ.2వేల చొప్పున అద్దె చెల్లిస్తూ ఉండటంతో విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. నరేంద్ర తాకట్టు పెట్టిన వాహనాలు ఇతరుల వద్ద గుర్తించిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేంద్ర మార్టూరుకు చెందిన కార్లను ద్రోణాదుల, నాగండ్ల, పూనూరు, పల్నాడు జిల్లా నాదెండ్ల గ్రామంలో మొత్తం ఐదు వాహనాలను బాడుగ పేరుతో తీసుకొని తాకట్టు పెట్టి రూ.5లక్షలకు పైనే అప్పు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని అతను తాకట్టు పెట్టిన వ్యక్తుల నుంచి వాహనాలను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై బాబూరావు తెలిపారు. పిడుగురాళ్ల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్వై వార్షిక 2026లో జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్(జేడీఎన్) రాష్ట్ర చైర్మన్ 2026–28 పదవికి పిడుగురాళ్ల పట్టణానికి చెందిన డాక్టర్ దూళ్లిపాళ్ల భరత్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆయన మంగళవారం తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలను ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ డాక్టర్ జీఎస్ మూర్తి అధికారికంగా ప్రకటించినట్లు తెలిపారు. -
భవిత కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
బాపట్ల: ప్రతి చిన్నారికి సమాన విద్య అవకాశాలు కల్పించేలా భవిత కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో ఉన్న సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆటిజం సహాయక కేంద్రాలు, సాహిత విద్య కార్యక్రమాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవిత కేంద్రాల బలోపేతానికి చర్యలు – సమగ్ర విద్యతో ప్రతి చిన్నారికి విద్యాబుద్ధులు నేర్పడమే లక్ష్యమని తెలిపారు. బాపట్లలో ప్రత్యేక సీఎస్ కోన శశిధర్ ప్రతిపాదనల మేరకు ఆటిజం సహాయక కేంద్రం ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 17 మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు. తగిన వసతులు కల్పించినట్లు చెప్పారు. డీఈఓ శ్రీనివాస్ సింగ్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, డీసీహెచ్ ఎస్. డాక్టర్ పద్మావతి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి మాధవి, డీఆర్డీఏ పీడీ సింగయ్య తదితరులు పాల్గొన్నారు. ‘సర్’లో 99.7 శాతం డిజిటలైజేషన్ సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాలో సర్ కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించారు. మంగళవారం తుది గడువుగా ప్రకటించిన అధికారులు ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ పూర్తి కాకపోవడంతో గడువు పెంచారు. మంగళవారం నాటికి 99.7 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. జిల్లాలో 10,50,605 మంది ఓటర్లు ఉన్నారు. వేటపాలెం, చీరాల అర్బన్, చీరాల రూరల్, భట్టిప్రోలు, బాపట్ల అర్బన్, బాపట్ల రూరల్, ఇంకొల్లు, కారంచేడు మండలాల పరిధిలో మరో 5 వేల ఫారాలు డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. -
‘భరోసా’ కరువు
ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు నేతన్నలను నట్టేట ముంచింది. సంక్షేమ పథకాలకు కోతలు పెడుతూ ఆ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పండుగలా సాగిన నేతన్నల బతుకుల్లో కూటమి సర్కారు చీకట్లు నింపిందని చేనేత కార్మికులు వాపోతున్నారు.చీరాల అర్బన్: చంద్రబాబు మాటలతో మభ్యపెడుతూ, చేతల్లో గారడీ చేస్తూ చేనేత రంగాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు, సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నేతన్న నేస్తం’ కింద జిల్లాలో ఏకంగా 8,705 మందికి లబ్ధి చేకూర్చారని, ఏటా రూ.24 వేలు చొప్పున క్రమం తప్పకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేసి ఆదుకున్నారని గుర్తు చేస్తున్నారు. కానీ, చంద్రబాబు ‘నేతన్న భరోసా’ పేరుతో ఏటా రూ.25 వేలు ఇస్తానన్న హామీని గాలికి వదిలేశారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత విద్యుత్ కింద జిల్లాలో 6,318 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చి చేతులు దులుపుకొంది. అర్హులకు కోతలు విధించి లబ్ధిదారుల సంఖ్యను దారుణంగా తగ్గించడంపై నేతన్నలు వాపోతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి నిలువునా మోసపోయామని బావురుమంటున్నారు. 50 ఏళ్లకే పెన్షన్ ఏమైంది? చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల వేళ ఆర్భాటంగా హామీ ఇచ్చారు. ఆ కల్లబొల్లి మాటలు నమ్మిన నేతన్నలు ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. ఇంతవరకు ఒక్కరికి కూడా పెన్షన్ మంజూరు చేయలేదు. అటకెక్కిన రిజర్వేషన్లు ఒకవైపు జీఎస్టీ భారం చేనేత రంగానికి గుదిబండగా మారగా, మరోవైపు నేతన్నలకు అండగా నిలవాల్సిన 11 రకాల చేనేత రిజర్వేషన్ల చట్టాన్ని కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. అధికారుల ఉదాసీనతతో నేతన్నలకు పని భద్రత ప్రశ్నార్థకమైంది. పవర్లూమ్ మాయాజాలం పెరిగిన నూలు, రంగులు, రసాయనాల ధరలతో చేనేత వస్త్రాల తయారీ, విక్రయాలు భారంగా మారాయి. ఈ కష్టకాలంలో పవర్లూమ్ వస్త్రాలు చేనేత వస్త్రాలుగా మార్కెట్లో యథేచ్ఛగా చెలామణి అవుతున్నాయి. వాడేకొద్దీ వాటి అసలు రంగు బయటపడుతున్నా.. అప్పటికే చేనేత రంగానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అక్రమార్కులను నియంత్రించాల్సిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి సంబంధించిన కార్యాలయం తిరుపతిలో ఉంది. అక్కడి నుంచి అధికారులు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియని పరిస్థితి. స్థానిక అధికారులు, చేనేత సంఘాల ప్రతినిధులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతున్నారు. అధికారులుగా మా వంతు బాధ్యతలు మేం నిర్వహిస్తున్నాం. కానీ, ‘నేతన్న భరోసా’ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మాకు ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. బహుశా ఆగస్టులో వచ్చే జాతీయ చేనేత దినోత్సవం నాటికి ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఇక చేనేత ముసుగులో కొన్నిచోట్ల పవర్లూమ్ వస్త్రాలు చెలామణి అవుతున్న మాట వాస్తవమే. మా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ తిరుపతిలో ఉంటుంది. ఎవరైనా ఫిర్యాదులు చేసినప్పుడు మాత్రమే వారు వస్తుంటారు. – వెంకటేశ్వరరావు, హ్యాండ్లూమ్స్ ఏడీ, చీరాల 50 ఏళ్లకే పింఛన్ ఇస్తారని చెప్పడంతో ఎంతో ఆశపడి కూటమికి ఓట్లు వేశాం. ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు. ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా.. ఎవరిని అడిగినా దాటవేస్తున్నారు. ఎదురుచూసి కళ్లు కాయలు కాస్తున్నాయి. – అంజయ్య, చేనేత కార్మికుడు, ఈపూరుపాలెం 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటే నిజమేనని నమ్మి ఓట్లు వేశాం. కానీ, ఇప్పుడు ఎదురుచూపులు తప్ప మాకు ఒరిగిందేమీ లేదు. అధికారులను, నేతలను అడిగితే సమాధానం లేదు. – వెంకటేశ్వరమ్మ, చేనేత కార్మికురాలు, దేవాంగపురి -
కోల్డ్ స్టోరేజీ బాధిత రైతులను మోసం చేసిన ప్రభుత్వం
దుగ్గిరాల: దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజీలో పసుపు దగ్ధమైన రైతుల సమావేశం నిర్వహించారు. మంగళవారం దుగ్గిరాలలోని పసుపు యార్డులో ములకా సాంబిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో పసుపు రైతుల రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర సంత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజీలో దగ్ధమైన పసుపునకు పరిహారం అందించడంలో రైతులను ముప్పతిప్పలు పెడుతోందన్నారు. పెద్దల కమిటీలో బహిరంగంగా రైతులకు క్వింటాకు రూ.7 వేలు ఇస్తామని హామీ ఇచ్చి నేడు పరిహారం కుదించి రూ.5 వేలు ఇస్తామని చెప్పడంతో రైతులు ఉద్యమ బాటలో నడవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ములకా సాంబిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందని ఆశ పడ్డ రైతులకు నిరాశే మిగిలిందన్నారు. రైతులు ఆందోళనకు సిద్ధంగా ఉన్నారని, ఈ నెల 20 లోపు న్యాయం జరగకపోతే వ్యవసాయ మంత్రి క్యాంపు కార్యాలయానికి రాయబారానికి వెళ్లాలని సమావేశంలో తీర్మానించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు లాయర్లు కె.వీరయ్య, వై.శ్రీనివాసరావు, రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె.అజయ్, కమిటీ సభ్యులు బి.శ్రీనివాసరావు, వ్యవసాయం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జెట్టి బాలరాజు, రైతులు రవి కిషోర్, వెంకటప్ప రెడ్డి, నాగేశ్వర రెడ్డి, సత్యనారాయణ, సురేంద్ర, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. -
ముద్రగడ మృతి తీరని లోటు
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాఽభం మృతికి పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మంచితనానికి, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం ముద్రగడ అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి ఆదర్శమైన మంత్రిగా మెలిగారన్నారు. ఇటువంటి నిజాయతీ గల వ్యక్తిని కోల్పోవటం దురదృష్టకరం అన్నారు. ఆయన మృతి రాష్ట్ర భవిష్యత్కు, కాపు ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బాపట్ల: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతికి మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముద్రగడ మృతి తీరని లోటని కోన అభిప్రాయపడ్డారు. ఉద్యమ నాయకుడిగా ఆయన చూపిన ధైర్యం, నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పొన్నూరు: ప్రముఖ కాపు నేత, రాజకీయ నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం మృతికి వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేపల్లె: కాపు ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి కాపు జాతికే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ తీరని లోటని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్కృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన ముద్రగడ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కాపు సమాజానికి న్యాయం జరగాలనే లక్ష్యంతో ముద్రగడ జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు. కాపుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ఆయన చేపట్టిన ఉద్యమాలు ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన దీక్షలు, పోరాటాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. వారి కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని అన్నారు. -
సర్పోతుందా.. గడువు!
బాపట్లబుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026అచ్చంపేట : ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 30.9103 టీఎంసీలు. ఎగువ ప్రాంతాల నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా... దిగువకు అంతే నీరు వదులుతున్నారు.సర్ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినా, పలు వర్గాల ఓట్లు గల్లంతవుతాయనే ఆందోళన నెలకొంది. నెల రోజుల్లో ఓటరు వివరాలను డిజిటలైజేషన్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గడువులోపు సిబ్బంది సాధ్యమైనంత మేర పూర్తి చేశారు. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించడంతో, మిగిలిన ఫారాల డిజిటలైజేషన్ పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. చీరాల: చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో మొత్తం 218 పోలింగ్ బూత్లు ఉన్నాయి. మొత్తం 2,03,641 మంది ఓటర్లు ఫారాలు అందించగా, వీరిలో 2,02,167 ఓట్లను డిజిటలైజేషన్ పూర్తి చేశారు. ఇంకా 1,474 ఓటర్ల ఫారాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. మంగళవారం నాటికి మొత్తం 99.28 శాతం నమోదైంది. ఒక్కో బీఎల్ఓకు రాజకీయ పార్టీల నుంచి ఒక్కో బీఎల్ఏను కేటాయించారు. బీఎల్ఏల పనితీరును బీఎల్ఓలు పరిశీలిస్తారు. బీఎల్ఓ ద్వారా పొందిన రెండు రకాల ఫారాల్లో ఓటరు తన వివరాలను నింపి తిరిగి అందజేయాలి. గత నెల 15న ప్రారంభమైన సర్ ప్రక్రియ ఈనెల 14వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే ఎక్కువ మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తి కాకపోవడంతో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సర్ కార్యక్రమాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశాయి. వారి ఓట్లకు గండి? కొంతమంది ఓటర్లకు సర్ ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రక్రియ నెమ్మదిగా సాగింది. గత రెండు దఫాలుగా ఓటు వేసినా, 2002 నాటి సర్ వివరాలను అందించాలనే నిబంధన ఉండడంతో ఎక్కువ మంది ఓటు హక్కును కోల్పోతున్నారు. అప్పటి వివరాలు లభించకపోవడం, వేరే ప్రాంతం నుంచి ఇక్కడకు వలస రావడం, స్థిర నివాసం లేకపోవడం వంటి కారణాలతో ఎంతో మంది ఓటు హక్కును కోల్పోతామనే ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా మైనార్టీలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువ మంది ఉన్నారు. వీరికి స్థానికంగా ఓటు హక్కు ఉన్నా, 2002లో ఎక్కడ ఓటు వేశారనే విషయంపై స్పష్టమైన అవగాహన లేదు. చీరాల మున్సిపాలిటీలోని శివారు వార్డుల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వలస వచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారు. తూర్పు రెడ్డి, తూర్పు కాపు సామాజికవర్గాలకు చెందిన వారు ఎన్నో ఏళ్లుగా చీరాలకు వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని 27, 28 వార్డుల్లో తూర్పు రెడ్డి సామాజికవర్గానికి చెందిన 1,000 ఓట్లు ఉన్నాయి. అలాగే 23, 24 వార్డుల్లో తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన 800 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి ఇక్కడ, అక్కడ ఓట్లు ఉండడంతో, వారిలో ఎక్కువ మంది తమ సొంత ప్రాంతంలోనే ఓటు కొనసాగించడానికి మొగ్గుచూపుతున్నారు. ఈ వార్డుల్లో ఓట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. మైనార్టీ వర్గాలకు చెందిన ఎక్కువ మందికి గత సర్ కార్యక్రమంలో ఓటు లేకపోవడంతో, వారి ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉందని సమాచారం. స్పెషల్ డ్రైవ్లు.. హెల్ప్ డెస్క్లు.. సర్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం కదిలింది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. బీఎల్ఓలతో మాట్లాడి సర్ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. అధికారులకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు అందిస్తూ సర్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించారు. మున్సిపాలిటీల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లు, స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేశారు. ఓటర్లు పూర్తి చేసిన ఫారాలు అందించేందుకు వీలుగా చీరాల మున్సిపాలిటీలో నాలుగు ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న సర్ ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు పార్టీ నాయకులతో మాట్లాడారు. పార్టీకి సంబంధించి బీఎల్ఏలు నిరంతరం బూత్లలో బీఎల్ఓలకు అందుబాటులో ఉంటూ అర్హులందరికీ ఓటు హక్కు అందేలా చూడాలన్నారు. బీఎల్ఏలు నిబద్ధతతో పనిచేయాలన్నారు. పోలింగ్ బూత్ల పరిధిలో డబుల్ ఎంట్రీ ఓట్లు తొలగించి, అర్హులైన వారి ఓట్లు పోకుండా చూడాలన్నారు. అలాగే గత మూడు రోజులుగా ఆయన నియోజకవర్గంలోని పలు సచివాలయాల్లో పర్యటిస్తూ సర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సిబ్బంది కూడా నిష్పక్షపాతంగా వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
మై భారత్ పోర్టల్లో నమోదు వేగవంతం చేయాలి
జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవగుంటూరు వెస్ట్: మై భారత్ పోర్టల్లో విద్యార్థులు, యువత నమోదును వేగంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. నేటితో ముగియనున్న ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్ – అవగాహన డ్రైవ్ పురోగతిపై మంగళవారం స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించాలని, ప్రతి కళాశాలలో మై భారత్ నోడల్ అధికారులను నియమించి, మై భారత్ చాప్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం జేసీతోపాటు అధికారులు మై భారత్ పోర్టల్ పోస్టర్ను ఆవిష్కరించారు. మేరా యువ భారత్ గుంటూరు జిల్లా ఉప సంచాలకులు దేవిరెడ్డి కిరణ్మయి, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి సంజీవరావు, జిల్లా ఎన్ఎన్ఎస్ ప్రోగ్రాం అధికారి సునీల్, స్టెప్ మేనేజర్ రాధిక తదితర అధికారులు పాల్గొన్నారు. -
అధికారం మాదే.. పెత్తనమూ మాదే!
చీరాల టౌన్: అధికారం చేతిలో ఉంది.. అధికారులు మా కిందే ఉన్నారు... మా మాటకు అడ్డు లేదంటూ టీడీపీ గ్రామ, మండల స్థాయి నాయకులు సచివాలయంలో తిష్ట వేసి చక్రం తిప్పుతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమంలో ఏకంగా అధికారి కుర్చీలోనే టీడీపీ నేతలు కూర్చొని సర్ డిజిటలైజేషన్ చేయిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ అధికారికి కేటాయించిన కుర్చీలో కూర్చొని వారి అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారు. ఈ సంఘటన మంగళవారం చీరాల మండలంలోని తోటవారిపాలెం గ్రామ సచివాలయంలో చోటు చేసుకుంది. సర్ కార్యక్రమంలో బీఎల్వోలకు అనుసంధాన పార్టీ తరఫున ఏర్పాటు చేసి బీఎల్ఏలు, టీడీపీ నాయకులు బీఎల్ఓలతో కలిసి గ్రామ సచివాలయంలో ఓట్ల చేర్పు, తొలగింపు ప్రక్రియ చేస్తున్నట్లు సమాచారం. సర్ ప్రక్రియలో అనుకూలమైన ఓట్లు ఉంచుతున్నారు. ఇతర పార్టీల ఓట్లు తొలగిస్తున్నారని సమాచారం. -
సాగునీరు లేదు..
