Bapatla District Latest News
-
న్యూడ్ కాల్స్ కేసులో ముగ్గురు అరెస్ట్
తెనాలిరూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన న్యూడ్ కాల్స్ దందా కేసులో ఎట్టకేలకు నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులలో తల్లి, కొడుకులు కూడా ఉండటం విశేషం. స్థానిక త్రీ టౌన్ పోలీసుస్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక పాండురంగపేట జనావాసాల మధ్య ఓ ఇంట్లో మహిళలు న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ సొమ్ము చేసుకుంటున్నారన్న సమాచారంతో ఈనెల 16న త్రీ టౌన్ పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో బోడపాటి అనూరాధ, మహమ్మద్ షహనాజ్లను అదుపులోకి తీసుకున్నారు. చుట్టుపక్కల వారిని విచారించారు. ఆన్లైన్ వేదికగా ఓ యాప్లో ‘స్ట్రిప్ టాక్’ పేరిట ఉన్న పోర్టల్లో ‘స్వీటీ క్యూటీ’ పేరుతో లాగిన్ అయ్యి ఇరువురు మహిళలు ముఖానికి మాస్క్తో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ, అవతలి వ్యక్తుల నుంచి నగదు అందిన సమాచారంతో వారి కోరిక మేరకు న్యూడ్గా ఫోన్లో మాట్లాడుతున్నారు. యాప్ నిర్వాహకులు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొంత నగదును మహిళల ఖాతాకు జమ చేస్తున్నారు. రెండు నెలల కిందట అద్దెకు తీసుకొని ఉంటున్న ఇంటిలో ఈ తతంగం నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో ఈ కేసులో కీలకంగా వ్యవహరించి, యాప్ డౌన్లోడ్ చేయడంలో సహకరించిన అనూరాధ కుమారుడు హేమంత్ సాయి పరారయ్యాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. వదంతులు నమ్మవద్దుఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా అనేక వదంతులు విస్తరించాయని, వందలాది మంది మహిళలు ఇలా అక్రమంగా సంపాదిస్తున్నారని వచ్చిన వదంతుల్లో వాస్తవం లేదని డీఎస్పీ చెప్పారు. అనూరాధ కుటుంబం గతంలో ఉపాధి కోసం విజయవాడ ఈడ్పుగల్లుకు వెళ్లగా అక్కడ తన స్నేహితురాలు విజయలక్ష్మి, ఆమె కుమారుడు తులసి ద్వారా ఈ యాప్ వివరాలు తెలుసుకుందని చెప్పారు. అనూరాధ, ఆమె కుమారుడు హేమంత్ సాయి యాప్ వినియోగం అక్కడే నేర్చుకున్నారని, ఇంజినీరింగ్ చదువుతూ మధ్యలోనే చదువు ఆపేసి హేమంత్సాయి ప్రేమవివాహం చేసుకున్నాడని తెలిపారు. తల్లి, భార్యతో కలసి విజయవాడలో ఉంటుండగా, ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారం నచ్చక కోడలు విభేదించి తెనాలి వచ్చేసిందని తెలిపారు. హేమంత్ సాయి వచ్చి భార్యతో కలిసి తెనాలిలో ఉంటున్నాడు. కొద్ది రోజులు వ్యవధిలోనే అనూరాధ కూడా ఒంటరిగా ఉండలేక తిరిగి తెనాలి చేరిందని చెప్పారు. వేరుగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న అనూరాధకు షహనాజ్ పరిచయం కావడంతో ఇరువురు కలిసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అనూరాధ తిరిగి తెనాలి చేరటం, అక్రమార్జనకు పాల్పడటం ఇష్టంలేని కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని డీఎస్పీ చెప్పారు. ఈ కేసులో విజయవాడ వ్యక్తుల ప్రమేయం, యాప్ వివరాలు, దానిలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులకు నివేదించి, తదుపరి సాంకేతిక సహకారంతో విచారణ కొనసాగిస్తామ చెప్పారు. సోషల్ మీడియా ప్రచారాలలో వాస్తవం లేదని, ప్రధాన నిందితుడు పరారీలో ఉండటంతో జాప్యం జరిగినట్లు చెప్పారు. -
కొరత కృత్రిమం.. అంతా అక్రమం
నరసరావుపేట టౌన్: జిల్లాలో గ్యాస్ కొరత పేరుతో నెలకొన్న పరిస్థితులు సాధారణ సరఫరాకు అంతరాయం కాదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు హోటళ్లు, టీ స్టాళ్లు, చిన్న వ్యాపార సంస్థలు గ్యాస్ కొరతతో మూతపడుతున్నాయి. మరో వైపు అదే గ్యాస్ అధిక ధరల్లో బ్లాక్లో సులభంగా లభించటం ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతోంది. ఇది కృత్రిమంగా సృష్టించిన సంక్షోభం అనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో పెరుగుతోంది. యుద్ధ పరిస్థితులను బూచిగా చూపి కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరతను సృష్టించాయన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సరఫరాలో అంతరాయం ఉందన్న ప్రచారంతో బహిరంగ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్న కొంత మంది గ్యాస్ ఏజెన్సీ వారు దళారులతో కలిసి బ్లాక్ మార్కెట్కు తెరతీశారు. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.1000 నుంచి రూ.1500 వరకు అదనంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ భారీ ధరలతో హోటళ్లు, టీ స్టాళ్లు, చిన్న వ్యాపార సంస్థలు తీవ్ర ఆర్థిక భారాన్ని మోస్తున్నాయి. కొందరు వ్యాపారాలను నెట్టుకొస్తుండుగా, మరి కొందరు దుకాణాలను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. వివాహాల సీజన్ కావటంతో క్యాటరింగ్ రంగానికి గ్యాస్ సిలిండర్లు అత్యవసరం. దీంతో అధిక ధరలైనా చెల్లించి సిలిండర్లు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. వారి డిమాండ్ను ఆసరా చేసుకున్న అక్రమార్కులు భారీగా సిలిండర్లను నిల్వ చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఏడున్నర వేలకుపైగా దుకాణాలు మూసివేత గ్యాస్ కొరతతో జిల్లాలో వేల వ్యాపార సంస్థలు ఇప్పటికే మూతబడ్డాయి. సరిపడా గ్యాస్ అందుబాటులో లేకపోవటంతో కొందరు ప్రత్యామ్నాయంగా కట్టెలు, డీజిల్, ఎలక్ట్రిక్ పొయ్యిలను వినియోగిస్తున్నారు. అయితే వినియోగం పెరగటంతో కట్టెల రేటు పెరిగింది. దీంతో వ్యాపారాల్లో నష్టాలు చవిచూసి నిర్వాహకులు దుకాణం తెరిచేందుకు సాహసించడం లేదు. జిల్లాలో మొత్తం 10,300 హోటళ్లు ఉండగా అందులో 2,600 వరకు మూతపడ్డాయి. అదే విధంగా 25,500 టీస్టాళ్లు ఉండగా అందులో 5,000 వరకు మూసేశారు. భోజన హోటళ్లు, ప్రైవేటు వసతి గృహాల నిర్వాహకులు గ్యాస్ అందుబాటులో లేకపోవటంతో పూర్తిగా కట్టెల పొయ్యిపైనే వంటకాలు చేస్తూ మెనూను కుదించారు. అక్రమ ఏజెన్సీలపై చర్యలేవి? ఇటీవల నరసరావుపేట పట్టణంలో భారీగా కమర్షియల్ సిలిండర్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టిఫిన్ బండి యజమాని అక్రమంగా శ్రీనివాసనగర్లోని తన ఇంటిలో వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్లను నిల్వ ఉంచాడనే సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 18 సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అధికారులు లోతైన విచారణ జరపకపోవటం, నామమాత్రపు కేసు పెట్టి చేతులు దులుపుకోవటం విమర్శలకు తావిస్తోంది. సత్తెనపల్లి రోడ్డులో క్యాటరింగ్ నిర్వాహకుడి కార్కానాపై పౌరసరఫరాల శాఖ అధికారులు 20 రోజుల క్రితం దాడులు నిర్వహించారు. దాడుల్లో 25 కమర్షియల్ సిలిండర్లను గుర్తించారు. సిలిండర్లు అన్ని సీజ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తామని మొదట అధికారులు నానా హడావుడి చేశారు. చివరకు నిర్వాహకుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకొని కేసును నీరుగార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు కొన్ని టీస్టాళ్ల వద్దకు తనిఖీలకు వెళ్లిన అధికారులు గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తుండటాన్ని గుర్తించి వారి వద్ద నుంచి బెదిరించి నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సర్కారు డొంక తిరుగుడు
గోవాడ(తెనాలి): ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తర్వాత అంత వైభవంగా మహాశివరాత్రి తిరునాళ్ల జరిగే ప్రసిద్ధ శైవక్షేత్రం గోవాడలోని శ్రీబాలకోటేశ్వరస్వామి దేవస్థానం. అక్కడ ఏటా తిరునాళ్ల జరిగే డొంక రోడ్డు ప్రదేశాన్ని రాష్ట్రప్రభుత్వం ఎంఎఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి కట్టబెట్టటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గ్రామ పంచాయతీ అభ్యంతరం చెప్పినా, ప్రజలు అభ్యర్థించినా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో అధికారులు ఆ స్థలాన్ని ఏపీఐఐసీకి అప్పగించారు. ఆగమేఘాలపై అక్కడ నిర్మాణ పనులనూ ఆరంభించారు. ప్రజల అభ్యంతరాలు/ఆందోళనల నేపథ్యంలో తాత్కాలికంగా పనులను నిలుపుదల చేశారు. నిర్మాణ సామగ్రిని మాత్రం తొలగించలేదు. నిబంధనలకు విరుద్ధంగా డొంకరోడ్డును ఎంఎస్ఎంఈ పార్కుకు కేటాయించటం, అధికారుల అత్యుత్సాహంపై విచారణ చేయాలని స్థానికులు శనివారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఉత్సవాలకు ఎంతో కీలకం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలంలో గోవాడ గ్రామం ఉంది. అక్కడి శ్రీబాలకోటేశ్వరస్వామి దేవస్థానానికి విశేష చారిత్రక ప్రాముఖ్యత ఉంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏటా అక్కడ 15 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. అందుకోసం పలు అన్నదాన సత్రాలు వెలిశాయి. చివరి మూడురోజులు తిరునాళ్ల మరింత ప్రత్యేకమైంది. గోవాడ–కావూరు డొంకరోడ్డు వెంట జరిగే మూడు రోజుల తిరునాళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మూడు లక్షల మంది వస్తారని అంచనా ఉంది. తిరునాళ్ల ఏర్పాట్లపై రేపల్లె ఆర్డీఓ అధ్యక్షతన కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. తిరునాళ్లకు దాదాపు 500 దుకాణాలు ఏర్పాటు అవుతాయి. డొంకరోడ్డు సరిపోక స్టాల్స్ నిర్వాహకులు సమీప రైతుల స్థలాల్లోనూ సర్దుకుంటారు. ఏడురోజుల పశుప్రదర్శన కూడా మరో ఆకర్షణ. వివిధ ప్రాంతాల నుంచి తిరునాళ్ల స్పెషల్ బస్సులు ఆర్టీసీ నడుపుతుంది. ఇంతటి కీలకమైన డొంకరోడ్డు గోవాడ, చెరుకుపల్లి మండల గ్రామం కావూరు మధ్య ఉంది. గోవాడ పరిధిలో సర్వే నెం.605/ఏ, 605/బీ, 606, 758/ఏ, 758/బీ, 758/సీ లోని దాదాపు 4 కి.మీ.వరకు 40–80 అడుగుల వెడల్పుతో ఉండే ఈ డొంకరోడ్డుకు ఇరువైపులా పంటకాల్వలు ఉన్నాయి. రోడ్డు దిగువన మంచినీటి పథకం పైప్లైన్ కూడా ఉందని చెబుతున్నారు. గోవాడ, కావూరే కాకుండా, పరిసర గ్రామాలకు చెందిన రైతులు ఏడాదంతా వ్యవసాయ పనులకు ఈ డొంక రోడ్డును ఎక్కువగా వినియోగిస్తుంటారు. అధికారుల అత్యుత్సాహం గోవాడ డొంకరోడ్డు భూమిలో కొంత భాగాన్ని 1943లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం సైనికుడికి కేటాయించింది. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరం రావటంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అదే డొంక రోడ్డు ప్రాంతాన్ని పేదల ఇళ్ల స్థలాలకు ప్రతిపాదించినా తర్వాత ఆ ప్రాంత ప్రాముఖ్యతను గుర్తించి, ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం, మొత్తం డొంక రోడ్డు ప్రదేశాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల స్థాపనకు అవసరమైన ఎంఎస్ఎంఈ పార్కుకు కేటాయించింది. డొంకరోడ్డును ఇతర ఏ అవసరాలకు కేటాయించరాదనే నిబంధనతో భూమి స్వభావాన్ని కూడా మార్చి బంజరు భూమిగా చూపించారని అధికారులపై ఆరోపణలున్నాయి. అంతేకాకుండా గతేడాది గోవాడ పంచాయతీ ఎంఎస్ఎంఈ పార్కుకు అనుమతిస్తూ తీర్మానించినా, మరికొద్ది నెలల్లోనే ఆ తీర్మానాన్ని రద్దు చేసుకుంది. అయినప్పటికీ అమృతలూరు తహసీల్దారు పంచాయతీ తీర్మానాన్ని పట్టించుకోకుండా ఏపీఐఐసీకి అప్పగించటం, సంబంధిత కాంట్రాక్టు సంస్థ పనులను ఆరంభించారు. దీనిపై ఏపీఐఐసీ జోనల్ మేనేజరు అత్యుత్సాహం చూపారని, కాంట్రాక్టు సంస్థ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూడా స్థానికులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి జిల్లా కలెక్టరుతో మాట్లాడినట్టు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా లేఖ ఇచ్చారని చెబుతున్నారు. అయినా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా లేదంటున్నారు. -
మహంకాళి ఆలయ అభివృద్ధికి రూ.1.50 కోట్లు విరాళం
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధికి చిలువూరు గ్రామానికి చెందిన రంగంశెట్టి జగదీష్ రూ.కోటీ యాభై లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు అంగీకారపత్రాన్ని ఆలయ ఈవో కె.సునీల్కుమార్, ధర్మకర్త రంగప్రసాద్కి అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అనివేటి మండపం, ప్రాకారం, పడమర వైపు రాజగోపురం నిర్మాణానికి సీజీఎఫ్ ద్వారా రూ.ఆరు కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఈవో తెలిపారు. తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రిపై విఘ్న విమోచక హనుమంతుని మండలాభిషేక మహోత్సవాలు సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో మహోత్సవాలు ఈనెల 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలిరోజు ఉదయం 9 గంటలకు విఘ్న విమోచక హనుమంతునికి 108 కలశాలతో అభిషేక మహోత్సవం, విశేష అర్చనలు, అనంతరం తీర్థ ప్రసాదగోష్ఠి, సాయంత్రం 7 గంటలకు పల్లకీ సేవ, హనుమ అష్టోత్తర శతనామార్చన, హనుమాన్ చాలీసా పారాయణ, తీర్థ ప్రసాదగోష్ఠి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు తిరుమంజన సేవ, విశేష అలంకరణ, అష్టోత్తర శతనామార్చన, రామానుజ సూత్తందాది, సాయంత్రం తిరువీధి ఉత్సవం, జగదాచార్యులు, భగవద్రామానుజులు అనుగ్రహించిన గద్యత్రయ పారాయణ, అనంతరం తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించబడతాయని, భక్తులు పైకార్యక్రమాలలో పాల్గొని హనుమంతుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. వేటపాలెం: అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో వేటపాలేనికి చెందిన గాత్రం ఉమామహేశ్వరరావు ట్రిపుల్ జంప్ఽ కాంపిటిషన్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు బ్యాంకాక్ దేశంలో థాయిలాండ్ అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్ పోటీలు జరిగాయి. 49 ప్లస్ వయస్సులో ఉమామహేశ్వరరావు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో తన సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన ఉమాను స్నేహితులు అభినందించారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.7,55,030 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం వెల్లడించారు. స్వామివారి సేవా టికెట్ల ద్వారా రూ.3,86,53, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,26,665, స్వామి వారికి డొనేషన్లు రూపంలో రూ.1,73,217, కల్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. 28,800, దర్శనం ద్వారా రూ.33,900 కలిపి మొత్తం రూ.7,55,030 ఆదాయం వచ్చిందన్నారు. -
ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
రేపల్లె: ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, ఆక్రమణల నివారణే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ భూములను, నిరుపయోగంలో ఉన్న ప్రభుత్వ భవనాలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... భూముల స్థితిగతులు, రికార్డులు, భౌగోళిక పరిమితులను సమీక్షించారు. ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నాయా అనే అంశంపై అధికారుల నుంచి ఆరా తీశారు. భూముల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, అవసరమైన చోట్ల సర్వేలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్తులను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఈ తనిఖీ చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూముల పరిరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆస్తులను సక్రమంగా వినియోగించేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఆర్ఐ రాంబాబు, సర్వేయర్లు, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
అంకమ్మకు జలబిందెలతో అభిషేకం
రాజుపాలెం: మండల కేంద్రంలోని రాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మ వారి ఆలయ జీర్ణోద్ధరణ, వాయు ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ఆదివారం అధిక సంఖ్యలో మహిళా భక్తులు జలబిందెలతో తరలివచ్చి అభిషేకం నిర్వహించారు. ముందుగా వెయ్యిన్నొక్క మంది మహిళలు జలబిందెలు తలపై పెట్టుకుని బ్యాండ్మేళాలతో అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి జలబిందెలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన అర్చకుడు అరవపల్లి ఫణికేశవ శర్మ తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ కమిటీ వారు భక్తులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. -
తీరంలో ఇసుక దిబ్బల తొలగింపుపై ఫిర్యాదు
వేటపాలెం: రామాపురం సముద్రతీరంలో ఇసుక దిబ్బల తొలగింపుతో తమ జీవనాధారానికి భంగం కలుగుతుందని మత్స్యకారులు ఆదివారం జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ అధికారులకు, ముఖ్యమంత్రికి ఆన్లైన్లో... కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఈ– మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. రామాపురం పరిధిలో సముద్ర అలల నుంచి 200 మీటర్లలో నో డెవలప్మెంట్ జోన్ పరిధిలో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించడాన్ని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నో డెవలప్మెంట్ జోన్ ప్రధానంగా తీర ప్రాంత పర్యావరణాన్ని రక్షించడం, తుపాన్లు, సునామీల నుంచి కాపాడటానికి ఇసుక తిన్నలు ఉంటాయి. అలాగే మత్స్యకారులు జీవనాధారాన్ని పరిరక్షించకుండా అందుకు భిన్నంగా అక్రమంగా రిసార్ట్స్ నిర్మాణం, రియల్ ఎస్టేట్ వెంచర్ల ఏర్పాటు, ఇసుక తిన్నెలు తొలగించడం వల్ల తీర ప్రాంత పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తీరం వెంట మడ అడవులను పెంచడానికి మత్స్యకారులను ప్రోత్సహించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం రాష్ట్ర తీరప్రాంత నిర్వహణ అథారిటీ అధికారులు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నో డెవలప్మెంట్ జోన్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను నిలిపివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదుల్లో వారు పేర్కొన్నారు. అడ్వెంచర్ స్పోర్ట్స్కు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. పోలీసులు బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన మత్స్యకారులు -
గరికపాటికి లీగల్ నోటీసు
తెనాలి: ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు వ్యక్తిగతంగా తనకు ఇష్టమేనని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చులకనగా చేసి మాట్లాడటం సరి కాదని హైకోర్టు న్యాయవాదులు పెరికల డేనియల్, వేములపల్లి శ్రీనివాస్ అన్నారు. పట్టణ అయితానగర్లో ఆదివారం తన కార్యాలయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం డేనియల్, శ్రీనివాస్ మాట్లాడారు. గరికపాటి నరసింహారావు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెనాలి క్లయింట్ బొప్పూరి పవన్కుమార్ అభ్యర్థనతో తాము లీగల్ నోటీసు పంపినట్టు వారు తెలిపారు. తన న్యాయవాది ద్వారా ఆయన తిరుగు సమాధానం ఇచ్చారని కూడా చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం వాక్స్వాతంత్య్రానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పారు. వీరితో మరో న్యాయవాది గజ్జ శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. ఈతకు వెళ్లి యువకుడు మృతి పట్నంబజారు: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. పాత గుంటూరు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... సీతానగర్కు చెందిన పొదుకూరి లోకేష్ (19) అదే ప్రాంతంలోని కాళికామాత తల్లి ఆలయంలో సేవలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో మణిపురం ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఒక ఖాళీ స్థలంలో ఉన్న నీళ్లకుంట వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో లోకేష్తో కలిసి మరో ఇద్దరు ఈతకు దిగారు. నీటి కుంట లోతు అంచనా వేయలేని లోకేష్ లోపలకు దిగిన క్రమంలో ఈత కొట్టలేక అందులో కూరుకుపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్ని మాపక శాఖ రెస్క్యూ టీం సిబ్బంది కోటేశ్వరరావు మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పాత గుంటూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మార్టూరులో రాష్ట్రస్థాయి నాటిక పోటీలు
మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో ఈనెల 24, 25, 26 తేదీల్లో ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు శ్రీకారం కళాపరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు తెలిపారు. స్థానిక ఎఫర్ట్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సృజనాత్మక సంస్కృతి సమితి ఆధ్వర్యంలో మార్టూరు రోటరీ క్లబ్, శ్రీకారం కళాపరిషత్లు సంయుక్తంగా 16వ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు స్థానిక మద్ది సత్యనారాయణ కంపెనీ ఆవరణలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ● మొదటి రోజైన 24వ తేదీ శుక్రవారం రాత్రి 7:30 కు అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి ‘దేవుణ్ణి చూశా’ నాటిక, రాత్రి 9:30 నిమిషాలకు కళానికేతన్ వీరన్నపాలెం వారి ‘దీపం కింద చీకటి’ నాటిక, రాత్రి 10:30 నిమిషాలకు విజయవాడ సాంస్కృతిక సమితి వారి ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటికలు ప్రదర్శిస్తారు. ● రెండో రోజు శనివారం రాత్రి 7:30కు యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి ‘ధర్మో రక్షతి’ నాటిక, రాత్రి 9. 30 నిమిషాలకు శ్రీకృష్ణ ఆర్ట్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ గుడివాడ వారి ‘ద్వార బంధాల చంద్రయ్య నాయుడు’ నాటిక, రాత్రి 10 గంటల 30 నిమిషాలకు హర్ష క్రియేషన్స్ విజయవాడ వారి ‘చెరిగిపోని చిరునామా’ నాటికలు ప్రదర్శిస్తారు. ● చివరి రోజు ఆదివారం రాత్రి 7:30 కు అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సుహాన నాటిక రాత్రి 9:30కు గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక రాత్రి 11. 30 నిమిషాలకు బీవీకే క్రియేషన్స్ కాకినాడ వారి ‘కన్నీటికి విలువెంత’ నాటికలు అనంతరం బహుమతి ప్రదానం ఉంటుందని సాంబశివరావు తెలిపారు. మార్టూరు పరిసర గ్రామాల ప్రేక్షకులు కార్యక్రమానికి విరివిగా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎఫర్ట్ డైరెక్టర్ జేవీ మోహన్రావు, మార్టూరు రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.ఏప్రిల్, 24, 25, 26 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు -
జేఎన్టీయూఎన్ కాకాని క్యాంపస్కు అటానమస్ హోదా
నరసరావుపేటరూరల్: జేఎన్టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్కు అటానమస్ హోదా కల్పించనున్నట్టు జేఎన్టీయూకె వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. కళాశాల వార్షికోత్సవ, క్రీడోత్సవాలు శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్, ఎఫెక్ట్రానిక్స్ సంస్థ సీఈఓ దాసరి రామకృష్ణ హాజరయ్యారు. సీఎస్ఆర్కె ప్రసాద్ మాట్లాడుతూ జేఎన్టీయూఎన్ కాకాని క్యాంపస్లో రాబోవు విద్యా సంవత్సరం నుంచి పీజీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యా, క్రీడా విభాగాల్లో ప్రతిభ కనభర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వైఎస్ కిషోర్బాబు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీపీ రాజు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు రూరల్: 2018 జూలై నెలనుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఆర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఇంజినీరింగ్ విభాగం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది, ఇంజనీరింగ్ విభాగం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాజు మాట్లాడుతూ సంఘం బలోపేతం, పెన్షనర్ల సంక్షేమం, ప్రభుత్వంతో సానుకూల సమన్వయం వంటి విషయాలను వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూర్మరావు సంఘం కార్యకలాపాలను వివరించారు. -
లివర్ క్యాన్సర్కు దారితీస్తాయి...