ఖరీఫ్ సాగుకు ముందుగానే పొలాలు దున్నుకుని విత్తనాలు కొనుగోలు చేశాం. పొలాలు సిద్ధం చేసుకున్నాం. ఇప్పటివరకు కాలువలకు నీరు రాలేదు, వర్షం పడలేదు. ఏటా ఖరీఫ్ సీజన్లో ఈ పాటికి నాట్లు వేసేవాళ్లం. ఇప్పటివరకు నారుదొడ్లు సైతం పొయ్యలేదు. ఎప్పటికి సాగు ప్రారంభిస్తామో తెలియని పరిస్థితి. ఆలస్యమైతే సీజన్ పూర్తిగా దెబ్బతింటుంది. – దుండి రామిరెడ్డి, రైతు, పొన్నపల్లి, చెరుకుపల్లి మండలం ● -
భార్యాభర్తల ఘర్షణ.. భార్య మృతి
చెరుకుపల్లి: భార్యాభర్తలు గొడవలో భార్య మృతి చెందింది. ఈ ఘటన కనగాలలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ కందుల తిరుపతిరావు అందించిన వివరాలు... రాంబొట్లపాలెం గ్రామానికి చెందిన పిట్టు శ్రీనివాసరెడ్డికి కర్లపాలేనికి చెందిన సుజాత(38)తో 15 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరు ప్రస్తుతం మండలంలోని కనగాలలో వారి బంధువుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరెడ్డి తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. పనుల నిమిత్తం రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి వచ్చాడు. కుమారుడు యేగేంద్రరెడ్డి బాపట్ల మేనత్త దగ్గర ఉండి పదో తరగతి చదువుతున్నాడు. కుమారుడిని పంపించి రావాలని సుజాత భర్తను కోరింది. తరువాత తీసుకెళ్తాలే అని శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పటంతో వివాదం పెరిగింది. వాదులాట సమయంలో సుజాతకు బలమైన దెబ్బ తగలటంతో చుట్టు పక్కల వారు దగ్గరలోని ఓ హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే సుజాత మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి ఘటనా స్థలాన్ని సీఐ సురేష్ బాబు, ఎస్ఐ కందుల తిరుపతిరావు పరిశీలించారు. మృతురాలి తండ్రి అక్కల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
రేపల్లె డిపోలో అద్దె బస్సుల బంద్
రేపల్లె: హైర్ బస్సు డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి, మదర్థెరిసా హైర్ బస్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు మణిలాల్ కోరారు. జీతాల పెంపుతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ తదితర కార్మిక హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపల్లె ఆర్టీసీ డిపో పరిధిలోని హైర్(అద్దె) బస్సు డ్రైవర్లు సోమవారం తెల్లవారుజామున ఆందోళన చేశారు. ఉదయం 5 గంటల నుంచి అద్దె బస్సులను డిపోలోనే నిలిపివేసి విధులకు హాజరుకాక నిరసన చేపట్టారు. మణిలాల్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని చీరాల, బాపట్ల, రేపల్లె డిపోల పరిధిలో పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లకు రెండేళ్లుగా వేతనాలు పెరగలేదని చెప్పారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో డ్రైవర్లకు తక్షణమే వేతనాల పెంపు అవసరమని తెలిపారు. అద్దె బస్సు యజమానులకు ముందుగానే సమస్యలను తెలియజేసి, పరిష్కారం లభించకపోతే ఆందోళన చేపడతామని సమాచారం ఇచ్చినప్పటికీ స్పందన రాకపోవడంతో బస్సులు నిలిపివేసి నిరసనకు దిగినట్లు చెప్పారు. స్పందించిన యాజమాన్యం వేతనాల పెంపుపై సానుకూల హామీ ఇవ్వటంతో ఆందోళనను విరమించి విధులకు హాజరయ్యారు. కార్యక్రమంలో మదర్ థెరిసా హైర్ బస్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రేపల్లె డిపో అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, కన్వీనర్ కె.గోపి, కోశాధికారి జి.రవిబాబు, డ్రైవర్లు సుబ్రహ్మణ్యం, రాజు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఏపీఎంఐపీ పీడీగా నీలిమ
బాపట్ల: ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ)పీడీగా వి.నీలిమ సోమవారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ని మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్క అందజేశారు. ప్యాసింజర్ రైల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చీరాల రూరల్: ఒంగోలు నుంచి విజయవాడ వెళ్తున్న మెము ప్యాసింజర్ రైల్లో గుర్తుతెలియని వ్యక్తి సోమవారం సాయంత్రం 4.25 గంటల సమయంలో మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై సిహెచ్.కొండయ్య తెలిపారు. రైల్లో అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గమనించిన తోటి ప్రయాణికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. చీరాల రైల్వేస్టేషన్ ప్లాట్ఫాం4 పై దించి 108 సిబ్బందిని పిలిపించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు సుమారు 50 ఏళ్లు, చామనఛాయ, 5.5 అడుగుల ఎత్తు ఉంటాడు. తెలుపు, బ్రౌన్ రంగు ఫుల్హ్యాండ్ షర్టు, బ్లూ జీన్స్ ప్యాంటు, నలుపు ఫ్రేమ్ కళ్లద్దాలు ధరించాడు. బొడ్డుకు కుడివైపు, ఎడమ డొక్కపై పుట్టుమచ్చలున్నాయి. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9247575633 నంబర్లో జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని ఎస్సై కోరారు. ఏఎన్యూ ఎమ్మెస్సీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ ఎమ్మెస్సీ నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వెల్లడించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 ఏప్రిల్లో నిర్వహించిన ఎమ్మెస్సీ ఆక్వాకల్చర్ పరీక్షలకు 41 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 40 మంది ఉత్తీర్ణులయ్యారు. అలానే ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ పరీక్షలకు 22 మందికిగానూ 20 మంది, ఎంఎస్సీ బోటరీ పరీక్షలకు 66 మందికి 38 మంది, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ పరీక్షకు 37 మంది 31 మంది ,ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ 26 మందికి 26 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎమ్మెస్సీ ఎన్విరాల్మెంట్ సైన్స్ పరీక్షకు 16 మందికి 16 మంది, ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్, నూట్రీషన్ 70 మందికి గాను 70 మంది, ఎమ్మెస్సీ జియాలజీ పరీక్షలకు ఐదుగురు, ఎమ్మెస్సీ సైకాలజీ పరీక్షకు 23 మంది హాజరు కాగా 23 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ డీసెట్–2026) లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేటు డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 18వ తేదీ లోపు వెబ్ ఆధారిత ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించినట్లు ఏపీ డీసెట్ కన్వీనర్, పాఠశాల విద్య గుంటూరు జోన్ ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నమోదు చేసిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఈనెల 20 నుంచి 23 వరకు సీట్ల కేటాయింపు జరుపుతామని పేర్కొన్నారు. సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు తమ తాత్కాలిక ప్రవేశ పత్రాలను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. సంబంధిత అభ్యర్థులు ఈనెల 24 నుంచి 29 వరకు సంబంధిత ప్రభుత్వ డైట్ కళాశాలల్లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ప్రవేశ పత్రం పొందాలని సూచించారు. డీఎల్ఈడీ ప్రధమ సంవత్సర తరగతులు ఈనెల 30 నుంచి ప్రారంభమవుతాయని, అర్హత సాధించిన అభ్యర్థులందరూ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుని, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై కేటాయించిన కళాశాలలో నిర్ణీత గడువులోపు ప్రవేశం పొందాలని తెలిపారు. గుంటూరు సీసీఎస్ డీఎస్పీగా శివాజీరాజా నగరంపాలెం: గుంటూరు సీసీఎస్ డీఎస్పీ శివాజీరాజా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన ఆదివారం జిల్లా కోర్టు రోడ్డులోని గుంటూరు సీసీఎస్ కార్యాలయంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన డీఎస్పీ మధుసూదనరావు కర్నూలు జిల్లా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బదిలీపై వెళ్లిన విషయం విదితమే. విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి లక్ష్మీపురం: ఈనెల 15న విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం సీపీడీసీఎల్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి పవన్, జి నాగరాజులు పిలుపు నిచ్చారు. ఈమేరకు గుజ్జనగుండ్లలోని సోమవారం విద్యుత్ స్టోర్స్ కార్యాలయంలో ధర్నా పోస్టర్ ను ఆవిష్కరించారు. -
కొనసాగుతున్న ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తల దీక్షలు
మంగళగిరి రూరల్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రావాల్సిన 750 కోట్ల సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక ధర్నా సోమ వారం 13వ రోజుకు చేరుకుంది. మండలంలోని చినకాకాని గ్రామ పరిధిలోని ఎన్నారై జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద కొనసాగుతున్న ధర్నాలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్యూనర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ భానోత్ రమేష్ మాట్లాడుతూ ఈ నెల 19 వరకు జిల్లాల వారీగా ధర్నాలు కొనసాగనున్నాయని, అప్పటికీ ప్రభు త్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే జూలై 20న రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కుటుంబాలు మహా ధర్నాలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది. సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలు, టీడీపీ కేంద్ర కార్యాలయం, వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం, మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్ ముట్టడి చేపట్టి మహా ధర్నా చేపడతామని ఆర్గనైజింగ్ సెక్రటరీ భానోతు రమేష్ హెచ్చరించారు. కారం సత్య మాట్లాడుతూ సబ్సిడీలు అందక ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలు రోడ్లు పడ్డారని వాపోయారు. పర్సంటేజ్ రూపంలో కాకుండా 100 శాతం సబ్సిడీల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బేతపూడి విజయ్, బంటు వీర్రాజు, జక్కుల రాజు, జక్కుల నారాయణ, బత్తుల విష్ణుమూర్తి, జూపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్పీటీఈఎల్ సర్టిఫికేషన్ కోర్సుల్లో విజ్ఞాన్ నిరులకు ఏ గ్రేడ్
గుంటూరు రూరల్: విజ్ఞాన్ నిరుల మహిళా ఇంజినీరింగ్ కళాశాల మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాధిక తెలిపారు. సోమవారం పెదపలకలూరు రోడ్డులోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ స్వయం ఎన్పీటీఈఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనవరి–ఏప్రిల్ 2026 ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సుల్లో విశేష ప్రతిభ కనబరిచినందుకు కళాశాలకు ఏ రేటింగ్ లభించిందన్నారు. ప్రతిష్టాత్మక అవార్డును 2026 జూలై 11న చైన్నెలోని ఐఐటీ మద్రాస్లో నిర్వహించిన అవార్డుల పంపిణీ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్ ఎస్.లక్ష్మీశిరీష అందుకున్నారన్నారు. జనవరి–ఏప్రిల్ 2026 సెమిస్టర్లో కళాశాల నుంచి మొత్తం 923 మంది ఎన్పీటీఈఎల్ కోర్సులకు నమోదు చేసుకోగా, వారిలో 238 మంది విద్యార్థులు, 11 మంది అధ్యాపకులు కలిపి మొత్తం 249 మంది సర్టిఫికెట్లు సాధించారన్నారు. 19 మంది విద్యార్థులు టాపర్స్గా నిలిచి కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. జాతీయ స్థాయిలో కళాశాలకు లభించిన ఈ గుర్తింపు విద్యార్థులు, అధ్యాపకుల నిరంతర కృషి, అంకితభావానికి నిదర్శనమన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ఎస్. లక్ష్మిశిరీషను, అధ్యాపకులను, విద్యార్థులను, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు అభినందించారు. ఆర్వీఆర్ జేసీకి జాతీయ స్థాయిలో 14వ సారి ఏఏ రేటింగ్.. 98 స్టార్ అవార్డులు లభ్యంగుంటూరు రూరల్: ఎన్పీటీఈఎల్ పరీక్షా ఫలితాల్లో తమ కళాశాల మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి వరుసగా 14వ సారి ప్రతిష్టాత్మక ఏఏ రేటింగ్ను సాధించటంతో పాటూ 98 స్టార్ అవార్డులు అందుకోవడం, దేశ వ్యాప్తంగా వున్న ఎన్పీటీఈఎల్ అన్ని లోకల్ చాఫ్టర్స్లో తమ కళాశాల అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జె మురళీమోహన్, డాక్టర్ జగదీష్లు తెలిపారు. సోమవారం చౌడవరం గ్రామంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థుల ఈ అద్భుత విజయాలు కళాశాలలో అందిస్తున్న నాణ్యమైన సాంకేతిక విద్య, ఆధునిక బోధనా విధానాలకు నిదర్శనమన్నారు. ప్రతిష్ఠాత్మక గుర్తింపులో భాగంగా,కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి 259 గోల్డ్, 672 సిల్వర్, 1,034 ఎలైట్ గ్రేడ్లను సాధించారన్నారు. వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 84 మంది విద్యార్థులు టాపర్ సర్టిఫికెట్లు పొందారన్నారు. ఇటీవల చైన్నెలోని ఐఐటీ మద్రాస్లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో కళాశాల లోకల్ చాప్టర్ సమన్వయకర్త డాక్టర్ ఎంవీపీ చంద్రశేఖరరావు కళాశాల తరఫున ఈ ప్రతిష్టాత్మక అవార్డులను స్వీకరించారన్నారు. ఎన్పీటీఈఎల్ కోర్సులు ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే అత్యుత్తమ వేదికగా నిలుస్తున్నాయని, స్టార్ గుర్తింపు పొందిన విద్యార్థులకు ఐఐటీలలో నెలకు రూ.15,000 స్టైపెండ్తో కూడిన ఇంటర్న్షిప్ అవకాశాలు, అత్యాధునిక సాంకేతిక అంశాలపై హ్యాండ్స్ఆన్ వర్క్షాప్లు, అలాగే ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ప్లేస్మెంట్ అవకాశాలను మెరుగుపరచుకునే ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించవా?