లివర్ క్యాన్సర్లు రావటానికి హెపటైటిస్– బీ, హెపటైటిస్–సీ వ్యాధులే కారణం. కామెర్ల వ్యాధి(జాండీస్) సోకిన వారు తప్పనిసరిగా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో హెపటైటిస్ వైరస్ ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే క్రానిక్ హెపటైటిస్కు దారి తీసి కొన్నేళ్ల తరువాత లివర్ దెబ్బతినటానికి కారణమవుతుంది. దీని వల్ల లివర్ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్, లివర్ సిరోసిస్ వస్తుంది. –డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణురాలు, గుంటూరు -
మానవ సంబంధాలపై మొబైల్స్ తీవ్ర ప్రభావం
నగరంపాలెం: మొబైల్ ఫోన్లల్లో అవసరం లేనివి తొలగించినట్లు(డెలిట్) నేడు బంధాలు– మానవ సంబంధాలు తొలగించుకునే అంశాలుగా మారిపోతున్నాయని అభ్యుదయ రచయితల సంఘం(అరసం) జాతీయ అధ్యక్షులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మురుగుడు శ్రీహరి రచించిన శ్రీహరి సిత్రాలు ఛాయా చిత్ర కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆదివారం నిర్వహించారు. పుస్తకాన్ని పెనుగొండ ఆవిష్కరించారు. గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ సౌజన్యంతో మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ నిర్వహణలో బృందావన్గార్డెన్న్స్ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆడిటోరియంలో ఆలయ సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. సభకు డాక్టర్ పట్టాభి కళాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. పెనుగొండ మాట్లాడుతూ వందేళ్ల అనుబంధాలను క్షణాల్లో తెంచుకుంటున్న తీరుపై ఈ పుస్తక రచయిత తెగిపోతున్న బంధాలు పేరుతో కవిత్వం రాయడంపై హర్షం వ్యక్తం చేశారు. సభకు అధ్యక్షత వహించిన తూములూరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సిరా చుక్క మౌనం వహిస్తే, సారా చుక్క రాజ్యమేలుతుందని అన్నారు. కవులు మౌనం వీడాలని, సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కవిత్వం రాయాలని ఆకాంక్షించారు. మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ మాట్లాడుతూ కవిత్వంలో ఎన్నో కొత్త ప్రక్రియలు రంగప్రవేశం చేస్తున్నాయని అన్నారు. ఛాయాచిత్ర కవిత్వం అనే కొత్త ప్రక్రియతో కవిత్వమై పుస్తకంగా మనముందుకొచ్చిన శ్రీహరిని ప్రోత్సహించడం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు. పుస్తకాన్ని సుప్రసిద్ధ కవి కోసూరి రవికుమార్ పరిచయం చేశారు. సభలో మోదుగుల రవికృష్ణ, ఆధ్యాత్మిక రచయిత పచ్చిపులుసు సూర్యనారాయణ, బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు బండికల్లు జమదగ్ని, గుళ్లపల్లి రాఘవేంద్రరావు, కావూరి రవికుమార్ పాల్గొన్నారు. అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ -
బేస్బాల్ పోటీల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
ఇంకొల్లు(చినగంజాం): రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీల్లో రాణిస్తే క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ జాయింట్ కార్యదర్శి వేమారెడ్డి అన్నారు. మండలంలోని డీవీఆర్ సైనిక్ స్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం బాపట్ల జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల బేస్బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర బేస్ బాల్ జాయింట్ కార్యదర్శి వేమారెడ్డితో పాటు డీవీఆర్ సైనిక్ స్కూల్ డైరెక్టర్ గోరంట్ల సుబ్బారావులు హాజరై జిల్లా జట్టు ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ జిల్లా జట్టులో ఎంపికై న క్రీడాకారులు మే నెల 5 నుంచి 7 వ తేదీ వరకు కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల జెడ్పీ హైస్కూల్లో నిర్వహించే సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా బేస్ బాల్ కార్యదర్శి కే శ్రీను, అజయ్ కుమార్, నరేష్, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బేస్బాల్ ఎంపిక పోటీలు -
మహా కుంభాభిషేకం మహా శక్తి సంపన్నం
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడలో ప్రసిద్ధ క్షేత్రమైన గంగాపార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న మహా కుంభాభిషేకం 4వ రోజైన ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. పెనుగొండలోని శ్రీ విద్యాపీఠం పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) ముఖ్య అతిథిగా హాజరై అనుగ్రహ భాషణం చేశారు. బాలస్వామి మాట్లాడుతూ మహా కుంభాభిషేకంలో కుంభ శాంతి చేసి దేవాలయాన్ని పునర్జీవింప చేసి నెగిటివ్ ఎనర్జి తొలగి మహాశక్తి వంతం అవుతుందని అన్నారు. మహా కుంభాభిషేకం మహా శక్తి సంపన్నం అని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ పావులూరి రమేష మాట్లాడుతూ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా విచ్చేసి సోమవారం 10 గంటలకు జరుగు మహా కుంభాభిషేకం తిలకించి తీర్ధ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. దేవాలయ ప్రధాన అర్చకులు చావలి శ్రీధర్శర్మ ఆధ్వర్యంలో పండిత బృందం యజ్ఞాలు, యాగాలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాస వర్మ కార్యక్రమాలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ పావులూరి సుబ్బారావు, గుంటూరు, కృష్ణా జిల్లాల టీటీడీ దాససాహిత్య ప్రాజెక్ట్ అధ్యక్షులు గట్టిపాటి శ్రీనివాసరావు, ఆధ్యాత్మికవేత్త పావులూరి వరలక్ష్మి, ఆలపాటి రమాదేవి, ఉప్పల పద్మ, అరుణ, నన్నపనేని పద్మ, సువర్ణ, హరే శ్రీనివాస దాససాహిత్య ప్రాజెక్ట్ భజన సంఘాలు, ఆర్యవైశ్య అన్నదాన సత్రం కమిటీ బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి గోవాడలో 4వ రోజు కొనసాగిన మహాకుంభాభిషేకం -
కాలేయం వ్యాధులపై అప్రమత్తం
గుంటూరు మెడికల్: గుంటూరు సంగడిగుంటకు చెందిన సాకేత్ ప్రైవేటు ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో సకాలంలో ఆహారం తీసుకోకుండా హోటల్స్లో ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటూ కాలం గడుపుతున్నాడు. తోటి సహచరులతో కలిసి మద్యానికి అలవాటు పడి అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులు పరీక్షలు చేసి మద్యం సేవించటం వల్ల కాలేయానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని నిర్ధారించారు. మద్యానికి స్వస్తిపలికి వైద్యుల సలహాలతో మందులు వాడని పక్షంలో ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. ఇలా ఎంతో మంది లివర్ సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం వైద్యులను సంప్రదిస్తున్నారు. అతి పెద్ద గ్రంథి కాలేయం కాలేయం (లివర్) మన శరీరంలో అతి పెద్ద గ్రంథి. లివర్ పనిచేయకపోతే అనేక రోగాలు శరీరాన్ని చుట్టుముడతాయి. ఆధునిక జీవనశైలి వల్ల నేడు అనేక మంది లివర్ వ్యాధుల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజలు లివర్ వ్యాధులను సకాలంలో గుర్తించి వైద్యం చేయించని పక్షంలో లివర్ క్యాన్సర్గా మారుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మంది లివర్ జబ్బులతో ప్రతి ఏడాది చనిపోతున్నారు. 2030 నాటికి లివర్ జబ్బులు 35 శాతం పెరుగుతాయి. లివర్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 19న వరల్డ్ లివర్ డే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. లివర్ బాధితులు... గుంటూరు జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీ వైద్యవిభాగంలో 300 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 130 మంది లివర్ సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నవారు. ప్రతి ఏడాది 4000 మందికి పైగా వివిధ రకాల సమస్యలతో గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యవిభాగంలో చికిత్స పొందారు. వీరిలో ఎక్కువ శాతం మంది లివర్ సంబంధిత సమస్యలున్న వారేనని వైద్యులు తెలిపారు. లివర్ చేసే పనులు... మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయటం, జీర్ణక్రియకు దోహదపడే పైత్యరసాన్ని ఉత్పత్తి చేయటం, శరీరంలోని కొవ్వు, చక్కెర, ప్రోటీన్ శాతాన్ని నియంత్రిస్తుంది. శరీరం జబ్బు బారిన పడకుండా రక్షణ కల్పించటం, రక్త శుద్ధి చేయటం, శరీరంలోని విషాలను హరించటం చేస్తుంది. మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించటం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చటం, వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రణలో పెట్టడం, రక్తం గడ్డ కట్టడానికి, గాయాలు త్వరగా మానటానికి కావాల్సిన ఎంజైమ్స్ను ఉత్పత్తి చేయటం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. కాలేయ సమస్యలకు ముఖ్యకారణాలు మత్తు పదార్థాలు సేవించటం, పొగతాగటం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, ఇన్ఫెక్షన్స్ వల్ల కాలేయ సమస్యలు వస్తాయి. లైంగిక సంబంధాలు, ఒకరికి వాడిన సూదిని మరొకరికి వాడటం వల్ల హెపటైటిస్ బీ, సీ వ్యాధులు సోకుతాయి. కలుషిత రక్తమార్పిడి, కలుషిత నీరు తాగటం వల్ల, కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల హెపటైటిస్ ఎ, ఇ వ్యాధులొస్తాయి. శారీరక వ్యాయామం లేకపోవటం, స్థూలకాయం వల్ల కొవ్వు పెరిగి కాలేయంపై పేరుకుపోతుంది. నూనె వస్తువులు ఎక్కువగా తినటం, పిజ్జాలు, బర్గర్స్లు, ఫాస్ట్ఫుడ్ వల్ల లివర్ వ్యాధులు వస్తాయి. శరీరానికి హానిచేసే మందులు ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా కాలేయ సమస్యలు తలెత్తుతాయి. మన రోగ నిరోధక శక్తి మనవైపే ప్రతికూలంగా పనిచేయటానికి అవకాశం ఉన్నప్పుడు , వంశపారంపర్యంగా కాలేయ వ్యాధులు వస్తాయి. తెల్లగా ఉండే కళ్లు పసుపు పచ్చగా, గోళ్లు పసుపు రంగులో మారితే కామెర్ల సమస్యలు ఉన్నట్లు భావించి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. కాలేయ సమస్యలను ముందస్తుగా గుర్తించి సకాలంలో వైద్యం చేయని పక్షంలో లివర్ క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది. -
లివర్ను ఇలా కాపాడుకోవాలి..
ఆల్కాహాల్ వల్ల లివర్ దెబ్బతింటుంది కాబట్టి మద్యం జోలికి వెళ్లవద్దు. కొవ్వు పదార్థాలు, వేపుళ్లు అతిగా తినవద్దు. ఉప్పు, చక్కెర , రెడ్మీట్ ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. పచ్చని ఆకు కూరలు తినటం వల్ల లివర్ను శుభ్రంగా ఉంచుతాయి. ఆలీవ్ ఆయిల్స్, వాల్నట్స్, గ్రీన్ టీ, ఆపిల్ పండ్లు, వెల్లులి పాయలు, పసుపు లివర్కు మేలు చేస్తాయి. విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే కాలేయం వద్ద పేరుకుపోయే కొవ్వును నియంత్రణ చేస్తుంది. రోజూ నీటిని ఎక్కువగా తాగటం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. – డాక్టర్ షేక్ నాగూర్ బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, గుంటూరు జీజీహెచ్ -
ఉచితంగా వైద్యసేవలు...
గుంటూరు జీజీహెచ్లో లివర్ జబ్బులకు అత్యాధునిక వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నాం. లివర్ జబ్బులను ముందస్తుగానే గుర్తించి చికిత్స అందించేందుకు జీజీహెచ్లో ప్రత్యేకంగా లివర్ను దెబ్బతిసే వైరస్లకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. హెపటైటిస్–బీ వైరస్ నియంత్రణ కోసం ప్రతినెలా రూ.2000 ఖరీదు చేసే మందులు ఉచితంగా ఇస్తున్నాం. హెపటైటిస్–సీ జబ్బులకు ఉచితంగా రూ. 20,000 ఖరీదు చేసే మందులు ఉచితంగా ఇస్తున్నాం. లివర్ మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. –డాక్టర్ అనుముల కవిత, గ్యాస్ట్రో ఎంట్రాలజీవిభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్ -
జల వనరులే భావితరాలకు సిరులు
జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ కొల్లూరు: నీటి వనరులు అంతరించిపోతున్న తరుణంలో జల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ కోరారు. శనివారం మండలంలోని అనంతవరంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర, జలధార – జల హారతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ నీటి వృథాను అరికట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మొంథా తుపాను నష్టపరిహారం సైతం త్వరలో రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. అనంతవరం పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న కూడలిలో ప్రభుత్వ యంత్రాంగం, విద్యార్థులతో కలసి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రదర్శనగా స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో కలసి మొక్క నాటారు. అనంతరం డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ బి. శ్రీదేవి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ రత్నమన్మోహన్, డీపీఓ కేఎల్ ప్రభాకరరావు, డీఆర్డీఏ పీడీ బి. శింగయ్య, డ్వామా పీడీ పి. పద్మ, ఎంపీడీఓ ఎ. స్పందన, తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. డొంక రోడ్లలో రవాణా దిగువ రైతుల హక్కు పంట ఉత్పత్తుల తరలింపు కోసం తరతరాలుగా అందుబాటులో ఉంటున్న డొంక రోడ్ల విషయంలో ఒకరిద్దరు రైతులు అడ్డంకులు సృష్టించి ఇతరులను ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదని జిల్లా కలెక్టర్ అన్నారు. శనివారం అనంతవరం జిల్లా పరిషత్తు పాఠశాలలో నిర్వహించిన గ్రామసభలో ఆయనకు రైతులు ఈ సమస్యను వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందించి, పొలాలకు ఉన్న బాటలలో రాకపోకలను అడ్డగించడం వల్ల మిగిలిన వారు అవస్థలు పడతారని తెలిపారు. అనంతరం కొల్లూరు శివారు కేటీ కాలనీ సమీపంలో బళ్ల బాట కోసం ఆందోళన చేస్తున్న రైతులు తమ సమస్యను కలెక్టర్కు మొర పెట్టుకున్నారు. పరిష్కరించాలని రేపల్లె ఆర్డీఓ బి. శ్రీదేవిని ఆయన ఆదేశించారు. అనంతవరంలో ఖరీప్లో వరి సాగు చేసి కేళీలతో పంట నష్టానికి గురైన రైతులు తమకు సంబంధిత విత్తన కంపెనీ నుంచి పరిహారం అందకపోవడంపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్సీ శ్మశాన వాటికకు స్థల కేటాయింపు, 20 ఏళ్ల క్రితం కేటాయించిన ఇళ్ల స్థలాలలో మెరకలు, ఇతర మౌలిక వసతుల కల్పన, డ్రైనేజ్ల నిర్మాణం, విద్యుత్తు స్తంభాల ఏర్పాటు, చెరువు కట్టల బలోపేతం, డొంక రోడ్ల మరమ్మతులు వంటి సమస్యలపై కలెక్టర్కు గ్రామస్తులు వినతిపత్రాలు అందజేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను శాఖల వారీగా పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ అమతలూరి స్పందన పాల్గొన్నారు. -
డిప్యూటీ ఎంపీడీఓకు అస్వస్థత
అత్యవసర వైద్య సేవల అనంతరం గుంటూరుకు తరలింపు కొల్లూరు: ఉద్యోగంలో పనిభారం, అనారోగ్య సమస్యల కారణంగా డిప్యూటీ ఎంపీడీఓ అస్వస్థతకు గురయ్యారు. శనివారం మండలంలోని అనంతవరంలో జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమ నిర్వహణలో భాగంగా కొల్లూరు డిప్యూటీ ఎంపీడీఓ సింహాద్రి నిరంజన్రావు ఉదయమే అనంతవరం చేరుకొని ఏర్పాట్ల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. మండుటెండలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర అవగాహనా ర్యాలీలో పాల్గొన్నారు. అప్పటికే అధిక ఒత్తిడి కారణంగా బీపీ పెరగడంతో స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు అతి కష్టంపై చేరుకున్న ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి కుప్పకూలారు. అత్యవసర వైద్య సేవలు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యుల కోరిక మేరకు గుంటూరు వైద్యశాలకు తరలించారు. -
ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
గుంటూరు మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పరిధిలో జాతీయ ఆరోగ్య మిషన్లో ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. జూనియర్ అసిస్టెంట్, ఆప్టో మెట్రిక్, డీడీఎం, లాబడెండెంట్, సోషల్ వర్క్, టీబీ హెల్త్ విజిటర్, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ ఉద్యోగాలకు అర్హులైన వారు గుంటూరు.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి పంపించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 18 నుంచి 30 వరకు డీఎంహెచ్ఓ కార్యాలయంలో, లేదా రిజిస్ట్రర్ పోస్టులో అందించాలన్నారు. పూర్తి వివరాలకు గుంటూరు.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో చూడాలన్నారు. నగరంపాలెం: జిల్లాలోని పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ స్టాఫ్ గ్రీవెన్న్స్ (ఎస్పీ – సంపర్క్) నిర్వహించారు. పోలీస్ సిబ్బంది వినతులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. వారి సమస్యలను ఆలకించి, త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ సిబ్బంది వృత్తిపై నిబద్ధత, నిజాయతీగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించాలని చెప్పారు. పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. -
విత్తనాల సరఫరాలో జాప్యం లేకుండా చూడాలి
కొరిటెపాడు(గుంటూరు): ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.పద్మావతి స్పష్టం చేశారు. స్థానిక కృషి భవన్లో రాబోవు ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని విత్తన డీలర్లు, ఉత్పత్తిదారులతో శుక్రవారం సాయంత్రం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. పద్మావతి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో అత్యంత కీలకమైన పత్తి, మిరప పంటల సాగుకు సంబంధించి విత్తనాల సరఫరాలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. డీలర్లు, ఉత్పత్తిదారులు విత్తనాల నిల్వలను పారదర్శకంగా వెల్లడించాలని సూచించారు. ప్రతి డీలరు తమ వద్ద ఉన్న విత్తన నిల్వలు, విత్తన కంపెనీ, రకాల వారీగా కచ్చితంగా వెల్లడించాలన్నారు. షాపుల వద్ద ప్రతి రోజూ విత్తనాల లభ్యతను తెలిపేలా స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించి విత్తనాలను అక్రమంగా నిల్వ చేస్తే సీడ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంకు ముందే విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామీణ స్థాయిలో రైతు సేవా కేంద్రాలతో సమన్వయం చేసుకుని విత్తన పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. స్టాక్ మూవ్మెంట్కు సంబంధించిన తాత్కాలిక కాలక్రమ పట్టికను అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. అనధికారిక, నకిలీ విత్తనాల విక్రయం నేరమని, అనుమతి పొందిన సంస్థల నుంచి మాత్రమే విత్తనాలను సేకరించాల్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు విత్తన రకం, కంపెనీ పేరు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీతో కూడిన అధికారిక రశీదు ఇవ్వాలని ఆదేశించారు. లూజు విత్తనాల అమ్మకం పూర్తిగా నిషేధమని, ప్యాకెట్లపై స్పష్టమైన లేబుల్స్, సర్టిఫికేషన్ ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే లైసెన్సులను రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేని బీజీ–3(హెటీ కాటన్) వంటి చట్టవిరుద్ధమైన విత్తనాలను నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు తప్పవన్నారు. గుజరాత్, బెంగుళూరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అనధికారిక విత్తనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా టాస్క్ఫోర్సు బృందాలు గోడౌన్లు, మార్కెట్ సెంటర్లపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తాయని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా డీలర్లు సహకరించాలని కోరారు. సమావేశంలో డీడీఏ ఐ.సునీత, ఏడీఏ ఎన్.మోహన్రావు, ఏఓ సునీల్కుమార్, విత్తన డీలర్లు, వివిధ విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. డీఏఓ ఎం.పద్మావతి -
నేరాలు, రౌడీయిజం నిర్మూలనే ధ్యేయం
● జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ● డీఎస్పీలతో సమీక్ష బాపట్లటౌన్: నేరాలు, రౌడీయిజం నిర్మూలనే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ధ్యేయమని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. కార్డన్ సెర్చ్ విధానం అమలుపై జిల్లాలోని డీఎస్పీలతో శుక్రవారం సాయంత్రం వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ నేర ప్రవృత్తి, రౌడీయిజాన్ని అరికట్టి, గంజాయి వంటి మత్తు పదార్థాలు, దొంగతనాలు, అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడానికి జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలను నిరోధించడానికి శాంతి భద్రతలను పరిరక్షించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సున్నితమైన ప్రదేశాలు, తరచూ నేరాలు జరిగే ప్రాంతాలు, నేరాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఏకకాలంలో ఆ ప్రాంతాలను అదుపులోకి తీసుకొని అక్కడ ఉన్న వ్యక్తులను, రౌడీషీటర్లను, వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించడం, నేరస్తులు ఎవరైనా ఉంటే వారిని అదుపులోకి తీసుకోవడం, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం, గంజాయి వంటి మత్తు పదార్థాల సరఫరా, వినియోగం ఉందేమోనని గుర్తించడం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రౌడీషీటర్ల కదలికలు, జీవనశైలిపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, ఎస్బీ సీఐ జి.నారాయణ, ఎస్బీ2 సీఐ ఎం.రాంబాబు, వర్చువల్ విధానంలో రేపల్లె, బాపట్ల, చీరాల డీఎస్పీలు ఏ.శ్రీనివాసరావు, సిహెచ్.చంద్రమౌళి, ఎండీ మోయిన్ పాల్గొన్నారు. -
బాధితులకు 150 మొబైల్ ఫోన్లు అప్పగింత
నగరంపాలెం: మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. సుమారు రూ.30 లక్షలు ఖరీదు చేసే 150 మొబైల్ఫోన్లను బాధితులకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సీఈఐఆర్లో ఫిర్యాదుతోపాటు అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్కు సంప్రదించాలని పేర్కొన్నారు. పోగొట్టుకున్న మొబైల్ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఇప్పటిదాకా సుమారు రూ.8.44 కోట్ల విలువైన 4,224 మొబైల్ ఫోన్లను ఎటువంటి రుసుం లేకుండా బాధితులకు అప్పగించామని తెలిపారు. మొబైల్ ఫోన్లల్లో వ్యక్తిగత, ఆర్థిక సమాచారం దుర్వినియోగం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు మొబైల్ఫోన్లల్లో ఎక్కువ నిర్వహిస్తున్నారని, ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలకు స్పందించవద్దని చెప్పారు. ఐటీ కోర్ సీఐ నిషార్బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, ఇమామ్సాహెబ్, యాసిన్, అరుణ, మానస, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను జిల్లా ఎస్పీ అభినందించారు. -
జీజీహెచ్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో రూ.కోట్ల వైద్య పరికరాలు ఉన్నాయని, అత్యాధునిక వైద్య సేవలు కార్పొరేట్ ఆసుపత్రికంటే దీటుగా అందిస్తున్నామని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ అన్నారు. ఆసుపత్రిలో మీకోసం మేము కార్యక్రమంలో భాగంగా 73వ వారం రోగులతో ఇంట్రాక్షన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. డాక్టర్ యశశ్వి రమణ మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా ఇటీవల కాలంలో రూ. వంద కోట్లతో జింకానా ఎంసీహెచ్ భవనం ప్రారంభించామన్నారు. ప్రభుత్వం రూ.30 కోట్ల వైద్య పరికరాలు అందించిందన్నారు. క్యాన్సర్, హెచ్ఐవీ బాధితులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. సంతానం లేనివారికి ఐవీఎఫ్ సేవలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. కోత, కుట్లు లేని ఆపరేషన్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐసీయూలో ఉన్న రోగులను పరామర్శించేందుకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు ఒకరు, ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని, రోగుల సహాయకులు దీన్ని గుర్తించి తమకు సహకరించాలన్నారు. ఆహారం తిని ఎక్కడబడితే అక్కడ వేయకుండా డస్ట్ బిన్లలో వేయాలని, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డెప్యూటీ ఆర్ఎంఓ శ్రీనివాసరాజు, పాల్గొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ -
ఎక్సైజ్ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో మద్యం షాపును రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుంటూరులో ఎకై ్సజ్ శాఖ రీజనల్ లేబొరేటరీ, మద్యం శాంపిల్స్ని పరిశీలించారు. ఎకై ్సజ్ శాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమరావతి రోడ్డులోని విజయశ్రీ వైన్ షాపులోకి వెళ్లి పరిశీలించి.. షాపునకు వచ్చిన మద్యం కొనుగోలుదారులతో మాట్లాడి మద్యం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకై ్సజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామన్నారు. నాటు సారా నిర్మూలన కోసం నవోదయం 2.0 కార్యక్రమం ప్రారంభించి, సామాన్యుల కోసం రూ.99 అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కల్తీకి అవకాశమే లేకుండా ఎకై ్సజ్ సురక్ష యాప్ కూడా తీసుకొచ్చామని, ఆ యాప్ ద్వారా ప్రతి మద్యం బాటిల్ను ట్రాక్ అండ్ ట్రేస్ చేయడంతో పాటుగా, తయారీ నుంచి ప్రతి వివరాలు ప్రజలకు అందుబాటులో తెచ్చామన్నారు. షాపు నిర్వాహకులు తప్పనిసరిగా సమయపాలన, ఎమ్మార్పీ విషయాల్లో ఉల్లంఘనలకు పాల్పడకుండా అధికారులకు కీలక ఆదేశాలిచ్చామన్నారు. ఎక్కడైనా తప్పు జరిగినట్లు గమనిస్తే ప్రజలు స్వచ్చందంగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాసులు, ఈఎస్ అరుణకుమారి, ఏఈఎస్ మారయ్య బాబు, సీఐ బొలిశెట్టి లతా, ఎస్ఐలు ఇతర ఇబ్బంది పాల్గొన్నారు. -
24న గురుకుల ప్రవేశ పరీక్ష
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభావంతులుగా నిలిచిన అక్కాచెల్లెళ్లు(ట్విన్స్) ఎంఎన్వీ అలేఖ్య లావణ్యశ్రీ, ఎంఎన్వీ ఆస్రిత రమ్యను జీకేఆర్ హైస్కూల్ డైరెక్టర్లు జి.కొండారెడ్డి, జి.జనార్ధన్రెడ్డి అభినందించారు. శుక్రవారం ఏటీ అగ్రహారంలోని జీకేఆర్ హైస్కూల్లో విద్యార్థినులకు నిర్వహించిన అభినందన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు తమ పాఠశాలలో చదివిన విద్యార్థినులు ఇంటర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి, జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు వరుసగా 462, 459 మార్కులు సాధించారని తెలిపారు. తమ పాఠశాల పూర్వ విద్యార్థులు ఎంతో మంది వివిధ రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. విద్యార్థినులు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో వేసిన బలమైన పునాది తాము టెన్త్, ఇంటర్మీడియెట్లో అత్యధిక మార్కులు సాధించేందుకు దోహదం చేసిందన్నారు. కార్యక్రమంలో పట్టాభిపురం, ఏటీ అగ్రహారం క్యాంపస్ల ప్రిన్సిపాల్స్ జి.శైలజ, జి.సుశీల, ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదాల నివారణ అందరి బాధ్యత
బాపట్లటౌన్: అగ్ని ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అగ్నిమాపకాధికారి జి.రామ్సిద్దార్థ్ అన్నారు. అగ్నిప్రమాదాల నివారణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అగ్నిమాపకాధికారి జి.రామ్సిద్దార్థ్ మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14న ముంబయి ఓడరేవులో ఒక నౌకలో జరిగిన అగ్ని ప్రమాదం వలన 66 మంది అగ్నిమాపక సిబ్బంది, 336 మంది ప్రజలు అక్కడికక్కడే మృతిచెందారని, వారి మృతికి చిహ్నంగా ప్రతి ఏడాది వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పట్టణంలోని అగ్నిప్రమాదం వలన ఎంతో విలువైన నగదు, ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించే ప్రమాదం ఉంటుందన్నారు. వాటిని నివారించేందుకు అగ్నిమాపక సిబ్బందితోపాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలు వంట సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాపట్ల అగ్నిమాపకాధికారి జి.రామ్ సిద్ధ్దార్థ్ -
ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: దుగ్గిరాల మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మార్చి నెల వేతనాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా ఖజానాధికారి ఎం.చంద్రశేఖర్రెడ్డిని కలెక్టరేట్లోని కార్యాలయంలో కలిసిన ఎస్టీయూ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. దుగ్గిరాల సబ్ ట్రెజరీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు ఇప్పటివరకు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేతనానికి సంబంధించిన సమస్యపై సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులు బాధ్యతారాహిత్యంగా సమాధానం చెబుతున్నారని, వారి ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారని తెలియజేశారు. తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని డీటీవో హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు కె.శ్రీనివాసరావు, జె.గురుబ్రహ్మం, వి.ప్రసాద్, జోజప్ప, కె.వెంకయ్య, యు.మహంకాళరావు, జె.శంకర వరప్రసాద్, సీహెచ్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
● భారీగా నిల్వలు గుర్తింపు ● డీలర్పై 6ఏ కేసు నమోదుయడ్లపాడు: రేషన్ డీలర్ ఆఽధీనంలో అక్రమంగా సరుకుల నిల్వలు అధికంగా ఉన్నాయంటూ మండలంలోని జాలాది గ్రామస్తులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన జేసీ ఆదేశాల మేరకు జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ప్రసాద్ గురువారం రాత్రి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారుల రాకతో ఫిర్యాదు దారులు ౖకలిసి తామే ఫిర్యాదు చేశామని చెప్పడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు ఉన్నట్లు తేలడంతో యడ్లపాడు డీటీ అనురాధకు సరుకుల వివరాలను చూడాలంటూ ఆదేశించి వెళ్లారు. ఇదే విషయంపై శుక్రవారం డీఎస్వోను వివరాలు అడగ్గా గ్రామంలోని 16వ రేషన్షాపులో ప్రజా పంపిణీ ప్రక్రియ ముగిసిన తర్వాత బియ్యం, జొన్నలు అధిక నిల్వలు ఉన్నందున వారిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిల్వల వివరాలు మండల అధికారుల నుంచి తీసుకోవాలని చెప్పగా, తహసీల్దార్ జెట్టి విజయశ్రీ వాటి పూర్తి వివరాలు తమ వద్దకు రాలేదని శనివారం తెలియజేస్తామంటూ సమాధానమిచ్చారు. అధికారుల తనిఖీల్లో సుమారు 20 క్వింటాళ్ల బియ్యం, 95.50 కేజీ పంచాదార, జొన్నలు కూడా నిల్వలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. -
మాతృ మరణాలను నివారించండి
బాపట్ల: జిల్లాలో ఎక్కడా మాతృ మరణాలు జరగడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. మాతృ మరణాలపై శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఎక్కడా మాతృ మరణాలు జరగడానికి వీలులేదన్నారు. ఇటీవల మూడు మరణాలకు గల కారణాలను గుర్తించి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, గర్భధారణ కాలంలో నిరంతర వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. హైరిస్క్గా ఉన్న గర్భిణులను ముందుగానే గుర్తించి వారికి తగిన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రసవ నొప్పులు మొదలవగానే తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ లేదా 108 వాహనాల ద్వారా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ సిబ్బంది గ్రామ స్థాయిలో గర్భిణులపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొన్నారు. అవసరమైన సందర్భాల్లో తక్షణమే పైస్థాయి వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను మరింత మెరుగుపరచి, ప్రసవ సేవలను నాణ్యంగా అందించాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, ఎండీఎస్ఆర్ కమిటీ సభ్యులు, డాక్టర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి పురపాలక సంఘం పెట్రోల్ బంకు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల పట్టణం పాత బస్టాండ్ కూడలి వద్ద నూతనంగా నిర్మిస్తున్న పురపాలక సంఘం పెట్రోల్ బంకు పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పనులు మే నెలాఖరిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. 507.7 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బంకు ఏర్పాటు చేయాలన్నారు. వినియోగదారులకు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సదుపాయం ఇక్కడ అందుబాటులో ఉంచాలన్నారు. పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెంట పురపాలక సంఘం కమిషనర్ రఘునాథరెడ్డి, తహసీల్దార్ షాలీమా, మున్సిపల్ ఇంజినీర్ కృష్ణారెడ్డి ఉన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా కేంద్ర కార్యాలయం మీడియా ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎండీ రహుల్లాలు విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్రాజు మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ పనులపై వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చే వారి దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నిరంతరం మజ్జిగ, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మేకా అంజిరెడ్డి, పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ ఫిరోజ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నరసరావుపేట: స్వీయ జనగణనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తన వివరాలను ఆన్లైన్ ద్వారా శుక్రవారం నమోదు చేసుకున్నారు. జిల్లాలో జనగణన కార్యక్రమం ప్రారంభమైన విషయం విదితమే. ప్రతి ఒక్కరూ వెబ్సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 30 తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్లైన్లో తమ వారికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని, జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వినుకొండ: వినుకొండ–అద్దంకి రోడ్డులోని రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణంపై పట్టణంలోని ఏనుగుపాలెం రైల్వే గేటు వద్ద ఆర్డీవో కె.బాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వినుకొండ–అద్దంకి రోడ్డులోని రైల్వే గేటు వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జికి సుమారు రూ.54 కోట్లు అంచనా వేశారని తెలిపారు. ఇందులో రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమాన వాటా భరిస్తాయని అధికారులు తెలిపారు. భూసేకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే సివిల్ పనుల కోసం టెండర్లు పిలిచే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీటీ మురళి, ఆర్ఐ శ్రీహరి, రెవెన్యూ, మున్సిపల్, రైల్వే, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 527 అడుగులకు చేరింది. ఇది 162.3490 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువకు 3,431, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదల అవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 5,231 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 5,231 క్యూసెక్కులు చేరుతోంది. బాపట్లటౌన్: బాపట్ల జిల్లాలో నలుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజాంపట్నం ఎస్ఐ కె.కె.తిరుపతిరావును చెరుకుపల్లి స్టేషన్కు బదిలీ చేశారు. వీఆర్లో ఉన్న జి.కిరణ్బాబును నిజాంపట్నం స్టేషన్కు, జిల్లాలోని పోలీస్ కంట్రోల్ రూమ్లో విధులు నిర్వర్తిస్తున్న బి.బాబురావును మార్టూరు అర్బన్ స్టేషన్, చెరుకుపల్లి ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న టి.అనిల్ కుమార్ను వీఆర్ బదిలీ చేశారు. -
ఇసుక తవ్వకాలా..?
రైతుల ప్రయోజనమా... ఏది ముఖ్యమో చంద్రబాబు ప్రభుత్వం తేల్చుకోవాలని డిమాండ్ కొల్లూరు: రైతులు ముఖ్యమో.. ఇసుక తవ్వకాలు ముఖ్యమో.. తేల్చుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓ రైతు ప్రశ్నించారు. కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల చోటుచేసుకునే పరిణామాలను ప్రజల నుంచి తెలుసుకునేందుకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. శుక్రవారం మండలంలోని జువ్వలపాలెంలో రేపల్లె ఆర్టీఓ బి. శ్రీదేవి సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. ఉప్పు నీటి ప్రవేశానికి వీలుగా.. ఇసుక తవ్వకాల కోసం మైనింగ్ శాఖ గుర్తించిన 507 సర్వే నంబర్లో జువ్వలపాలెం – 2 ఇసుక క్వారీలో 24.90 హెక్టార్ల విస్తీర్ణంలో ఏడాదికి 3, 73, 500 టన్నుల ఇసుక తవ్వకాలు చేపట్టడానికి జరిపిన ప్రజాభిప్రాయ సదస్సులో ఆరుగురు మాట్లాడారు. వారి నుంచి భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి. మండలంలోని తోకలవారిపాలెం శివారు కృష్ణానగర్కు చెందిన గొరిపర్తి వెంకట కృష్ణారావు అనే రైతు మాట్లాడుతూ.. ‘‘రైతులు ముఖ్యమా.. ఇసుక తవ్వడం ముఖ్యమా’’ అనేది తేల్చుకోవాలని పేర్కొన్నారు. చింతర్లంకకు చెందిన ప్రజా సంఘాల నాయకుడు తోడేటి సురేష్ ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇసుక తవ్వకాలతో సముద్రపు పోటు ద్వారా చొచ్చుకొస్తున్న ఉప్పునీరు లంక గ్రామాలలోకి వచ్చేందుకు గేట్లు తీసినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేశాడు. నిబంధనల ప్రకారం జువ్వలపాలెం – 2 ఇసుక క్వారీకి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజల అభిప్రాయాల సైతం తీసుకోవాల్సి ఉంది. కేవలం నాలుగైదు గ్రామాల ప్రజలతోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడమేంటని ప్రశ్నించారు. లోపాటు సవరించాలి... ప్రజల అభిప్రాయాలు సేకరించే ముందు వినిపించిన నివేదికలోని అంశాలు సైతం లోపభూయిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని సవరించి మాత్రమే ఇసుక క్వారీ నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక తవ్వకాల కారణంగా కృష్ణా నదిలో ప్రవాహ దిశ మారి పంట భూములు కోతకు గురవుతున్నాయని తెలిపారు. నివేధికలో వెల్లడిస్తున్నట్లు తాగు, సాగు నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోతే ఇప్పటికే రూ. 50 కోట్లు వెచ్చించి పోతార్లంక ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు ఎందుకు సరఫరా చేస్తున్నారని నిలదీశారు. లంక గ్రామాల ప్రజలు నిత్యం తాగునీరు ఎందుకు కొనుక్కుంటున్నారని ప్రశ్నించారు. నదిలో పశుగ్రాసానికి ఉపయోకరంగా ఉన్న పచ్చిక బయళ్లు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందన్నారు. తిప్పలకట్టకు చెందిన పంతగాని నాగమల్లేశ్వరరావు ఇసుక తవ్వకాల ద్వారా లభ్యమయ్యే ఆదాయం స్థానిక సంస్థలకు కేటాయించి అభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక క్వారీ సర్వే నంబర్లు సక్రమంగా లేవని సరిచూసుకోవాలని సూచించారు. ఇసుక క్వారీ నుంచి తిరిగే వాహనాల కారణంగా రహదారిలో ప్రయాణించడం కష్టతరంగా ఉందని తెలిపారు. తక్షణం సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించాలని స్థానికుడు కృష్ణ కిశోర్ కోరారు. ఇసుక క్వారీలో అక్రమ వసూళ్లు జరగకుండా చూడటంతోపాటు ఉప్పు నీరు రాకుండా భట్టిప్రోలు మండలం ఓలేరు ప్రాంతం నుంచి చెక్డ్యామ్ నిర్మాణం చేపట్టాలని జువ్వలపాలెం మాజీ సర్పంచి యార్లగడ్డ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్కు చెందిన సునందారెడ్డి అనే ఎన్జీఓ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ఇసుకను ఇతర రాష్ట్రాలకు విక్రయించి ఆదాయ వనరుగా రాష్ట్ర ప్రభుత్వం మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ విజయ్మోహన్, మైనింగ్ ఏడీ జి. శ్రీనివాస్, తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడలో ప్రసిద్ధి గాంచిన క్షేత్రమైన గంగాపార్వతి సమేత బాలకోటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం పవిత్ర చైత్ర మాస అమావాస్య పురస్కరించకుని మహా కుంభాభిషేకంలో భాగంగా కోటి కుంకుమార్చన, సామూహిక లలిత సహస్ర నామ పారాయణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చావలి శ్రీధర్శర్మ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతి అమ్మవారికి పల్లకీ సేవ ఘనంగా చేశారు. వేదాంతం సునీత మాట్లాడుతూ లలిత సహస్ర పారాయణం విశిష్టతను వివరించారు. ఆలయ చైర్మన్ పావులూరి రమేష్, ఆలయ కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాసవర్మ, జిల్లా సంస్కృతి ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ, జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు, తమ్మన సాంబశివరావు, చింతల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త సమాజాల వారు దాస సాహిత్య ప్రాజెక్ట్ హరే శ్రీనివాస భజన సంఘాల వారు తదితరులు పాల్గొన్నారు. -
జలధార–జల సంరక్షణపై అవగాహన ముఖ్యం
బాపట్ల జిల్లా డిప్యూటీ కలెక్టర్ లవన్న కారంచేడు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహించనున్న జలధార–జలసంరక్షణ పథకంపై ప్రజలు సరైన అవగాహన కలిగి ఉండేలా సంబంధిత అధికారులు, పాలకులు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా డిప్యూటీ కలెక్టర్ లవన్న అన్నారు. శుక్రవారం ఆయన కారంచేడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామసభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో ప్రధాన సాగు, తాగునీటి వనరులుగా ఉన్న కొమ్మమూరు, సాగర్ ఆయకట్టు కింద ఉన్న భూములకు అవసరమైన సాగునీటితోపాటు, ఆయా గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేలా తాగునీటిని కూడా జాగ్రత్తగా వినియోగించుకోవాల్సి ఉందన్నారు. నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. నీటిని వృథా చేసుకోవడం వలన భవిష్యత్లో నీటి గండం ఏర్పడే ప్రమాదం ఉంటుందన్నారు. నీటి సంరక్షణ, నీటి భద్రత, తాగునీటి చెరువుల పునరుద్ధరణలు వంటి అనేక విషయాలపై ఆయన 100 రోజుల కార్యాచరణలో భాగంగా సాగునీటి సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వర్షపు నీటని కూడా చాలా జాగ్రత్తగా వినియోగించుకొనేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కే నేతాజీ, తహసీల్దారు జీ నాగరాజు, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు, నీటి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మద్యానికి బార్లా తెరిచేశారు..!
గుంటూరు రూరల్: ‘ఎవరు ఎలా పోతే మాకేంటి? మేం మాత్రం పగలూ రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయించాలి. జేబులు పూర్తిగా నిండేలా సంపాదించుకోవాలి’ అన్నట్లుంది నగరంలో, నగర శివారుల్లో బార్ నిర్వాహకుల పరిస్థితి. పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలు మద్యం విక్రయాలు చేస్తూనే ఉంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిత్యం విక్రయిస్తూనే ఉన్నారు. సంబంధిత అధికారులు, పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మామూళ్ల మత్తులో జోగుతున్నారని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నగరంలోనే కాకుండా రూరల్ పరిసరాల్లో సైతం నిత్యం మద్యం అందుబాటులోనే ఉంటోంది. తెల్లవారుజామున 5 గంటలకే బార్లు బార్లా తెరిచి మద్యం విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బార్ పాలసీ ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలి. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు బాహాటంగానే కొనసాగిస్తూ ఉన్నారు. రాత్రి 12 గంటల తరువాత బార్లలో లైట్లు ఆపి మద్యం విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల వెనుక డోర్ నుంచి విక్రయాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో పాత పాలసీ ప్రకారం రాత్రి 11 గంటల వరకే మద్యం విక్రయాలు చేసేవారు. అనంతరం బార్లు తెరిచి ఉంటే వారిపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుం విధించేవారు. ఇక్కడ ప్రత్యేక రూల్ ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు జరగాలి. గుంటూరు నగరంలో మరీముఖ్యంగా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం రోజులో 24 గంటలు మద్యం ఏరులై పారుతూనే ఉంది. అధికారులకు మామూళ్లు ముట్టజెప్పటంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక రాత్రి గస్తీ తిరిగే పోలీసులు సైతం అదే మామూళ్ల మత్తుకు అలవాటయ్యారు. అనధికార అనుమతి ఇస్తూ మద్యం ఏరులై పారిస్తున్నారు. బార్ యజమానులు దీనికోసం భారీగానే అధికారులకు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక బార్లో కొనుగోలు చేసిన బీర్ సీసాలో పురుగులు రావటంతో నిర్వాహకులతో కొనుగోలుదారులు వివాదానికి దిగిన సంఘటన తెలిసిందే. విషయం బయటకు రాకుండా పోలీసులు, బార్ యాజమాన్యం సెటిల్మెంట్ చేసుకున్నట్లు సమాచారం. విచ్చలవిడిగా పర్మిట్ రూములు ప్రతి వైన్ షాపులో బార్లను మించిన పర్మిట్ రూములు ఏర్పాటు చేసుకున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం ఏరులై పారుతోంది. ఎకై ్సజ్ అధికారులకు, పోలీసులకు మామూళ్లు ఇచ్చి మద్యం విక్రయిస్తున్నారు. అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాలు, బార్లపై చర్యలు తీసుకుని నాణ్యమైన మద్యాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
వైద్యుడి నియామకంలో కునికిపాట్లు
నరసరావుపేట టౌన్: ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు పూర్తిగా నిలిచిపోవటం పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ను ఐదు నెలల క్రితం సస్పెండ్ చేసి ఆ స్థానంలో ఇప్పటి వరకు ఎవ్వరినీ నియమించకపోవటంతో పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబ నియంత్రణ వంటి ప్రాథమిక ఆరోగ్య సేవలు కూడా అందుబాటులో లేకపోవటం చంద్రబాబు పాలన వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పలువురు ప్రైవేటు వైద్యశాలలకు ఆశ్రయించడంతో ఆర్థిక భారం తప్పడం లేదు. రోజూ ఎనిమిది నుంచి పది వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేవి. సగటున నెలకు సుమారు 200కుపైగా నిర్వహించేవారు. గతేడాది నవంబర్ నెలలో ఓ మహిళకు ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ టి. నారాయణస్వామి సర్జికల్ బ్లేడును తొడ భాగంలో వదిలేశారు. రోగి బంధువులు ఆందోళన చేయటంతో విచారణ జరిపిన అధికారులు... డాక్టర్, స్టాఫ్ నర్స్ శౌరీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించారు. వారిద్దరిని గతేడాది డిసెంబర్ 5వ తేదీన అధికారులు సస్పెండ్ చేశారు. ఆ స్థానంలో మరో డాక్టర్ను ఇప్పటివరకు నియమించలేదు. సంఘటన జరిగి ఐదు నెలలు గడుస్తున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటంతో పీపీ యూనిట్ విభాగంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి రోజు రోగులు వచ్చి వెనుతిరిగి వెళ్లడం పరిపాటిగా మారింది. వైద్యం లేదు.. ప్రోత్సాహకం రాదు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను అందిస్తోంది. మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషనుకు రూ.1,500, పురుషులకు వ్యాసెక్టమీ శస్త్రచికిత్సకు రూ.2,000కుపైగా అందించటం ద్వారా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైపు ప్రజలను ఆకర్షించేలా చేస్తోంది. దీంతోపాటు ప్రయాణ భత్యం, ఆపరేషన్ తర్వాత ఉచిత మందులు, చికిత్స అందిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆశ వర్కర్లకు కూడా ప్రోత్సాహకం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆపరేషన్లు లేకపోవటంతో ఈ ప్రయోజనాలన్నీ దక్కటం లేదు. ఒకవైపు ఉచిత వైద్యం కోల్పోతుండగా, మరోవైపు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కూడా అందడం లేదు. ఆరోగ్యానికి ముప్పు.. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు ఎక్కువగా ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయి. ఆలస్యం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే ముప్పు ఉంది. కుటుంబ నియంత్రణ లేకపోవటం వల్ల అనుకోని గర్భధారణలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆరోగ్యంపై ప్రభావం చూపి సామాజిక సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుడి నియామకం జరగక ఐదు నెలలైనా పట్టించుకున్న నాథుడు లేడు. మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే వారే కరువయ్యారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కనీసం కు.ని. ఆపరేషన్లు కూడా చేయించలేని దీనస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ప్రజలు మండిపడుతున్నారు. -
క్షౌరశాలలకు ఉచిత విద్యుత్
తెనాలిటౌన్: రాష్ట్ర నాయీ బ్రాహ్మణుల క్షౌరశాలలకు 200 యూనిట్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుందని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కె.రఘురామయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల 200 యూనిట్లలోపు ఉన్న క్షౌరశాలలకు విద్యుత్ బిల్లులను మాఫీ చేసినట్లు చెప్పారు. నిర్వాహకులు ఆదాయ సర్టిఫికెట్, షాపు ఓనర్ ధ్రువీకరణ పత్రం, రేషన్కార్డు, ఆధార్కార్డును సబ్మీట్ చేయాలని సూచించారు. పట్టణాలలో సంవత్సర ఆదాయం రూ.70 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు ఉండాలని జీఓ ఉండగా ఇప్పుడు వాటిని సవరిస్తూ బీపీఎల్ సర్టిఫికెట్ తహసీల్దార్ నుంచి పట్టణాల్లో సంవత్సర ఆదాయం రూ.1,44,000, గ్రామీణప్రాంతాల్లో రూ.1,20,000 ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని విద్యుత్శాఖ తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అక్కల సత్యనారాయణ కోరినట్లు వివరించారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఇతర సర్టిఫికెట్లు తీసుకుని విద్యుత్ అధికారులకు అందజేయాలని సూచించారు. నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయం జిల్లాలో ఉద్యమంలా సాగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఐసీఆర్పీలు, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్ బృందాలకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం జిల్లా ప్రకృతి వ్యవసాయ కార్యాలయంలో నిర్వహించారు. జగ్గారావు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 70 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రైతులు పీఎండీఎస్ విధానాన్ని అవలంబించాలని సూచించారు. వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల వలన సూపర్ ఎల్నినో రాబోతుందని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి రైతు వేసవి కాలంలో బెట్టను తట్టుకుని దిగుబడినిచ్చే పంటలు ఎన్నుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం కె.అమలకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ
పచ్చనేతలు బరి తెగించారు. ఇసుక దిబ్బలను యథేచ్ఛగా మింగేస్తున్నారు. తవ్విన ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి జేబులు నింపుకొంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. ఉచిత పథకానికి తూట్లు పొడుస్తున్నారు. ఇదేమని అడిగే వారే లేరు. సాక్షి టాస్క్ ఫోర్స్: చీరాల నియోజకవర్గ ప్రధాన నాయకుడు.. అనుచరులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. అక్రమంగా ఇసుక తరలింపు కోసం మాఫియా నాయకులు రూ. లక్షల మేర ప్రధాన నాయకుడికి కప్పం కడుతున్నారు. ఉచితం మాటున యంత్రాలతో తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లతో అక్రమంగా తరలిస్తున్నారు. ఈ అక్రమ తరలింపు వ్యవహారం తెలిసినా మామూళ్ల మత్తులో డ్రైనేజీ, రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా వేటపాలెం మండల పరిధిలోని పందిళ్లపల్లి, రామన్నపేట, సముద్రతీర గ్రామాల పరిధిలో అసైన్డ్, వాన్పిక్ భూముల నుంచి పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లు, లారీ టిప్పర్లతో నూతనంగా వేసే లేఅవుట్లకు నిత్యం వందల సంఖ్యలో ఇసుక లోడులు తరలిస్తున్నారు. ప్రతి రోజూ 100 నుంచి 150 లోడ్ల వరకు డంప్ అవుతున్నాయి. ట్రాక్టర్ ఇసుక రూ.4000 నుంచి రూ.5000కు విక్రయిస్తున్నారు. టిప్పర్ ఇసుక రూ. 25000 నుంచి క్వాలిటీని బట్టి రూ.40 వేలకు రాత్రి వేళల్లో తరలించి జేబులు నింపుకుంటున్నారు. ప్రధాన అనుచరుడే కీలకం... చీరాల నియోజకవర్గ పరిధిలో ఆరు ప్రాంతాల నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. పందిళ్లపల్లి, రామన్నపేట, బొచ్చులవారిపాలెం, చల్లారెడ్డిపాలెం, దేశాయిపేట గ్రామాల నుంచి అక్రమంగా అసైన్డ్ భూముల్లోని ఇసుక కొల్లగొడుతున్నారు. నియోజకవర్గంలో ప్రధాన నాయకుడికి రూ.లక్షలు కప్పం కట్టి వారి అనుచరులే ఇసుక దందా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇద్దరు అనుచరులు ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక తలించి డబ్బులు వసూలు చేస్తుంటారు. కొమ్ముకాస్తున్న పోలీసులు చీరాల ప్రాంతంలో తాను మినహా వేరెవరూ ఇసుకను విక్రయించేందుకు వీలులేదని హుకుం జారీ చేయడంతో చీరాల ప్రాంతంలో పచ్చనేత ఇసుక వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన వారికి ఇసుక దిబ్బలు ఉన్నా అమ్ముకోవడానికి వీలులేదు. కాదూ కూడదని తరలించే ప్రయత్నం చేసినా వెంటనే తహసీల్దార్, పోలీసులకు చెప్పి ఆ ట్రాక్టర్లను సీజ్ చేయిస్తారు. ఆదేశాలు పేపర్లకే పరిమితం.. చీరాల నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్, ఆర్డీఓ ఆదేశాలు పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. యథేచ్ఛగా ఇసుక టాక్టర్లు రాత్రి, పగలు తిరుగుతున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదంటున్నారు. వారికి ప్రతి నెలా అందుతున్న మామూళ్ల వల్లే ఉన్నత అధికారులు ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
కోర్టు భవనాల సముదాయానికి స్థలం కేటాయించండి
బాపట్ల: బాపట్ల జిల్లా కోర్టు భవనాల సముదాయానికి స్థలం కేటాయింపు చేయాలని బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విన్నకోట సత్యప్రసాద్తోపాటు పలువురు జిల్లా కలెక్టర్డాక్టర్ వి.వినోద్కుమార్కు కలిసి కోరారు. బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా బుధవారం మర్యాదపూర్వకంగా కలెక్టర్ను కలిశారు. కోర్టు భవనాల సముదాయంతోపాటు, బార్ అసోసియేషన్ సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ విషయాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని అధ్యక్షులు విన్నకోట సత్యప్రసాద్ తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఉపాధ్యక్షులు కె రవిబాబు, ప్రధాన కార్యదర్శి సి. ప్రేంచంద్, పూర్వ అధ్యక్షులు కె.అవినాష్, వై.నరేష్, డి.హెచ్.బెంజ్, బి.స్టాన్లీ, ఎం.శ్యామలాదేవి, ఏ.మాధురి, బి.నాగప్రసాద్, వై.రామకోటి, పి.మురళీకృష్ణ,, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కలెక్టర్కు న్యాయవాదుల వినతి -
ముగ్ధ మనోహర చిత్రం
రేపల్లె: ఆసక్తి ఉంటే గురువు అవసరం లేదు. కష్టపడితే ప్రతిభకు అడ్డంకులు ఉండవు అనే మాటలను నిజం చేస్తూ ముందుకు సాగుతోంది వరికూటి ముగ్ధశ్రీ. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరు సమీపంలోని వరికూటివారిపాలెం గ్రామానికి చెందిన ముగ్ధశ్రీ చిన్ననాటి నుంచే చిత్రలేఖనంపై అపారమైన ఆసక్తి పెంచుకుంది. ప్రత్యేకంగా ఎలాంటి గురువు లేకుండానే స్వయంకృషితో చిత్రకళలో నైపుణ్యాన్ని సాధించి ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్ధశ్రీ చదువుతో పాటు తన అభిరుచిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. సాధారణ కాగితం, పెన్సిల్తో ప్రారంభమైన ఆమె ప్రయాణం, ఇప్పుడు అద్భుతమైన చిత్రాల రూపంలో కళాభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రతి చిత్రంలో భావం, శ్రద్ధ, సృజనాత్మకత ప్రతిబింబించేలా చిత్రీకరిస్తూ అందరిని ఆకర్షిస్తోంది. ముగ్ధశ్రీ తండ్రి రాము వరికూటి, తల్లి లీలా కరుణశ్రీ తమ కుమార్తె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ఆమె ఎదుగుదలకు ప్రధాన కారణం. గ్రామీణ నేపథ్యంలో ఉన్నప్పటికీ, తన ప్రతిభతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే పట్టుదల ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఆకర్షణీయంగా చిత్రించిన పలు చిత్రాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. చిత్రలేఖనంలో ప్రతిభ చాటుతున్న ముగ్ధశ్రీ -
స్వీయ జనగణనలో వాస్తవాలు వివరించండి
ప్రతి చెరువునూ గుర్తిస్తున్నాం ‘జలధార–జలహారతి’ కింద జిల్లాలో ఉన్న ప్రతి చెరువునూ గుర్తిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టూ ఒడిసి పట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డీఆర్వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం, డ్వామా పీడీ వి.శంకర్, భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనం పాల్గొన్నారు. -
హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు
బాపట్లటౌన్: హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో శిరోరక్ష–ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి వాహనచోదకులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ఈనెల 1న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘శిరో రక్ష –ప్రాణరక్ష‘ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ ఆవశ్యకతపై గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. హెల్మెట్పై అవగాహన పెంచుకోవడానికి, కొనుగోలు చేయడానికి ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు అవకాశం కల్పించామన్నారు. ఏప్రిల్ 16 నుంచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించాలన్నారు. ఉల్లంఘించిన వారి మీద రోడ్డు భద్రతా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, హెల్మెట్ అనేది చలానా తప్పించుకునే మార్గం కాకుండా వ్యక్తిగత బాధ్యతగా ధరించాలన్నారు. హెల్మెట్ అనేది ప్రాణాలను కాపాడే ఆపన్నహస్తమని, దాన్ని ఎప్పుడూ భారంగా భావించకూడదన్నారు. అతి త్వరలో ‘నో హెల్మెట్ – నో పెట్రోల్‘ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. హెల్మెట్ ధరించకుండా వచ్చే వాహనదారులకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపే అవకాశం ఉండదని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల రూరల్ సర్కిల్ సీఐ హరికృష్ణ, అడ్మిన్ ఆర్ఐ మౌలుద్దీన్, ఎంటి ఆర్ఐ శ్రీకాంత్, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ -
మెప్మా ఆర్పీలకు పెండింగ్ జీతాలు విడుదల చేయాలి
లక్ష్మీపురం: ఆర్పీలు అనేక ఒత్తిడిలు, ఆర్థిక ఇబ్బందుల మధ్య పనిచేస్తున్నారని వారికి నెల నెల జీతాలు రావడం లేదని సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్.రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మెప్మా ఆర్పీల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు కే శ్రీనివాసరావు అధ్యక్షత మెప్మా పీడీ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని, ఏడు నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. ప్రతి నెలా ఆర్పీలకు జీతాలు 5వ తేదీలోపు చెల్లించాలని, గ్రీటింగ్ విధానం రద్దు చేసి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంసీపీ యాప్ని రద్దు చేయాలని, అర్హత ఉన్న ఆర్పీలను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించాలన్నారు. ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్పీలకు ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెప్మా కార్యాలయ అధికారి ఐబి హనుమంతు నాయక్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంకమ్మ, అనూష, ఎస్కె పర్వీన్, ఎస్.కె కమీలిబీ, సుమతి, నసురున్ సుజాత, తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ నాయకుల డిమాండ్ మెప్మా పీడీ కార్యాలయం ఎదుట ధర్నా -
గంజాయ్కి యువత చిత్తు !