తాడేపల్లి రూరల్ : రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులతో సంప్రదింపులు జరపకుండా వారి నుంచి బలవంతపు భూసేకరణ చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు అన్నారు. ఉండవల్లిలో బలవంతపు భూసేకరణ ప్రాంతాన్ని ఆయన స్థానిక సీపీఎం నాయకులతో కలసి సోమవారం పరిశీలించారు. అనంతరం సీపీఎం కార్యాలయంలో బాబూరావు మాట్లాడుతూ.. ఇక్కడి రైతుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించవా అని ప్రశ్నించారు. చట్టాలను లెక్కచేయకుండా, కోర్టులో వివాదం నడుస్తుండగా, కోర్టు తీర్పులు పట్టించుకోకుండా దౌర్జన్యంగా రైతుల పంట భూములు తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మహిళలను విచక్షణారహితంగా జుట్టు పట్టుకుని లాగివేయడం సరికాదన్నారు. రూ.ఆరేడు కోట్ల విలువ చేసే విలువైన భూములను రిజిస్ట్రేషన్ వాల్యూ తెలీకుండా ఆర్డరు ప్రకటించడం దుర్మార్గమన్నారు. భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నామంటూ 9.3 అంగీకారం తెలిపినా, రైతుల భూముల్లో దౌర్జన్యంగా మట్టి వేశారన్నారు. మాట తప్పింది ప్రభుత్వమేనని, రైతులు కాదని తెలిపారు. రైతులకు అన్యాయం జరుగుతున్నా, స్థానిక శాసనసభ్యులు, మంత్రి లోకేశ్ నోరు మెదపడంలేదని విమర్శించారు. పవన్ ఎందుకు మాట్లాడరు?.. ఇక ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రైతుల భూములు బలవంతంగా తీసుకుంటే జనసేన చూస్తూ ఊరుకోదని చెప్పిన పవన్కళ్యాణ్, నేడు పేదల భూముల లాక్కుంటుంటే ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రెండవ దశలోని 43 గ్రామాల్లో 1,43,000 ఎకరాలు భూసేకరణ చేస్తామనడం దుర్మార్గమన్నారు. రాజధాని అంటే పారిశ్రామికవేత్తలకి, కాంట్రాక్టర్లకి, నాయకులకేనా, రైతుల గోడు పట్టదా అని బాబురావు మండిపడ్డారు. -
కళకళలాడిన శివాలయం
పెదకాకాని: శివాలయంలో ఆరుద్ర నక్షత్రం. కృష్ణ చతుర్దశి మహా పర్వదినం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం జరిగిన పూజా కార్యక్రమాలకు జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి కనిపించింది. మాస శివరాత్రి రోజున భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు త్వరితగతిన దర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. ఆలయంలో అంతరాలయ అభిషేకాలు, ఏక వారాభిషేక పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు, రాహుకేతు పూజలు అధికసంఖ్యలో జరిగాయి. వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ఒక్క రోజులో స్వామి వారికి రూ.4 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని, పూజలు చేశారు. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ వరప్రసాద్ కూడా స్వామి వారిని దర్శించుకుని, అభిషేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు, వేద పండితులు ఆయన్ను స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించారు. వేద ఆశీర్వచనం చేశారు. -
సర్కారు వారి కుట్టు కథ
సత్తెనపల్లి: మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు కుట్టు శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లు ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటం చేసింది. ఆ మాటలు నమ్మి వేలాది మంది మహిళలు ఎంతో ఆశతో శిక్షణ పొందారు. తీరా చూస్తే ప్రభుత్వం శిక్షణతో సరిపెట్టేసి కుట్టుమిషన్లు ఇవ్వకుండా చేతులు దులిపేసుకుంది. ఇదంతా చంద్రబాబు మార్కు కట్టు కథలా ఉందంటూ ప్రభుత్వ తీరుపై మహిళలు మండిపడుతున్నారు. రెండు విడతలుగా... బీసీ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ శాఖల ఆధ్వర్యాన బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ), కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, కాపు సామాజిక వర్గాల్లో అర్హులైన మహిళలకు 2024–25 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గత ఏడాది ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చారు. దీనికోసం సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (సీయూఆర్డీ), సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ (ఎస్ఏపీఈ) ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి కేంద్రంలో ఒక ట్రైనర్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ను నియమించారు. శిక్షణ కేంద్రం అద్దె, కుట్టుమిషన్, ఇతర పరికరాల కోసం ఒక్కో మహిళకు సుమారు రూ. 22 వేలు చొప్పున కేటాయించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ మొదటి విడతగా 7,345 మంది మహిళలు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. వీరిలో 30 శాతం మంది శిక్షణ పొందారు. నాలుగు నెలలకు తగ్గకుండా శిక్షణ పొందితేనే కుట్టు మిషీన్ ఇస్తామని ప్రకటించారు. మిషన్లు ఇవ్వకుండా కాలయాపన... నాలుగు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే 75 శాతం హాజరు నమోదైన మహిళలకు సర్టిఫికెట్తో పాటు ఉచితంగా కుట్టుమిషన్లు అందిస్తామని అప్పట్లో ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ అలా జరగలేదు. పైగా 75 శా తం హాజరున్న మొదటి బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని చెప్పుకొచ్చారు. శిక్షణ పొందితే మిషన్లు ఇస్తారని ఆశతో ఎదురు చూస్తుంటే కాలయాపన చేస్తున్నారని మహిళలు మండిపడుతున్నారు. కేవలం మిష న్లు ఇవ్వకుండా కాలయాపన చేయడానికి ఇలా సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. శిక్షణ పూర్తయి ఏడాది గడుస్తున్నా కుట్టు మిషన్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని, కనీసం ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వాలని నిలదీస్తున్నారు. దీంతో రెండో విడత శిక్షణ కూడా ఇవ్వలేదు. అలాగే శిక్షణ ఇచ్చిన 32మంది సిబ్బందికి సైతం ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషీన్లు అందజేయడంతో పాటు శిక్షణ ఇచ్చిన సిబ్బందికి వేతనాలు విడుదల చేయా లని మహిళలు కోరుతున్నారు. -
చీఫ్ మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ దాసరి రమేష్
గుంటూరు మెడికల్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందించే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) గుంటూరు చీఫ్ మెడికల్ ఆఫీసర్గా (సీఎంఓ) డాక్టర్ దాసరి రమేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు నగరంపాలెంలోని సీజీహెచ్ఎస్ వెల్నెస్ కేంద్రంలో బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రమేష్ను సెంట్రల్ ఎకై ్సజ్, కస్టమ్స్, సెంట్రల్ టాక్స్ పెన్షనర్స్ అసోసియేషన్ నేతలు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు అంశాలను పెన్షనర్లు సీఎంఓ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని డాక్టర్రమేష్ తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యాలతో మాట్లాడి రోగి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కొండ నాగార్జున మాట్లాడుతూ డాక్టర్ల కొరత ఉన్నప్పటికీ పెన్షనర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజూ తాము వందకు పైగా ఓపీ సేవలు అందిస్తున్నామన్నారు. దూర ప్రాంత రోగులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు టి.వివేకానంద మాట్లాడుతూ విధి నిర్వహణలో డాక్టర్లు నిబద్ధతత, నిశ్వార్ద సేవలు అందించాలని కోరారు. రోగుల పట్ల మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. లోకల్ అడ్వైజరీ కమిటి మెంబర్ గుమ్మడి సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ సీజీహెచ్ఎస్లో ఆరోగ్య సేవలు పొందడం పెన్షనర్ల హక్కు అని చెప్పారు. శస్త్రచికిత్సలకు అధిక రుసుము వసూలు చేసే ఎంప్యానల్డ్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్షనర్లు పి.వి.సత్యనారాయణ, పి.కోటేశ్వరరావు, ఎన్.ఎస్.నగేష్బాబు, కె.సాంబ్రాంజ్యం, నర్సింగ్ ఆఫీసర్ హేమసుందరి, ఫార్మాశిస్టుల ఆయేషా బేగం, సునిల్, వైద్య సిబ్బంది పేరేశ్వరరావు, మురళి, రామారావు పాల్గొన్నారు. -
దళిత ఉద్యమనేత కోటి జేమ్స్ కన్నుమూత
నివాళులర్పించిన దళిత, ప్రజా సంఘాల నేతలు చీరాల రూరల్: దళిత ఉద్యమనేత, చీరాల జాన్పేటకు చెందిన కోటి జేమ్స్ అనారోగ్యంతో సోమవారం తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు దళిత, ప్రజా సంఘాల నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటి జేమ్స్ మరణం దళిత ఉద్యమానికి తీరని లోటని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎల్టీడీ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన.. కార్మిక నాయకుడిగా హక్కుల సాధన కోసం విశేష కృషి చేశారు. కారంచేడు మారణకాండ బాధితులకు బాసటగా నిలిచి, వారికి న్యాయం జరిగే వరకు ఆర్థికంగా, నైతికంగా అండగా ఉంటూ ఎన్నో పోరాటాలు సాగించారని నాయకులు గుర్తుచేసుకున్నారు. దళిత ఉద్యమ శిఖరం డాక్టర్ కత్తి పద్మారావుకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ.. దళిత మహాసభ ఉపాధ్యక్షుడిగా ఆయన విశేష సేవలు అందించారని కొనియాడారు. అత్యంత సాధారణ జీవితం గడిపిన జేమ్స్.. చివరి దశలో క్రీస్తు పరిచర్యలో గడిపారని వివరించారు. జేమ్స్ భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల వాసు, దళిత, ప్రజా సంఘాల నాయకులు నీలం నాగేంద్రరావు, మాచవరపు జూలియన్, కొరివి వినయకుమార్, దారా అంజయ్య, పులిపాటి బాబురావు, గోసాల ఆశీర్వాదం, దుడ్డు భాస్కరరావు, భగత్సింగ్, తేళ్ల వెంకటస్వామి, బి.లక్ష్మీనరసయ్య, గొర్రెపాటి రవికుమార్ తదితరులు ఉన్నారు. -
మంగళవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2026
పిడుగురాళ్ల ప్రభుత్వ కళాశాల, వైద్యశాల ముఖ ద్వారం నెరవేరిన జగనన్న సంకల్పం పిడుగురాళ్ల: పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను నిర్మించడానికి గతంలో శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే పిడుగురాళ్ల కళాశాల నిర్మాణం పల్నాడు జిల్లాకే మణిహారంగా మారింది. బడుగు, బలహీన వర్గాలు, పేదలకు వైద్యంతోపాటు పేద విద్యార్థులకు వైద్యవిద్య అందించేందుకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దీనిని నిర్మించారు. ఈ ప్రాంతం ప్రజల కల వైఎస్ జగన్ సహకారంతో సాకారం అయిందని జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి వంద ఎంబీబీఎస్ సీట్లు 2026–27 విద్యా సంవత్సరానికి కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా బోధనాసుపత్రి, తరగతి గదులు, ప్రయోగశాలలు, హాస్టళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు సిద్ధమైనట్లు వైద్య బృందం తెలిపింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ... పల్నాడు జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఈ వైద్య కళాశాల ఎంతో ఉపయోగపడనుంది. వైద్యులు, బోధన సిబ్బంది, ఇతర ఉద్యోగాల కల్పనకు అవకాశం దక్కింది. పరోక్షంగా ఎంతో మంది స్థానికులు ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ సీట్ల సంఖ్య పెరగటంతోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి రావటం మాజీ ముఖ్యమంత్రి జగన్ చలవేనని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ముందుచూపు ఫలితమే నేడు పిడుగురాళ్ల వైద్యశాల, వైద్య కళాశాల రూపకల్పనకు కారణమైంది. గతంలోనే 90 శాతం పూర్తి జిల్లా ప్రజలకు ఆరోగ్య భద్రత కోసం చేపట్టిన కళాశాల నిర్మాణం 90 శాతం ఆయన హయాంలోనే పూర్తి చేశారు. ఈ ఏడాది నుంచి మెడికల్ కళాశాల కూడా ప్రారంభం కానుండటంతో వంద సీట్లు కేటాయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలు పెట్టమని ఎన్ఎంసీ ఆదేశాలు ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైద్య కళాశాల, వైద్యశాల నిర్మాణం శరవేగంగా చేసేందుకు అప్పటి గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి చూపిన చొరవను ప్రజలు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. గురజాల నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే కాసు ప్రత్యేక ముద్ర వేశారు. మెడికల్ కాలేజీ, వైద్యశాల పరిసరాలు వ్యాపారపరంగా అభివృద్ధి చెందడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేద, మధ్యతరగతి వారికి ఉచిత వైద్యం, విద్య అందించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. దానికి అనుగుణంగా వైద్య కళాశాలల నిర్మాణానికి నడుం బిగించారు. అందులో భాగంగా పిడుగురాళ్లలో వైద్య కళాశాల పనులు చేపట్టి దాదాపు 90 శాతం పూర్తి చేయించారు. నేడు ఆ కళాశాల ప్రారంభమవడమే కాకుండా తాజాగా ఎంబీబీఎస్ సీట్లు కూడా పొందింది. పేదలకు మెరుగైన వైద్యం అందించేలా వైద్యశాల కూడా అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
అర్జీల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్ల: అర్జీల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారవేదిక(పీజీఆర్ఎస్)కు వచ్చిన అర్జీలను ఆయన స్వయంగా పరిశీలించారు. అర్జీదారులతో మాట్లాడి సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా భార్యాభర్తల వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మోసాలు, భూ వివాదాలకు సంబంధించిన అర్జీలు అందాయి. వాటిని ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరిధిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. బాధితుల అర్జీలను పరిష్కరించే సమయంలో వారి సమస్యను మన సమస్యగా భావించి చట్టపరిధిలో విచారణ చేపట్టి, వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. అర్జీల పరిష్కారానికి సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పీజీఆర్ఎస్ విభాగంకు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
నగరంపాలెం: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, సమర్థవంతమైన పోలీసింగ్, పరిపాలనలో ఇద్దరు పోలీస్ అధికారులు అందించిన సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఏఆర్ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది కర్నూలు జిల్లాకు బదిలీపై వెళ్తున్న హనుమంతు, ప్రస్తుతం రేపల్లె డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న షేక్.అజీజ్ను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సత్కరించి, జ్ఙాపికలు అందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వకుల్ జిందాల్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించారని అన్నారు. తద్వారా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు. సామాజిక సేవలో హనుమంతు ముందుంజలో ఉన్నారని అన్నారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అలహరి శ్రీనివాస్ (ఎస్బీ), శ్రీనివాస్రెడ్డి (మహిళా పీఎస్), శివాజీ (సీసీఎస్), ఆర్ఐ శ్రీహరిరెడ్డి, సురేష్బాబు, కృష్ణయ్య, ఆర్ఎస్ఐలు, సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
హోంగార్డు కుటుంబానికి రూ.40.25లక్షల చెక్కు అందజేత
బాపట్ల: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడంలోనూ, వారి సంక్షేమాన్ని కాపాడటంలోనూ బాపట్ల జిల్లా పోలీస్ శాఖ మరోసారి మానవీయతను చాటుకుంది. వేమూరు పోలీస్ స్టేషన్న్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తూ మృతి చెందిన కె. అశోక్వర్ధన్ కుటుంబానికి పోలీస్ శాలరీ ప్యాకేజీ, ఇన్స్యూరెన్స్ విభాగాల ద్వారా మంజూరైన రూ. 40 లక్షల 25 వేల ఆర్థిక సహాయాన్ని సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్వయంగా అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని, వారి కుటుంబాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు జిల్లా పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కృష్ణంరాజు, ఏఓ అద్దంకి వెంకటేశ్వర్లు, రిజర్వ్ ఇన్న్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాంత్, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రమేష్, న్యూ ఇండియా ఇన్స్యూరెన్స్ మేనేజర్ సుబ్బారావు, జమీర్ తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్కు తుది ఘడియ
నేటితో ముగియనున్న ప్రక్రియ సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇప్పటికే జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాలు నూరు శాతం పంపిణీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. డిజిటలైజేషన్ కోసం అప్లోడింగ్ ఎంత శాతం జరుగుతుందో చూడాల్సి ఉంది. చాలాచోట్ల బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే ఎన్యూమరేషన్ ఫారాలు తెప్పించుకొని పనికానిచ్చారు. పర్చూరు, రేపల్లె లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ కార్యాలయాల్లోనే ఈఎఫ్ల ప్రక్రియ జరిగిందని, మిగిలిన నియోజకవర్గాల్లో చాలావరకు అధికారులు కార్యాలయాల్లోనే కూర్చొని తంతు నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. చాలామంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందని పరిస్థితి కనిపించింది. ఒకవర్గం ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఈ ప్రక్రియ సాగినట్లు ఆరోపణలున్నాయి. బృందాలు ఏర్పాటు చాలామంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించకుండానే తాము నూరుశాతం ఫారాలు అందజేసినట్లు కాకిలెక్కలు చూపించారు. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడడంతో జిల్లా కలెక్టర్ అప్రమత్తం అయ్యారు. క్షేత్రస్థాయి అధికారులకు చీవాట్లు పెట్టారు. జిల్లాలోని ఉన్నతాధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటింపజేసి పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు అప్రమత్తమై బీఎల్ఓలపై ఒత్తిడి తీసుకొచ్చారు. వారు స్పందించని చోట ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో కొంతమేర అక్రమాలకు అడ్డుకట్ట పడింది. తర్వాత అందరికీ ఫారాలు అందించారు. ప్రతి ఓటరుకూ రెండు ఫారాలు ఇచ్చి వివరాలు నింపిన తర్వాత ఒకటి బీఎల్ఓకి ఇవ్వాలి. మరో ఫారాన్ని ఓటర్కు అక్నాలడ్జ్మెంట్ కింద జాగ్రత్తగా దాచి పెట్టాలి. కానీ చాలాచోట్ల బీఎల్ఓలు ఒక్క ఎన్యూమరేషన్ పారాన్ని మాత్రమే ఓటర్కు ఇస్తున్నారు. రెండవ ఫారం అడిగితే ఫొటో తీసుకోమంటున్నారు. అడగకపోతే దాని గురించి పట్టించుకోవడం లేదు. ఓటు గల్లంతైతే ఫారం నింపి ఇచ్చినట్లు తమ వద్ద ఆధారం లేదని పలువురు ఓటర్లు వాపోతున్నారు. మృతులు, డబుల్ఎంట్రీ, షిప్టింగ్ ఓట్లను తుది రోజు నాటికి తొలగించనున్నారు. ఈ సాకుతో అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి అర్హుల ఓట్లను కూడా తొలగిస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్యూమరేషన్ ఫారాలు తమకు అందలేదని పలువురు ఓటర్లు ఫిర్యాదులు చేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరింది. వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు పావులు కదిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొందరు బీఎల్ఓలు, ఇతర సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి ఎంపిక చేసుకున్న ఓట్లను తొలగించేందుకు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియకుండా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది వ్యవహారం నడిపించే ప్రయత్నం చేశారు. పర్చూరు, చీరాల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఈ తరహా అక్రమాలకు యత్నించినట్లు సమాచారం. -
పీజీఆర్ఎస్కు 142 అర్జీలు
బాపట్ల: పీజీఆర్ఎస్లో అర్జీదారులు అందజేసే ప్రతి అర్జీకి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలకు సంబంధించి 142 మంది అర్జీలు వచ్చాయి. వెంటనే పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, డీఆర్ఓ జి. గంగాధర్ గౌడ్, ఎస్డీసీ లవన్న తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ అమలు కాలేదు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకాలో కూడా ఎస్సీ భూమి కొనుగోలు రుణమాఫీ పథకం అమలు జరగలేదని దళిత నాయకులు మాచవరపు జూలియన్, నీలం నాగేంద్రరావులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం రుణమాఫీ చేసిన 311.79 ఎకరాల భూమిని 554 మంది లబ్ధిదారులకు 22ఏ నుంచి తొలగించి పాస్పుస్తకాలు ఇవ్వాలని కోరారు. స్థలం అడిగితే శ్మశానంలో ఇచ్చారు కుమారుడి ఆరోగ్యం కోసం చికిత్స చేయించుకునేందుకు ఇంటిని సైతం అమ్ముకున్నామని, ముఖ్యమంత్రికి గ్రీవెన్స్లో అర్జీ ఇస్తే అధికారులు శ్మశానంలో స్థలం ఇచ్చారని ఓ కన్నతల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన కప్పల వెంకట సుజాత కుమారుడు యశ్వంత్ దివ్యాంగుడు. అతనికి ఆరోగ్య సమస్యలు ఉండటంతో వైద్య ఖర్చుల కోసం ఇంటిని అమ్ముకుని అద్దె ఇంట్లో కాలం గడుపుతున్నారు. విచారణ చేసి మరోచోట స్థలం ఇస్తామని కలెక్టర్ చెప్పారు. పొలంలోనే హద్దురాళ్లు చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెంకు చెందిన జి. గోవిందరాజు తన పొలంలో హద్దురాళ్లు వేశారని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. పక్క పొలాలకు కొలతలు వేస్తున్నామని చెప్పి పిలిచి తనతో సంతకం చేయించుకుని, తన పొలంలోనే హద్దురాళ్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలం ఆక్రమణను అడ్డుకోండి తన పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని, ఆరు నెలలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ పని కావడం లేదని బత్తులవారిపాలెంకు చెందిన చిమటా మార్పు ఆవేదన వ్యక్తం చేశారు. 1.48 ఎకరాల పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని, ఎన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఫిర్యాదు మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో టీడీపీ నాయకులు ఆక్రమించుకున్న సుమారు రూ.6 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ మార్టూరుకు చెందిన దళిత నాయకుడు సోమవారం బాపట్ల గ్రీవెన్స్ సెల్లో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అర్జీదారు రామకూరి విజయకుమార్ వివరాల మేరకు.. మార్టూరు నుంచి రాజుగారి పాలెం వెళ్లే మార్గంలో గల సర్వే నంబర్లు 392, 343లలో 2.08 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసి టీడీపీ నాయకుడు, మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు. -
ప్రజలు కోరిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలి
– ఆర్టీఐ కమిషనర్ శ్రీనివాసరావు అచ్చంపేట: ప్రజలు కోరిన సమాచారం అందుబాటులో ఉంటే వెంటనే ఇవ్వాలని ఆర్టీఐ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. అచ్చంపేట తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాలను సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. సహ చట్టం రికార్డులు పరిశీలించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్నింటికి సమాచారం అందించారనే విషయాలను పరిశీలించారు. అధికారులు జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ప్రతి సమాచారం పబ్లిక్కు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డులు ఉంచి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఆయన వెంట సత్తెనపల్లి ఆర్డీవో గోపాలకృష్ణ, తహసీల్దారు సరోజ, డిప్యూటీ తహసీల్దారు జానీబాషా, ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బగళాముఖి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని వారాహి నవరాత్రి మహోత్సవాలు బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కె.చక్రధరరెడ్డి తెలిపారు. సోమవారం 90వ అమావాస్య దివ్యహోమం సందర్భంగా అమ్మవారికి అష్టాదశ శక్తి పీఠాలలో దేవతారూపం లేకుండా కేవలం చక్ర రూపంలో గయా క్షేత్రంలో మాత్రమే దర్శనమిచ్చే శ్రీమాధవేశ్వరి మహామాత అలంకరణలో పూజలు చేశారు. అమావాస్య సందర్భంగా ఆలయంలో జరిగిన హోమం, విశేష పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్నంబజారు: ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం నెల్లూరు జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఈడీ) జి.నాగేంద్రప్రసాద్ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) డి.సాంబ్రాజ్యంతో క లసి డిపో–1 గ్యారేజీని పరిశీలించారు. బస్సుల మరమ్మతుల పనులను పరిశీలించారు. గుంటూరు డిపో–2లో జరుగుతున్న ఎలక్ట్రికల్ బస్సుల గ్యారేజీ పనుల గురించి ఆరా తీశారు. ఈడీ మాట్లాడుతూ ఆర్టీసీలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణం, పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం ఒకే రోజు రావడంతో పట్టణంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానానికి ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, బిల్వ దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. రద్దీ కారణంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహా శైవాక్షయోగం రోజున శివునికి భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు చేయడం వలన వంద మహాశివరాత్రులు ఆచరించిన పుణ్యఫలం లభిస్తుందని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు, అర్చకులు అందించారు. -
పొగబారిన రైతన్న
గంపెడాశతో సాగు చేసిన పొగాకు నేడు పగాకుగా మారింది. పర్చూరు నియోజక వర్గంలోని సాగు చేసిన రైతులు నేడు అయోమయంలో పడ్డారు. భారీగా పేరుకుపోయిన నిల్వలను ఏం చేయాలో తెలియక.. వాటిని సంరక్షించలేక.. ధర లేక.. ప్రభుత్వం ఆదుకోక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట కొనుగోలు విషయంలో కూటమి మాటలు తప్ప చేతల్లో విఫలమైంది. మార్క్ఫెడ్ను రాజకీయంగానే వాడుకుంటోంది. అన్నదాతల కష్టాలను గాలికి వదిలేసింది. పర్చూరు(చినగంజాం): భారీగా పెట్టు బడులు పెట్టి ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కోసం ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది. రెండేళ్లుగా పొగాకు రైతు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. రైతులు పండించిన బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేస్తామని ఊకదంపుడు వాగ్దానాలు ఇచ్చి మోసం చేసింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒత్తిళ్ల మేరకు తలొగ్గి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేపట్టింది. ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్న గంపెడాశతో కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన రైతులకు మొండి చేయి చూపించింది. ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామన్న మంత్రివర్గ నిర్ణయంతో వారి ఆశలపై నీళ్లు చల్లింది. పర్చూరు నియోజకవర్గ పరిధిలో 30 నుంచి 40 శాతం మాత్రమే పొగాకును మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేసింది. అది కూడా పంట నాణ్యత లేదని, తేమ శాతం ఎక్కువగా ఉందని సాకులు చెబుతూ నామమాత్రంగా కొనుగోలు చేసింది. రైతుల వద్ద సుమారు 60 శాతానికిపైగా మిగిలి పోవడంతో కాపాడుకోలేక అల్లాడిపోతున్నారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో 2022–23, 2023–24 సీజన్లో రైతులు పండించిన పొగాకుకు గిరాకీ వచ్చింది. క్వింటా ధర కనీసం రూ. 16 వేలు నుంచి రూ. 18 వేలువరకు అమ్మకం సాగింది. మిర్చి, శనగ పంటలతో గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో పొగాకు లాభసాటిగా ఉండటంతో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులు ఈ సాగు చేపట్టారు. 2024–25 సీజన్లో భారీగా సాగు చేపట్టడంతో రైతుల వద్ద నిల్వలు పెరిగిపోయాయి. ప్రభుత్వం అంతంత మాత్రంగానే కొనుగోలు చేపట్టి చేతులు దులుపుకోవడంతో వారు మోసపోయారు. కొనుగోళ్లలో పక్షపాతం ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా చేపట్టిన పొగాకు కొనుగోలు నామమాత్రంగానే సాగింది. గతంలో క్వింటా ధర రూ.18 వేలకు పైగా కొనుగోళ్లు జరగగా... మార్క్ఫెడ్ ద్వారా కేవలం రూ.12 వేలు, రూ. 9 వేలు, రూ.6 వేలు అంటూ మూడు రకాల ధరలు నిర్ణయించారు. పండించిన పొగాకు సంబంధించి రైతు సేవ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న రైతులను పిలుస్తామన్నారు. కేవలం టీడీపీ నాయకులకు సంబంధించిన రైతులను మాత్రమే పిలిచారు. చిన్న, సన్నకారు రైతులను పక్కన పెట్టడంతో ప్రభుత్వ మోసాన్ని అర్థం చేసుకున్నారు. ఎదురు చూపులు ఇప్పుడు క్వింటా కేవలం రూ.5 వేలు పలుకుతోంది. ఆశపడి ముందుకు వెళితే కొనుగోలు సమయానికి దళారులు రూ. 2,500, రూ.3 వేలకు కొనుగోలు చేస్తామంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పొగాకు నిల్వలను కాపాడుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట సీజన్లో కచ్చితమైన తేమశాతం, నాణ్యత ఉంటుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఆకు ఎండిపోయి నాణ్యత తగ్గే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం తీవ్రమైన ఎండల కారణంగా నిల్వ ఉంచిన పొగాకు దెబ్బతినడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండెలను కాపాడుకోలేక పట్టలు కప్పి ఉంచడం, తిప్పి వేయడానికి అదనపు ఖర్చులు పెట్టాల్సి రావడంతో భారం పెరిగింది. -
స్టీరింగ్ విరిగి వాహనం బోల్తా
కొల్లూరు: అరటి గెలలు లోడుతో ప్రయాణిస్తున్న వాహనం స్టీరింగ్ విరిగిపోవడంతో పంట పొలాలలోకి దూసుకువెళ్లి పల్టీ కొట్టిన సంఘటన కొల్లూరు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. లంక గ్రామాల నుంచి అరటి గెలల లోడుతో వాహనం మిర్యాలగూడ బయలుదేరింది. కూలీలను వారి గ్రామంలో దింపేందుకు మండలంలోని కోటిపల్లి వెళుతుండగా కొల్లూరు సమీపంలోని మలుపు దాటిన అనంతరం అకస్మాత్తుగా స్టీరింగ్ విరిగిపోవడంతో అదుపు కోల్పోయి పంట పొలాల వైపు దూసుకుపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన కూలీలు పంట పొలాల్లోకి దూకివేయడంతో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పల్టీ కొట్టిన వాహనంలో నుంచి డ్రైవర్ సైతం క్షేమంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్టు
పట్నంబజారు: ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాలు.. ఏప్రిల్ నెల 4వ తేదీన చౌత్రా డౌన్ గంజిబజార్లోని కోట్ల అంకమ్మ తల్లి దేవస్థానంలో గుడి పూజారిని మాయ చేసి అమ్మవారి మెడలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఒక వ్యక్తి దోచుకుని పోయాడు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడుని గుర్తించారు. కృష్ణాజిల్లా విజయవాడ మాచవరానికి చెందిన ఏమని రాంబాబు ప్రస్తుతం హైదరాబాదులోని నేతాజీ నగర్లో నివాసం ఉంటున్నారు. ఏప్రిల్ నాలుగో తేదీన విజయవాడ నుంచి స్కూటీపై గుంటూరుకు వచ్చి గంజి బజార్లోని కోట్ల అంకమ్మ తల్లి దేవస్థానంలో పూజారి గుడి శుభ్రం చేస్తుండగా అమ్మవారికి దండం పెట్టుకున్నట్లు నటించి ఆయనకు రూ.500 నోటు ఇచ్చి 100 రూపాయలు దక్షిణ తీసుకుని మిగతావి తిరిగి ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో ఆలయ అర్చకుడు బయటకు వెళ్లిన సమయంలో అమ్మవారి బంగారు మంగళ సూత్రాలు, బొట్టు మొదలగు వెండి వస్తువులను అపహరించుకుపోయాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 70కి పైగా ఆలయాల్లో చోరీకి చేసినట్లు గుర్తించిన పోలీసులు నిందితుడిని సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుంచి అమ్మవారి ఆలయంలో చోరీకి పాల్పడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. -
ఉపాధ్యాయ పని సర్దుబాటు కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ పని సర్దుబాటు కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో నిర్వహించారు. గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా అధ్యక్షతన నిర్వహించిన ఈ ప్రక్రియలో ఎస్జీటీలుగా పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్ అర్హతలు ఉన్న వారిని వివిధ ఉన్నత పాఠశాలలకు కేటాయించారు. పలువురు ఎస్జీటీలు గుంటూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లాకు వెళ్లారు. కౌన్సెలింగ్కు హాజరైన 147 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల్లో తెలుగు మీడియం విభాగం నుంచి హైస్కూల్కు అర్హతలు గల ముగ్గురు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కోరుకోగా, మరో 10 మంది ఎస్జీటీలు వేర్వేరు పాఠశాలలను కోరుకున్నారు. ఉర్దూ మీడియంలో హాజరైన తొమ్మిది మంది ఉపాధ్యాయుల్లో ఇద్దరు వేర్వేరు పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. మొత్తం 147 మంది ఉపాధ్యాయుల్లో 15 మంది పాఠశాలలను ఎంపిక చేసుకోగా, మిగిలిన వారు సుముఖత చూపలేదు. కౌన్సెలింగ్ ప్రక్రియలో గుంటూరు డీవైఈవో జి.ఏసురత్నం, ఎంఈవోలు కె.విజయభాస్కర్, ఎండీ ఖాసిం, జిల్లా విద్యాశాఖ ఐటీ సెల్ సిబ్బంది నాగమల్లేశ్వరరావు, శివ నాగేశ్వరరావు, నరేష్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెనాలి రూరల్: పోలీసులమని చెప్పి దోపిడీలకు పాల్పడుతున్న వారిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన 73 ఏళ్ల మల్లికార్జునరెడ్డి ఈ నెల 7వ తేదీన తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో రూ.1.60 లక్షలు విత్డ్రా చేశారు. నగదును స్కూటీ డిక్కీలో పెట్టుకుని తెనాలి వస్తుండగా ఆటోనగర్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. పోలీసులమని, తనిఖీ చేయాలంటూ వాహన పత్రాలను అడిగారు. అదే సమయంలో డిక్కీలో ఉన్న నగదులో నుంచి రూ.50 వేలు తీసుకుని పరారయ్యారు. ఈ కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిందితుల్లో ఒకరు చీరాలకు చెందిన వ్యక్తి కాగా, మరో వ్యక్తి బాపట్లకు చెందిన మాజీ సైనికుడని విశ్వసనీయ సమాచారం.నగరంపాలెం: జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు, హోటళ్లలో ఆదివారం సాయంత్రం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆయా సబ్ డివిజన్లలోని డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్ఐలు, ప్రత్యేక బృందాలుగా ఈ తనిఖీలు కొనసాగించారు. తొలుత రిజిస్టర్ పుస్తకాలను పరిశీలించారు. రోజుకి ఎంత మంది వస్తున్నారు, ఏయే పనులపై వస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటున్నారనే విషయాలపై నిర్వాహకుల నుంచి ఆరా తీశారు. అనంతరం గదుల్లో బస చేసిన వ్యక్తుల ఆధార్ కార్డులు, ఇతరత్రా గుర్తింపు కార్డులను పరిశీలించారు. జిల్లాలో, ముఖ్యంగా గుంటూరు నగరంలో వారు ఎందుకు వచ్చారనేది అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా వస్తే ఒరిజినల్ ఆధార్, ప్రభుత్వ గుర్తింపు కార్డులను పరిశీలించాక వాటి జిరాక్స్ కాపీలను తీసుకోవాలని నిర్వాహకులకు పోలీస్ అధికారులు సూచించారు. విధిగా రిజిస్టర్లల్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు 24 గంటలు వాడుకంలో ఉండాలని, కనీసం నెల రోజుల రికార్డింగ్ బ్యాకప్ ఉండాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. దుర్గమ్మకు విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. తిరుపతి జిల్లా పనగలూరుకు చెందిన జి. సుబ్రహ్మణ్యంరెడ్డి కుటుంబం అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ. 1,00,116 విరాళాన్ని ఆలయ అధికా రులకు అందజేశారు. మచిలీపట్నం నరసింహనగర్కు చెందిన సీహెచ్ శ్రీలలిత కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ డీఈవో కిషోర్బాబు, అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను దాతలకు అందజేశారు. -
ఐఏపీ ప్రెసిడెంట్ ఎలక్ట్గా డాక్టర్ ఉమాజ్యోతి
గుంటూరు మెడికల్: ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ(ఐఏపీ) ఏపీ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఎలక్ట్గా గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల వైద్య విభాగాధిపతి డాక్టర్ నీలి ఉమాజ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విశాఖపట్నంలో మానసికవ్యాధి వైద్య నిపుణుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ ఉమాజ్యోతిని మానసిక వైద్య నిపుణుల సంఘం రాష్ట్ర శాఖకు ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఈమె రాష్ట్ర శాఖలో వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తారు. డాక్టర్ ఉమాజ్యోతి 1999 నుంచి సంఘంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా, రాష్ట్ర సంఘంలో పలు హోదాల్లో సేవలందించారు. ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఏకగ్రీవంగా ఎన్నికై న డాక్టర్ ఉమాజ్యోతికి మానసికవ్యాధి వైద్య నిపుణుల సంఘం గుంటూరు ప్రెసిడెంట్ డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, సెక్రటరీ డాక్టర్ పసుపుల సాయి కిరణ్, ఇతర సంఘ నేతలు, గుంటూరు జీజీహెచ్ మానసికవ్యాధుల వైద్య విభాగానికి చెందిన వైద్యులు, జీజీహెచ్, గంటూరు వైద్య కళాశాల అధికారులు, వైద్యులు అభినందనలు తెలిపారు. గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన ప్రముఖ మధుమేహవైద్యనిపుణులు, ఎస్వీఆర్ షుగర్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ వీవీ రామకుమార్ ఆదివారం జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో జ్యోతి దేవ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఫోరం– 2026 సంవత్సరానికి ‘పేషెంట్ ఎంపవర్మెంట్ డిజిటల్ ఎంగేజ్మెంట్ అండ్ పేషెంట్ ఎడ్యుకేషన్ ఇన్షియేటివ్స్‘ విభాగంలో ప్రముఖ మధుమేహ నిపుణులు పద్మశ్రీ డాక్టర్ శశాంక్ జోషి, త్రివేండ్రం గోకులం హాస్పిటల్ చైర్మన్ మనోజ్ చేతుల మీదుగా డాక్టర్ రామ్కుమార్ జాతీయస్థాయి పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ కుమార్ మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా షుగర్ వ్యాధిపై వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. జాతీయ పురస్కారాన్ని అందుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. తన ఆత్మీయ పేషెంట్లకు, సహచర వైద్య బృందానికి, విద్య నేర్పిన గురువులకు, కుటుంబ సభ్యులకు డాక్టర్ రామ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. నగరంపాలెం: గుంటూరు నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను ఆదివారం అమరావతి లా అండ్ ఆర్డర్ (ఎల్/ఓ) నూతన ఓఎస్డీ మనోజ్ రామనాథ్హెగ్డే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. 2022 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన మనోజ్ రామనాథ్హెగ్డే రాజంపేట నుంచి బదిలీపై అమరావతి ఎల్ అండ్ ఓకు బదిలీయ్యారు. అమరావతి రాజధాని ఏరియాకు ప్రాధాన్యత ఉందని జిల్లా ఎస్పీ అన్నారు. సున్నితమైన ప్రాంతంలో విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. తుళ్లూరు, సీఆర్డీఏ లో లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఇంటెలిజెన్స్, ఎస్బీ సమాచారంతో ఉండాలని, ప్రజా భద్రతకై విధులు చేపట్టాలని సూచించారు. -
ఆన్లైన్లోనూ ఈఎఫ్ పూర్తి చేయొచ్చు
బాపట్ల: ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఆన్లైన్లోనూ ఈఎఫ్లు పూర్తి చేయొచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని 29 వ వార్డు, బెస్తపాలెం 69వ పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న సర్ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని బీఎల్ఓలను ఆదేశించారు. కలెక్టర్ నేరుగా ఓటర్లతో మాట్లాడారు. గడువు ముగుస్తున్నందన ప్రక్రియ వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. బాపట్ల ఆర్డీఓ ఎ. హరికుమార్, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, డీఆర్డీఏ పీడీ బి.సింగయ్య, మున్సిపల్ కమిషనర్ ఎం.హాసిని తదితరులు పాల్గొన్నారు. నేడు జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ బాపట్ల: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఉదయం తొమ్మిది నుంచి 10 గంటల వరకు గతంలో పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీల పరిష్కారంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు. తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకుంటే సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ తెలిపారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
కుళ్లిన స్థితిలో క్వారీ గుంతలో మృతదేహంగుంటూరు రూరల్: కుళ్లిన స్థితిలో క్వారీ గుంతలో వ్యక్తి మృతదేహం ఆదివారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... పొత్తూరు గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం క్వారీ గుంతలో ఛిద్రమైన స్థితిలో ఉందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహంపై వస్త్రాలు లేవని పోలీసులు గుర్తించారు. కాళ్లను తాళ్లతో కట్టారని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం రుద్ర ట్రస్ట్ సహకారంతో జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎక్కడైనా చంపి ఇక్కడకు తెచ్చి పడేశారా? ఇక్కడే హత్య చేశారా? అనే కోణాలలో దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో మృతుడు తాడికొండ మండలం ఫణిదరం గ్రామానికి చెందిన మాడుగుల శంకరరావు (52)గా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడని తేలింది. ఈ నెల 7వ తేదీన చిలకలూరిపేటలో పని ఉందని ఇంటి నుంచి బయటకు వచ్చాడని, తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీస్ స్టేషన్లో ఈ నెల 8వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారని తెలిసింది. కుటుంబసభ్యులకు నల్లపాడు పోలీసులు సమాచారం అందించారు. వ్యాపార లావాదేవీల వల్ల హత్య చేశారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణాలలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
సాంకేతిక రంగంలో మార్పులను అభ్యసించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: సాంకేతిక రంగంలో మార్పులను ఉపాధ్యాయులు అభ్యసించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆదివారం సాంబశివపేటలోని ఏసీ కళాశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో టెట్ పరీక్షలో ఇంగ్లీష్ బాషాంశాలు అనే అంశంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ టెట్ పరీక్ష ఉపాధ్యాయులను విద్యార్థులుగా మార్చిందన్నారు. వేగంగా మారిపోతున్న విజ్ఞానశాస్త్రం, సాంకేతిక రంగం మార్పులను ఉపాధ్యాయులు అభ్యసించాలని అన్నారు. తద్వారా ఆధునిక విద్యార్థులను తయారు చేయగలరని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ బోధనా శాస్త్రాల పునఃశ్చరణ కల్పించి టీచర్లు అందరూ టెట్ లో ఉత్తీర్ణులయ్యేలా యూటీఎఫ్ క్లాసులు నిర్వహిస్తోందన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు హాజరు కావడం అవగాహన పెంపొందించుకోవడం అభినందనీయమన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ హక్కుల కోసం పోరాటంలోనూ, అవసరమైన సందర్భంలో ఉపాధ్యాయులకు అండగా ఉండటంలోనూ యూటీఎఫ్ ముందుంంటుందన్నారు. రాబోవు ఆదివారం సైతం టెట్ తరగతులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, సహాధ్యక్షురాలు ఎండీ షకీలా బేగం, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.సాంబశివరావు, టి.ఆంజనేయులు, ఏ.శ్రీనివాసరావు, ఎం. గోవింద్, కె.కామాక్షి, కె.రంగారావు, బి.ప్రసాద్, ఎం.కోటిరెడ్డి ఆడిట్ కమిటీ సభ్యులు వి.వినోద్, ఎన్. ధనలక్ష్మి, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు -
నేషనల్ హైవేపై రెయిలింగ్ రాడ్లు చోరీ
నాదెండ్ల: జాతీయ రహదారి నూతన బైపాస్ రోడ్డుకు ఇరువైపులా రెయిలింగ్ బిగించిన ఇనుప రాడ్లను దొంగిలిస్తున్న వ్యక్తిని హైవే పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ ఆర్.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన తాళ్లూరి జక్రయ్య దివ్యాంగుడు. ఒక కాలు లేకపోవటంతో మూడు చక్రాల బండిపై తిరుగుతుంటాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో జక్రయ్య నూతన బైపాస్ రోడ్డుపై గణపవరం వద్ద రోడ్డు వెంబడి రెయిలింగ్కు బిగించిన ఇనుప రాడ్లు దొంగిలించి పాత ఇనుప దుకాణంలో విక్రయిస్తున్నాడు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు గత పదిరోజులుగా సీసీ కెమేరాల ఫుటేజీ గమనించి సుమారు రూ.60 వేలు విలువైన ఇనుప రాడ్లు దొంగిలించి, విక్రయించినట్లు నేషనల్ హైవే పోలీసులు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగిలించిన వస్తువులను ఎక్కడెక్కడ విక్రయించాడో ఆరా తీస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు -
వైఎస్సార్ సీపీ ఓటర్లే టార్గెట్!