బాపట్లగురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఆత్మస్తుతి.. పరనింద 7గంజాయి అంగడి సరుకుగా మారింది. మత్తుతో యువత చిత్తవుతున్నారు. విద్యాసంస్థలే లక్ష్యంగా కొందరు గంజాయి సరఫరా చేస్తున్నారు. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశం. వారాంతపు రోజుల్లో తీర ప్రాంతానికి గంజాయి దిగుమతి అవుతోంది. సంబంధిత శాఖల అధికారుల తనిఖీల్లో పట్టుబడేది గోరంతయితే.. వినియోగం కొండంతగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంగడి సరుకుగా మారిన గంజాయి పట్టుబడేది గోరంత... వినియోగం కొండంత మత్తులో నేరాలకు పాల్పడుతున్న యువత గంజాయి ఆకుతోపాటు చాక్లెట్ల రూపంలో విచ్చలవిడిగా లభ్యం వారాంతపు రోజుల్లో తీర ప్రాంతానికి దిగుమతి గంజాయి రహిత రాష్ట్రం చేస్తామన్న బాబు హామీ సంగతేంటని ప్రజల మండిపాటు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7000, గరిష్ట ధర రూ.9000, మోడల్ ధర రూ.11500 వరకు పలికింది. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 527.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 4,205 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.9640 టీఎంసీలు. -
మహిళను హత్య చేసిన న్యాయవాది
నగరంపాలెం: మహిళను హత్య చేసిన న్యాయవాది, అతని స్నేహితుడ్ని పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. పాతగుంటూరు యాదవబజార్ 1/4వ అడ్డరోడ్డులో ఉంటున్న ఆకుల రమాదేవి (45) శ్రీనివాసరావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. 12 సంవత్సరాల కిందట అనారోగ్యంతో శ్రీనివాసరావు మృతిచెందాడు. రమాదేవికి చేబ్రోలు మండలం శ్రీరంగపురం గ్రామానికి చెందిన న్యాయవాది ఎనుమల సురేష్బాబుతో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఇంటి నుంచి బయటకెళ్లి తిరిగి రాలేదు. ఆమె తల్లి కలుకోలను వెంకాయ్య పాతగుంటూరు పీఎస్లో ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసుగా నమోదు చేసి సీఐ వెంకటప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. రమాదేవి సెల్ఫోన్ ఆధారంగా విచారించగా, చివరి కాల్ సురేష్బాబు మొబైల్ నుంచి వచ్చినట్లు గుర్తించి ఆ దిశగా విచారించారు. రమాదేవితో అతనికి రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అదిగాక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె వద్ద రూ.18 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సురేష్బాబు గుంటూరు కోర్టులో ప్రాక్టీస్ చేసేవాడని, హైకోర్టులోనూ కొన్ని కేసులున్నాయి. ఆమె వద్ద తీసుకున్న డబ్బులు ఇటీవల జరిగిన గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లోనూ ఖర్చు చేసినట్లు గుర్తించారు. రమాదేవిని డబ్బులు విషయమై పిల్లలు అడగడంతో ఆమె సురేష్బాబుపై ఒత్తిడి తీసుకొచ్చేది.ఈ క్రమంలో ఆమెతో శ్రీశైలం వెళ్దామని సురేష్బాబు నమ్మించి, తెనాలి రూరల్ సంగంజాగర్లమూడి గ్రామ వాసి ఆటోడ్రైవర్ కోపల్లి శేఖర్ సాయంతో ఫిబ్రవరి 21 అర్ధరాత్రి శ్రీరంగపురం వెళ్లే డొంకరోడ్డులోని సంగంజాగర్లమూడి కాలువ వద్దకి తీసుకెళ్లారు. అనంతరం కర్రతో ఆమెను కొట్టి ఇద్దరు కల్సి ఆమె జుట్టు పట్టుకుని కాల్వలోకి తోసేయగా, ఆమె పైకి వచ్చేందుకు ప్రయత్నించగా మళ్లీ కర్రతో కొట్టి నీటి ప్రవాహంలోకి తోసేశారు. రమాదేవి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి సుమారు రెండు నెలలైంది. మృతదేహం జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు. మృతదేహన్ని గుర్తించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు. లాక్ల వద్ద కూడా నిశితంగా పరిశీలన చేస్తున్నారని అన్నారు. కేసుని ఛేదించిన తూర్పు డీఎస్పీ ఎస్కే అబ్దుల్అజీజ్, సీఐ కె.వెంకటప్రసాద్, ఎస్ఐ ఎస్కే.అబ్దుల్ రహమాన్లను జిల్లా ఎస్పీ అభినందించారు. నిందితులకు రిమాండ్ గుంటూరు లీగల్: మహిళా హత్య కేసులో న్యాయవాది ఎనుముల సురేష్ బాబుతో పాటు మరోకరికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి మహమ్మద్ గౌస్ తీర్పునిచ్చారు. జిల్లా జైలుకు తరలించారు. -
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల కమిటీల నియామకం
బాపట్ల: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జిల్లా అనుబంధ విభాగాల కమిటీలలో వివిధ హోదాలలో పలువురిని నియమించారు. బాపట్ల జిల్లా యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా బాపట్లకు చెందిన అక్కల శ్రీనివాసరెడ్డిని, సెక్రటరీగా బాపట్లకు చెందిన నట్టల కృపాసుమన్ను నియమించారు. బాపట్ల మున్సిపాల్టీ బీసీ సెల్ అధ్యక్షులుగా పాగోలు నారాయణరావును నియమించారు. జిల్లా ఇంటెలెక్చువల్ ఫోరం ఉపాధ్యక్షులుగా అద్దంకికి చెందిన మద్దినేని అశోక్, బాపట్లకు చెందిన దుద్దుకూరి భాస్కరరావు, జిల్లా జనరల్ సెక్రటరీలుగా బాపట్లకు చెందిన పెరికల జోసఫ్, చీరాలకు చెందిన డి.వెంకట సుబ్బారావు, బక్కా శ్రీనివాసరెడ్డి, రేపల్లెకు చెందిన కసుకుర్తి దిలీప్కుమార్, వేమూరుకు చెందిన కె.పిచ్చయ్యశాస్త్రి, కోళ్లపూడి అశోక్కుమార్, పర్చూరుకు చెందిన కె.రామ్ప్రసాద్, సెక్రటరీలుగా అద్దంకికి చెందిన కె.సాంబశివరావు, చీరాలకు చెందిన కేసన శ్రీను, కాగితాల ప్రకాశ్, వేమూరుకు చెందిన జి.రామిరెడ్డి, ఎం.గోపయ్య, పర్చూరుకు చెందిన అక్కల రామిరెడ్డి, తాళ్లూరి అమరేష్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎం.ప్రకాశ్ (అద్దంకి), పి.ఎస్.ఆనంద్కుమార్ (బాపట్ల), షేక్.మహబూబ్వలి (బాపట్ల), కె.వెంకటేశ్వర్లు (చీరాల), కె.ఆనంద్కుమార్ (చీరాల), జె.రమేష్ (రేపల్లె), పిట్టు హైమా శ్రీనివాసరెడ్డి (రేపల్లె), ఎస్.ఎస్.ప్రసాద్ (రేపల్లె), ఎన్.వెంకటేశ్వరరావు (రేపల్లె), జి.నాగేశ్వరరావు (వేమూరు), ఎస్కె.అసీఫుల్లా (పర్చూరు), పి.సుబాష్ (పర్చూరు)లను ఎంపిక చేశారు. -
అన్నదాతల పోరుబాట
కొల్లూరు: బళ్ల బాట విషయంలో రాజకీయ నాయకుల వత్తిళ్లకు రెవెన్యూ అధికారులు తలొగ్గడం రైతులు రోడ్డెక్కి నిరసనలకు దిగడానికి దారితీసింది. అన్ని వర్గాలకు చెందిన సన్న, చిన్నా కారు రబీలో పండించిన పంట ఉత్పత్తులు తరలించుకోవడానికి ఉన్న బళ్లబాటను ఒకరిద్దరు మోతుబరి రైతులు చెరబట్టడంతో కడుపు మండిన కర్షకులు ఽఆందోళనకు దిగారు. 200 ఎకరాల పై చిలుకు విస్తీర్ణంలో సాగైన జొన్న, మొక్కజొన్న, ధాన్యం ఉత్పత్తులు తరలింపును అడ్డుకుంటూ బళ్లబాటను చెడగొట్టిన రైతులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండుతో బక్క రైతులు రహదారిపై బైఠాయించి గొంతెత్తి నినదించారు. మోతుబరి రైతులకు అధికార టీడీపీకి చెందిన నాయకులు కొమ్ముకాస్తూ దిగువ పొలాలకు బళ్లబాట లేకుండా చేస్తున్నారన్న ఆవేదనతో రైతులు ధర్నాకు దిగారు. టీడీపీ నాయకుల ఆదేశాలను పాటిస్తున్న రెవెన్యు అధికారులు రైతుల పొట్టకొడుతున్నారంటూ రేపల్లె – తెనాలి ప్రధాన రహదారిపై మండుటెండలో బైఠాయించారు. మాటదాటేసి మభ్యపెట్టడంతో... కొల్లూరు శివారు కేటీ కాలనీ మార్గంలోని ఈద్గా వద్ద గత కొద్ది కాలంగా పంట భూములకు ఉన్న బళ్లబాట విషయంలో వివాదం నడుస్తుంది. లోపల పంట భూములున్న సన్న, చిన్నకారు రైతులు పంట దిగుబడులు, ఎరవులు తరలింపుకు వీలుగా బళ్లబాట ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల రాకపోకలు జరగకుండా ఒకరిద్దరు పెద్ద రైతులు బళ్లబాటను తవ్వించడంతో వివాదం ముదిరింది. తమకు న్యాయం చేయాలని రైతులు సోమవారం కొల్లూరు రెవెన్యు కార్యాలయంలో బైఠాయించి నిరసనకు దిగారు. దీనితో తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు వివాదాస్పదమైన బళ్లబాటను పరిశీలించి బుధవారం నుంచి రాకపోకలు సాగేలా చూస్తానని రైతులకు భరోసా కల్పించి నిరసనను విరమింపజేశారు. అయితే బుధవారం కొల్లూరు రెవెన్యు కార్యాలయం వద్దకు వచ్చిన రైతులు తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీనితో తహసీల్దార్ టీడీపీ నాయకుల వత్తిళ్లకు తలొగ్గి రైతులను మభ్యపెట్టి, మాటదాటవేచి మోతుబరీ రైతుల పక్షాన నిలుస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చిన రైతులు కొల్లూరు బస్టాండ్ సెంటర్లో రేపల్లె – తెనాలి ప్రధాన రహదారిలో ధర్నాకు ఉపక్రమించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు రైతులను విషయం అడిగి తెలసుకొని ధర్నాను విరమించాలని సూచించారు. రైతులు ససేమిరా అనడంతో రికార్డులు పరిశీలించి రెవెన్యు అధికారుల సమక్షంలో న్యాయం చేస్తామని ప్రజలకు ఇబ్బంది కల్పించడం తగదని సూచించడంతో రైతులు ధర్నాను విరమించి పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. రేపల్లె ఆర్డీఓ, తహసీల్దార్ల సమక్షంలో సమస్య సామరస్యంగా పరిష్కరిస్తానని సీఐ భట్టిప్రోలు మండలంలో ఇతర కార్యక్రమానికి వెళ్లడంతో రైతులు తిండీ, తిప్పలు మానుకొని వారి కోసం 4 గంటలపాటు పడిగాపులు కాశారు. బళ్ల దారి కోసం కార్యాలయాల బాట దారి విషయంలో అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న సన్న, చిన్నకారు రైతులు తమకీ దుస్థితి పట్టించిన అధికార టీడీపీ నాయకులు, అధికారుల తీరును ఎండగడుతున్నారు. రైతుల సమస్య పరిష్కారం కోసం వివాదాస్పదమైన దారి వద్దకు వచ్చిన రేపల్లె ఆర్డీఓ బి. శ్రీదేవి రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తామని రైతులకు తెలపడంతో అన్నదాతలు నిరుత్సాహానికి గురయ్యారు. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా, దారి లేకుండా చేసిన ఒకరిద్దరు రైతుల కోసం ఇంతమంది రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఆమెకు మొరపెట్టుకున్నారు. సమస్య పరిష్కారం విషయంలో కాలయాపన జరిగితే పంట వ్యర్ధాలకు ఇతర రైతులు నిప్పు పెడితే తమ పంట సైతం బుగ్గిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎటువంటి అన్యాయం చేయకుండా, రెవెన్యు రికార్డులు, బళ్లబాటను అడ్డగించిన వ్యక్తుల రికార్డులు, రైతులు, ఇరిగేషన్ శాఖ వద్ద ఉన్న రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తానని ఆమె రైతులకు హామీ ఇచ్చారు. ఆర్డీఓ హామీతో మెత్తబడిన రైతులు ఆందోళనను విరమించి గురువారం రేపల్లె ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లేందుకు సముఖత వ్యక్తం చేశారు. బళ్ల బాట ఏర్పాటులో ‘పచ్చ’పాతంపై రైతుల ఆగ్రహం దారి విషయంలో అధికారులపై టీడీపీ నాయకుల ఒత్తిళ్లు బళ్ల దారి ఏర్పాటులో రెవెన్యూ యంత్రాంగ వైఫల్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు రేపల్లె – తెనాలి ప్రధాన రహదారిపై ధర్నా రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తానని రేపల్లె ఆర్డీఓ హామీ -
డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అక్రమ అరెస్ట్లు
తాడేపల్లిరూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వారి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రంలో ఏదైనా విషయంపై ప్రజలు చర్చించుకునే సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను అక్రమ అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు అంకమరెడ్డి నారాయణమూర్తి అన్నారు. బుధవారం తాడేపల్లి పట్టణ పరిధిలో నవోదయ కాలనీలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర మీడియా కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమంగా అరెస్ట్ చేసిన సంఘటనపై సంఘటనా స్థలం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు కోసం మావిగన్ ప్రతిపాదన తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ఇలా చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు -
ఖాకీల రేంజ్ వేరు
ప్రభుత్వ అవినీతి, అసమర్థతను చూస్తూ తట్టుకోలేక సామాన్యుడు సామాజిక మాధ్యమంలో ఒక్క పోస్టు పెట్టడం ఆలస్యం.. పచ్చ పెద్దల హుకుంతో ఖాకీలు వచ్చి వాలిపోతారు. ఒక తీవ్రవాదిని పట్టుకుంటున్నాం అన్నంత ‘రేంజ్’లో అర్ధరాత్రిళ్లు, మఫ్టీల్లో ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు రావడాలు.. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై దాడి చేయడాలు.. స్టేషన్ నుంచి స్టేషన్కు మారుస్తూ చిత్రహింసలు పెట్టడాలు.. తప్పుడు కేసులు బనాయించడాలు.. ఇవన్నీ ఇక్కడి పోలీసులకు షరా మామూలే. అధికారపార్టీ నేతలు విజయోత్సవ ర్యాలీలు, రోడ్లపై ఉత్సవాల పేరుతో నానా హంగామా చేసినా పట్టించుకోరు.. అదే ప్రతిపక్ష నేతలు చిన్న నిరసన వ్యక్తం చేసినా.. లాఠీలతో కుళ్ల బొడుస్తూ.. తప్పుడు కేసులు నమోదు చేయడంలో ముందుంటారు. తమ దందాలకు అడ్డొస్తే వారు ఎంతటివారైనా, న్యాయవాదులైనా అడ్డు తొలగించుకోవడంలో ముందుంటారు. ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చి ఆత్మహత్యలకు కారణమవుతారు.. ప్రేమికుల వ్యవహారాల్లో వీడియోలు తీసి లైంగిక వాంఛలు తీర్చుకుంటారు.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో.. కాబట్టే ఇక్కడి పోలీసుల ‘రేంజ్’ వేరయా.. అని ఉమ్మడి జిల్లావాసులు చెప్పుకొంటున్నారు. గుంటూరు సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు రేంజ్లో పోలీసులు కట్టుతప్పుతున్నారా? వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలను పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తోంది. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ఖాకీ చొక్కాలు విప్పేసి పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా కేసుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41 నోటీసులు ఇవ్వాలని చెప్పినా పోలీసులు తమ తీరు మార్చుకోవడం లేదు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై రెచ్చిపోయిన వైనం రెండురోజుల క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు బ్రాడీపేటలోని ఆ పత్రిక నగర కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. లాలాపేట, పాతగుంటూరు, పట్టాభిపురానికి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నతాధికారుల ముందే రెచ్చిపోయి వైఎస్సార్ సీపీ నేతలను, కార్యకర్తలను లాఠీలతో కుళ్లబొడిచారు. గోడ దూకి మరీ వెళ్లి.. తాజాగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చినపులివర్రులో నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్బాబు స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని సమర్ధిస్తూ మాట్లాడటంపై నిలదీస్తూ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో ఎటువంటి అసభ్యకరమైన భాష వాడలేదు. అయినా తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు ఇచ్చారన్న పేరుతో అర్ధరాత్రి దాటిన తర్వాత మఫ్టీలో ప్రైవేటు వాహనంలో గోడలు దూకి వెళ్లి మరీ తనీష్బాబును అరెస్టు చేయడానికి పోలీసులు యత్నించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఈ అక్రమ అరెస్టును అడ్డుకోబోయిన కుటుంబసభ్యులతో పాటు తనీష్పై కూడా పోలీసులు చేయి చేసుకోవడం, బలవంతంగా లాక్కెళ్లాలని చూడటంతో స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అశోక్బాబు అక్కడికి చేరుకుని పోలీసులను నిలదీయడమే కాకుండా పోలీసులపై కేసు నమోదు అయ్యేలా చూశారు. ఇక పల్నాడు జిల్లాలో అయితే పోలీసులు పూర్తిగా అదుపుతప్పారు. రోజుకో ఆరోపణలతో పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెస్తున్నారు. పల్నాడు జిల్లాలో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించిన ఒక సీఐను మహిళతో సహజీవనం చేసిన వ్యవహారంలో వీఆర్కు పంపారు. మాచర్లకు చెందిన చౌడేశ్వరి ప్రేమ వ్యవహారంలో తలదూర్చి ఆమె పరువు హత్యకు పరోక్షంగా సహకరించిన సీఐ సస్పెండ్ అయ్యారు. మాచర్లకే చెందిన ఓ ఏఎస్ఐ ప్రేమ జంటల్ని బెదిరించి వారి వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా లైంగికంగా వేధించిన కేసులో సస్పెండ్ అయ్యారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాది హత్యకేసులో నరసరావుపేటకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టు అయ్యారు. అక్రమ సంబంధం నేపథ్యంలో మరో కానిస్టేబుల్ను కలుపుకొని హత్యకు పాల్పడ్డారు. అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటే ఏమైనా చేయవచ్చనే ధీమానే పోలీసులను తప్పుడు మార్గంలోకి నెడుతోంది. -
చేబ్రోలు పోలీసుల అత్యుత్సాహం
చేబ్రోలు: స్వల్ప విషయాన్ని రాద్ధాంతంగా మార్చి టీటీపీ నాయకుల ప్రోత్సాహంతో రాజకీయం చేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన గ్రామంలో ఉద్రికత్తలకు కారణంగా నిలిచింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని పోలేరమ్మ గుడి వద్ద ఈ నెల 7వ తేదీన తిరునాళ్ల జరిగింది. గుడి ఎదురుగా 50 సంవత్సరాల క్రితం స్థానిక దాతలు బస్ షెల్టర్ను నిర్మించారు. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరటంతో ఆ ప్రాంతంలో మందుబాబులకు అడ్డాగా, అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. ఆలయ ధర్మకర్తల కుటుంబసభ్యులు గుడి వద్ద భక్తులకు ఉపయోగపడేందుకు శిథిలావస్థలో ఉన్న షెల్టర్ను తొలగించారు. స్థానిక టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో పంచాయతీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేబ్రోలు స్టేషన్ నుంచి ఎస్ఐ కే వీరనారాయణ సిబ్బందితో కలిసి పోలేరమ్మ గుడి సెంటర్ వద్ద షెల్టర్ వద్దకు వెళ్లారు. రోడ్డు పక్కన వెళ్తున్న వారికి ఇబ్బందులు కొత్తరెడ్డిపాలెంలోని పోలేరమ్మ గుడి సెంటర్లో సంఘటనా ప్రాంతం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. షెల్టర్ తొలగింపు చేపట్టిన విషయాన్ని వాస్తవాలను గుర్తించాల్సిన పోలీసులు దానిని తుంగలో తొక్కారు. గ్రామానికి చెందిన గాదె వినయభూషణ్రెడ్డి ఇంటికి వెళ్లే సమయంలో పోలీసులు ఆపి సంఘటన గురించి వివరాలు అడిగారు. ఫిర్యాదు చేసిన వారినే అడిగితే వారే పేర్లు చెబుతారుగా అని సమాధానం చెప్పటం పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. ఎస్ఐ వీరనారాయణ అసభ్యకరంగా బూతులతో మాట్లాడటంతో... సక్రమంగా మాట్లాడాలని వినయభూషణ్రెడ్డి చెప్పారు. దీంతో జీపులో ఎక్కించి వారికి మర్యాదలు చేయండి అని సిబ్బందికి చెప్పటంతో గ్రామస్థులు అడ్డుతిరిగారు. వినయభూషణ్రెడ్డిని, ఆయన భార్య గీతావాణి, బీబీఏ చదువుతున్న శశిదత్రాయరెడ్డిలను ఎస్ఐ ఈశ్వర్, ఏఎస్ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు జీబులో స్టేషన్కు బలవంతంగా తీసుకువెళ్లారు. గుండె సంబంధ వ్యాధితో బాదపడుతున్న వినయభూషణ్రెడ్డిని అర్ధరాత్రి రెండు గంటల వరకు నిలబెట్టి ఇబ్బందులకు గురిచేశారు. కానిస్టేబుల్తో పోలీసులపై దౌర్జన్యం చేశారనే తప్పుడు ఫిర్యాదుతో వారి కుటుంబసభ్యులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. 8వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్ వద్ద ఉంచి ఇబ్బంది పెట్టారు. చదువుతున్న ఆయన కుమారుడిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. చెప్పినట్లు వినకపోతే మీ అంతు చూస్తామని బెదిరింపులకు పోలీసులు దిగారు. షెల్టర్ను తొలగింపు పనులు చైన్నె ప్రాంతానికి చెందిన లింగమ్మ ఉరఫ్ లీలావతి చేపట్టినట్లు ఆమె పంచాయతీకి, పోలీసులకు తెలియజేసింది. నాలుగు రోజులుగా పోలీసు స్టేషన్కు, పంచాయతీకి తిరిగినా ఆమె మొర ఆలకించలేదు.కొత్తరెడ్డిపాలెంలో జరిగిన సంఘటనపై కేసు వివరాలు తెలుసుకోవటానికి వచ్చిన హైకోర్టు న్యాయవాది శివప్రసాద్పై చేబ్రోలు ఎస్ఐ పి. వీరనారాయణ వీరంగం సృష్టించారు. హర్ట్ పేషంట్ను, మహిళలను అర్ధరాత్రి వరకు స్టేషన్లో ఉంచటంపై న్యాయవాది ప్రశ్నించటంతో ఎస్ఐ అసహనానికి గురయ్యారు. సీసీటేజీల గురించి, ఎఫ్ఐఆర్ల గురించి హైకోర్టు న్యాయవాది వివరాలను అడగటంతో ఎస్ఐ లేచి మీదకు రావటంపైజిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు న్యాయవాది శివప్రసాద్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు పోలీసులు గ్రామంలోని వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయటం, పోలేరమ్మ గుడి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మానవ హక్కుల కోసం పోరాడిన అంబేడ్కర్
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: మానవ హక్కుల కోసం పోరాడిన ప్రపంచ మేధావిగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు మంగళవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈటీసీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభ సూచికగా జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించారు. అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్తో పాటు అతిథులు పుష్ప మాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చరిత్రపై రూపొందించిన కరపత్రాలను కలె క్టర్ విడుదల చేశారు. తొలుత 94 మందికి రూ.1.22 కోట్లు విలువచేసే 94 యూనిట్లను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ నేటి యువత అంబేడ్కర్ వలే కష్టపడి చదివి, దేశానికి ఉపయోగపడేలా ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రతి నెలా ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని, సందర్శిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ గ్రామాలలో పౌరహక్కుల రోజును జయప్రదంగా జరుపుతామని కలెక్టర్ ప్రకటించారు. ఆయన చరిత్రపై ప్రత్యేకంగా వర్క్షాపులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే నాయకుడు కాదని, ప్రపంచానికి నాయకుడుగా అభివర్ణించారు. ఎస్సీ ఎస్టీ సామాజిక భవనానికి చర్యలు తీసుకుంటామన్నారు. -
మహోన్నత వ్యక్తి అంబేడ్కర్
భట్టిప్రోలు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సర్వ సమానత్వానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మంగవారం భట్టిప్రోలు మండలం సూరేపల్లి పంచాయతీ పరిధిలోని వేమవరం గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్ అన్నారు. ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన నిరూపించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత శిఖరాలు చేరుకున్నప్పుడే నిజమైన నివాళులు అర్పించినట్లని పేర్కొన్నారు. ‘స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’నే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో ఆవిష్కరించారని గుర్తుచేశారు. దీనిని 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 400 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమైందని తెలిపారు. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన స్మృతివనం, అంబేడ్కర్ జీవిత విశేషాలను తెలిపే మ్యూజియం పర్యాటకులకు ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన జంగం చంద్రశేఖర్, ఐనంపూడి ఏసుదాసు తదితరులను నాగార్జున అభినందించారు. విశ్రాంత హెడ్మాస్టర్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు జంగం సుబ్బారావు, గ్రామానికి చెందిన మానేపల్లి చెంచులక్ష్మి సహకారం అందించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఆర్ఈఎఫ్ డైరెక్టర్ రెబ్బా ఇమ్మానియేల్, వేమూరు నియోజకవర్గ మజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు, న్యాయవాది డేవిడ్ విజయ్ కుమార్, కనపర్తి మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
బాపట్ల
పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2720 టీఎంసీలు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,000, గరిష్ట ధర రూ.11,500, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 527.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 4,156 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. 7 -
ఘనంగా అంబేడ్కర్, ఫూలే, జగ్జీవన్రామ్ల జయంతి