పిడుగురాళ్ల: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)– 2026 కార్యక్రమాన్ని ప్రారంభించి, కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమం ఈ నెల 14తో ముగియనుంది. అయితే కొందరు అధికారుల తీరుతో కార్యక్రమం తీరుతెన్నులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన గ్రామం. ఈ గ్రామంలో 213, 214, 215, 216, 217 నంబర్ల పోలింగ్ బూత్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ నెల 11వ తేదీవరకు సర్ పక్రియ, డిజిటలైజేషన్ సజావుగా సాగింది. అయితే ఈనెల 11వ తేదీన గురజాల ఆర్డీఓ మురళి, పిడుగురాళ్ల తహసీల్దార్ మధులు కరాలపాడు గ్రామంలోని సచివాలయంలో బీఎల్ఓలతో సర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఇక్కడి బీఎల్ఓ పనితీరు మారిందని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియలో కీలకమైన ఆదివారం రోజున డిజిటలైజేషన్ ప్రక్రియలో ఇక్కడి ఐదుగురు బీఎల్ఓలు హాజరై వేగవంతంగా ఆన్లైన్ చేయాల్సి ఉండగా కేవలం ఒక బీఎల్ఓ మాత్రమే హాజరై అది కూడా మధ్యాహ్నం తర్వాత వచ్చి ఆన్లైన్ కార్యక్రమం నామమాత్రంగా నిర్వహించారు. దీంతో వైఎస్సార్ సీపీ సానుభూతి పరులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీలకు అతీతంగా చేయాల్సిన కార్యక్రమంలో అధికారుల ఒత్తిళ్లతోనే బీఎల్ఓలు విధులకు దూరంగా ఉంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఏ ప్రభుత్వ కార్యక్రమైన ఉన్నతాధికారులు వచ్చివెళ్లిన తర్వాత కింది స్థాయి సిబ్బంది వేగవంతంగా విధులు నిర్వహించి పనులు ముగిస్తారని, కానీ కరాలపాడులో మాత్రం ఉన్నతాధికారులు వచ్చినప్పటి నుంచి ప్రక్రియ నత్తనడకన సాగుతుందని ఆరోపిస్తున్నారు. – ఈ విషయమై తహసీల్దార్ మధుబాబును ‘సాక్షి’ వివరణ కోరగా.. కరాలపాడులో బీఎల్ఓలు సక్రమంగా నిర్వహిస్తున్నారని, మరింత సమాచారం కావాలంటే ఆ గ్రామానికి మండల ఆర్ఐ శ్రీనుబాబు ఇన్ఛార్జిగా ఉన్నాడని మాట దాటవేశారు. దీంతో ఆర్ఐ శ్రీనుబాబును వివరణ కోరగా కరాలపాడులోని ఐదు ఎన్నికల బూత్లలో ఇప్పటి వరకు 84 శాతం ఆన్లైన్ పక్రియ చేయటం జరిగిందని, కొన్ని ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్ల వద్ద నుంచి సేకరించాల్సి ఉందని, అవి కూడా ఈ రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సేకరించి ఆన్లైన్ చేస్తామని తెలిపారు. -
సహకారం శూన్యం
బాపట్లఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026● బకాయిలు చెల్లించాలని కోరుతున్న చేనేత సంఘాల ప్రతినిధులు ● కార్మికులకు పని భద్రత ఏదీ? ● సంఘాల బలోపేతానికి కొరవడిన చర్యలు చీరాల అర్బన్: కళాత్మక వృత్తిదారుల బతుకులు కత్తిమీద సాములా మారాయి. అసలే పెరిగిన ధరలు, జీఎస్టీల భారంతో సతమతమవుతుంటే ఆదుకుంటాయనుకున్న చేనేత సహకార సంఘాలు కూడా మూలన పడుతున్నాయి. చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వ పరంగా రావాల్సిన పలు పథకాలకు సంబంధించిన సబ్సిడీ బకాయిలు మొండి బకాయిలుగా మారాయి. త్రీఫ్ట్ ఫండ్ 8 శాతం, పావలా వడ్డీ, నూలు, రంగులు, రసాయనాలు తదితరాలకు సంబంధించిన సబ్సిడీ బకాయిలు ప్రధానమైనవి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సొసైటీలకు సంబంధించి రూ.203 కోట్లు విడుదల కావాలి. జిల్లావ్యాప్తంగా 75 సహకార సంఘాలు ఉండగా ప్రస్తుతం 34 సంఘాలు సేవలు అందిస్తున్నాయి. ఆయా సొసైటీలకు కోట్లాది రూపాయల చెల్లింపులు నిలిచిపోయాయి. సంఘాలకు పాలకవర్గం పదవీ కాలం ఎప్పుడో ముగిసినా.. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియడంలేదు. జిల్లాలో ప్రస్తుతం 34 సంఘాలు మాత్రమే మిణుకుమిణుమంటున్నాయి. మిగిలిన సంఘాలు మూలన పడ్డాయి. దీంతో ఆయా సంఘాల్లో పనిచేసే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్న సంఘాల నిర్వహణ కూడా అధికారులకు తలకు మించిన భారంగా మారింది. నిధుల లేమి, సిబ్బంది కొరత అందుకు కారణం. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి సవిత మాత్రం చేనేత సహకార సంఘాల బకాయిలు త్వరలో చెల్లిస్తామంటూ మాటలు మాత్రం చెప్తున్నారు. బ్యాంకుల నుంచి సంఘాలు తీసుకున్న అప్పు( క్యాష్ క్రెడిట్)కు వడ్డీ భారం పెరుగుతోంది. సంవత్సరాల తరబడి వడ్డీలు చెల్లించకపోవడంతో అసలు, వడ్డీ తడిసి మోపెడు అవుతోందని గత పాలకవర్గాల ప్రతినిధులు చెప్తున్నారు. దీంతో సొసైటీలకు ప్రస్తుతం ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న అధికారులు కూడా అయోమయంలో పడ్డారు. చేనేత సహకార సంఘాలకు సంబంఽధించి గతంలో కొన్ని లోపాలు వెలుగు చూసిన మాట వాస్తవమే. అయితే పూర్తిగా పాలకవర్గాలు లేకపోతే వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 513.70 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. నేతన్నలకు చేయూత కొరవడింది. రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం చేనేత సహకార సంఘాల లక్ష్యాన్ని నీరుగార్చుతోంది. వాటి బకాయిల చెల్లింపునకు అడ్డు పడుతూ వేలాది మంది చేనేత కార్మికుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటోంది. పాలకవర్గాల పదవీకాలం పూర్తయినా చోద్యం చూస్తోంది. చేనేత సహకార సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీ భారీగా మారింది. ఈ క్రమంలో ముందు చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఆ క్రమంలోనే ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలకు బాధ్యతలు అప్పగించాలి. ఆ రెండు జరిగితేనే చేనేత సహకార సంఘాలు మనగలుగుతాయి. లేదంటే కనుమరుగు కాక తప్పదు. – కాటూరి వెంకటేశ్వర్లు, శ్రీ వెంకట వీరాంజనేయ చేనేత సహకార సంఘం, మాజీ అధ్యక్షుడు, ఈపురుపాలెం -
బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం
గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలను రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ప్రారంభించారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పోటీలకు హాజరైన క్రీడాకారులను రామకృష్ణ పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ పోటీలు రెండు రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతాయన్నారు. ముఖ్యంగా అండర్ 11, 13, 15 విభాగాలలో క్రీడాకారులకు అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు. నలుమూలల నుంచి 400 మంది క్రీడాకారులు పోటీలకు హాజరవడం విశేషమని తెలిపారు. అనంతరం చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి వజ్జా రామకృష్ణ, అసోసియేషన్ అధ్యక్షులు రంగబాబు, జిల్లా కమిటీ సభ్యులు మొకమటం వెంకట్, సతీష్ చంద్ర, బండారు రాము, బొచ్చు రమేష్, హరి పాల్గొన్నారు. -
జిల్లా ఆర్యవైశ్య సంఘ కార్యవర్గానికి నియామక పత్రాల అందజేత
తెనాలి: గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గంలో నియమితులైన వారికి జిల్లా అధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు తెనాలిలో నియామక పత్రాలను అందజేశారు. స్థానిక బోసురోడ్డులోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గీతా మందిరంలో శుక్రవారం రాత్రి ఈ సమావేశం నిర్వహించారు. నూతన కార్యవర్గంలో తెనాలికి చెందిన పలువురికి అవకాశం లభించింది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొత్త రామారావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా సంకా లక్ష్మీనారాయణ మూర్తి, ఉపాధ్యక్షులుగా మాలేపాటి తిరుమలేశ్వర్రావు, బీటీవీఎస్ నారాయణ, జాయిన్ జాయింట్ సెక్రటరీలుగా కొమ్మూరు కృష్ణ, అచ్యుత సాంబశివరావు, డైరెక్టర్లుగా కాజా గిరిధర్, శెనగపల్లి నరేంద్ర కుమార్, సుగ్గుల రవీంద్రకుమార్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు చుండూరు ఉమా మహేశ్వరరావు నియామకపత్రాలను అందజేశారు. సంఘ అభివృద్ధికి, ఆర్యవైశ్యుల పురోగతికి తోడ్పడతామని నూతన కార్యకర్వం ప్రకటించింది. పదోతరగతిలో 578 మార్కులు సాధించిన వక్కలగడ్డ భాగ్యశ్రీలక్ష్మికి నూతన పాలకవర్గం రూ.10 వేల నగదును బహూకరించారు. -
‘సర్’ ప్రక్రియ వేగవంతం చేయాలి
వేమూరు: సర్ కార్యక్రమంలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. మండల కేంద్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేమూరు నియోజక వర్గంలోని సర్ కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంత వరకు వచ్చిందోనని బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలన్నారు. నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో ఆన్లైన్ విధానం వంద శాతం పూర్తి చేయాలని నియోజక వర్గం ఎన్నికల అధికారి, బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్కు సూచించారు. తహసీల్దారు పార్వతి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ‘సర్’ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ బాపట్ల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్) కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి మున్సిపాలిటీ పరిధిలోని దేవుడి మాన్యం 11వ వార్డు, సచివాలయ 2, పోలింగ్ స్టేషన్ 96లో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తనిఖీ చేశారు. ప్రక్రియ ఏవిధంగా జరుగుతుందని ఓటర్లును అడిగితెలుసుకున్నారు. కలెక్టర్ వెంట బాపట్ల ఆర్డీఓ ఎ.హరి కుమార్, డీఆర్డీఏ పీడీ బి.సింగయ్య, మున్సిపల్ కమిషనర్ ఎం.హాసిని, సూపర్ వైజర్, బీఎల్ఓలు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ -
ఉపాధ్యాయులకు టెట్ సైకాలజీపై శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్: ఎస్టీయూ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలో భాగంగా సైకాలజీ తరగతులు నిర్వహించారు. ప్రముఖ సైకాలజీ నిపుణుడు టి.సుగంధరావు సైకాలజీ తరగతులను బోధించారు. కార్యక్రమానికి ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సిహెచ్.జోసెఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ టెట్ ఉత్తీర్ణతపై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు పొందటానికి ఎస్టీయూ అన్ని రకాలుగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పార్లమెంటులో చట్టం చేయించి 2011 ముందు ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరిన వారికి టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు లభించేలా చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకుమాను జోజప్ప, రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీధర్, మాజీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎస్.రామచంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్యామ్ బాబు, జిల్లా ఆర్థిక కార్యదర్శి హనుమంత ప్రసాద్, జిల్లా గౌరవాధ్యక్షులు ఏవీ ప్రసాద్ బాబు, నాయకులు వీరాంజనేయులు, మహి, శంకర్, ఏ వీరయ్య, భానుమూర్తి, ఏడుకొండలు, వెంకయ్య, గురుబ్రహ్మం, దేవరాజ్ పి.రవికుమార్, బి.మరియదాసు, జగన్, పి.సురేష్ పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి
విజయపురిసౌత్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో విద్యనభ్యసించి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీ(ఏపీఆర్ఈఐఎస్) కార్యదర్శి కృష్ణమోహన్ అన్నారు. శనివారం స్థానిక ఏపీఆర్ జూనియర్ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కళాశాల 1976–78 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు 25 మంది హాజరవ్వటం ఎంతో సంతోషకరమన్నారు. పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అనంతరం ప్రిన్సిపాల్ ఎం హేమాంబర్రెడ్డి మాట్లాడుతూ కళాశాల ప్రగతి, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల విజయాలను వివరించారు. తొలుత పూర్వ విద్యార్థులు అలుమ్ని సభ్యులు విద్యార్థి జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ విద్యార్థులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు జీవిత విలువలపై పలు సూచనలు చేశారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పూర్వ విద్యార్థులను ఏపీఆర్ఈఐఎస్ కార్యదర్శి కృష్ణమోహన్, సంయుక్త కార్యదర్శి ఉబేదుల్లా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
వినుకొండ: నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. మట్టిని సరిహద్దులు దాటిస్తూ రూ. కోట్లలో సంపాదిస్తున్నారు. వినుకొండ రూరల్ మండలం దొండపాడు గ్రామంలోని చెరువును ఆనుకుని ఉన్న మునిస్వామి కొండను పొక్లెయిన్లతో అక్రమంగా తవ్వి, వేలాది ట్రక్కులతో మట్టి తరలిస్తున్నారు. దీని వల్ల కొండపై ఉన్న చారిత్రక శివాలయం కనుమరుగయ్యే దశకు చేరుకుంది. రాత్రింబవళ్లు తేడా లేకుండా తవ్వి తరలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ప్రైవేటు వారికి అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో అధికం వినుకొండ రూరల్ మండలంలోని నీలగంగవరం, వెంకుపాలెం, అలాగే బొల్లాపల్లి మండలంలోని పేరుపాడు, వెల్లటూరు, నూజెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వెంకుపాలెం జాలపాలెం గ్రామ పరిధిలోని ఎర్ర కొండ వద్ద భారీ యంత్రాలతో మట్టిని తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి ధరను నిర్ణయిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ బొల్లాపల్లి, వినుకొండ రెవెన్యూ అధికారులు పరస్పరం సాకులు చెబుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు ఇప్పటికై నా స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ఈ– ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానంపై అపోహలు వద్దు
తెనాలిటౌన్: మార్కెటింగ్శాఖ జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధా నంపై అపోహలు అవసరం లేదని మార్కెటింగ్ శాఖ విజయవాడ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఎం.దివాకర్ తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శనివారం ది డాల్మిల్స్, పల్సె స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమా వేశమయ్యారు. ఈ– ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానంపై వ్యాపారులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. నగదు రహిత లావాదేవీల కోసం ప్రభు త్వం రూపొందించిన ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చెక్పోస్ట్ల వద్ద నగదు రశీదులు రాసి ఇవ్వడం పూర్తిగా రద్దు చేయబడిందని వెల్లడించారు. లైసెన్స్ కలిగిన వ్యాపారస్తుడు స్వతహాగా ఆన్లైన్ ఈ–పర్మిట్ తీసి సరుకు ఎగు మతి చేస్తున్న వాహన డ్రైవర్కు ఇచ్చి పంపాలని స్పష్టం చేశారు. వాహన డ్రైవర్ ఆన్లైన్ ఈ–పర్మిట్ ప్రింట్ను తన మొబైల్కు వచ్చిన నంబర్ను చెక్ పోస్టు వద్ద చూపించి స్కానింగ్ చేయించుకుని వెళ్లాలని సూచించారు. ముందస్తు ఆన్లైన్ ఈ–పర్మిట్ లేకుండా సరుకు ఎగుమతి చేస్తున్న వాహన డ్రైవర్ల నుంచి చెక్పోస్టు వద్ద కేవలం ఫోన్పే, జీపే, పేటీఎం ఇతర డిజిటల్ పద్ధతిలోనే మార్కెట్ ఫీజు వసూలు చేసి పర్మిట్ జారీ చేయబడుతుందని చె ప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నగదు అంగీకరించబడ దని వెల్లడించారు. పర్మిట్ తీసుకున్న పది రోజుల వరకు గడువు ఇవ్వాలని అసోసియేషన్ ప్రతినిధు లు కోరగా ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. నూ తన ఈ–ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానానికి సహకరించాలని కోరారు. -
జాతీయ లోక్ అదాలతో 1225 కేసులు పరిష్కారం