గుంటూరు లీగల్: మహనీయులు బాబూ జగ్జీవన్రామ్, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి, ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ హాజరయ్యారు. జిల్లా కోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ మెంబర్స్ జి.శాంతకుమార్, వి.బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులు సందేశాలను అందించారు. సీనియర్ న్యాయవాదులు వైకే, పోకల వెంకటేశ్వర్లు, వి.హృదయరాజు, సాంబిరెడ్డి, బి.అంకమ్మరావు, పి.ప్రసాద్, సి.వెంకటరామయ్య తదితరులు ప్రసంగించారు. బార్ అసోసియేషన్ నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎం.రేవతి, ట్రెజరర్ ఆకుల లక్ష్మీసుజాత, సంయుక్త కార్యదర్శి పి.ఏసుప్రసాద్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు, లైబ్రరీ సెక్రటరీ పూదోట రాజేష్ లింగం, లేడీ రిప్రజెంటివ్ అడపా ఇందిరా, లేడీ ఎగ్జిక్యూటివ్ లక్ష్మీ తిరుపతమ్మ, సీనియర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, లాయర్లు పాల్గొన్నారు. వేమూరు: అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని బాలకోటేశ్వర స్వామిని దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయంలో పనుల నిర్వహణపై పాలకమండలి, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలని సూచించారు. దేవస్థానం అభివృద్ధి అధికారి శ్రీనివాస్ వర్మ, సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట: జిల్లాలో భూగర్భ జలమట్టం పెంచేందుకు రానున్న మూడు నెలల్లో రూ.26.46 కోట్లు వెచ్చించి పనులు చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జలధార–జల హారతి కార్యక్రమం కింద సాగునీటి సంఘాల ద్వారా చేపట్టనున్న పనులకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని భూగర్భ జల మట్టం మూడు మీటర్ల నుంచి ఆరు మీటర్ల మేరకు పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తం 227 చెరువులలో పూడికతీత పనులు, కాల్వల పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీటి–తాగునీటి సరఫరా, భూగర్భ జలమట్టం మెరుగుపరుస్తామన్నారు. డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, జిల్లా భూగర్భజల శాఖ అధికారి రామ్ బాలాజీరెడ్డి పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా అండర్–13 ఓపెన్, బాలికల చెస్ చాంపియన్షిప్ పోటీలు స్థానిక నలందానగర్లోని మకూన్స్ కిడ్స్ ప్లే స్కూల్లో మంగళవారం జరిగాయి. బాలుర విభాగంలో మాక్షరత్ గోగినేని, మారెడ్డి తేజభరత్రెడ్డిలు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. బాలికల విభాగంలో జె.అలేఖ్య, జయఅలేఖ్య తన్నీరు ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారని పోటీల నిర్వహకుడు పి.విజయ్ కుమార్ తెలిపారు. గెలుపొందిన చిన్నారులు త్వరలో మార్కాపురంలో జరగనున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షలు సీహెచ్ రవీంద్రరాజు, న్యూరో సర్జన్ డాక్టర్ సత్యారెడ్డి చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో సుమారు 120 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు. స్కూల్ డైరెక్టర్ సాహితి దుగ్గింపూడి పాల్గొన్నారని పేర్కొన్నారు. -
బైక్ను ఢీకొన్న కారు
మంగళగిరి టౌన్: మంగళగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు మంగళగిరికి చెందిన వాసంతి పెదకాకానిలో నివాసముంటోంది. వాసంతి దంపతులకు మూడు సంవత్సరాల చిన్నారి విరోనిక (3) ఉంది. వాసంతి డెలివరీ నిమిత్తం కొన్ని రోజుల కిందట విరోనికతో మంగళగిరిలోని పుట్టింటికి వచ్చింది. వాసంతి అన్నయ్య ప్రశాంత్ విరోనికను తీసుకుని మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై గౌతమ బుద్ధ రోడ్డు వద్దకు వచ్చాడు. అదే సమయంలో అతివేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ఉన్న ప్రశాంత్, విరోనికలు కిందపడిపోయారు. ఇద్దరిపై నుంచి కారు వెళ్లడంతో విరోనికకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ప్రశాంత్ రెండు కాళ్లకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అదే కారు అక్కడే ఉన్న మరో ఇద్దరు మహిళలను ఢీకొనడంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకుని కారు నడుపుతున్న సిబార్ డెంటల్ కాలేజీలో నాల్గవ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి సాయివాగ్ధేవిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు కారు నడుపుతున్న వైద్య విద్యార్థినిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థినిని బయటకు పంపించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దానశీలత కలిగిన రాడికల్ హ్యూమనిస్ట్ సుబ్బారావు
గుంటూరు ఎడ్యుకేషన్: ఆగమ శాస్త్రంలో విశేషమైన కృషి చేసి వాటిపై పరిశోధనాత్మక పుస్తకాలు రాసిన సందర్భంగా బెంగళూరులోని ‘శ్రీవిద్య ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్’ నుంచి గుంటూరు నగరానికి చెందిన ఆమంచి విజయభాస్కర శాస్త్రి మంగళవారం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వర్సిటీ కులపతి జే శ్రీనివాసమూర్తి, రిజిస్ట్రార్ ఎస్ఆర్ నరసింహమూర్తి చేతుల మీదుగా సత్కారం పొందారు. డాక్టర్ విజయభాస్కర్ శాస్త్రి మాట్లాడుతూ అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ ఆఫ్ వేదిక సైన్సెస్ అనుబంధంగా ఉన్న బెంగళూరు శ్రీవిద్య వేదిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం వారు తమంత తాము గుర్తించి ఈ డాక్టరేట్ను అందజేశారని తెలిపారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న డాక్టర్ విజయ భాస్కర్శాస్త్రి, కరుణశ్రీ దంపతులకు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, మైలవరపు శ్రీనివాసరావు, సామవేదం షణ్ముఖ శర్మ, అన్నదానం చిదంబర శాస్త్రి, పలువురు పీఠాధిపతులు, అర్చక సంఘాలు, బ్రాహ్మణ పరిషత్తులు అభినందనలు తెలిపారు. -
సెంట్రల్ జోన్ సీనియర్ టీ–20 విజేత గుంటూరు జిల్లా జట్టు
మంగళగిరి టౌన్: రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి విమర్శించారు. మంగళగిరిలో ఐద్వా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీదేవి మాట్లాడుతూ ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు యువతకు అందుతున్నాయన్నారు. చంద్రబాబు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని చెప్పడం తప్ప కార్యాచరణ లేదని అన్నారు. పాఠశాల విద్యార్థులకు కూడా అందుబాటులో గంజాయి దొరకడం వలన వారి భవిష్యత్ నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం వలన పనిదినాలు తగ్గిపోయాయని తెలిపారు. మహిళలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మహిళలకు భద్రత లేకపోవడంతో అత్యాచారాలు, దాడులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలియజేశారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస కుమారి మాట్లాడుతూ పసిపిల్లలు సైతం దాడులకు గురికావాల్సి వస్తోందని, సమాజంలో సీ్త్ర విముక్తి కోసం మహిళల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఐద్వా పనిచేస్తుందని అన్నారు. దాడులకు, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై త్వరితగతిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ, నాయకులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం
జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో.. అంబేడ్కర్ జీవితం భావితరాలకు స్ఫూర్తి కొరిటెపాడు(గుంటూరు): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి మంచి చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోద్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరులోని ఏపీజీబీ ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బ్యాంక్ లైజర్ ఆఫీసర్ ఉబా ప్రసాద్, జనరల్ మేనేజర్లు, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాలే స్ఫూర్తి గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ ఆశయాలే స్ఫూర్తి కావాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా తెలిపారు. మంగళవారం నల్లచెరువు మెయిన్ రోడ్డులోని మహావీర్ జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్న టెన్న్త్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన డీఈఓ సలీమ్ బాషా మాట్లాడుతూ మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నప్పటికీ మనమందరం లౌకికవాదాన్ని కట్టబడి ఉండటం మన రాజ్యాంగ గొప్పతనం అని అన్నారు. కార్యక్రమంలో డీవైఈవో జి.ఏసురత్నం, ప్రధానోపాధ్యాయులు మణికుమార్, జే శ్రీనివాసరావు, జి హజ్రయ్య, అంబటి ఇమ్మానుయేలు, సత్యం, డీసీఈబీ కార్యదర్శి ఎ.తిరుమలేష్, ఎ.వెంకట రెడ్డి, ఉర్దూ డీఐ ఖాసీం, శారద, బి.సురేఖ పాల్గొన్నారు. -
బండారుపల్లిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
తాడికొండ: బండారుపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభ గందరగోళంగా మారింది. తెలుగుదేశం పార్టీలోని ఇరువర్గాలు గ్రామసభ సాక్షిగా బాహాబాహీకి దిగడంతో సభలో అధికారులు ప్రేక్షక పాత్ర వహించడమే అయింది. ఎమ్మెల్యే అనుకూల వర్గానికి చెందిన గ్రామపార్టీ అధ్యక్షులు ఇతరులు స్టేజీపై కూర్చొని నడిపిస్తుండటం, తాత్కాలికంగా నియమించిన పంచాయతీ ఉద్యోగుల విషయంపై వ్యతిరేక వర్గం నిలదీయడంతో రసాభాసగా మారింది. గ్రామంలో తాగునీటి సరఫరాలో నాణ్యత ఉండటం లేదని, ఇటీవల రూ.10 లక్షలతో మరమ్మతులు తూతూ మంత్రంగా చేసి పాత ఇటుకలనే పేర్చడంతో ఫిల్టర్ అవడం లేదని ఆరోపించారు. వివాదం ముదరడంతో అధికారులు నామమాత్రంగా సభను నిర్వహించి చేతులెత్తేశారు. -
ప్రజలకు చేరువ చేసేందుకు నియోజకవర్గాల్లో నిర్వహిస్తాం
రేపల్లె: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రతి వారం జిల్లాలోని ఒక్కొక్క నియోజకవర్గంలో నిర్వహిస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. పట్టణ సర్కిల్ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు చట్టపరమైన సమస్యలు పరిష్కరించేందుకు ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణ ప్రజలతోపాటు వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను చట్టపరిధిలో విచారించి నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తామని తెలిపారు. కుటుంబ సమస్యలు, భూవివాదాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర పలు సమస్యలపై నిర్వహించిన ఈ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రేపల్లె పరిసర ప్రాంతాల నుంచి 28 మంది అర్జీలు అందజేశారని పేర్కొన్నారు. అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎప్పీ జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సీఐలు మల్లికార్జునరావు, సురేష్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్దార్ కార్యాలయంలో కారు బీభత్సం
తొమ్మిది బైక్లు, రెండు కార్లు ధ్వంసంచీరాల టౌన్: డ్రైవింగ్లో ఏమాత్రం నైపుణ్యం లేని ఓ వ్యక్తి కారు నడిపి బీభత్సం సృష్టించాడు. సోమవారం మధ్యాహ్నం చీరాల తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో భయానక పరిస్థితి ఏర్పడింది. ప్రమాదం ధాటికి తహసీల్దార్ కార్యాలయం ముందు పార్కింగ్ చేసిన తొమ్మిది ద్విచక్ర వాహనాలు, మరో రెండు కార్లు దెబ్బతిన్నాయి. వివరాలు.. చీరాల తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. కావలికి చెందిన ఒక సీఐ బంధువు చీరాల్లో భూమి రిజిస్ట్రేషన్ కోసం కారులో వచ్చాడు. తన వాహనాన్ని పార్కింగ్ చేసేందుకు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోకి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి పార్కింగ్లో ఉంచిన బైకులు, కార్లను ఢీకొట్టింది. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తుండటంతో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు, పలు శాఖల అధికారుల వాహనాలతో ఆ ఆవరణ కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం ఒక్కసారిగా కారు బీభత్సం సృష్టించడంతో పలుశాఖల అధికారులు, సిబ్బందికి చెందిన తొమ్మిది ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న తహసీల్దార్ గోపీకృష్ణ బయటకు వచ్చి స్థానికుల సాయంతో కారు ఇంజిన్ను నిలిపివేయించి, పోలీసులకు సమాచారం అందించారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి వాహనాలన్నీ రెవెన్యూ కార్యాలయం ఆవరణలో పార్కింగ్ చేయడంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇకపై ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. ఇదిలా ఉండగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో దెబ్బతిన్న వాహనాలకు మరమ్మతులు చేయిస్తామని వెంట తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన కారు కావలికి చెందిన ఓ సీఐది కాబట్టి పోలీసులు వెంటనే రాజీ యత్నాలు చేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
తీరంలో అభివృద్ధి పనులువేగవంతం చేయాలి
బాపట్లటౌన్: తీరంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. సూర్యలంక బీచ్ ప్రాంతాల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరగనున్న అభివృద్ధి పనులకు సంబంధించి భూములను ఆర్డీఓ పి.గ్లోరియా, జిల్లా అటవీశాఖ అధికారి రవిశంకర్తో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యలంక బీచ్ ప్రాంతంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధికి సంబంధించి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. సూర్యలంక అడవి రెవెన్యూ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములను మ్యాప్ ద్వారా మండల సర్వే అధికారులు కలెక్టర్కు వివరించారు. ఖాళీ ప్రదేశం చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసేందుకు సంబంధించి అంచనా తయారు చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. ఆ సర్వే నెంబర్లో ఆక్రమణకు గురైన ప్రాంతంను ఖాళీ చేయించేందుకు నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓ, తహసీల్దార్లను ఆదేశించారు. సూర్యలంక బీచ్ వద్ద అనధికారికంగా టోల్ గేట్ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనధికారికంగా టోల్ గేట్ వసూల్ చేస్తున్న షేడ్ను జిల్లా కలెక్టర్ దగ్గర ఉండి తొలగించారు. ల్యాండ్ అండ్ సర్వే శాఖ ఏడీ సాంబశివరావు, తహసీల్దార్ షేక్ సలీమా, పర్యాటక, అటవీ, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సీఐ ఏకపక్ష వైఖరిపై గ్రీవెన్స్లో ఫిర్యాదు
మార్టూరు: భూ వివాదంలో ఏకపక్షంగా ఓ వర్గానికి కొమ్ము కాస్తూ మార్టూరు సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావు తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ మండలంలోని కోలలపూడి గ్రామానికి చెందిన కుంచపు శ్రీనివాసరావు సోమవారం బాపట్ల గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. కోలలపూడి సర్వే నంబర్ 150లో శ్రీనివాసరావు కుటుంబ స్వాధీనంలో దశాబ్దాల కాలంగా ఐదు సెంట్లు భూమి ఉంది. ఈ భూమి విషయమై శ్రీనివాసరావు సామాజిక వర్గానికే చెందిన మరో కుటుంబంతో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అందులో భాగంగా రెండు నెలల కిందట ఇరువర్గాలను స్థానిక తహసీల్దార్ ముందు పోలీసులు బైండోవర్ చేశారు. ఈ క్రమంలో గత ఆదివారం సీఐ శ్రీనివాసరావు స్టేషన్కు రమ్మన్నారంటూ పోలీస్స్టేషన్ నుంచి శ్రీనివాసరావుకు పిలుపు వచ్చింది. ఆదివారం ఉదయం 10 గంటలకు స్టేషన్కు వెళ్లిన శ్రీనివాసరావు దంపతులను సిబ్బంది సాయంత్రం రావాలంటూ తిప్పి పంపించారు. రాత్రి 9 గంటలకు స్టేషన్కు వచ్చిన సీఐ బాధితుడు శ్రీనివాసరావును తన గదిలోకి పిలిపించాడు. తనను ఏ కారణంతో స్టేషన్కు పిలిపించారనే విషయాన్ని పలుమార్లు అడుగుతున్నా చెప్పకుండా సీఐ చెప్పటానికి వీలులేని అసభ్య పదజాలంతో దూషిస్తూ తనను భయపెట్టాడని చెప్పాన్నాడు. వివాదాస్పద భూమిలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తావంటరా.. నా కొడకా.. నాతో పెట్టుకుంటే లాఠీ దించుతాను అంటూ రాయడానికి వీలులేని పదజాలంతో తనను తీవ్రంగా సీఐ దూషించినట్లు శ్రీనివాసరావు తెలిపాడు. సీసీ కెమెరాలను ఎవరూ ధ్వంసం చేయలేదని యథాస్థితిలోనే ఉన్నాయని వచ్చి పరిశీలించుకోవాలని తాను చెబుతున్నా సీఐ తనను మాట్లాడనివ్వకుండా తిడుతూనే ఉన్నారన్నారు. రాత్రి 11 గంటల వరకు తనను తన భార్యను పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టిన సీఐ తరువాత ఇంటికి పంపించినట్లు వివరించాడు. తమ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుల ఆదేశాలను పాటిస్తూ తనను సీఐ స్టేషన్కు పిలిపించి దూషించినట్లు చెప్పారు. తనకు ఇక్కడ ఎలాంటి న్యాయం జరగదని భావించి జరిగిన విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాల్సిందిగా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసరావు విలేకరులకు తెలిపాడు. -
ఏ దారి కానరాక..!
కొల్లూరు: పంట ఉత్పత్తుల తరలింపునకు ఉన్న బాటను సాధించుకునేందుకు అన్నదాతలు పోరు బాట పట్టారు. రెక్కల కష్టంతో శ్వేదం చిందించి సంపాదించుకున్న సొమ్మును విరాళాల రూపంలో సేకరించుకొని రూ.7లక్షలు వెచ్చించి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న బళ్ల దారి మార్గాన్ని పచ్చ పార్టీ నాయకుల అండదండలతో కబళిస్తున్న పెద్ద రైతుల కబంధ హస్తాల నుంచి దక్కించుకునేందుకు కర్షకులు రోడ్డెక్కి నిరసన గళం విప్పారు. టీడీపీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి ఒత్తిళ్లకు తలొగ్గి రెవెన్యూ యంత్రాంగం దారి సమస్యను పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ రైతులు రెవెన్యు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సోమవారం కొల్లూరు రెవెన్యు కార్యాలయ ఆవరణలో బైఠాయించి సన్న, చిన్న కారు రైతులు నిరసన వ్యక్తం చేశారు. అసలేం జరిగింది.. కొల్లూరు శివారు కేటీ కాలనీ మార్గంలోని ఈద్గా వద్ద ఉన్న బళ్ల బాట విషయంలో గత కొద్ది కాలంగా వివాదం నడుస్తుంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం బళ్ల బాటగా ఉన్నప్పటికీ, సాగునీటి పారుదల కాలువ, బోదె కాలువల ఏర్పాటులో ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం సమస్యకు ప్రధాన కారణంగా మారింది. గతంలో బళ్ల మార్గం ద్వారా పంట ఉత్పత్తులను తరలించుకోవడానికి అవకాశం ఉందన్న విషయం తెలుసుకున్న 200 ఎకరాల పై చిలుకు పంట భూములున్న సన్న, చిన్న కారు రైతులు స్వచ్ఛందంగా చందాలు వేసుకొని వంతెన నిర్మించుకొని పంట ఉత్పత్తుల తరలింపునకు వీలుగా బళ్ల మార్గాన్ని పునరుద్ధరించారు. అయితే కేటీ కాలనీ ప్రధాన మార్గానికి ఆనుకొని ఉన్న ఒకరిద్దరు రైతులు బళ్ల మార్గం ఏర్పాటు విషయంలో ఆక్షేపించడంతో దారి అంశంపై కోర్టును ఆశ్రయించారు. రైతుల పంటపొలాలకు వెళ్లాల్చిన దారి సమస్య పరిష్కారానికి కొద్ది గడువు కోరడం జరిగింది. దారి వివాదం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బుధవారం లోపు సమస్యను పరిష్కరిస్తాం. బుధవారం నుంచి రైతులు సాగు చేసిన మొక్కజొన్న, జొన్న పంటలను బళ్ల మార్గం ద్వారా తరలించుకునేలా చర్యలు తీసుకుంటాం. – బి.వెంకటేశ్వర్లు, కొల్లూరు తహసీల్దార్ -
ఉత్తమ ప్రదర్శనగా శ్రీమాత్రే నమః నాటిక
యడ్లపాడు: చారిత్రక వైభవానికి నిలయమైన కొండవీడు ప్రాంతంలో అద్భుత కళాసౌరభాలు విరబూశాయి. లింగారావుపాలెం గ్రామంలోని పోసాని సుబ్బారావు కళావేదికపై మూడు రోజుల పాటు జరిగిన కొండవీటి కళాపరిషత్ 27వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. తొమ్మిది విభిన్న నాటికలు ప్రదర్శితమైన ఈ వేదికపై కథా బలం, నటీనటుల అభినయం, సాంకేతిక హంగులు పోటీపడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన రమణారావు, ఏ నర్సిరెడ్డి, గోపరాజు విజయ్ అత్యంత పారదర్శకతతో విజేతలను ఎంపిక చేశారు. ఉత్తమ ప్రదర్శనగా శ్రీమాత్రే నమః నాటిక. ప్రదర్శనల విభాగంలో హైదరాబాద్కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ వారు ప్రదర్శించిన ‘శ్రీమాత్రే నమః’ నాటిక తన అద్భుత ప్రదర్శనతో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని ఉత్తమ ప్రదర్శన బహుమతిని గెలుచుకుంది. విజయవాడ సాంస్కృతిక సమితి వారి ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక ద్వితీయ బహుమతిని గెలుచుకోగా, గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక తృతీయ స్థానంలో నిలిచింది. గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ‘ఇది అతని సంతకం’ నాటిక జ్యూరీ ప్రత్యేక ప్రదర్శనగా గుర్తింపు పొంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అభినయ విభాగంలో.. కళాకారుల అభినయంలో... ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక అవార్డుల పంట పండించింది. ఈ నాటికలో ముత్యాలరావు పాత్రలో ఒదిగిపోయిన ఈఎస్ పవన్ కుమార్ ఉత్తమ నటుడిగా, రమణమ్మ పాత్రలో భావోద్వేగాలను పండించిన ఆర్.రాజేశ్వరి ఉత్తమ నటిగా నిలిచారు. ఇదే నాటికకు దర్శకత్వం వహించిన సుఖమంచి కోటేశ్వరరావు ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ‘శ్రీమాత్రే నమః’ నాటికకు పదునైన మాటలు అందించిన ఉదయ భాగవతుల ఉత్తమ రచయితగా అవార్డు అందుకున్నారు. ‘తరమెల్లి పోతున్నదో’ నాటికలో రంగనాథం పాత్ర పోషించిన ఎన్.శ్రీధర్ ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికవగా, మాతృత్వం నాటిక సంతోష్ పాత్రధారి.. పొగర్తి నాగేశ్వరరావు, మంచిమనసులు నాటిక సూర్య పాత్రధారి.. నడింపల్లి వెంకటేశ్వర్లు తమ నటనకు గానూ ప్రత్యేక ప్రశంసా బహుమతులు అందుకున్నారు. ఉత్తమ ప్రదర్శనలు, నటులకు పరిషత్ నిర్వాహకులు నగదు పారితోషికంతో పాటు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు కట్టా శ్రీహరిరావు, ఉపాధ్యక్షులు తోకల సాంబశివరావు, నంబూరి వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మండెపూడి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కోశాధికారులు కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, బ్రహ్మ వరప్రసాద్, పర్యవేక్షకులు జరుగుల రామారావు వీటిని అందజేశారు. -