రేపల్లె: న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కోర్టు హాలులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలలో మొత్తం 1225 కేసులు పరిష్కరించినట్లు తెనాలి సీనియర్ సివిల్ జడ్జి ఎస్.వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిష్కరించిన కేసుల్లో 29 సివిల్, 1196 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా వేగవంతంగా పరస్పర సమ్మతితో వివాదాలు పరిష్కారం కావడం వల్ల ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు. తెనాలి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, న్యాయవాదులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరుకు చెందిన భక్తులు శనివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. గుంటూరు వికాస్నగర్కు చెందిన రాయపాటి కోటి సుధాకర్ (సుబ్బారావు) ఆలయ అధికారులను కలిసి అన్నదానానికి రూ. 1,08,616 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ డీఈఓ కిశోర్కుమార్, అర్చకుడు రంగావఝుల శ్రీనివాసశాస్త్రి దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. తెనాలి: కొల్లిపర మండల గ్రామం కుంచవరంలోని శ్రీవారాహి దేవాలయంలో ఈనెల 15 నుంచి 24వ తేదీవరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, దీక్షాధారణ ఉత్సవాలు జరగనున్నాయి. ఈమేరకు ఉత్సవాల ఆహ్వానపత్రికను శనివారం స్థానిక మారీసుపేటలోని పోస్టల్ సహకార సొసైటీ భవనంలో శ్రీకాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీ గౌరవ చైర్మన్ డీఎల్ కాంతారావు ఆవిష్కరించారు. ఆలయ ధర్మకర్త, ‘పోస్ట్’ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ తన్నీరు శ్రీనివాసబాబు మాట్లాడుతూ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి చేతుల మీదుగా ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు, హోమాలు, కుంకుమ పూజలు, మధ్యాహ్నం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు. యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య, కల్యాణం శ్రీనివాసరావు, పీఎస్సార్ బ్రహ్మాచార్యులు, జగదీష్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: న్యాయవాదులుగా రాణించాలంటే భాషా నైపుణ్యాలు పెంపొందించుకోవడం కీలకమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ చీమలపాటి రవి అన్నారు. శనివారం జేకేసీ కళాశాల రోడ్డులోని జాగర్లమూడి చంద్రమౌళి (జేసీ) న్యాయ కళాశాల గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఇరువురు న్యాయమూర్తులు న్యాయ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల పాలకమండలి అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కార్యదర్శి కుప్పుస్వామి, ఉపాధ్యక్షుడు డాక్టర్ కొండబోలు కృష్ణ ప్రసాద్, కోశాధికారి రాయపాటి వెంకట కోటేశ్వర ప్రసాద్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ పి.గోపీచంద్, ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ సుధాకర్ బాబు, పాలక మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రార్థనలు ఆలకించే కార్మెల్ మాత
● 14 నుంచి కార్మెల్ మాత మహోత్సవాలు ● మూడురోజులపాటు నిర్వహణ ● తెలుగు రాష్ట్రాల నుంచి తరలిరానున్న కథోలిక్కులు ఫిరంగిపురం: మండలకేంద్రం కార్మెల్ కొండపై ఉన్న కార్మెల్మాత ఉత్సవాలు ఈనెల 14,15,16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే దివ్యపూజాబలి కార్యక్రమంలో గుంటూరు మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య పాల్గొంటారని ఆలయ వర్గాలు శనివారం తెలిపాయి. 14 మంగళవారం సాయంత్రం కార్మెల్ మాత కొండవద్ద దివ్యపూజాబలి కార్యక్రమం విచారణ గురువు పి.అంతోని రాజు నిర్వహించనున్నారు. 15 బుధవారం ఉదయం కథెడ్రల్ దేవాలయంలో విచారణ గురువు ఫాతిమా మర్రెడ్డి, కొండపై 8గంటలకు విచారణ గురువు కె.సాగర్లు దివ్యపూజాబలి పూజలు నిర్వహిస్తారు. రాత్రి పదినుంచి ఉదయం 4 వరకు అఖండ జపమాల నిర్వహించనున్నారు. 16న ఉదయం బాల ఏసుదేవాలయంలో, 9గంటలకు కార్మెల్ కొండపైన దివ్యపూజాబలి నిర్వహిస్తారు. కార్యక్రమానికి విజయవాడ పీఠాధిపతి తెలగతోటి రాజారావు ప్రధాన యాజకులుగా వ్యవహరిస్తారు. తరువాత కార్మెల్ మాత మహోత్సవ సమిష్టి దివ్యపూజాబలి కార్యక్రమానికి గుంటూరు మేత్రాసన నూతన అభిషిక్త గురువులు పాల్గొంటారు. అనంతరం కార్మెల్మాత తేరు ప్రదక్షిణ నిర్వహించనున్నారు. కార్మెల్మాత విశిష్టత.. క్రీస్తుపూర్వం 857లో ఆహాబురాజు పరిపాలన కాలంలో ఇజ్రాయేల్ దేశంలో అనావృష్టితో కరువు ఏర్పడింది. ఈపరిస్థితిలో ప్రవక్త ఏలియా కార్మెల్ పర్వత గుహలో ప్రవేశించి ప్రార్థించాడు. దీంతో ఆకాశంలో కారు మేఘాలు కమ్మి కుంభవృష్టిగా వర్షం కురిసింది. సమృద్ధిగా పంటలు పండి ప్రశాంతతకు దేశం నిలయంగా మారింది. అంతటి పవిత్రమైన కార్మెల్ పర్వతాన్ని స్మరించేందుకు వీలుగా 1885వ సంవత్సరంలో లండన్ మిల్హిల్ గురువులు తియోడర్ డిక్మన్ ఫిరంగిపురం విచారణ గురువులుగా, సహాయ విచారణ గురువుగా రాజనాడార్ ఉన్నారు. గ్రామంలోని కొండపైన లూర్డుమాత దేవాలయాన్ని నిర్మించారు. 1922వ సంవత్సరంలో జీబీజే ఫర్మెన్స్వామి, నోయప్ప స్వామి సహకారంతో అప్పటివరకు ఉన్న లూర్ధు మాత దేవాలయ స్థానంలో కార్మెల్మాత దేవాలయాన్ని పునర్నిర్మించారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
నాదెండ్ల: ద్విచక్ర వాహనం అదుపు తప్పిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ ఆర్. వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు... నుదురుపాడు గ్రామానికి చెందిన పారెళ్ళ అనిల్కుమార్ (27) కేరళలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో తమ బంధువు మృతి చెందటంతో ద్విచక్రవాహనంపై వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో నాదెండ్ల–అప్పాపురం డొంక రోడ్డులో ద్విచక్రవాహనం అదుపుతప్పి గోతిలో పడింది. స్థానికులు గమనించి 108కు సమాచారమిచ్చారు. అనిల్కుమార్ను చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించగా, శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని శనివారం పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించటంతో స్వగ్రామమైన నుదురుపాడుకు తరలించారు. నకరికల్లు: మండలంలోని చల్లగుండ్ల గ్రామంలో వరిగడ్డి వామి దగ్ధమైంది. ఈ సంఘటన గ్రామంలోని ఎస్సీ కాలనీలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన డి.పెదలాజర్ నాలుగెకరాల వరిగడ్డిని సుమారు రూ.50 వేలతో కొనుగోలు చేసి నిల్వ చేశాడు. శనివారం ఉదయం సమయంలో వరిగడ్డికి నిప్పంటుకుంది. చుట్టుపక్కల వారు గమనించే సరికి మంటలు చెలరేగాయి. నీళ్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పిడుగురాళ్ల ఫైరింజన్ యంత్రాంగం గ్రామానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. అప్పటికే వరిగడ్డి మొత్తం అగ్నికి ఆహుతైంది. అసలే మేత దొరకని గడ్డుకాలం వస్తున్న తరుణంలో తమకు భారీ నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరువెస్ట్(క్రీడలు): గుంటూరులోని రాప్ స్నూకర్స్ గేమ్ జోన్ ఆధ్వర్యంలో 10 రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్ర స్థాయి బిలియర్ట్స్ చాంపియన్న్ షిప్ పోటీల విజేతగా కాకినాడకు చెందిన శివశర్మ నిలిచాడు. ద్వితీయ స్థానంలో గుంటూరుకు చెందిన బద్రు జుబేర్ నిలిచాడు. శనివారం జరిగిన విజేతల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాదాల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధినేతలు అమర ఆదినారాయణ, అమర అజయ్ మాట్లాడుతూ గత పది రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 200 మందికి పైగా క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించి పోటీలను విజయవంతం చేయడం అభినందనీయమని క్రీడాకారులు ప్రశంసిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు సుమారు రూ.1.50 లక్షలు నగదు రూపంలో అందజేశామని చెప్పారు. భవిష్యత్లో రాప్ స్నూకర్స్ గేమ్ జోన్ ఆధ్వర్యంలో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి బిలియర్డ్స్ పోటీలను నిర్వహించడంతో పాటు గుంటూరును ఈ క్రీడకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. తెనాలిరూరల్: రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలి రైల్వే స్టేషన్ ఐదో నంబరు ప్లాట్ఫాంపై శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి ఐదో నంబరు ప్లాట్ఫాం పట్టాలపై ఆత్మహత్యాయత్నం చేశాడు. కాళ్లు తెగిపోయి తీవ్ర రక్తస్రావమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని తెనాలి వైద్యశాల మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లిరూరల్: ఇద్దరు బాలికల అదృశ్యంపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఖాజావలి తెలిపిన వివరాలు.. మంగళగిరి– తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేట, అంబేడ్కర్ కాలనీలో బాలికలు వారి తల్లిదండ్రుల కలసి నివాసం ఉంటున్నారు. మొహరం కుమార్తె ఇస్రా, అస్మతున్నిసా కుమార్తె నూర్జహాన్ కనిపించకుండా పోయారంటూ తాడేపల్లి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఉదయం సమయంలో తాడేపల్లి ప్రెస్ క్లబ్ వద్ద మంగళగిరి వెళ్లే ఆటోలో వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. -
మాస్టర్ మైండ్స్ విద్యార్థుల ర్యాంకుల ప్రభంజనం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈనెల 9న ప్రకటించిన సీఎం ఏ ఫౌండేషన్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ర్యాంకుల ప్రభంజనాన్ని సృష్టించారని సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. శనివారం గుంటూరు బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంఏ ఫౌండేషన్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో ప్రకటించిన టాప్–10 ర్యాంకులలో 9 ర్యాంకులను తమ విద్యార్థులు కై వసం చేసుకున్నారని తెలిపారు. మాస్టర్ మైండ్స్ విద్యార్థులు వరసగా 2, 4, 5, 6, 6, 6, 7, 8, 10 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని, ఒకే విధమైన మార్కులు వచ్చిన విద్యార్థులకు ఒకే విధమైన ర్యాంకు కేటాయిస్తారని పేర్కొన్నారు. అదే విధంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించిన సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో 4, 5, 8, 15, 16 వ ర్యాంకులు సాధించి చరిత్ర సృష్టించారని వివరించారు. అతి పిన్న వయస్సులోనే విద్యార్థులు సీఏ, సీఎం ఏ కోర్సులను సమాంతరంగా పూర్తి చేయటం అభినందనీయమని అన్నారు. సీఏ, సీఎంఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల -
రైతులపై ప్రభుత్వ దౌర్జన్యాలు ఆపాలి
ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్కుమార్ లక్ష్మీపురం: రైతుల ఆమోదంతో దేవతల రాజధాని నిర్మిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు దీనికి భిన్నంగా రైతుల పచ్చని పంట పొలాలను ఒక్కసారిగా ధ్వంసం చేయటమే కాకుండా అడ్డు వచ్చిన రైతులను కూడా విచక్షణారహితంగా ఈడ్చివేయడం అన్యాయమని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరు కార్యాలయంలో శనివారం మాట్లాడారు. చూస్తుంటే ప్రశాంతమైన రాజధాని నిర్మాణం జరిగేటట్టు కనబడట్లేదని అభిప్రాయపడ్డారు. రాజధాని పరిధిలోనే ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో భూములు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదనలును రైతుల ఆమోదించి మార్కెట్ విలువ ప్రకారం చెల్లించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 9వ తేదీ ఉండవల్లిలో సీఆర్డిఏ అధికారులు గ్రామ సభ జరిపి రైతుల ప్రమేయం లేకుండా, చర్చించకుండా ఎటువంటి నిర్ణయం చేయబోమని చెప్పిన రెండు రోజులు గడవక ముందే పోలీసులను రంగంలో దింపి పచ్చని పంట పొలాలును పొక్లెయిన్లతో ధ్వంసం చేయటం దుర్మార్గమైన, సహించరాని చర్య అన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిన రైతుల పైన ఈ విధంగా వ్వహరించటం అంటే భవిష్యత్లో దీని తగిన మూల్యం చెల్లించక తప్పదు అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ దుందుడుకు చర్యలను ఉపసంహరించుకొని రైతు పక్షపాతిగా వారు కోరిన మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించి న్యాయం చేయాలని అజయ్కుమార్ డిమాండ్ చేశారు. తెనాలిరూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన విజయవాడ– చైన్నె రైలు మార్గంలోని చుండూరు– మోదుకూరు స్టేషన్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని జీఆర్పీ పోలీసులు శనివారం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎల్.సరస్వతి తెలిపారు. -
పెదకాకానిలో భారీ చోరీ
15 సవర్లు బంగారం అపహరణ పెదకాకాని: పెదకాకానిలో తాళాలు వేసి ఇళ్లే టార్గెట్గా దుండగులు చోరీలకు తెగబడుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పెదకాకాని గ్రామానికి చెందిన రాధారపు నాగేశ్వరరావు ఆర్టీసీలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 7వ తేదీన ఫిరంగిపురం మండలం వేములూరుపాడులో పెద్ద కుమార్తె బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకలకు నాగేశ్వరావు భార్య, చిన్న కుమార్తె వెళ్లారు. అదే రోజు డ్యూటీ ముగించుకుని నాగేశ్వరరావు కూడా బంధువుల వివాహానికి వెళ్లాడు. వివాహ కార్యక్రమం ముగించుకొని శనివారం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటం, బీరువా పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు భావించి, పెదకాకాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు క్లూస్టీంతో చేరుకున్నారు. దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 15 సవర్లు బంగారం, 40 తులాల వెండి, రూ.50 వేలు నగదు దోచుకెళ్లినట్లు బాధితులు తెలియజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. -
పల్లపట్ల ముద్దుబిడ్డ ఎస్.జానకి
● తీరప్రాంతానికి గర్వకారణమైన మహాగాయని ● పుట్టిన ఊర్లో విషాదఛాయలు రేపల్లె: తీరప్రాంతంలోని చిన్న గ్రామమైన పల్లపట్లకు అపారమైన గుర్తింపు తీసుకువచ్చిన గానకోకిల ఎస్.జానకి (శిష్టా శ్రీరామమూర్తి జానకి) శనివారం కన్నుమూయడంతో ఆ ప్రాంతలో విషాదఛాయలు అలముకున్నాయి. తమ ఊరిలో పుట్టిన గాయనిగా గర్వంగా చెప్పుకునే గ్రామస్తులు ఆమె మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిజాంపట్నం మండలం పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించిన జానకి చిన్నతనంలోనే తండ్రి ఉద్యోగరీత్యా కరీంనగర్కు వెళ్లిపోయారు. తండ్రి శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యుడిగా సేవలందించగా తల్లి శకుంతలమ్మ. చిన్న వయసులోనే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టినప్పటికీ ఆమె పుట్టిన నేలగా పల్లపట్లకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. గ్రామంలో పెద్దలు, వృద్ధులు ఆమె చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గర్వపడేవారు. ఆమె ఈ ప్రాంతంలో ఎక్కువకాలం నివసించకపోయినా పుట్టిన ఊరుగా పల్లపట్లకు వచ్చిన గౌరవం మాత్రం తగ్గలేదు. గ్రామస్తులు తమ ఊరి పేరును దేశవ్యాప్తంగా వినిపించిన మహాగాయని అంటూ ఆమెను స్మరించుకుంటున్నారు. తీరప్రాంతంలోని ప్రజలు కూడా ఆమె మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఈ నేలలో పుట్టిన గానకోకిలగా జానకిని స్మరించుకుంటున్నారు. చిన్న గ్రామం నుంచి ప్రపంచ సంగీత శిఖరాలకు ఎదిగిన ఆమె ప్రయాణం ఈ ప్రాంతానికి ఎప్పటికీ గర్వకారణంగా నిలిచిపోతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆమె గానం చిరస్థాయిగా మారినప్పటికీ ఆమె లేని లోటు మాత్రం ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. -
వినూత్న ప్రయోగం ‘గ్రహాంతర ప్రేమికుడు’
తెనాలి: మానవాళితో గ్రహాంతరవాసుల సహజీవనం కథాంశంతో మా–ఏపీ నుంచి నూతన దర్శకుడు స్టైల్ రవి రూపొందిస్తున్న ’గ్రహాంతర ప్రేమికుడు’ ఓటీటీ చిత్రం ఒక వినూత్న ప్రయోగమని మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్రాజా చెప్పారు. తెనాలిలోని సంస్థ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రహాంతర వాసులు... ఏలియన్స్ ఉనికిని నేచర్ అస్ట్రానమి జర్నల్ సైంటిస్టులు ధ్రువీకరించారని దిలీప్రాజా చెప్పారు. దర్శకుడు స్టైల్ రవి మాట్లాడుతూ శాస్త్రవేత్తలు వెల్లడించిన పరిశోధనల నుంచి స్ఫూర్తి పొందామని చెప్పారు. ఈ చిత్రంలో భవానీ కపూర్, రమ్య రాథోడ్, సముద్రాల శ్రీధర్ శర్మ, యశ్వంత్ చంద్ర, బెల్లంకొండ వెంకట్, తుమ్మా పాపారావు, మల్లెపాడు రమేష్, సైదులు నటిస్తున్నారని తెలిపారు. -
అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
● నిందితుడు రఫీ అరెస్టు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ వేటపాలెం: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హతమార్చాడు. చీరాల డీఎస్పీ ఎస్డీ మొయిన్ తన కార్యాలయంలో హత్యకు సంబంధించిన వివరాలను శనివారం వెల్లడించారు. దేశాయిపేట పంచాయతీ ముస్లిం కప్పల దొడ్డి కాలనీలో అన్నపురెడ్డి వీరమ్మ అలియాస్ షేక్ ఆశా భర్త షేక్ రఫీ నివాసం ఉంటున్నారు. వీరద్దరూ 13 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరమ్మకు ఇది రెండో వివాహం. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరమ్మ ఇంట్లో అగరబత్తీలు తయారు చేస్తుంటుంది. రఫీ ఆటో నడుపుతూ, మాంసం కొట్లో పనిచేస్తుంటాడు. కాగా రఫీ తరచూ మద్యం తాగి వచ్చి భార్యను అనుమానించి వివాహేతర సంబంధాలు అంటకడుతూ కొడుతూ ఉండేవాడు. రెండు నెలల క్రితం వీరమ్మ మొదటి భర్త ద్వారా పుట్టిన కూతురు అన్నపురెడ్డి ఉమా వెంకట లక్ష్మి తన నాయనమ్మ ఇంటి నుంచి తల్లి ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. కూతురిని హాస్టల్లో ఉంచి చదివిద్దామని భర్తతో చెప్పగా, అందుకు రఫీ అంగీకరించలేదు. ఈ విషయంపై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇటీవల భార్యను బాత్రూమ్లో ఉంచి కొట్టి, కూరగాయల కత్తితో చేతి మీద ఇష్టం వచ్చినట్లు దాడిచేశాడు. గురువారం తెల్లవారు జామున మళ్లీ భార్యతో గొడవ పడి ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్ చార్జింగ్ వైరు వీరమ్మ మెడకు బిగించి గట్టిగా లాగడంతో మృతి చెందింది. గమనించిన కూతురు ఉమా వెంకటలక్ష్మి వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. శనివారం నిందితుడు రఫీ సంతరావూరు రైల్వే గేటు వద్ద ఉన్న కోళ్ల ఫారం దగ్గర ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. తాను చేసిన నేరాన్ని నిందితుడు ఒప్పుకున్నాడు. సెల్ఫోన్ చార్జింగ్ వైర్ను స్వాధీనం చేసుకొని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పర్చినట్లు డీఎస్పీ వెల్లడించారు. రూరల్ సీఐ సుధాకర్ యాదవ్, ఎస్సై జనార్దన్ సమావేశంలో ఉన్నారు. -
కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియ
చీరాల: ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ నియోజకవర్గంలో కొనసాగుతోంది. గడువులోపు సర్వే పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు కూడా ఈ కార్యక్రమంపై దృష్టి సారించారు. రోజూ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. స్థానిక లోటుపాట్లు కారణంగా వందశాతం పూర్తి చేయడంపై బీఎల్ఓలు తలలు పట్టుకుంటున్నారు. చీరాల నియోజకవర్గంలో చీరాల, వేటపాలెం మండలాల్లో మొత్తం 218 పోలింగ్ బూత్లున్నాయి. ఓటర్లు 2,03,641 మంది కాగా... వీరిలో 1,43,533 మంది ఫారాలు డిజిటలైజేషన్ పూర్తి అయింది. శుక్రవారం నాటికి ఇది మొత్తం 70.48 శాతంగా నమోదైంది. గత నెల 15న మొదలైన సర్ ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడంతో నెమ్మదిగా సాగుతోంది. గడువు 14 వ తేదీ వరకే ఉంది. రెండు దఫాలుగా ఓటు వేసినా 2002 నాటి సర్ వివరాలను అందించాలనే నిబంధన ఉండటంతో ఎక్కువ మంది హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. అప్పటి వివరాలు లభించకపోవడం, వేరే ప్రాంతం నుంచి ఇక్కడకు వలస రావడం, స్థిరనివాసం లేని వారు ఓటు హక్కుకు దూరం కానున్నారు. మైనార్టీలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువ మంది ఉన్నారు. స్థానికంగా ఓటు హక్కు ఉన్నా, 2002 నాటి ఓటు గురించి సమస్యలు తలెత్తుతున్నాయి. తప్పని పరుగులు ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం నుంచి సమస్యలలో చిక్కుకుంది. మరో నాలుగు రోజులు మాత్రమే మిగలడంతో అధికారులపై ఒత్తిడి, ప్రజలపై భారం మోపుతున్నారు. సర్ కార్యక్రమంపై బీఎల్ఓలకు, బీఎల్ఏలకు అవగాహన కల్పించారేగానీ ప్రజల గురించి పట్టించుకోలేదు. గడువు దగ్గరపడటంతో ప్రత్యేక క్యాంపుల పేరిట హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. చీరాల మున్సిపాలిటీలో జయంతిపేట, పేరాల మసీదు సెంటర్, పేరాల్లోని ఏఆర్ఎం హైస్కూల్, బెస్తపాలెంలోని సచివాలయం, పాపరాజుతోటలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ శిబిరాలను ఏర్పాటు చేసి పూర్తి చేసిన ఫారాలను అందించేందుకు వీలు కల్పించారు. సర్ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను పరిశీలిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నారు. చీరాలలో 70.48 శాతం డిజిటలైజేషన్ -
ప్రపంచ జనాభా వారోత్సవాలను విజయవంతం చేయండి
గుంటూరు మెడికల్: ప్రపంచ జనాభా వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. ఈ నెల 11 నుంచి 18 వరకు నిర్వహించనున్న ప్రపంచ జనాభా వారోత్సవాల పోస్టర్ను శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. కుటుంబ ఆరోగ్యం, మాతృత్వ సంరక్షణ, కుటుంబ సంక్షేమంపై విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. మాతా, శిశు ఆరోగ్య పరిరక్షణ ముఖ్యమని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు, ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు తదితరులు పాల్గొన్నారు. నేడు జాతీయ లోక్ అదాలత్ గుంటూరు లీగల్: జాతీయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధిక సంస్థ ఆధ్వర్యంలో రెండవ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 11వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు గుంటూరు ప్రధాన జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని న్యాయాధికారులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. సివిల్ కేసులు, రాజీకి అనువైన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద పరిహార కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, బ్యాంకు రుణ వివాదాలు, కుటుంబ వివాదాలు, కార్మిక, విద్యుత్, రెవెన్యూ తదితర కేసులు, ప్రీ–లిటిగేషన్ వివాదాలను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. కక్షిదారులు, న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
కదం తొక్కిన అంగన్వాడీలు
సమస్యల పరిష్కారం కోసం భారీ ధర్నా బాపట్ల: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం దేశవ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీ ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె. ఝాన్సీ నేతృత్వం వహించారు. వేలాదిగా హాజరైన కార్యకర్తలతో కలెక్టరేట్ ముఖద్వారం కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి వచ్చిన వారు కలెక్టరేట్లోకి వెళ్లకుండా పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. బాబురావు మాట్లాడుతూ కనీసం కార్మికులుగా కూడా కార్యకర్తలను గుర్తించకపోవడం దారుణమని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. హామీ విస్మరించిన ఎమ్మెల్యే కౌలు రైతు సంఘం జిల్లా నాయకుడు సీహెచ్ గంగయ్య మాట్లాడుతూ గతంలో సమ్మె సందర్భంలో ప్రస్తుత బాపట్ల శాసనసభ్యుడు వేగేశన నరేంద్ర వర్మ శిబిరానికి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి సమస్యలు తక్షణమే తీరుస్తామని ఇచ్చిన హామీని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నెరవేర్చకపోవడం దారుణమన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో అంగన్వాడీలు ధర్నా చేస్తుంటే ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కనీసం స్పందించక పోవడం శోచనీయమన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. రేఖా ఎలిజబెత్ మాట్లాడుతూ పెరిగిన గ్యాస్ ఖర్చులు ఇవ్వకుండా యాప్ల పేరుతో వేధించడం తగదన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ఏఓ మల్లికార్జున రావుకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం. వసంతరావు, నాయకులు సీహెచ్ మణిలాల్, కె. శరత్, పి.మనోజ్, ఐద్వా జిల్లా కార్యదర్శి టి.సుభాషిణి, పంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు కె. శ్రీనివాసరావు, అంగన్వాడీ జిల్లా నాయకులు శైలశ్రీ, హేమ, బ్యూలా, ప్రమీల, నిర్మల జ్యోతి, రత్నకుమారి, మేరి, మణి, మల్లేశ్వరి, సుజాత, బసవమ్మ, ప్రమీల, అనిత పాల్గొన్నారు. -
‘సర్’పై అప్రమత్తంగా లేకుంటే ఓటు రద్దు
తెనాలి: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లేకుంటే ఓటు రద్దుతోపాటు పౌరసత్యాన్నీ కోల్పోయే ప్రమాదముందని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతవరపు ప్రసాద్ హెచ్చరించారు. తనను తాను ఓటరుగా నిరూపించుకోవాల్సిన బాధ్యతను ఎన్నికల కమిషన్ పౌరులపైనే బాధ్యతను ఉంచిందని చెప్పారు. దీనిపై పౌరులకు తగిన ముందస్తు అవగాహన కల్పించలేదని, సర్ నిబంధనలతో కొంతమందికి ఓటును నిరూపించుకోవటం కష్టసాధ్యమన్నారు. ఆదర్శనేత, ఆర్గానిక్ ఇంటలెక్చువల్ కనపర్తి ఏసురత్నం 70వ జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం స్థానిక కవిరాజు పార్కులోని వీజీకే భవన్లో ఏర్పాటైన సభకు ‘అరసం’ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కనపర్తి బెన్హర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సభలో కౌతవరపు ప్రసాద్ ‘ఎన్నికల జాబితా సవరణ చట్టం’పై కనపర్తి ఏసురత్నం స్మారకోపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ, స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) పేరిట ఎన్నికల కమిషన్ ఏటా ఓటరు జాబితా సవరణ చేస్తోందని గుర్తుచేశారు. చనిపోయి,బదిలీ, వలస వెళ్లినవారి ఓట్ల తొలగింపు, 18 ఏళ్లు నిండిన వారికి ఓటు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో బిహార్తో పలు రాష్ట్రాల్లో ‘సర్’ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్టు తెలిపారు ఇందులోని నిబంధనలతో ఆయా రాష్ట్రాల్లో లక్షలాదిమంది ఓటు హక్కును కోల్పోయినట్టు సోదాహరణంగా చెప్పారు. ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిచేసి ఇస్తేనే ఓటు హక్కు వచ్చినట్టు కాదనీ, అందులోని నిబంధనల ప్రకారం లేకుంటే కంప్యూటర్ తిరస్కరిస్తుందని చెప్పారు. ఆయా నిబంధనలనూ వివరించారు. కేవలం ముస్లింలు, మైనారిటీల ఓట్లు పోతాయనే అపోహ ఉందని, వాస్తవానికి ఇతర రాష్ట్రాల్లో ఎస్సీలు, వలస కార్మికుల ఓట్లు, ప్రధానంగా మహిళల ఓట్లు కూడా పోయాయని తెలిపారు. దీనిపై ఓటర్లకు అవగాహన కల్పించాలనీ, స్వచ్ఛంద సంస్థలు, అభ్యుదయవాదులు సమష్టిగా అందరికీ ఓటుహక్కు లభించేలా చూడాలని సూచించారు. అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, ప్రముఖ న్యాయవాదులు జి.శివనాగేశ్వరరావు, పీపీఆర్వీ సాగర్, అంబేడ్కర్ సేవాట్రస్ట్ కోశాధికారి బండికళ్ల సతీష్ మాట్లాడారు. కమ్యూనిస్టుగా, హేతువాదిగా, అంబేడ్కరైట్గా, ‘కార్డ్స్’ సంస్థ జాయింట్ డైరెక్టర్గా ప్రజాఉద్యమాలకు తోడ్పాటునందించిన కనపర్తి ఏసురత్నంను పరిపూర్ణ మానవుడుగా స్మరించుకున్నారు. అరసం, భిన్నస్వరాలు, అంబేడ్కర్ సేవాట్రస్ట్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతవరపు ప్రసాద్ -
దార్శనికుడు బొమ్మిడాల భానుమూర్తి
గుంటూరు రూరల్: బహుముఖ ప్రజ్ఞాశాలి, దార్శనికుడు బొమ్మిడాల గ్రూపు కంపెనీల చైర్మన్ దివంగత బొమ్మిడాల భానుమూర్తి అని నీతి అయోగ్ పూర్వ చైర్మన్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఇన్నర్ రింగ్రోడ్డులో శ్రీ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన బొమ్మిడాల భానుమూర్తి జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వట్టిచెరుకూరు మండలం సౌపాడు గ్రామంలో వ్యాపార కుటుంబంలో జన్మించిన బొమ్మిడాల భానుమూర్తి 19వ సంవత్సరంలోనే కంపెనీ బాధ్యతలు స్వీకరించారన్నారు. ఆనాటి నుంచి అంచలంచెలుగా దేశ విదేశాలలో వ్యాపార విస్తరణ చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించారని కొనియాడారు. భానుమూర్తి జయంతి సందర్భంగా కాకాని రోడ్డు ఆయన పొగాకు కంపెనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి, జ్యోతి వెలిగించి నివాళులర్పించారు. అనంతరం బొమ్మిడాల భానుమూర్తి జీవిత చరిత్రపై బీకే సుధాకర్రెడ్డి రాసిన బై ఎగ్జాంపుల్ ఎ లోన్ ది లైఫ్ అండ్ లెగసి ఆఫ్ బొమ్మిడాల భానుమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికవేత్తల కృషి ఎంతైనా అవసరమని చెప్పారు. కష్టించే మనస్తత్వం, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి, వ్యాపార దక్షత, నిజాయితీ, నాణ్యతతో కూడిన ఉత్పత్తుల తయారీ ఎగుమతుల ద్వారా బీబీఎం గ్రూపు సంస్థలు దేశ విదేశాలలో గొప్ప పేరు గడించాయన్నారు. బొమ్మిడాల భానుమూర్తి సుదీర్ఘ వ్యాపార ప్రయాణం వర్తమాన బహుశా పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకమని కొనియాడారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ భానుమూర్తి వ్యాపార రంగంలో సూర్యునిలా విరాజిల్లుతూ దశ దిశలా వెలుగులు పంచారని కీర్తించారు. భానుమూర్తి సోదరులు, ప్రముఖ పారిశ్రామికవేత్త బొమ్మిడాల శ్రీకష్ణమూర్తి మాట్లాడుతూ అందరికంటే చిన్నవాడిగా ఉన్న తనను అన్నగా ఆదరించి విద్యాబుద్ధులు, వ్యాపార దక్షతలు నేర్పి తన అభివృద్ధికి బాటలు వేశారని నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొమ్మిడాల భానుమూర్తి మెమోరియల్ అవార్డును డాక్టర్ ప్రద్యుత్ వాగ్రేకు ప్రదానం చేశారు. ప్రతి ఏడాది ఇచ్చే సీఎస్ఆర్ ఫౌండేషన్ పురస్కారాలను అందించారు. కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ప్రధానార్చకులు రమణదీక్షితులు, బీవీ శ్రీమన్నారాయణ, బీఎస్వీ కోటిరత్నం, బీవీ రాజా వరప్రసాద్, పీజీ అరుణ పద్మ శ్రీనివాస్, బొమ్మిడాల కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు, భానుమూర్తి గ్రూపు కంపెనీల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ పూర్వ చైర్మన్ బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం -
సమన్వయంతో ప్రజా సమస్యలను పరిష్కరించండి
వంద శాతం పూర్తి చేయండి బాపట్ల: సర్ ప్రక్రియ శనివారం సాయంత్రానికి వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీసీ హాల్లో సర్ ప్రక్రియపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేగంగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. శనివారం జిల్లాలో చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఆకస్మిక తనిఖీకి వస్తారని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి సర్ కార్యక్రమంలో సిబ్బంది నిమగ్నమై ఉండాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, డీఆర్ఓ జి. గంగాధర్ గౌడ్, చీరాల ఆర్డీఓ నరసింహారావు, ఎన్నికల పర్యవేక్షకుడు షఫి, తదితరులు పాల్గొన్నారు. -
ఈకేవైసీని వెంటనే పూర్తి చేసుకోవాలి
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ మేనేజర్ జి.వెంకట రమణారావు కొరిటెపాడు(గుంటూరు వెస్ట్): భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మార్గదర్శకాల మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులందరూ తమ ఈకేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) వివరాలను వెంటనే నవీకరించుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ మేనేజర్ జి. వెంకట రమణారావు శుక్రవారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాతాదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారా ఓటీపీ ఆధారిత కేవైసీ సులభంగా పూర్తి చేసుకోవచ్చన్నారు. సమీపంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సందర్శించి కూడా కేవైసీ వివరాలను నవీకరించుకోవచ్చు. కేవైసీని సకాలంలో పూర్తి చేయడం ద్వారా బ్యాంకింగ్ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి. అలాగే ఖాతాల భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఇంకా కేవైసీ పూర్తి చేయని ఖాతాదారులు ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు. బ్యాంకు శాఖ, కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చని తెలిపారు. ఖాతాదారుల సౌకర్యార్థం బ్యాంకు అన్ని శాఖల్లో ఈ–కేవైసీ ప్రక్రియను సులభతరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సంప్రదించాలని కోరారు. గుంటూరు ఎడ్యుకేషన్: టెట్కు సన్నద్ధమవుతున్న ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు ఎస్టీయూ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో సైకాలజీ అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబు, గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సైకాలజీ నిపుణుడు డాక్టర్ టి.సుగంధరావు పర్యవేక్షణలో సైకాలజీపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సు, శిక్షణా తరగతులను గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని ఉపాధ్యాయులు వినియోగించుకోవాలని కోరారు. శిక్షణా తరగతులకు హాజరయ్యే ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో తాళాలు వేసిన ఓ ఇంట్లో చోరీ చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న లక్ష్మీఅనూష పట్టణంలోని మన్నెంవారి బజార్, సీకే గ్రౌండ్స్ సమీపంలో కుటుంబ సభ్యులతో నివాసముంటోంది. తన సోదరికి ఆరోగ్యం బాగోకపోవడం వలన కుటుంబ సభ్యులతో కలసి గురువారం రాత్రి లక్ష్మీఅనూష మంగళగిరిలోని అక్కయ్య ఇంటికి వెళ్లింది. శుక్రవార ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగలకొట్టి ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించారు. బంగారు వస్తువులు, వెండి వస్తువులు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఘటనపై మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో లక్ష్మీ అనూష ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీమ్ను పిలిపించారు. ● మెడికల్ కళాశాల వద్ద స్టీల్ అపహరణ ● పట్టించుకోని అధికారులు బాపట్ల: ప్రజా సొమ్ముతో ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కళాశాల వద్ద అర్ధంతరంగా నిలిచిపోయిన పనులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. కోట్లాది రూపాయిలు వెచ్చించి 30 అడుగుల లోతు నుంచి వేసిన పిల్లర్లను కోసుకుని దొంగలు వెళుతున్నప్పటికీ రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలలో స్టీల్ను దొంగిలించిన ప్రదేశాన్ని కోన రఘుపతి శుక్రవారం పరిశీలించారు. పిల్లర్లు తొలగించటం వల్ల మళ్లీ నిర్మాణ పనులు చేపట్టాలంటే చాలా ఖర్చుతో కూడిన పనిగా ఆయన పేర్కొన్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ దృష్టికి తీసుకువెళ్లినట్లు కోన వివరించారు. మెడికల్ కళాశాల కోసం ఇప్పటి వరకు రూ.48 కోట్లు ఖర్చు చేశారని, ఆ మేరకు కాంట్రాక్టర్కు కూడా బిల్లులు చెల్లించినట్లు తెలిపారు. రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లిస్తే ఆ ధనం ప్రజా ధనంగా భావించి వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోన పేర్కొన్నారు. వైద్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని కోరారు. కనీసం రక్షణ చర్యలైనా తీసుకోవాలని సూచించారు. మెడికల్ కళాశాలను పరిశీలించిన వారిలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, యల్లావుల ఏడుకొండలు, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, పార్టీ నాయకులు కొక్కిలిగడ్డ చెంచయ్య, కోకి రాఘవరెడ్డి, నక్కా వీరారెడ్డి, గవిని కృష్ణమూర్తి, వడ్డిముక్కల డేవిడ్, చల్లా రామయ్య, పిన్నిబోయిన ప్రసాద్, గంగిశెట్టి రత్తయ్య, ఎం.రమేష్, నర్రావుల వెంకట్రావు, ఉరబిండి గోపినాథ్, ఆట్ల నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ఓటరు హెల్ప్ డెస్క్లు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లతోపాటు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలోనూ ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ డెస్క్ల వద్ద ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను నేరుగా స్వీకరించి, తదుపరి ప్రక్రియ కోసం సంబంధిత సూపర్వైజర్లకు అందజేస్తారని వివరించారు. నగర ప్రజలతోపాటు ప్రయాణికులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. తమ వార్డు కౌంటర్లను, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ హెల్ప్ డెస్క్లను సంప్రదించి సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేచవరంలో ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం నకరికల్లు: మండలంలోని దేచవరం గ్రామంలోని శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 4వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు పరుచూరి గిరీష్ మణిపవన్ ఆధ్వర్యంలో హోమాలు జరిపించారు. 108 కలశాలతో విశేష అభిషేకాలు చేశారు. స్వామి వారిని విశేషంగా అలంకరించారు. సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. రాత్రికి కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి కుటుంబ సమేతంగా వేడుకలలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నారు. మునగోడులో కార్డన్ సెర్చ్ అమరావతి: మండల పరిధిలోని మునగోడు గ్రామంలో శుక్రవారం వేకువజామున పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు ఆధ్వర్యంలో సుమారు వంద మందికిపైగా పోలీసులు ఈ కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు. రెండు ఎస్సీ కాలనీలతోపాటు గ్రామంలోని ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తనిఖీలలో 34 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సీజ్ చేసి అమరావతి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే గంజాయి నిర్మూలన, హెల్మెట్ ధారణ, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ తనిఖీలలో సీఐ వై.అచ్చయ్య, ఎస్ఐలు జె.శ్రీనివాసరావు, కె.రాజశేఖర్లతోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు రేపల్లె: నాణ్యమైన ఎరువులనే రైతులకు అందించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అద్దేపల్లి లక్ష్మి అన్నారు. పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలలో శుక్రవారం అధికారులతో కలసి ఆమె ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్, ఐఎఫ్ఎంఎస్ ద్వారా జరుగుతున్న ఎరువుల విక్రయాలు, రైతుల వివరాల నమోదు విధానం, బయోమెట్రిక్, ఓటీపీ ఆధారంగా ఎరువుల పంపిణీ ప్రక్రియ తదితరాలను పరిశీలించారు. నాణ్యత లోపించిన ఎరువులు, పురుగు మందుల విక్రయిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలలో సహాయ వ్యవసాయ సంచాలకుడు వి.రమేష్ బాబు, మండల వ్యవసాయాధికారి ఎ.మహేష్బాబు పాల్గొన్నారు. -
ప్రధాన సమాచార అధికారి పర్యటన
బాపట్ల: ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమాచార అధికారి సి.హెచ్. సునీల్ శుక్రవారం బాపట్ల కలెక్టరేట్కు చేరుకున్నారు. కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ముందుగా డీఆర్ఓ జి. గంగాధర్ గౌడ్ పూల మొక్క అందజేసి, స్వాగతం పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేశాక జిల్లా కలెక్టరేట్లో పలు విభాగాలను సందర్శించారు. అధికారులు నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పౌర సంబంధాల అధికారి, పరిపాలన అధికారి మల్లికార్జున రావు, డీఆర్డీఏ పీడీ బి. సింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ల్యాబోదిబో
పూర్తి నిర్లక్ష్యం.. వేటపాలెం: టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వ్యవసాయ శాఖ, పశు సంవర్థక, మత్స్యశాలకు సంబంధించిన ఎటువంటి పరీక్షలు చేయించు కోవాలన్నా జిల్లా కేంద్రాలకు వెల్లాల్సిన పరిస్థితి ఉండేది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేసి రైతు పక్షపాతి అని నిరూపించుకొన్నారు. 2023లో చీరాల నియోజవర్గ పరిధిలో వేటపాలెం మండలంలో రూ.1. 37 కోట్లతో నూతనంగా వైఎస్సార్ ఇంటి గ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. (ఈ అత్యాధునిక ప్రయోగశాల్లో వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖలకు సంబంధించిన అన్ని పరీక్షలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి.) రైతులకు అందు బాటులో ఉండే ఒక వ్యవసాయ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. అప్పటి టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 20 వ్యవసాయ ప్రయోగ శాలలు మాత్రమే ఉండేవి. వైఎస్సార్ సీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 147 వ్యవసాయ ప్రయోగ శాలలు ఏర్పాటు చేయడం విశేషం. బాపట్ల జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో ఆరు ప్రయోగ శాలలు ఏర్పాటు చేశారు. ఎన్నో సేవలు వ్యవసాయ శాఖకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్ష, రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయు ఉపకరణల నాణ్యత పరీక్ష, డీలర్స్ అమ్మే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలు, రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నాణ్యత పరీక్షలు, సాయిల్ టెస్టులు చేస్తారు. -
వడ్లమూడి పెదచెరువులో పెద్ద దోపిడీ
యథేచ్ఛగా సాగుతున్న మట్టి అక్రమ త్వకాలు చేబ్రోలు: ప్రభుత్వ సొమ్ముతో చెరువును అభివృద్ధి చేయాల్సింది పోయి.. చెరువులోని మట్టిని యంత్రాల సహాయంతో తవ్వకాలు చేసి విక్రయించుకొని జేబులు నింపుకుంటున్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి పెద్ద చెరువు వద్ద శుక్రవారం యంత్రాలు, వందలాది ట్రాక్టర్ల వాహనాలతో ఆ ప్రాంతం తిరునాళ్లను తలపించింది. చెరువుల అభివృద్ధి పేరిట అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మట్టిని తవ్వుకొని విక్రయించుకోవటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వడ్లమూడి గ్రామంలో ప్రభుత్వ నిబంధనలకు పాతర వేస్తూ గ్రామంలోని పెద్ద చెరువును ప్రదానమంత్రి కృషి సంచార యోజన (పీఎంకేఎస్వై) కింద అభివృద్ధి చేసేందుకు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను సద్వినియోగం చేసి చెరువును బాగు చేయాల్సింది పోయి, దీనిని తమకు అనుకూలంగా మార్చుకొని చెరువులోని మట్టిని కొల్లగొట్టి కోట్లాది రూపాయిల విలువ చేసే మట్టిని వడ్లమూడి పరిసర గ్రామాలకు రియల్ ఎస్టేట్ ప్లాటులకు, ఖాళీ ప్రదేశాలు, భవనాలకు ట్రాక్టర్లు, లారీలతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పచ్చనేతల జేబులు నింపుకుంటూ చెరువు గర్బాన్ని గుల్ల చేస్తున్నారు. వందలాది ట్రాక్టర్లతో మట్టి అక్రమ రవాణా జరుగుతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లు తిరుగుతుండటంతో చెరువు ప్రాంతం ఒక పెద్ద తిరునాళ్లను తలపిస్తుంది. కోట్లాది రూపాయిల ప్రభుత్వ సంపదను దోచుకుంటున్న నేతలపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజా పోరాటం తప్పదని స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడ్లమూడి పెద్ద చెరువులో యథేచ్ఛగా యంత్రాలతో తవ్వకాలు -
పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది గ్రీవెన్న్స్ డే నిర్వహించారు. జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలోని పోలీస్ సిబ్బంది నుంచి వినతులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. ప్రస్తుతం ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు, ఎక్కడికి బదిలీ, వ్యక్తిగత, ఉద్యోగోన్నతులు, సెలవులు, వైద్య అవసరాలపై సిబ్బందితో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ప్రతి వినతిని పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా పరిష్కారిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తొలి ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. జిల్లా ఏఆర్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను శుక్రవారం ఏఆర్ ఎస్ఐ పసుపులేటి చంద్రమౌళి మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వర్తించే ఆయన జిల్లాకు బదిలీయ్యారు. అనంతరం ఆయన ఏఆర్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. 2007 బ్యాచ్కు చెందిన ఆయన గతంలో పల్నాడు జిల్లా, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లాలో విధులు నిర్వర్తించారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): టీడీపీ నేత ముజీబ్ కార్యాలయంలో జరిగిన కుటుంబ పంచాయితీ నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బావ తమ్ముడిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం జరిగింది. పాతగుంటూరు సుద్దపల్లి డొంకకు చెందిన షేక్ షాజిదబేగంను గత నాలుగు సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామానికి చెందిన షేక్ రఫీకి ఇచ్చి వివాహం జరిపారు. అయితే రెండున్నర సంవత్సరాల క్రితం భార్యా భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అప్పటి పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పి కాపురానికి పంపించారు. మళ్లీ ఏడాది క్రితం ఇరువురి మధ్య వివాదం జరగడంతో మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదై ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ విషయం తెలిసిన షేక్ రఫీ బంధువు బాజి ముజీబ్ను సంప్రదించి తమ సమస్యను పరిష్కరించాలని కోరడంతో షాజిద కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆయన కార్యాలయంలో పంచాయితీ జరిగింది. రఫీ, అతని తమ్ముడు జహీర్, కుటుంబ సభ్యులు హాజరు కాగా, ఇటు పక్క నుంచి భార్య షాజిదబేగం, తమ్ముడు షౌకత్ అలి కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడకు వచ్చారు. ఇరువర్గాలతో చర్చించిన అనంతరం మరోసారి పంచాయితీ వాయిదా వేసిన నేపథ్యంలో రఫీ కుటుంబ సభ్యులు బయటకు వస్తుండగా, షాజిదాబేగం తమ్ముడు షేక్ షౌకత్ అలి అతనితోపాటు మరో ఇద్దరు కలిసి రఫీ తమ్ముడు ఇమ్రాన్పై కత్తితో దాడిచేసి గాయపరిచారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన షేక్ ఆసీఫ్ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఈమేరకు బాధితుడి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. కొత్తపేట పోలీసులు విచారణ చేస్తున్నారు. -
68 క్వింటాళ్ల రేషన్ బియ్యం పక్కదారి
డీలర్పై 6ఏ, క్రిమినల్ కేసులు నమోదు రేపల్లె: పట్టణంలోని రేషన్ దుకాణం నంబర్–2లో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమంగా విక్రయించిన వ్యవహారం సివిల్ సప్లైస్ శాఖ ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసింది. శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో సుమారు 68 క్వింటాళ్లు రేషన్ బియ్యం నిల్వల్లో లేకపోవడంతో అధికారులు విస్తుపోయారు. డీఎస్ఓ జగన్మోహన్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో రేషన్ డీలర్ కె.నాగబాబు స్టాక్ను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించారు. రికార్డుల్లో, దుకాణంలో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. తీవ్రంగా పరిగణించిన అధికారులు ఆ డీలర్పై 6ఏ కేసుతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా మళ్లించడం తీవ్ర నేరమని, ఇలాంటి వాటికి పాల్పడే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో డీటీ ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. -
బాపట్ల అభివృద్ధికి కోన ప్రభాకరరావు కృషి
బాపట్ల: బాపట్ల ప్రాంతాభివృద్ధికి మాజీ గవర్నర్ కోన ప్రభాకరరావు చేసిన కృషి భావితరాలకు ఆదర్శమని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. కోన ప్రభాకర్రావు జయంతి సందర్భంగా పాతబస్టాండ్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ... బాపట్ల ప్రాంతాన్ని విద్యాకేంద్రంగా, పరిశ్రమవాడగా ప్రభాకరరావు తీర్చిదిద్దారన్నారు. 1962 బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేసి, అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కృష్ణా డెల్టా నుంచి సాగు, తాగు నీటిని రప్పించేందుకు విశేష కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. బాపట్లలో మంచినీటి చెరువు ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పుడు ఏడాదికి రూ.రెండు కోట్లు మున్సిపాలిటీకి నీటి పన్ను కింద రావడానికి ప్రభాకరరావు కృషే కారణమని పేర్కొన్నారు. బాపట్లలో మరో చెరువు ఏర్పాటు చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకుపోయి రూ.28 కోట్లు మంజూరు చేయించటం జరిగిందని కోన చెప్పారు. ప్రతిపాదనల్లో కొద్దిపాటి జాప్యం వలనే పనులు ఆలస్యం కావడం, ఆ ప్రతిపాదనలు ముందుకు రాలేదన్నారు. నల్లమడ పరివాక ప్రాంతాన్ని అంతా కలిపి బాపట్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోన ప్రభాకరరావు కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. జగనన్న కాలనీలో వసతులు కల్పించండి ఆయనను ఆదర్శంగా తీసుకుని 2002లో రాజకీయాల్లోకి వచ్చిన తాను జిల్లా సాధించుకునేందుకు కృషి చేసినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని హంగులు ఉండేలా అధికార పార్టీ కృషి చేయాలని కోరారు. బాపట్ల మున్సిపాలిటీ గ్రేడ్ 2గా ఉండగా .. పలు గ్రామాలను కలిసి గ్రేడ్ 1గా తీర్చిదిద్దటం జరిగిందన్నారు. లక్ష జనాభా ఉండటం వల్లే నేడు అమృత్ పథకానికి ఎంపికై రూ.23 కోట్ల నిధులు వచ్చాయని కోన చెప్పారు. అప్పట్లో ఆ నిధులు వస్తే జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రతిపాదించామని చెప్పారు. జగనన్న కాలనీకి ఎన్టీఆర్ కాలనీ అని పేరు పెట్టుకున్నా ఫర్వాలేదని, కానీ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, యల్లావుల ఏడుకొండలు, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, పార్టీ నాయకులు కొక్కిలిగడ్డ చెంచయ్య, కోకి రాఘవరెడ్డి, నక్కా వీరారెడ్డి, గవిని కృష్ణమూర్తి, వడ్డిముక్కల డేవిడ్, చల్లా రామయ్య, పిన్నిబోయిన ప్రసాద్, గంగిశెట్టి రత్తయ్య, ఎం.రమేష్, నర్రావుల వెంకట్రావు, ఉరబిండి గోపీనాథ్, ఆట్ల నాగేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి -
రేపల్లెలో విద్యుత్ విజిలెన్స్ తనిఖీలు
రేపల్లె: విద్యుత్ చౌర్యానికి పాల్పడినా, దుర్వినియోగం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ విజిలెన్స్ ఎస్ఈ కేవీఎల్ఎన్ మూర్తి హెచ్చరించారు. పట్టణ, మండలంలోని పలు గ్రామాలలో విద్యుత్ మీటర్లను విద్యుత్శాఖ విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. తనిఖీల అనంతరం స్థానిక విద్యుత్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పట్టణ, మండలంలోని 3762 విద్యుత్ సర్వీసులను తనిఖీలు చేశామన్నారు. దీనిలో 240 మంది వినియోగదారులు అధిక లోడు వాడుతున్నట్లు గుర్తించామన్నారు. వీరికి రూ.8.72లక్షల పెనాల్టీలు విధించామన్నారు. ముగ్గురు వినియోగదారులు కేటగిరి మార్పు గమనించి రూ.20వేల పెనాల్టీ విధించామన్నారు. తనిఖీలలో జిల్లాలోని 130 మంది విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో ాపట్ల ఆపరేషన్ ఎస్ఈ ఆంజనేయులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఎం.భాస్కరరావు, భాస్కరరావు, రాజేష్, రేపల్లె డిప్యూటీ ఈఈ శ్యామ్సుధాకర్బాబు, ఏఈ ఎం.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అధికారులు రేపల్లె పట్టణంలో గురువారం విస్తృత స్థాయిలో ఇంటెన్సివ్ ఇనిస్పెక్షన్స్ నిర్వహించారు. ఈ తనిఖీలలో అనుమతించిన పరిమితికి మించి విద్యుత్ వినియోగిస్తున్న వందలాది కనెక్షన్లు బయటపడగా, భారీ మొత్తంలో జరిమానాలు విధించారు.