అండర్–19 యువకుల క్రికెట్ జట్టు ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా అండర్–19 యువకుల క్రికెట్ జట్టును ఎంపిక చేశామని జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రీమెన్ కమిటీ సభ్యుడు టి.శివకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న జట్టు ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు పేరేచర్ల మైదానంలో అంతర్ జిల్లాల అండర్–19 క్రికెట్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జట్టు సభ్యులు జి.దేవ్ప్రమోద్(కెప్టెన్,వికెట్ కీపర్), ఎం.సమన్యుదత్త, కె.ఎన్.వి.కౌషిక్, వి.వెంకట రోహిత్, వి.రిత్విక్, కె.ఎస్.మణికంఠ, వై.శశాంక్రెడ్డి, టి.నాగసాయిచరణ్, ఎం.తులసి నందన్, ఎ.యోచన్, వి.డి.డింకు రామ్ చరణ్తేజ్, ఓ నాగూర్ అబ్దుల్ జబ్బార్, కె.ఆదిత్య శ్రీకర్, ఇ పృధ్వీ శ్రీనివాసరెడ్డి, ఎస్కె.మక్సూర్ ఇర్ఫాన్, డి.డేవిడ్ మెల్విన్. స్టాండ్ బైస్: ఎం.ఎస్.విజయ్, ఎస్కె.నాగుర్ బాషా, ఎస్కె ఎండీ గులాషన్ జమీల్ మోయిన్, వి.అభిషేక్, ఎస్కె అబ్దుల్ అజీజ్. కాటన్ కన్సార్టియం బలోపేతానికి కృషి –ఉప్పుటూరి సాంబశివరావు కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్లో కాటన్ కన్సార్టియం కింద పనిచేస్తున్న జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ కాటన్ టీఎంసీ మిల్స్ అసోసియేషన్ కన్సార్టియం నూతన అధ్యక్షుడు ఉప్పుటూరి సాంబశివరావు పేర్కొన్నారు. స్థానిక ఎస్వీఎన్ కాలనీలోని సమావేశ మందిరంలో సోమవారం అసోసియేషన్ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏల్చూరి వెంకటేశ్వర్లు నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఉప్పుటూరి సాంబశివరావుతోపాటు ఉపాధ్యక్షుడుగా కొమ్మాలపాటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా నల్లూరి గౌరీశంకర్, సహాయ కార్యదర్శిగా నేరెళ్ల ఏడుకొండలు, కోశాధికారిగా గుండా సాంబశివరావులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. కార్యక్రమంలో ఏపీ కాటన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గోరంట్ల పున్నయ్యచౌదరి, వివిధ జిల్లాల ప్రతినిధులు తుమ్మల సాంబశివరావు, మల్లయ్య, జయ కాటన్ సుబ్బారావు, బుల్లెట్ సుబ్బారావు, మదమంచి రంగారావు, కె.గోపాలకృష్ణ, వెంకటరామిరెడ్డి, దశరథరామిరెడ్డి, కుబేర్నాథరెడ్డి, మొరహరిరెడ్డి పాల్గొన్నారు. విద్యుత్ అధికారుల ఆకస్మిక తనిఖీలు రూ.12.93 లక్షలు అపరాధ రుసుం వసూలు కొరిటెపాడు(గుంటూరు): విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్ రమేష్ ఆధ్వర్యంలో డీ–13 సెక్షన్ పరిధిలోని ఆటోనగర్, నవభారత్నగర్, ఆర్టీసీ కాలనీలలో సోమవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో 54 మంది అధికారులు, 158 మంది సిబ్బంది 54 బృందాలుగా ఏర్పడి 4,489 సర్వీసులను తనిఖీలు చేశారు. అనుమతించిన లోడు కన్నా అదనంగా విద్యుత్ వాడుతున్న 183 మందికి రూ.12.16 లక్షలు, అనుమతించిన కేటగిరి కాక ఇతర కేటగిరిలో విద్యుత్ వాడుతున్న ఆరుగురికి రూ.52 వేలు, మీటరు ఉన్నప్పటికీ అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఒకరికి రూ.25 వేలు మొత్తం కలిపి రూ.12.93 లక్షలు అపరాధ రుసుం విధించినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్ఏ కరీమ్, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.హుస్సేన్ ఖాన్లు మీడియాకు తెలిపారు. తనిఖీల్లో డీఈఈలు పి.రమేష్, ఎన్.మల్లికార్జున ప్రసాద్, కె.రవికుమార్, ఏఈఈలు వి.బాజీ, యు.శివశంకర్, ఎం.సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్రకారుడు వల్లెం కృష్ణకు అంతర్జాతీయ మెరిట్ జ్యూరీ అవార్డు వినుకొండ: మండలంలోని గోకనకొండ గ్రామానికి చెందిన చిత్రకారుడు వల్లెం కృష్ణకు మరో అంతర్జాతీయ స్థాయి పురస్కారం లభించింది. డాక్టర్ కేపీ బాబు నేతృత్వంలోని క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో కృష్ణ గీసిన చిత్రానికి అంతర్జాతీయ మెరిట్ జ్యూరీ అవార్డు, నగదు బహుమతి అందుకున్నారు. అవార్డు పొందిన కృష్ణను పలువురు అభినందించారు. -
డ్రగ్స్ ఆరోగ్య సమస్య కాదు – భద్రత సమస్య
ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ చేబ్రోలు: డ్రగ్స్ ఆరోగ్య సమస్య, నేర సమస్య మాత్రమే కాదు, జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు అని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. డ్రగ్స్ ద్వారా వచ్చే డబ్బు ఉగ్రవాద సంస్థలకు చేరి దేశానికి హానికరంగా మారుతోందన్నారు. దీనిని ‘నార్కో టెర్రరిజం’గా అభివర్ణించారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో, వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో, ఈగల్ టీమ్ సహకారంతో ‘డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ – దండి మార్చ్ 2.0’ పేరుతో నిర్వహిస్తున్న 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర 8వ రోజు విజ్ఞాన్ యూనివర్సిటీకి చేరింది. డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమంగా ‘ది గ్రేటెస్ట్ డ్రగ్–ఫ్రీ మార్చ్ ఆన్ ఎర్త్’ అనే సందేశంతో యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచేందుకు ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య ఆవిష్కరించారు. 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఈగల్ ఏఎస్పీ స్వరూపరాణి, తెనాలి డీఎస్పీ మల్లికార్జునరావు, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో చలివేంద్రం ప్రారంభం
గుంటూరు వెస్ట్: కలెక్టరేట్ ఆవరణలో చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి సోమవారం ప్రారంభించారు. పీజీఆర్ఎస్కు విచ్చేసిన దరఖాస్తుదారులకు మజ్జిగ కూడా పంపిణీ చేశారు. వేసవి ఎండలు దృష్ట్యా కలెక్టరేట్ అవరణలోని వివిధ శాఖల కార్యాలయాలకు వచ్చే సందర్శకుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి సోమవారం చలివేంద్రంలో నీరు, మజ్జిగ పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, జిల్లా విపత్తుల నిర్వహణ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ వి జ్యోతిబసు, డీఆర్డీఎ పీడీ విజయలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య, డీఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా జేసీ సంజనా సింహ నరసరావుపేట: బాణసంచా అమ్మకందారులు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఫైర్ క్రాకర్స్ వ్యాపారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ లైసెన్స్ లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెన్యువల్ ముగిసిన వారు వెంటనే చేయించుకోవాలని సూచించారు. వేసవి కాలంలో షాపు నిర్వాహకులు, క్రాకర్స్ నిర్వాహకులు అగ్నిప్రమాదాలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంపాలెం: దుకాణాలు, హోటళ్లల్లో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు సోమవారం కొనసాగాయి. పెదనందిపాడు దత్తసాయి ఆర్యవైశ్య హోటల్, శ్రీలక్ష్మీ దుర్గా మెస్లో గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఆయా తనిఖీల్లో గుర్తించిన ఆరు సిలిండర్లను స్థానిక చిలకలూరిపేట ఎంఆర్ఐ, ప్రత్తిపాడు సీఎస్ డీటీలకు అప్పగించారు. ఆయా మెస్ల నిర్వాహకులపై 6–ఏ కేసులు రెండు నమోదు చేశారు. విజిలెనన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారులు, స్థానిక పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాలయంలో వేంచేసిన్న జ్వాలాముఖిదేవి అమ్మవారికి సోమవారం స్వర్ణకవచాన్ని సమర్పించారు. దేవదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఎన్.శ్రీనివాసరెడ్డి అమ్మవారికి రాగిపై బంగారుపూత వేసిన కవచాన్ని సమర్పించారు. సుమారు 40గ్రాముల బంగారంతో సుమారు రూ.6 లక్షల విలువైన వెండి కవచాన్ని అర్చకులు సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు, జ్వాలాముఖి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
హెల్మెట్ సహిత ప్రయాణం సురక్షితం
రేపల్లె: వాహనచోదకులు హెల్మెట్ను ధరించి చేసే ప్రయాణమే సురక్షితమైనదని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అన్నారు. శిరో రక్ష –ప్రాణ రక్ష కార్యక్రమంలో భాగంగా సోమవారం ఓల్డ్టౌన్ అంకమ్మ చెట్టు సెంటరులో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో వాహన చోదకులకు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదాలు వాటిల్లిన సమయంలో హెల్మెట్ రక్షణగా ఉంటుందన్నారు. తలకు ఎటువంటి గాయాలు తగలకుండా కాపాడుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తుచేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి నేటి వరకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తూ 50 అవగాహన ర్యాలీలు, 159 సదస్సులు నిర్వహించామన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పోలీసు సిబ్బందితో ద్విచక్రవాహనాలపై హెల్మెట్ ధరించి ఓల్డ్టౌన్ నుంచి రింగురోడ్డు, ఓపెన్ థియేటర్, బస్టాండ్ సెంటరు అక్కడి నుంచి పద్మావతి సెంటరు మీదగా పోలీసుస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్, సీఐలు మల్లికార్జునరావు, సురేష్, సర్కిల్ పరిధిలోని పోలీసుస్టేషన్ల ఎస్ఐలు, కానిస్టేబుల్స్, సిబ్బంది పాల్గొన్నారు. -
వేటకు టాటా.. సర్కారు దొంగాట
ఇకపై రెండున్నర నెలలపాటు సముద్ర తీర ప్రాంతాల్లో హైలెస్సా అనే మాటలు వినపడవు.. తీరాన మత్స్యకారుల సందడి కనిపించదు.. సముద్రంలో మత్య్సకారుల పడవలు కానరావు.. కడలి బోసిగా దర్శనమివ్వబోతోంది.. ప్రభుత్వం వేటపై నిషేధాజ్ఞలు జారీ చేయడంతో వేట తప్ప మరో పని తెలియని మత్స్యకారులకు ఈ సంధి కాలం కష్టాల సుడిగుండం కానుంది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు మత్స్యకార భృతి అందించకపోవడంతో గంగపుత్రుల పరిస్థితి మరింత దైన్యంగా మారనుంది. చీరాల టౌన్: రెండున్నర నెలల వేట విరామ సమయంలో బతుకు బండి ఎలా నడపాలో తెలియక గంగపుత్రులు సతమతం అవుతున్నారు. చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలను, కష్టాలను పట్టించుకున్న పాపానపోలేదు. గత ఏడాది ఇవ్వాల్సిన మత్స్యకార భృతి సాయం నేటికీ అందించలేదు. తమపై సీఎం చంద్రబాబు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మత్స్యకారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీరంలో వారం రోజులుగా వేట చేసినా మత్స్య సంపద సరిగ్గా దొరక్కపోవడంతో నానా కష్టాలు అనునభవిస్తున్న మత్స్యకారుల పరిస్థితి.. వేట నిషేధం కాలం గడువు ముంచుకురావడంతో అగమ్యగోచరంగా మారింది. వివరాలు.. ఈ నెల 15 నుంచి జూన్ 15వ తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిలుపుదల చేస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. ఏటా ఈ సమయంలో సముద్రంలో చేపల పునరుత్పత్తి జరుగుతున్న దృష్ట్యా మరబోట్లు, యాంత్రీకరణ తెప్పలతో వేట చేయడాన్ని ప్రభుత్వం నిలిపివేస్తుంది. కుటుంబ పోషణ భారం సాధారణంగా వాడరేవు మత్స్యకారులు కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా రామాయపట్నం వరకు వేటకు వెళ్లి గురకలు, పాములు, బొంత, కూనాం, వంజరం, పండుగప్పలు లాంటి చేపలను పట్టుకొస్తుంటారు. కానీ ప్రస్తుతం సముద్రంలో వేట ఆశాజనకంగా లేకపోవడంతో మత్స్యకారులు తమ బోట్లను చిన్న జెట్టీ వద్ద, వలలను తీరం ఒడ్డున నిలుపుదల చేస్తున్నారు. వేట నిషేధ సమయం ఆసన్నమవ్వడంతో మత్స్యకారులు కుటుంబ పోషణ కోసం అవస్థలు పడుతున్నారు. మత్య్సకారుల అభ్యున్నతికి చేయాతనందిస్తున్నామని పాలకులు మాటల్లో చెబుతున్నారే తప్ప చేతల్లో చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందాల్సిన రాయితీలేవీ ప్రభుత్వం సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో బోటుకు ఆరుగురు మత్స్యకారులు ఉంటారు. ఒక్కో మత్య్సకారుడికి రూ.20వేలు ఇస్తామన్న హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు గంగలో కలిపేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 2019 నుంచి 2023 జూన్ వరకు వేట నిషేధ సాయం ఒక్కో మత్స్యకారుడికి రూ.10 వేలు అందించగా, టీడీపీ ప్రభుత్వానికి మాత్రం గంగపుత్రుల ఆవేదన మచ్చుకై నా పట్టడం లేదు. మత్స్యకార భృతి పథకంపై టీడీపీ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడం, సర్వే, రీసర్వే పేరుతో కాలయాపన చేయడంతో వేలాది మంది మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. జిల్లాలోని చీరాల, పర్చూరు, బాపట్ల, రేపల్లె, అద్దంకి, వేమూరు నియోజకవర్గాల్లో మత్స్యకార జనాభా సుమారు 53,000 మంది ఉన్నారు. వీరిలో సముద్రంలో వేటకు వెళ్లే వారు 16,500 మంది ఉన్నారు. జిల్లాలో చీరాల, వేటపాలెం, బాపట్ల, రెపల్లె, బీవీపాలెం తదితర ఏడు తీరప్రాంత మండలాల్లో 76 కిలోమీటర్ల మేర కోస్టల్ లైన్ విస్తరించి ఉంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇంటి వద్ద ఉంటూ వలలకు మరమ్మతులు చేసుకుంటుంటారు. వరుస విపత్తులతో అల్లాడుతున్న తమకు ప్రభుత్వం సరైన సమయంలో సాయం అందించకపోతే ఎలా బతకాలని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. మత్స్యకారులకు వేట నిషేధంలో అందిస్తామన్న జీవన భృతి రూ.20 వేలను పాలకులు త్వరగా అందించి ఆదుకోవాలి. వేట నిషేధ సాయం ఆలస్యమైతే మేమంతా అప్పులు చేసి కాపురాలు నెట్టుకురావాల్సి వస్తుంది. ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబునాయుడు మత్స్యకారులకు సాయం త్వరగా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే మత్స్యకారులకు రావాల్సిన ఇతర పథకాలకు నిధులు మంజూరు చేయాలి. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడకుండా ఆదుకోవాలి. – ఎస్.నూకాలు, మత్స్యకారుడు, వాడరేవు -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
బాపట్లటౌన్: బాపట్ల ఏరియా వైద్యశాలలో గుర్తుతెలియని వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. పట్టణ పోలీసుల కథనం ప్రకారం... ఈనెల 11న పట్టణంలోని గుంటూరు రైల్వే ఓవర్బ్రిడ్జి సమీపంలో 70 సంవత్సరాల వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు 108 సమాచారం అందించారు. 108 సిబ్బంది వృద్ధుడిని చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న వృద్ధుడు సోమవారం సాయంత్రం మృతిచెందారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నారు. అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ టీచర్లపై వేధింపులు అన్యాయం నరసరావుపేట: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల పేరుతో టీచర్లపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నాయని డెమెక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఆంజనేయరాజు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఈ ఒత్తిడిని అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం జూన్న్లో మాత్రమే అడ్మిషన్లు ప్రారంభించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా కొన్ని పాఠశాలలు డిసెంబర్ నుంచే ముందస్తు అడ్మిషన్లు చేపట్టి నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని వివరించారు. ప్రతి రోజు స్కూల్ ముగిసిన తర్వాత టీచర్లను ఇంటింటికీ పంపిస్తూ అడ్మిషన్ల కోసం ప్రచారం చేయిస్తున్నారని, వారికి టార్గెట్లు విధించి ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. టార్గెట్లు పూర్తి చేయకపోతే జీతాలు నిలిపివేయడం, ఉద్యోగం తీసేస్తామని బెదిరించడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా విద్యా శాఖ అధికారులు దృష్టి సారించి ముందస్తు అడ్మిషన్లు నిలిపివేయాలని, టీచర్లపై వేధింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సెలవు రోజుల్లో కూడా పూర్తి జీతభత్యాలు చెల్లించాలనే నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
మార్కెట్ చీటీల వేలం ఆదాయం రూ.89.56 లక్షలు
చీరాల: చీరాల మున్సిపాలిటీకి అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చే నెహ్రూ కూరగాయల మార్కెట్ చీటీల వేలం నాటకీయ పరిణామాల నడుమ ఎట్టకేలకు నిర్వహించారు. వారం రోజుల్లో మూడు సార్లు వేలం ప్రక్రియ వాయిదా పడింది. అధికారులు గతంలో హెచ్చు పాటకు వెళ్లడంతో అర్ధంతరంగా వాయిదా పడగా తాజాగా సోమవారం మున్సిపల్ కార్యాలయంలో వేలం నిర్వహించారు. చీరాల నెహ్రూ కూరగాయల మార్కెట్లో చీటీల వసూలుకు సంబంధించి కాంట్రాక్టు మార్చి 31తో ముగిసింది. 2025–2026 సంవత్సరానికి రూ.70.87 లక్షల ఆదాయం రాగా, 2026–2027కు గాను రూ.70.48 లక్షలతో వేలం ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం ఆరుగురు పోటీపడగా రూ.87.56 లక్షలకు కోలా శివకృష్ణ చీటీల వేలం హక్కులు దక్కించుకున్నారు. అలాగే తోపుడు బండ్లపై వ్యాపారం నిర్వహించే వ్యాపారుల నుంచి రుసుం వసూలు చేసే వేలాన్ని రూ.11.50 లక్షల నుంచి ప్రారంభించారు. వేలంలో తొమ్మిది మంది పాల్గొనగా రూ.18,05,000కు ఓ వ్యక్తి హక్కులు దక్కించుకున్నారు. అలానే పేరాల మార్కెట్కు సంబంధించిన వేలంలో తొమ్మిది మంది పోటీపడగా రూ.8.35 లక్షలు పలికింది. ఇదిలా ఉండగా వారం రోజుల్లో మూడు సార్లు వేలం వాయిదా వేయడం వెనుక రాజకీయ హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే సోమవారం నిర్వహించాల్సింది బహింగ వేలం కాగా తలుపులు మూసివేసి పోలీసుల పర్యవేక్షణలో వేలం నిర్వహించడం గమనార్హం. -
టీడీపీ మాజీ కార్పొరేటర్పై సిటిబస్ల యజమానుల ఫిర్యాదు
సాక్షి టాస్క్ఫోర్స్: కోవిడ్–19 క్వారెంటైన్ సెంటర్కు సిటిబస్లు ఏర్పాటుచేశామని, ఆ బస్లకు సంబంధించి లక్షల రూపాయల బిల్లులు చెల్లించకుండా టీడీపీ మాజీ కార్పొరేటర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బస్ యజమానులు సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ మాజీ కార్పొరేటర్ తీరుపై ఫ్లెక్సీతో నిరసన వ్యక్తం చేశారు. 2020 సెప్టెంబర్లో గుంటూరు ఆర్టీవో ద్వారా ఈపూరు మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద క్వారంటైన్ సెంటర్ కింద బస్ ఏర్పాటు చేశామని సిటిబస్ యజమాని నళిని, ఆమె భర్త శివరామప్రసాద్ మీడియాకు తెలిపారు. సెప్టెంబర్ 16 నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు అక్కడే ఉంచామని అన్నారు. ఏళ్లు గడిచినా బిల్లులు చెల్లించకపోవడంతో గుంటూరు ఆర్టివో అధికారులను సంప్రదించామని చెప్పారు. సిటిబస్ ఆపరేటర్స్ అసోసియేషన్ గుంటూరు కార్యదర్శి, టీడీపీ 35వ డివిజన్ మాజీ కార్పొరేటర్ వరప్రసాద్బాబు (సిటిబస్)కి చెల్లించామని తెలియజేశారని తెలిపారు. ఈ విషయమై బస్బాబుని అడగ్గా, బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. కోవిడ్–19 వేళల్లో బస్ ఏర్పాటు చేశానని, లక్ష రూపాయలు రావాల్సి ఉందని మరో బస్ యజమాని వడ్లమూడి కిషోర్ తెలిపారు. జీవనోపాధి నిమిత్తం తాను కొనుగోలు చేసిన సిటిబస్ను బస్బాబుకి అప్పగించినట్లు మరో బాధితుడైన ఎం.రమేష్ చెప్పారు. బస్కు సంబంధించి రోడ్డు పన్ను ఇతరత్రా పన్నులు చెల్లించాలని అతనితో ఒప్పందం చేసుకున్నానని అన్నారు. బీమా కూడా చెల్లించకుండా నకిలీ బీమాతో బస్సు నడిపాడని ఆరోపించారు. ప్రస్తుతం నా బస్ని అప్పగించాలని కోరగా, బెదిరింపులకు పాల్పడుతున్నారు. తప్పుడు అగ్రిమెంట్ స్పష్టించి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కరోనాకు సంబంధించి ఎనిమిది మంది బాధితులు ఉన్నారని, టీడీపీ మాజీ కార్పొరేటర్ నుంచి రూ.8.50 లక్షలు రావాల్సి ఉందని న్యాయం చేయాలని కోరారు. -
గ్యాస్ గోడౌన్ వద్ద వినియోగదారుల ఆందోళన
పర్చూరు(చినగంజాం): పర్చూరులో గ్యాస్ సిలిండర్ల సరఫరా లోపం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం పర్చూరు గ్యాస్ గోడౌన్ వద్ద సిలిండర్ల పంపిణీ విషయమై కాస్తంత గందరగోళం నెలకొంది. గోడౌన్ వద్దకు సిలిండర్ల స్టాకు వచ్చిందన్న సమాచారం రావడంతో ముందుగా సిలిండర్లు బుక్ చేసుకున్న వినియోగదారులు భారీగా వచ్చి చేరారు. అందరికీ సిలిండర్ల పంపిణీ చేయలేమన్న నిర్వాహకులతో వినియోగదారులు వాగ్వాదానికి దిగి ఆందోళన చేపట్టారు. ఆమెరికా–ఇరాన్ యుద్ధ నేపథ్యంలో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదంటూ అధికారులు ప్రకటనలు విడుదల చేస్తున్న నేపథ్యంలో పర్చూరులో గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా తక్కువగా ఉండటం, గృహ వినియోగ సిలిండర్లు రెగ్యులర్గా పంపిణీ జరుగుతుండటంతో వ్యాపారులు వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లను బ్లాక్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటూ గృహ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. పర్చూరులో గ్యాస్ సరఫరా సమస్యలతో ప్రజల ఇబ్బందులు -
తీరం.. ఫలహారం!
చీరాల అర్బన్: తమ భూములపై హక్కును కోల్పోయేలా మత్స్యకారులను ప్రభావితం చేయటం వెనుక పెద్ద కుట్ర దాగుందనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటపై నిషేధం విధించనున్నారు. మత్స్యసంపద పునరుత్పత్తి జరిగే సమయం కావటం అందుకు కారణం. పర్యాటక రంగం అభివృద్ధి ముసుగులో అతిక్రమణలకు తెర తీశారు. అందులో రిసార్టుల నిర్వాహకులు ముందున్నారు. రిసార్టుల ఎదురు రోడ్డు నుంచి సముద్ర తీరం వరకు ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంపై వారసత్వ హక్కు ఉన్న మత్స్యకారులను ఆర్థికంగా ప్రలోభపరచుకున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వీరికి లాభమేంటంటే.. తీరం నుంచి రోడ్డు వరకు ఉన్న తీర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవటంతో సీవ్యూ పేరుతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు. దీంతో పాటు రాత్రి వేళల్లో క్యాంప్ ఫైర్ పేరుతో విందు, వినోదాలు ఏర్పాటు చేసి ప్రత్యేక రుసుం వసూలు చేస్తున్నారు. చిన్న, మధ్య తరహా ఫంక్షన్లు కూడా తీరం వెంట నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి భారీగా డబ్బు వసూలు చేసి అడ్డగోలుగా ఆర్జిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘన అతిక్రమణలపై అధికారుల నియంత్రణ శూన్యమనే చెప్పాలి. వారిని కూడా నిర్వాహకులు తమదైన శైలిలో తృప్తి పరుస్తుండటం అందుకు కారణంగా విమర్శలు వస్తున్నాయి. ఒకటి, రెండు రిసార్టులకు మినహా మిగిలిన వారికి అనుమతులు లేవు. అనుమతులు ఉన్న వాటిలో కూడా అతిక్రమణలు ఉన్నాయి. ఇది అన్ని శాఖల అధికారులకు తెలిసిన బహిరంగ రహస్యం. అధికార ముద్ర పడితే చాలు ‘‘అనుమతులా? అవెందుకు? ఎమ్మెల్యేతో ప్రారంభించుకుంటాం. దాంతో అధికార ముద్ర పడుతుంది. అవసరమైతే వారిని సంతృప్తి పరుస్తాం. దీంతో పాటు పార్టీ ఫండ్ ఇచ్చి సహకరిస్తామని చెప్తాం. అది చాలు. అంతేకానీ ఆ అనుమతి, ఈ అనుమతి అంటూ వివిధ శాఖల అధికారులు చుట్టూ ఎక్కడ తిరుగుతాం. తిరిగినా పని కాదు. నిబంధనల మేరకు రిసార్టు కట్టాలంటే అయ్యే పని కాదు. అయినా మమ్మల్ని ఏమన్నా చేయాలంటే మాకన్నా ముందు కట్టిన వారిపై చర్యలు చేపట్టండని అడుగుతాం. మరి ఇప్పుడు కూడా జరుగుతున్న నిర్మాణాల సంగతేంటని అడుగుతాం. ఇదో కందిరీగల తుట్టె. ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇస్తున్నాం. ఇక మాపై చర్యలేంటి?’’ అనే మాటలు రిసార్టుల యజమానుల నుంచి వినిపిస్తున్నాయి. పరిష్కారం ముఖ్యం పాలకులు, అధికారుల్లో చిత్తశుద్ధి ఉంటే రిసార్టుల నిర్మాణం లేదా నిర్వహణ నిబంధనల మేరకు సాగించటమనేది పెద్ద కష్టమేమీ కాదు. అలా చేస్తే ఒక విధమైన క్రమశిక్షణ వస్తుంది. తీరంలో భద్రత పెరుగుతుంది. అలా చేస్తే సంబంధికుల వ్యక్తిగత ప్రయోజనాలకు గండి పడుతుంది. అందుకే వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సునామీ సమయంలో 8 మంది మృతి చంద్రబాబు సర్కారు నిర్వాకంతో సముద్ర తీరం పరాధీనమవుతోంది. వేట విరామ సమయంలో మత్స్యకారుల భృతికి తీరం వెంట కేటాయించిన అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మడచెట్లు మాయం అయ్యాయి. అందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రిసార్టుల నిర్వాహకులు కారణం. చర్యలు చేపట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో విలువైన సహజ సంపద ప్రమాదంలో పడుతోంది. గతంలో సునామీ విపత్తు వచ్చినప్పుడు పొట్టిసుబ్బయ్యపాలెం తీరంలో 8 మంది మృత్యువాత పడ్డారు. అన్నీ సక్రమంగా ఉంటే అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అతిక్రమణలతో జరిగే ప్రమాదాలు కనిపించవు. ఏదన్నా సునామీ లాంటి విపత్తు ఎదురై ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే అందుకు ప్రస్తుతం కొమ్ముకాస్తున్న పాలకులు, అధికారులు బాధ్యత వహిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి తీరం వెంట అటవీ భూమి సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారుల భృతి కోసం కేటాయించింది. తీరం వెంట ఉన్న మడ చెట్లతోపాటు వారికి కేటాయించిన భూముల్లో సరిగ, యూకలిప్టస్, సుబాబుల్ వంటి సామాజిక వనాలను పెంచాలి. అందులో జీవాలు, పశువులను మేపుతూ భృతి పొందాలి. కోతకు వచ్చిన వనాల కలపను విక్రయించి వచ్చిన డబ్బుతో వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవాలి. ఇది ఈ ప్రక్రియ లక్ష్యం. తమకు కేటాయించిన ప్రాంతం ఎప్పుడైతే వివిధ కారణాలతో పరాధీనం అయ్యిందో, అప్పటి నుంచి తీరంలో సామాజిక వనాలు, మడచెట్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. మత్స్యకార గ్రామాల్లో పలువురు జీవాలు, గేదెల మేపునకు కూడా సరైన వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది ఆరంభం మాత్రమే. ఇదే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్లో వారు తమ ఉనికినే కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
అధికారం ఉందని అహంకారంతో మాట్లాడకు..
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయకపోగా..వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని తాను చేసినట్లుగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ..అధికారం ఉందనే అహంకారంతో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెదకూరపాడు సమన్వయకర్త నంబూరు శంకరరావు అన్నారు. ఆదివారం గుంటూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో శంకరరావు మాట్లాడుతూ మా పార్టీ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతుంటే ఓ వ్యక్తి మా గ్రామానికి నువ్వు ఏం చేశావని ప్రశ్నిస్తే దానికి నేను సమాధానం చెప్తే నీ కెందుకు..నన్ను ఎందుకు కదిలిస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. నీ పని నువ్వు చేసుకో..నా జోలికి వస్తే నువ్వు చేసే అరాచాకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు బయటకు తీస్తానని అన్నారు. వంద గ్రామాలు..వంద రోజులు అని కార్యక్రమం పెట్టి రోజుకు ఒక అరగంట తిరిగి తానేదో పనిచేసున్నట్లు హై కమాండ్కి చెప్పుకోవడమే తప్ప ప్రజలకు ఈ రెండేళ్లలో ఏ సంక్షేమ కార్యక్రమం కానీ..అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టావా..ప్రజల సమస్యలను పరిష్కరించావా అని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ను ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అక్కడే పరిష్కరించడంతోపాటు టీడీపీ నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి వారి సమస్యలను అక్కడే పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామాల్లో నీ గురించి ప్రజలు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకో..తెలియకపోతే నీ మనిషిని పెట్టుకుని తెలుసుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలోకి నన్ను రానివ్వవా..రానివ్వపోవడానికి నువ్వు ఎవరివి..ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..అధికారం ఉందని..కళ్లు నెత్తికెక్కితే ప్రజలే నీ అధికారాన్ని దించుతారు..నియోజకవర్గంలోకి ఎవరిని రానివ్వాలో..ఎవర్ని రానివ్వకూడదో ప్రజలే తేలుస్తారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.682.58కోట్లతో అభివృద్ధి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పెదకూరపాడు నియోజకవర్గంలో రూ.1483.24 కోట్లతో సంక్షేమం, రూ.682.58 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. రూ.148కోట్లతో అమరావతి, బెల్లంకొండ డబుల్ రోడ్, రూ.60 కోట్లతో మాదిపాడు వద్ద కృష్ణా నదిపైన బ్రిడ్జి, రూ.7.25 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజ్, రూ.4 కోట్లతో పెదమద్దూరు బ్రిడ్జి, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాలయాల నిర్మాణానికి రూ.5.80 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఒక్క రైతుకై నా ప్లాటు ఇచ్చారా? రాజధాని నిర్మాణం పేరుతో 54 వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాక్కుని 9 వేల ఎకరాల్లో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామని చెప్పిన మీరు...ఏ ఒక్క రైతుకై నా ప్లాట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. 9 వేల ఎకరాలు పోతే మిగిలిన 43 వేల ఎకరాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. మీరేమో వ్యాపారాలు చేసుకోవాలి, రైతుల్ని మాత్రం ముంచేయాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని..రాజధాని పేరుతో జరుగుతున్న భూ దోపిడీకి వ్యతిరేకమన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలుపుతూ మావిగన్ రాజధాని చేయాలని వైఎస్ జగన్ ప్రతిపాదించారు. చంద్రబాబునాయుడు కూడా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంతో కలిపి సీఆర్డీఏ ఉంటుందని చెప్పారు. రూ.20 వేల కోట్లతో పూర్తయే రాజధాని కావాలా..రూ. 2లక్షల కోట్లతో పూర్తయ్యే రాజధాని కావాలో ప్రజలే గ్రహించాలని అన్నారు. నియోజకవర్గ పరిశీలకులు యెనుమల మురళీధర్రెడ్డి, పెదకూరపాడు ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు కొండవీటి కోటేశ్వరరావు, భవిరిశెట్టి హనుమంతరావు, నర్సిరెడ్డి, అప్పిరెడ్డి, సాయిరెడ్డి, నాయుడు రాంబాబు, షేక్ సుభాని పాల్గొన్నారు. -
ఓఆర్ఆర్ మలుపులపై రైతుల నిరసన
గుంటూరు రూరల్: ఔటర్ రింగ్ రోడ్డు 2017లో తొలిసారిగా ఇచ్చిన ఎలైన్మెంట్ను తుంగలో తొక్కి 2025లో ఇష్టం వచ్చినట్లు మలుపులు తిప్పుతూ మరోసారి ఎలైన్మెంట్ మార్చిన ప్రభుత్వం తీరుపై వట్టిచెరుకూరు మండలం రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో రైతులు ప్రస్తుతం ఔట్ రింగ్ రోడ్డు వెళుతున్న మార్గంలో పొలాల వద్ద బైటాయించి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని ఇంజనంపాడు చమళ్ళమూడి, కుర్నూతల పుల్లడిగుంట గ్రామాల మీదుగా వెళుతున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం మలుపు తిరగడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారని వారు పేర్కొన్నారు. 2017 అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం చేసిన ఎలైన్మెంట్ సజావుగా ఉందని, 2025–26 మ్యాప్ ఎలైన్మెంట్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చైన్నె, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో లేని వెడల్పాటి 140 మీటర్ల రోడ్లు తమకొద్దని, 70 మీటర్ల రోడ్డు నిర్మాణం చాలని రైతులు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల భూములకు ఇప్పుడు ఇస్తున్న పరిహారం సరిపోదని, సరైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు నిర్వహించి బాధిత రైతుల డిమాండ్లను తెలుసుకుని, వాటిని అమలు చేయాలని కోరారు. లేని పరిస్థితుల్లో ధర్నా, రాస్తారోకోలు నిర్వహిస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు మలుపులు తిప్పి రైతులను ఇబ్బందులకు గురిచేయటమే ఈ ఎలైన్మెంట్ లక్ష్యంగా ఉందన్నారు. ఈ మార్పుల వల్ల చమల్ళమూడి, కుర్నూతల పరిధిలోని రైతులకు ప్రస్తుత బహిరంగ మార్కెట్తో ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి కనీసం పొంతన లేదని వాపోయారు. పాత ఎలైన్మెంట్ను పరిగణనలోకి తీసుకుని రోడ్డు నిర్మాణం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. -
రీ సర్వేలో రెవెన్యూ చేతివాటం
చుండూరు (వేమూరు): ముడుపులు చెల్లిస్తే బ్లాక్ లిస్టులో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసిన అధికారుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. కోర్టు వివాదంలో ఉన్న పొలాలకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు బ్లాక్ లిస్టులో ఉన్నాయి. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకొని ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. చుండూరు మండలంలోని చినపరిమి గ్రామంలో అనంతగిరి ముసలయ్యకు 56 సెంట్లు మాగాణి సాగు భూమి ఉంది. ఆయనకు ఆరుగురు కుమారులు, కుమార్తె సంతానం. కుమార్తెకు మాటలు రావు. ఆ భూమిని కుమార్తె పేరిట వీలునామా రాశారు. ఆమె అనంతరం కుమారులకు హక్కులు కల్పించారు. ఐదుగురు అన్నదమ్ముల్లో ఒక తమ్ముడు కొడుకు అనంతం శ్రీనివాసరావు రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇచ్చి 2020 పట్టాదారు పాస్ పుస్తకాలు పొందాడు. హక్కుదారులైన మగిలిన అన్నదమ్ములు చుండూరు తహసీల్దారు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్ పుస్తకం బ్లాక్ లిస్టులో పెట్టారు. అనంత శ్రీనివాసరావు తెనాలి సివిల్ కోర్టును ఆశ్రయించాడు. శ్రీనివాసరావు నకిలీ పత్రాలు ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందాడని మిగతావారు చుండూరు పోలీసు స్టేషన్ను ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఆధారాలను పరిశీలించిన అనంతరం శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. 2026లో చుండూరు తహసీల్దారు నాగరాజు లంచం తీసుకొని బ్లాక్లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకం శ్రీనివాసరావుకు ఇచ్చారు. హక్కుదారులు మార్చి 30వ తేదీన దీనిపై జిల్లా కలెక్టరుకు అర్జీ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తేదీన చుండూరు తహసీల్దారును కలిశారు. కోర్టు వివాదంలో ఉన్న పొలాలకు పట్టాదారు పాస్ పుస్తకం ఎందుకు మంజూరు చేశారని అడిగారు. తహసీల్దారు కార్యాలయంలోని వీఆర్వోలు కోర్టు వివాదంలో ఉన్న చినగాదెలవర్రు, పెదగాదెలవర్రు గ్రామాలకు చెందిన పొలాలకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారని బాధితులు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చుండూరు మండలంలోని కొంతమంది వీఆర్వోల హవా కొనసాగుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొంత మంది వీఆర్వోలను బదిలీ కావడం లేదు. కొంతమంది రైతుల వద్ద డబ్బులు తీసుకొని నకిలీ దస్తావేజులు పుట్టిస్తున్నారు. వాటి ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీఆర్వోలు అంటే తహసీల్దారు కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. -
గోవాడలో 16 నుంచి మహా కుంభాభిషేకం
అమృతలూరు(భట్టిప్రోలు): అమృత లూరు మండలం గోవాడలో వేం చేసియున్న గంగా పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవస్థానం నిర్మితమై శత వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణాధికారి ఎంవీఎస్ వర్మ ఆదివారం ఒక ప్రకనలో పేర్కొన్నారు. ఆలయ ముఖ్య అర్చకులు చావలి శ్రీధర్శర్మ, ఐలూరి సుబ్రహ్మణ్య దీక్షులచే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 16న ప్రవచన విద్వాంసురాలు అనుగ్రహభాషణ, 17న వేదాంతం సునీత భాషణం, 18న మాతా శివానంద సరస్వతి (శివకేశవ పీఠాధిపతులు) అనుగ్రహ భాషణం, సాయంత్రం గ్రామోత్సవం, 19న పెనుగొండ క్షేత్ర పీఠాథిపతి పజ్ఞానంద సరస్వతి బాల స్వామి అనుగ్రహ భాషణం, సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త నోరి నారాయణమూర్తి ప్రవచనం, 20న మహా కుంభాభిషేకం, మధ్యాహ్నం అన్న సంతర్పణ జరుగుతుందని వివరించారు. డీఈఓ రామారావు నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. కేబీఆర్ కళాశాల ప్రాంగణంలోని పది మూల్యాంకన కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి మూల్యాంకనం కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రానికి 1,75,700 పేపర్లు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు 60 శాతం మూల్యాంకనం పూర్తయినట్టు వివరించారు. ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, ప్రతి గదిలోనూ ఫ్యాన్, లైట్లు ఏర్పాటు చేశామన్నారు. తాగునీరు, వైద్యసేవలకు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఖమ్మం జిల్లాకు చెందిన భక్తులు ఆదివారం రూ.1.28 లక్షల విరాళాన్ని అందజేశారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన జయలక్ష్మి, వంశీకృష్ణ కుటుంబం ఆదివారం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసిన వారు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1.28,166 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
చినపులివర్రులో ఉద్రిక్తత
కొల్లూరు: మండలంలోని చినపులివర్రు గ్రామంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్థించడం ఎంతవరకు సమంజసం అంటూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా వేమూరు నియోజకవర్గ కన్వీనర్ బాణాల తనీష్బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఆదివారం తెల్లవారుజామున మఫ్టీలో తనీష్బాబు ఇంటికి వెళ్లిన పోలీసులు గోడలు దూకి ఇంటిలోకి వెళ్లి అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ప్రశ్నించిన తనీష్బాబు భార్య పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు గ్రామానికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనీష్కు మద్దతుగా వస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులను, చినపులివర్రు వాసులను వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, వివిధ పోలీసుస్టేషన్ల ఎస్ఐలు అడ్డగించారు. కొల్లూరు సమీపంలో రేపల్లె ● తెనాలి ప్రధాన రహదారిపై భారీగా మోహరించిన పోలీసులు అశోక్బాబు, తనీష్ కుటుంబ సభ్యులు మాత్రమే స్టేషన్ వద్దకు రావాలని ఆంక్షలు విధించారు. స్టేషన్ వద్దకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం కొల్లూరు పోలీసుస్టేషన్లో తనీష్కు పోలీసులు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు సమక్షంలో 41 నోటీసులు అందజేశారు. అనంతరం తనీష్ భార్య అనూష పోలీసులపై ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు. -
నాటక రంగానికి యువత అవసరం
యడ్లపాడు: నాటక రంగానికి యువతరం ఊపిరి కావాలని విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య చెప్పారు. కొండవీడు కళా పరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు రోజు ప్రదర్శనలను లింగారావుపాలెం మాజీ సర్పంచ్ షేక్ కరిమూన్ జ్యోతి ప్రజ్వలన చేయగా, వ్యాపారవేత్త దెందుకూరి రవిరాజా నటరాజ పూజ చేసి కార్యక్రమాల్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు నంబూరు వీరాంజనేయులు సభాధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య మాట్లాడుతూ నాటక రంగం పూర్వ వైభవాన్ని తీసుకురాగల సత్తా యువతలోనే ఉందని అభిప్రాయపడ్డారు. వారిని కళారంగంవైపు మళ్లించి తీసుకురావల్సిన బాధ్యత ముందు కుటుంబం నుంచి ప్రారంభం కావాలన్నారు. మరో అతిధి అనంతలక్ష్మి నూలుమిల్లు ఎండీ సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ ఒకప్పుడు నాటకాల్లో పురుషులే సీ్త్రపాత్రల్ని పోషించేవారని, నేడు సీ్త్రలే సీ్త్రపాత్రలు చేయడంతో పాటు ఒక్కో నాటికలో ఎక్కువ మంది సీ్త్రలు ఉండటం శుభపరిణామమన్నారు. రాకీ కమ్యూనికేషన్ చైర్మన్ నల్లపాటి రామచంద్రప్రసాద్, పఠాన్ యూసఫ్, గరికపాటి సుబ్బారావు, మలినేని సుబ్బారావు, ఆలోకం సుబ్బారావు, ముద్దన రాఘవయ్య చౌదరి ప్రసంగించార. కార్యక్రమంలో పరిషత్ ప్రతినిధులు కట్టా శ్రీహరిరావు, ఆలోకం సాంబశివరావు, మండెపూడి శ్రీనివాసరావు, నంబూరి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య -
ముగిసిన కొండవీడు కళా సంబరాలు
యడ్లపాడు: కొండవీడు కళాపరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు కళల పండుగలా కొనసాగాయి. మూడో రోజు ఆదివారం మూడు అద్భుత కళారూపాలు ప్రదర్శితం అయ్యాయి. వేటికవే గొప్ప కథనాలతో కళాకారుల పోటాపోటీ అభినయంతో ప్రేక్షకుల్ని అలరించాయి. నిర్వాహకులు కట్టా శ్రీహరిరావు, తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, మండెపూడి శ్రీనివాసరావు, మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, బ్రహ్మవరప్రసాద్ కృషిని దాతలు, కళాభిమానులు అభినందించారు. ‘అమ్మచెక్కిన బొమ్మ’ సృష్టిలోని అనంతమైన వైవిధ్యాన్ని ఆస్వాదించలేక..మూసధోరణిలో బతుకుతున్న నేటి సమాజపు సంకుచిత మనస్తత్వాన్ని నిలదీసే అద్భుత కళారూపం అమ్మచెక్కిన బొమ్మ నాటిక. ఆడ, మగ అనే రెండు పార్శ్వల మధ్య నలిగిపోతూ, తన గుర్తింపు కోసం పరితపించే మూడో ప్రకృతి అస్తిత్వ పోరాటాన్ని ఈ నాటిక కళ్లకు కట్టింది. గోవాడ క్రియేషన్స్ వేదికగా వచ్చిన ఈ నాటికకు జ్యోతిరాజ్ భీశెట్టి మూలకథను అందించగా, డాక్టర్ వెంకట్ గోవాడ తన నాటకీకరణతో, దర్శకత్వ ప్రతిభతో దీనికి ప్రాణం పోశారు. ‘అందరూ మంచివారే కానీ..!’ కన్నప్రేమను మించిన కరుణతో సాగాల్సిన అనుబంధాలు, కాసుల కక్కుర్తి ముందు ఎలా కరిగిపోతాయో సాక్షాత్కరించింది అందరూ మంచివారే కానీ..నాటిక. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న మరదలి ప్రాణం కంటే డబ్బే ముఖ్యమని భావించిన ఒక వదిన స్వార్థం, ఆ ఇంటి మమకారాన్ని బలితీసుకోవడం వీక్షకుల మనసును కలచివేసింది. క్లిష్ట పరిస్థితుల్లో మంచితనం మంటగలిసి, రక్తసంబంధం ఆర్థిక సంకెళ్లకు బందీ కావడాన్ని ఈ ప్రదర్శన అత్యంత సహజంగా ఆవిష్కరించింది. జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో మానవత సాగరి (యడ్లపాడు) బృందం అద్భుతంగా రంగస్థలంపై ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది. ‘ఇది అతని సంతకం’ సమకాలీన సమాజంలో మనిషి వ్యక్తిత్వానికి, పట్టుదలకు నిలువుటద్దంలా నిలుస్తుంది ఇది అతని సంతకం నాటిక. జీవిత చరమాంకంలో ఎవరికీ భారంగా మారకూడదని, తనకంటూ ఒక నిర్దిష్టమైన జీవన శైలిని రూపొందించుకున్న కృష్ణమూర్తి అనే వ్యక్తి, అబద్ధం లేని సిద్ధాంతాలతో సమస్యల నెదురిస్తూ సాగించిన ప్రయాణం ఇందులో స్ఫూర్తిదాయకంగా సాగుతుంది. ఈ నాటికను గుంటూరు అభినయ ఆర్ట్స్ ప్రదర్శించగా, శ్రీస్నిగ్థ రచించారు. ఎన్.రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఎనిమిది మందికి గాయాలు సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి 20 మంది మత్స్యకారులు ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామంలోని చెరువులో రొయ్యలు పట్టేందుకు వస్తున్నారు.బొల్లేరో వాహనంలో మత్స్యకారులు వస్తుండగా సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్దకు చేరుకోగానే డ్రైవర్కు నిద్రమత్తు రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సంగడి జోగేశ్వరరావు (45) మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాలువకు రెయిలింగ్ లేకపోవడంతో ప్రమాదం.. -
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అడహక్ కమిటీ ఏర్పాటు
బాపట్ల: బాపట్ల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభివృద్ధి చేసేందుకు జిల్లా అడహక్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సత్యనారాయణరావు, ప్రధాన కార్యదర్శి ఎం రమేష్కుమార్లు తెలిపారు. బాపట్లలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల సంఘం సమావేశంలో వారు మాట్లాడుతూ అడహాక్ కమిటీ చైర్మన్గా జీవీవీ రాఘవరెడ్డి, కన్వీనర్గా పసుమర్తి శ్రీనివాసరావు, సభ్యులుగా కే రోశయ్య, జే సుధాకర్, కే అంజిబాబు, జే మార్తా, వై రాజేష్బాబు, ఎన్ పెద్ద పుల్లారావు, టీ తరుణ్రాజ్లను నియమించినట్లు తెలిపారు. చైర్మన్గా ఎంపికై న రాఘవరెడ్డి మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని అన్ని తాలుకా కమిటీలను బలోపేతం చేస్తామని, జిల్లా మొత్తం పర్యటించి సభ్యత్వ నమోదు చేయిస్తామని తెలియజేశారు. ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సత్యనారాయణ, కార్యదర్శి రమేష్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
సందేశాత్మకం.. అద్భుత కళారూపం
యడ్లపాడు: లింగారావుపాలెం వేదికగా సాగుతున్న కొండవీటి కళా పరిషత్ 27వ జాతీయస్థాయి కళా సంబరాలు రెండోరోజు శనివారం మూడు నాటికలు ప్రదర్శితమయ్యాయి. ఆయా నాటికల్లోని సంఘటనలు నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ నిత్యం చూస్తున్న వాస్తవ ఘటనలకు దర్పణం పట్టాయి. ‘శ్రీమాత్రే నమః’ ఆకాశమంత ఆశ.. అమెరికా వెళ్లాలన్న ఆశయం.. కెరీర్ పరుగులో అందరికంటే ముందుండాలన్న తపన.. ఇదీ నేటితరం ప్రతినిధి అయిన ఒక ఆధునిక యువతి జీవన చిత్రానికి కళారూపమే సీ్త్ర మాత్రే నమః నాటిక. అయితే జీవితం ఎప్పుడూ మనం గీసుకున్న గీతల్లోనే సాగదు. అనూహ్యంగా ఎదురైన ఒక ప్రమాదం ఆమె ఆశల విమానాన్ని నేలకూల్చడమే కాదు, ఆమె జీవన ప్రయాణాన్నే ఓ మలుపు తిప్పిందని సునిశితమైన సంఘర్షణలతో అద్భుతంగా ఆవిష్కరించింది నాటిక. స్వర్ణసూర్య డ్రామా లవర్స్(హైదరాబాద్)వారు సమర్పించగా మూలకథను పూర్ణిమా పెమ్మరాజు అందించగా, ఉదయ భాగవతుల రచన, దర్శకత్వం వహించారు. ‘మమ్మల్ని బతకనివ్వండి’ కుండపోత వర్షంలో భార్య ప్రాణం గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతుంటే, సాయం కోసం గొంతు చించుకుని విలపిస్తున్న ఆర్తనాదాలు వినిపించింది కనిపించింది కేవలం వ్యాపారమే. మనిషి ప్రాణం కంటే డబ్బుకే విలువ పెరిగిన ఈ కాలంలో, తన వద్ద ఉన్న సర్వస్వాన్ని ధారపోసినా ఆ వృద్ధుడికి మిగిలింది మరణమే. వరద భీభత్సంలో మూర్ఛవ్యాధికి చిక్కి తన కళ్ల ముందే ఇల్లాలు కన్నుమూస్తుంటే, నిస్సహాయుడై ఆ ముసలాయన రోదించిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఒకవైపు ప్రకృతి విలయాన్ని, మరోవైపు అంతకుమించిన మనుషుల నైతిక పతనాన్ని కళ్లకు కట్టి చూపిందీ నాటిక. విజయవాడ సాంస్కృతిక సమితి వారు ప్రదర్శించిన ఈ రూపకం, పల్లెటూరి యాసతో, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగుతూ చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసింది. రచన, దర్శకత్వం సుఖమంచి కోటేశ్వరరావు వహించారు. ‘తరమెళ్లిపోతున్నదో..’ మరణం తర్వాత కూడా మనిషి జ్ఞాపకం బతకాలంటే, అతడు బ్రతికున్నప్పుడు పంచిన ప్రేమలో నిజాయితీ ఉండాలి. తోడునీడగా ఉండాల్సిన రక్తసంబంధాల మధ్య ఆస్తులు, అంతస్తులు చిచ్చుపెడితే, కోట్లు ఉన్నా ఆ మనిషి ఒంటరివాడేనని కథనమే తరమెళ్లిపోతున్నదో నాటిక. శేషయ్య, దశరథ రామయ్య అనే ఇద్దరు మిత్రుల నేపథ్యంతో మొదలయ్యే ఈ కథ, విద్య యొక్క విలువను, త్యాగంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూనే, ఆధునిక సమాజంలోని కృత్రిమ బంధాలపై చావుదెబ్బ కొట్టింది. తండ్రి చదివించకపోయినా, తన కొడుకు రాఘవరావును గొప్ప ఆఫీసర్గా చూడాలనుకున్న ఒక పేద తండ్రి ఆశయం వెనుక, మరో కొడుకు రంగనాథం చేసిన నిశ్శబ్ద త్యాగం ఈ నాటికలో ప్రతి ఒక్కరినీ కదిలించివేసింది. తమ ఇంట శుభకార్యానికి ఊరంతా పిలిచి తోడబుట్టిన వారిని వెలివేసే నేటి తరం వికృత పోకడలను బొమ్మిడి రామకృష్ణ తన దర్శకత్వంతో కళ్లకు కట్టారు. దీనిని కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్(గుంటూరు) వారు ప్రదర్శించిన ఈ నాటిక నవసమాజానికి మేలుకొలుపుగా నిలిచింది. -
నేడు గంగమ్మ తల్లి తిరునాళ్ల
కారంచేడు: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగాను, సంతాన లక్ష్మిగాను పేరొంది విరాజిల్లుతున్న గ్రామదేవత గంగమ్మ తల్లి తిరునాళ్లను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. కారంచేడు పుట్టాయిపాలెంలో కొలువైన అమ్మవారికి 39 సంవత్సరాలుగా శిడి మహోత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నాలుగు రోజుల నుంచి అమ్మవారికి వివిధ రకాల ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ, గ్రామస్తులు పెద్దఎత్తున నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఆదివారం వేకువజామునుంచే అమ్మవారిని వివిధ రకాల ప్రత్యేకమైన పూలతో అలంకరిస్తారు. గ్రామస్తులు ఎక్కడ ఉన్నా గ్రామానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. తమ పాడి పశువులను, వాహనాలను సైతం అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుంటారు. తిరునాళ్ల సందర్భంగా వివిధ ప్రాంతాలు, జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, మజ్జిగ, పులిహోర, అల్పాహారం వంటి స్టాల్సు సైతం ఏర్పాట్లు జరుగుతున్నారు. విద్యుత్ ప్రభలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. పెద్ద ఎత్తున హాజరు కానున్న భక్తులు.. ఈ ఏడాది గంగమ్మ తిరునాళ్లను పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నాలుగు రోజుల నుంచి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామానికి చెందిన ఆడపడుచులు, భక్తులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారితోపాటు, తెలంగాణ, తమిళనాడు, కేరళం, కర్ణాటకల నుంచి కూడా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. గ్రామానికి వచ్చే భక్తులు ఆలయం వద్దకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేస్తారని కమిటీ సభ్యులు చెప్పారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు.. తిరునాళ్లు ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వేకువజాము వరకు నిర్విరామంగా జరుగుతాయి. ఇంకొల్లు సీసీ వైవీ రమణయ్య కారంచేడు పోలీస్ స్టేషన్లో ఏర్పాట్లపై సమీక్షించారు. వేల సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారనే సమాచారంతో పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వివిధ స్టేషన్ల నుంచి ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీస్, హోంగార్డులను బృందాలుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరునాళ్లు జరిగే తీరును ఆయన ఆలయ కమిటీ సభ్యులతో చర్చించారు. -
పకడ్బందీగా టెన్త్ మూల్యాంకనం
బాపట్ల: పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూల్యాంకనం జరుగుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బాపట్లకు వచ్చిన పదో తరగతి పరీక్షల ప్రశ్న పత్రాలను పరిశీలించారు. పలు గదులలో జరుగుతున్న మూల్యాంకనం తీరును ఆయన తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఏర్పడకుండా విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. రెగ్యులర్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం కోసం 750 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1,77,819 మంది విద్యార్థుల ప్రశ్నాపత్రాలు వచ్చాయన్నారు. ఆరో తేదీన ప్రారంభమైన ఈ మూల్యాంకనం 15వ తేదీతో ముగుస్తుందన్నారు. ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా మొదలైందన్నారు. 15వ తేదీ వరకు జరిగే ఈ మూల్యాంకనంలో 60 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని, 12,408 మంది విద్యార్థుల ప్రశ్నపత్రాలు వచ్చాయన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం జరుగుతుందన్నారు. ఒక్కొక్క ఉపాధ్యాయుడు సగటున 40 మంది జవాబుపత్రాలు మూల్యాంకనం చేసేలా ప్రణాళికలు రూపొందించారన్నారు. ప్రభుత్వ అసిస్టెంట్ ఎగ్జామినర్ శివకుమార్, ఇద్దరు ఉప విద్యాశాఖ అధికారులు ఈ కేంద్రాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్, ఉపాధ్యాయుడు సాదిక్ తదితరులు ఉన్నారు. ఆటిజం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలి ఆటిజంతో బాధపడే పిల్లలకు విద్యాబుద్ధులు, వైద్యంతోపాటు వారి జీవన నైపుణ్యాలను అధికారులు మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న సపోర్ట్ సెంటర్ను కలెక్టర్ శనివారం పరిశీలించారు. బాధిత పిల్లల ఎదుగుదల కోసం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలతో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు. విభిన్న ప్రతిభావంతులైన మతిస్థిమితం లేని వారు, ఆటిజం పిల్లలకు సెంటర్ ఎంతో సాయం అందిస్తుందన్నారు. ఈ కేంద్రాల నిర్వహణపై సమగ్ర శిక్ష అభియాన్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆటిజం మూడు దశల్లో వైకల్యం ఉంటుందని వైద్యులు కలెక్టర్కు వివరించారు. మానవ వనరుల అభివృద్ధి చేయడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు. పిల్లల మేధో శక్తిని పెంచడానికి అనువైన వాతావరణం, పరికరాలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆటిజంతో బాధపడే పిల్లల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్సింగ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాజేంద్ర, విద్యాశాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
ఇకపై కోర్టుకో కానిస్టేబుల్ నియమాకం
నగరంపాలెం: జిల్లాలోని న్యాయస్థానాలలో కేసులు పరిష్కరించేందుకు ఇక నుంచి ప్రతి కోర్టుకు ఒక కానిస్టేబుల్ను నియమించనున్నట్లు సీఐలు ప్రభాకర్ (డీసీఆర్బీ), ధర్మేంద్రబాబు (కోర్టు మానిటరింగ్ సిస్టం– సిఎంఎస్) చెప్పారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు శనివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో ‘కోర్టుల వారీగా అంకితభావం కల్గిన కానిస్టేబుళ్లు మోడల్పై నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించారు. సీఐలు మాట్లాడుతూ ఇప్పటి దాకా పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల రికార్డులను/పత్రాలను కోర్టులలో దాఖలు చేసేవారని అన్నారు. ఆ కేసుల్లో సత్వర పరిష్కారానికి ప్రతి పోలీస్స్టేషన్ (పీఎస్) నుంచి కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు విధులు నిర్వర్తించేవారని గుర్తుచేశారు. ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి కోర్టుకు అవసరమైన పోలీస్ సిబ్బందిని కేటాయిస్తారని తెలిపారు. కోర్టులలో ఫైల్ చేసిన కేసులకు సంబంధించి పీఆర్సీ నంబర్లు, కేసు చార్జిషీటు దాఖలు చేశాక సీసీ నంబర్లు వచ్చేలా పర్యవేక్షించాలని అన్నారు. బాధితులకు న్యాయం అందించేందుకు సాక్షులను, ఆధారాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసులను గుర్తించి పరిష్కరించాలని అన్నారు. విచారణ కేసులకు హాజరవ్వని ముద్దాయిలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలన్నారు. కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడే శాతాన్ని పెంపొందించాలని అన్నారు. పీపీలు, ఏపీపీలతో సమన్వయంతో కేసుల పురోగతికి చర్యలు చేపట్టాలని చెప్పారు. సమావేశంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మేడికొండూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడిన ఘటన మండలంలోని జంగంగుంట్లపాలెం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నరసరావుపేట మండలం మక్కినవారిపాలెంలో రాత్రి జరిగిన వివాహానికి హాజరైన దీపక్, చాణిక్య, వారి కుటుంబ సభ్యులతో సత్తెనపల్లి నుంచి గుంటూరు వైపు వెళ్తున్నారు. వీరు జంగంగుంట్లపాలెం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న మరొక కారు బలంగా ఢీకొంది. ఎదురుగా వస్తున్న మరొక కారులో ఉన్న జొన్నలగడ్డ ప్రసూనతో పాటు భర్త బాంబే సుబ్రహ్మణ్యం, కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న మేడికొండూరు సీఐ మధుసూదనరావు, ఎస్ఐ ఖాజీబాబు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని పోలీసు వాహనంలో గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఘనంగా జాతీయ సర్వే దినోత్సవం
గుంటూరు మెడికల్: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న నిర్వహించే ‘జాతీయ సర్వే దినోత్సవం’ వేడుకలు ఆంధ్రప్రదేశ్ సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గౌరవ అతిథులుగా ఏపీ ఎన్జీజీవో సంఘ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, సర్వే శాఖ డెప్యూటీ డైరెక్టర్ తోయజాక్షరావు, అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ కుమార్లు జాతీయ సర్వే దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలకు గౌరవ అతిథులు బహుమతులు అందజేశారు. రక్తదాన శిబిరంలో 36 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి, తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు తమ వంతు సహాయాన్ని అందించారు. ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో సర్వే శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. సమాజ సేవలో భాగంగా రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సర్వే ఉద్యోగులు సామాజిక బాధ్యతను చాటుతున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్వే ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.లక్ష్మీనారాయణ, డివిజనల్ అధ్యక్షుడు కట్ట వరప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీ జీవో సిటీ ఉపాధ్యక్షుడు భావన్నారాయణ, సర్వే అధికారులు, సర్వే ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఏటీఎంలో రూ. 87 లక్షల నగదు చోరీ
పిడుగురాళ్ల: ఏటీఎంలలో నగదు ఉంచాల్సిన ఉద్యోగి ఆ నగదును దొంగిలించి పరారైన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి పిడుగురాళ్లపట్టణ సీఐ శ్రీరామ్ వెంకట్రావు తెలిపిన వివరాల మేరకు... పిడుగురాళ్ల పట్టణంలోనే ఎస్బీఐ బ్రాంచ్కు చెందిన నాలుగు ఏటీఎంలలో అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక ఏటీఎంలో శుక్రవారం రూ. 48 లక్షలు ఉదయం సమయంలో తోటి సిబ్బందితో సీఎంఎస్ గుంటూరు బ్రాంచ్కు చెందిన కస్టోడియన్ మామిడి నరేష్ అనే ఉద్యోగి ఏటీఎంలో నగదును పేర్చారు. అతనితోపాటు ఉద్యోగులు కూడా ఉండటంతో తెలివిగా ఏటీఎంలలో నగదును ఏర్పాటు చేసినా లాక్ వేయలేదు. తోటి ఉద్యోగులతోపాటు తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలోనే వేరే పని ఉందని చెప్పి గుంటూరుకు వెళ్లకుండా మార్గమధ్యలోనే దిగాడు. తోటి ఉద్యోగులు గుంటూరు వెళ్లిపోయారు. ఆ తరువాత మామిడి నరేష్ ఏటీఎంలకు వచ్చి మొత్తం రూ. 87 లక్షలకుపైగా నగదును ఏటీఎంలో నుంచి తీసుకొని పరారయ్యాడు. ముందుగా ఏటీఎంలలో ఏర్పాటుచేసిన రూ. 48 లక్షలు, అంతకుముందు ఏటీఎంలో ఉన్న మిగిలిన నగదుతో కలిపి మొత్తం రూ. 87 లక్షలకు పైగా ఉన్న నగదును అపహరించారు. నరేష్ పథకం ప్రకారం తిరిగి వచ్చి ఏటీఎంలలో ఉన్న నగదు మొత్తాన్ని చోరీ చేశాడు. ఏటీఎంలో నగదు రాకపోవడంతో పలువురు బ్యాంకు కస్టమర్లు ఆయా బ్యాంకు మేనేజర్లకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి చూడగా విషయం తెలిసింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఫిర్యాదు చేయగా సీఐ శ్రీరామ్ వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఛాన్స్ చూసి ఏసీయ్..!
గుంటూరు మెడికల్: కంచె చేను మేసిందన్న చందంగా గుంటూరు జీజీహెచ్లో పరిస్థితి ఉంది. గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏసీలను అపహరిస్తూ పట్టుబడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కొంతకాలంగా పలు వార్డుల్లో, ఆపరేషన్ థియేటర్లలో ఏసీలు పనిచేయడం లేదు. ఉక్కపోతతో వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు అల్లాడిపోతున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఏసీలు పనిచేయక వైద్య సేవలు అందించేందుకు చమటోడుస్తున్నారు. ఆసుపత్రికి గుండెకాయలాంటి కీలకమైన అత్యవసర సేవల విభాగంలో ఏసీలు పనిచేయక అల్లాడిపోతున్నారు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులకు చీమకుట్టినట్లైనా లేదు. రోగులు, వైద్యులు అల్లాడిపోతున్నా, అధికారుల గదుల్లో ఏసీలు బాగా చల్లగా పనిచేస్తుండటంతో, రోగుల బాధలు, వైద్యుల బాధలు అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరమ్మతుల మాటే మరిచారు ఆసుపత్రిలో ఏసీల మరమ్మతుల మాట మరిచిపోయారు. మరమ్మతులకు గురైన వాటిని బయటకు తీసి నిబంధనలకు విరుద్ధంగా అమ్మేస్తున్నారు. కొత్తవాటిని కొనుగోలు చేసి అమరుస్తున్నారు. మరమ్మతుల పేరుతో ఆయా వార్డుల్లో తొలగించిన ఏసీలు ఎక్కడకు వెళుతున్నాయో ఎవరికి తెలియడం లేదు. వీటిని పర్యవేక్షణ చేయాల్సిన వారు మిన్నకుండి పోవడం విమర్శలకు తావిస్తుంది. మండుతున్న ఎండలు వేసవి ప్రారంభమైందంటే మార్చి నెల నుంచే గుంటూరులో ఎండలు మండిపోతుంటాయి. గుంటూరు నగరంలో 40 డిగ్రీలకు పైగా ఎండలు ఉన్నాయి. గుంటూరు జీజీహెచ్లో పలు వార్డుల్లో ఏసీలు పనిచేయక రోగులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆపరేషన్ థియేటర్లలో సైతం ఏసీలు పనిచేయడం లేదు. ఇటీవల కాన్పుల వార్డులో కూడా ఏసీలు పనిచేయక బాలింతలు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుండెజబ్బుల వార్డు, ఇతర వార్డులు, క్యాజువాల్టిలో ఎప్పటి నుంచో ఏసీలు పనిచేయడం లేదు. అయినప్పటికీ మరమ్మతులు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోవడం విమర్శలకు తావిస్తుంది. ఏసీలు మరమ్మతులు చేయకపోయినా కాంట్రాక్టర్లకు దొడ్డిదారిలో బిల్లులు చెల్లించేందుకు ఆసుపత్రి అధికారులు రంగం సిద్ధం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్లో 32కుపైగా వైద్య విభాగాలు ఉన్నాయి. 15 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు ఎంతో కీలకమైన విభాగాలు. వీటిల్లో తప్పనిసరిగా ఏసీలు ఉంటేనే వైద్యులు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఐసీయూల్లో ఏసీలు పనిచేయకపోతే రోగుల శరీర ఉష్ణోగ్రత్తల్లో తేడా వచ్చి కొన్ని సార్లు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఐసీయూల్లో ఏసీలు పనిచేయకపోవడం వల్ల అత్యవసర వైద్య పరికరాలు సక్రమంగా పనిచేయక వాటి పనితీరులో తేడాల వల్ల ప్రాణాపాయ చికిత్స పొందుతున్న రోగులు ఆపరేషన్ చేయించుకున్న రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఆసుపత్రుల్లో ఎంతో కీలకమైన ఏసీలకు మరమ్మతులు చేసేందుకు టెక్నీషియన్ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ఆసుపత్రిలో ఏసీలు అపహరణకు గురవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి సిబ్బంది సైతం వీటి గురించి చర్చించుకుంటున్నారు. శుక్రవారం ఇరువురు ఉద్యోగులు ఎమర్జెన్సీ వార్డుపైన ఏసీలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించి సీసీ కెమెరాల్లో రికార్డు అవడం ద్వారా పట్టుబడ్డారు. దీంతో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమై గతంలో పోయిన ఏసీలను కూడా ఎవరు చోరీ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. గతేడాది కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు దాతలు, బ్యాంకులు, పారిశ్రామిక వేత్తలతో జీజీహెచ్లోని పేద రోగుల కోసం ఏసీలను డొనేషన్ చేయించారు. ఆ ఏసీలు ఎక్కడ ఉన్నాయో, ఏ వార్డులో వాడుతున్నారో ఎవరి వద్దా లెక్కలు లేవు. గతంలో ఉన్న ఏసీలకు సైతం లెక్కలు లేవు. వర్క్షాప్ ద్వారా ఏసీల నిర్వహణ గతంలో ఉండేది. నేడు వర్క్షాప్ నుంచి అధికారుల వద్దకు ఏసీల నిర్వహణ బాధ్యతలు మారడంతో ఏసీల అపహరణలు జరుగుతున్నాయి. -
నిత్యాన్నదానానికి రూ. 90,001 విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గుంటూరుకు చెందిన భక్తులు ధరణికోట గిరిజ శుక్రవారం రూ. 90.001 విరాళంగా సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మదుసూధనరావుకు అందచేశారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో దాతను సత్కరించారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): న్యూ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఆధ్వర్యంలో అండర్–18 బాల బాలికల బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రేవతి, జి.ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు. ఈ పోటీలను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని టాప్ కిడ్స్ స్కూల్లో ఏర్పాటు చేశామన్నారు. పాల్గొనే వారు పోటీలకు అరగంట ముందు రిపోర్ట్ చేయాలని తెలిపారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ తప్పక తీసుకురావాలని పేర్కొన్నారు. వివరాలకు ఆంజనేయులు 98663 34528 నెంబర్కు సంప్రదించాలని కోరారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శనివారం ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా స్పెషల్ కమిషనర్ సౌమ్య, కమిషనర్ డాక్టర్ కె.రవిశంకర్ హాజరయ్యారు. ఈ స్పోర్ట్స్ మీట్లో భాగంగా క్రికెట్, టెన్నిస్, షటిల్, టెన్నికాయిట్, చెస్, 2 కే రన్, 1కే రన్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ తదితర విభాగాల్లో క్రీడలు నిర్వహించారు. కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కె.మురళీకృష్ణ, కల్చరల్ సెక్రటరీ జగదీష్బాబు పాల్గొన్నారు. పట్నంబజారు(గుంటూరుఈస్ట్) రాజధాని అమరావతి గురించి ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టింగ్ పెట్టాడనే నెపంతో సోషల్ యాక్టివిస్ట్పై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. రాజధాని అమరావతి గురించి జగన్ వారియర్ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా రాజధానికి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టాడు. దీనిపై పలువురు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ యాక్టివిస్ట్ కోసం గాలిస్తున్నట్లు సమాచారం. నరసరావుపేట రూరల్: విషం సేవించి యువకుడు మృతిచెందిన ఘటన ఇస్సపాలెం– జొన్నలగడ్డ బైపాస్రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు. బెల్లంకొండ మండలం పాపాయపాలేనికి చెందిన బిట్రగుంట వెంకట్రావు(28) పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో గతంలో ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. హైదరాబాద్లో చికిత్స పొంది కోలుకున్న వెంకట్రావు ఆసుపత్రిలో విధులకు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఇస్సపాలెం–జొన్నలగడ్డ బైపాస్లోని పంట పొలంలో వెంకట్రావు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో రూరల్ ఎస్ఐ కిషోర్ ఘటాన స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. నగరంపాలెం: గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విధులు నిర్వర్తించే డీఎస్పీ బి.సునీల్ బదిలీయ్యారు. కొద్దిరోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎస్పీల బదిలీలు జరగ్గా, ఆయన్ను విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్ డీఎస్పీగా బదిలీ చేశారు. గుంటూరు సీఐడీలో సుమారు ఏడాదిపాటు సునీల్ విధులు నిర్వర్తించారు. -
భానుడు.. భగ భగ
రెంటచింతలలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నిర్మానుష్యంగా మారిన మాచర్ల–గుంటూరు రహదారిగుంటూరులో ఎండలు మండిపోవడంతో గొడుగులు ఉపయోగిస్తున్న మహిళలు, సోడా బండి వద్ద వే చి చూస్తున్న కొనుగోలుదారులుకొద్ది రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎల్నినో ప్రభావం వలన ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన విషయం విదితమే. దీంతో ఉదయం 10 గంటల నుంచే తీవ్రత పెరిగింది. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా రెంటచింతలలో శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 43.4 డిగ్రీలుగా నమోదైంది. మధ్యాహ్న సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి కొబ్బరిబొండాలు, చెరుకురసం, శీతల పానీయాల దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు/ రెంటచింతల -
తొలి సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే
గుంటూరు ఎడ్యుకేషన్: సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన తొలి సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే అని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు, వందల ఏళ్లుగా అణచివేతకు గురైన బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడిగా జ్యోతిరావు పూలే నిలిచారని అన్నారు. మహిళా సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడిగా మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలు నిరుపమానమని చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, వివిధ విభాగాల పరిపాలనాధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు చంద్రమౌళీనగర్కు చెందిన ఉప్పలపాటి శేఖర్, మాధవి రూ.1,00,001 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి నాగేశ్వరరావు, డీవీవీ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో ఇంటెలిజెన్స్ ఐజీపీ మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీపీ పీహెచ్డీ రామకృష్ణ కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలోపాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందించి సత్కరించారు. చల్లపల్లి సీఐ ఈశ్వరావు, స్థానిక ఎస్ఐ పి.గౌతమ్కుమార్. ఆలయ అధకారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దుర్గమ్మకు కానుకగా బంగారు హారం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు శనివారం రూ.5 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన కె.శ్రీనివాసుమూర్తి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 33 గ్రాముల బంగారం, రూ.5 లక్షలతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఎఈవో వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు. -
పూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన వైఎస్ జగన్
గుంటూరు ఎడ్యుకేషన్ : అట్టడుగు వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పరిపాలనలో ఆచరణలో పెట్టారని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవన్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. శనివారం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు)లతో కలసి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ 200 ఏళ్ల క్రితమే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని, అణగారిన, అట్టడుగు వర్గాల్లో అంటరానితనాన్ని పారద్రోలి సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా ముందుకు వెళ్లేందుకు బాటలు వేసిన మహనీయుడని కొనియాడారు. 1848లోనే సీ్త్ర విద్య కోసం తన సతీమణి సావిత్రిబాయి పూలేకు అండగా నిలిచి, ప్రత్యేకంగా విద్యాసంస్థలను స్థాపించేందుకు కృషి చేశారని అన్నారు. జ్యోతిరావు పూలే ఆశించిన విధంగా అట్టడుగు వర్గాల సంక్షేమం, రాజకీయంగాచైతన్య, చట్టసభల్లో ప్రాధాన్యాన్ని వైఎస్ జగన్మోన్రెడ్డి గత ప్రభుత్వంలో ఆచరణలో చూపించారని అన్నారు. బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన ఏకై క ముఖ్యమంత్రిగా నిలిచారని, రాష్ట్రంలో జ్యోతిరావ్ పూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ హక్కు ఉందన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ విభాగ అధ్యక్షడు తాడిబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో బీసీలకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. బీసీలకు న్యాయం చేసి, అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన వ్యక్తిగా వైఎస్ జగన్ నిలిచారని చెప్పారు. -
రంగస్థలిపై మానవీయ సంతకాలు
యడ్లపాడు: జగతిని జాగృతం చేసేవి కళారూపాలేనని ఏపీ రాష్ట్ర తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. రసవత్తరమైన నటనకు, భావోద్వేగాలకు వేదికగా నిలిచే లింగారావుపాలెంలో కొండవీటి కళా పరిషత్ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథి ఏపీ తెలుగు నాటక అకాడమీ చైర్మన్న్ గుమ్మడి గోపాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేయగా, పుడమి మైన్స్ డైరెక్టర్ ముత్తవరపు అరుణకుమారి నటరాజ పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిషత్ అధ్యక్షులు కట్టా శ్రీహరిరావు అధ్యక్షత వహించారు. గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను ఎండగట్టే గొప్ప శక్తి సింగిల్ టేక్లో ప్రదర్శించే ఒక్క నాటకానికి మాత్రమే ఉందన్నారు. సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య మాట్లాడుతూ నాటక రంగాన్ని నడిపిస్తున్నవి పరిషత్తులు, దాతలు మాత్రమే అన్నారు. ముత్తవరపు అరుణకుమారి మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వవైభవానికి తీసుకువచ్చే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం నేత చలసాని శ్రీనివాస్, విరించి రిసార్ట్స్ అధినేత నెల్లూరి వంశీకష్ణ, పఠాన్ సుభాని, ఆలోకం అమరలింగస్వామి, కిలారు వెంకటరావు, నంబూరు నరసింహారావు, కృష్ణారావు, శొంఠినేని సాంబశివరావు పాల్గొని ప్రసంగించారు. వ్యాపారమైన మాతృత్వంపై కన్నీటికి విలువెంత..? సమాజంలోని అతి కిరాతకమైన వైద్య మాఫియా ముఖాన్ని బట్టబయలు చేసింది. అమ్మ ప్రేమను కూడా అంగడి సరుకుగా మారుస్తున్న డాక్టర్ సరోజినీ దేవి అరాచకాలను, సామాన్య సీ్త్రల పోరాట పటిమను ఈ నాటిక అద్భుతంగా చిత్రించింది. నర్సు నందిని అందించిన సహకారంతో, బాధితులు సీతాలు, మాధవి తమ కన్నీటిని ఆయుధాలుగా మలిచి వ్యవస్థలోని అన్యాయంపై సమరశంఖం పూరించారు. డి.కామేశ్వరి కథను దృశ్యరూపంలోకి మలిచిన విధానం, బీవీకే క్రియేషన్స్ వారి నటన.. వైద్య రంగంలో మంటగలుస్తున్న నైతిక విలువలను ప్రశ్నించడమే కాకుండా, సీ్త్ర శక్తి తలచుకుంటే ఎంతటి కుట్రనైనా ఛేదించగలదని నిరూపించింది. మాయాలోకంలో మనీషిని వెతికిన మంచి మనసులు.. స్వార్థం రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో నిస్వార్థ సేవ యొక్క ప్రాధాన్యాన్ని హృదయాలకు హత్తుకునేలా చాటిచెప్పింది. తోటి మనిషి కష్టాన్ని తనదిగా భావించేవాడే అసలైన దైవమని, రక్త సంబంధాల కంటే ఆపన్న హస్తం అందించే మానవ సంబంధాలే మిన్న అని చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వ ప్రతిభతో సాక్షాత్కరించారు. అందరి క్షేమాన్ని కాంక్షించే ఉన్నత ఆశయమే సమాజానికి ప్రాణవాయువు అని చాటుతూ, ఉషోదయ కళానికేతన్ (కట్రపాడు)బృందం ప్రదర్శించిన ఈ రూపకం మనుషుల మధ్య అంతరించిపోతున్న మమకారాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. అందం వర్సెస్ అమ్మతనం.. ఇక శ్రీరమణా కళానిలయం సమర్పించిన మాతృత్వం నాటిక ఆడతనం అంటే కేవలం బాహ్యా సౌందర్యం కాదని, అది అమ్మతనంలోనే పరిపూర్ణత చెందుతుందని లోతైన విశ్లేషణ చేసింది. వృత్తి, అందం అనే వ్యామోహంలో పడి సంతానాన్ని భారంగా భావించిన లావణ్య అనే యువతి పాత్ర ద్వారా నేటి తరం ధోరణిని సునిశితంగా విమర్శించారు. అహంకారం నుంచి పశ్చాత్తాపం వైపు సాగిన ఆమె ప్రయాణం, పక్షవాతంతో ఉన్న అత్తగారి మాతృత్వ హృదయాన్ని చూసి కళ్లు తెరుచుకోవడం వంటి దృశ్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సుఖమంచి కోటేశ్వరరావు రచనకు, పొగర్తి నాగేశ్వరరావు ప్రాణం పోయగా, మారుతున్న కాలంలో మసకబారుతున్న కుటుంబ విలువలను సరిదిద్దే కనువిప్పుగా ఈ నాటిక నిలిచింది. -
ప్రకృతి సాగుతో ఆరోగ్యకర జీవనం
నరసరావుపేట: అందుబాటులో ఉన్న స్థలాన్ని వినియోగించి న్యూట్రి గార్డెన్ మోడల్స్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం న్యూట్రి, కమ్యూనిటీ, కిచెన్ గార్డెన్స్, సూర్య మండలం, ఏటీఎం మోడల్స్, టెర్రస్, బయో–రిసోర్స్ సెంటర్లపై సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు బడులు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలలు, మహిళల ఇళ్ల వద్ద ఈ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రోజువారీగా పోషక విలువలతో కూడిన ఆహారం పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడం అత్యంత అవసరమని తెలిపారు. చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. న్యూట్రి గార్డెన్స్ ప్రోత్సాహం కోసం గ్రామస్థాయిలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని సూచించారు. బయో–రిసోర్స్ ఇన్పుట్ సెంటర్ల ఏర్పాటు, పాయింట్ పర్సన్స్ బాధ్యతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల నేల నాణ్యత దెబ్బతినడం, ఆరోగ్య సమస్యలు పెరగడం వంటి సమస్యల గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని కాపాడుతూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధ్యం అవుతాయని తెలిపారు. న్యూట్రి, కిచెన్, కమ్యూనిటీ గార్డెన్స్, సూర్య మండలం, ఏటీఎం మోడల్స్, టెర్రస్ ప్రాముఖ్యతను వివరించారు. శిక్షణలో భాగంగా విత్తనాల ఎంపిక, నీటి నిర్వహణ, సేంద్రియ ద్రావణాల తయారీపై అవగాహన కల్పించారు. కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార భద్రత పెంపొందించడంతోపాటు ప్రకృతి వ్యవసాయం విస్తరణకు, రైతుల ఆర్థిక స్థితి మెరుగుదలకు దోహద పడుతుందని అధికారులు తెలిపారు. స్పెషల్ కలెక్టర్ మనోజ్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మెప్మా, డీఆర్డీఏ, ఐసీడీఎస్, డీపీఓ, ఎంపీడీఓలు, ఎంసీలు, ఏపీఎంలు, ఎంఈఓలు, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. జిల్లా జీఎస్టీ కో ఆర్డినేషన్ సమావేశం కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, పన్నుల విభాగ గుంటూరు జాయింట్ కమిషనర్ జాన్ స్టీవెన్సన్ పాత్రో పల్నాడు జిల్లా జీఎస్టీ కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. జీఎస్టీ వసూళ్లు పెంచడంలో వివిధ విభాగాలు అందించాల్సిన సహకారం, ఆవశ్యకత వివరించారు. జిల్లాలో పనిచేస్తున్న వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల అసిస్టెంట్ కమిషనర్లు హాజరయ్యారు. జిల్లాలో రైల్వే సంస్థ చేపట్టిన ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి), ఆర్యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి)ల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, డీఆర్ఓ నారదముని, ఆర్డీఓ మురళీకృష్ణ, రైల్వే శాఖ ప్రధాన అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా -
నరసరావుపేటలో 18 సిలిండర్లు స్వాధీనం
నరసరావుపేట టౌన్: గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్నట్టు గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు 18 సిలిండర్లను శుక్రవారం సీజ్ చేసి కేసు నమోదు చేశారు. వివరాలు... వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్న విస్తృత తనిఖీలలో భాగంగా శుక్రవారం విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ నేతృత్వంలో పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాసనగర్కు చెందిన గంటా ఫకీరయ్య 18 గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. మధ్యవర్తుల సమక్షంలో సిలిండర్లను స్వాధీనం చేసుకొని నరసరావుపేట మండల పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్కు అప్పగించారు. ఈ ఘటనలపై అత్యవసర సరుకుల చట్టం, 1955 లోని సెక్షన్ 6–ఏ కింద కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉండగా, వివిధ కారణాలతో 22న నిర్వహించేందుకు నిర్ణయించారు. 25న స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 25వ తేదీన జెడ్పీ కార్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు సీఈవో వి.జ్యోతిబసు షెడ్యూల్ విడుదల చేశారు. నగరంపాలెం: జిల్లాలోని మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలిచ్చి, వారిని ప్రమాదాలకు గురిచేయవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన నిమిత్తం గురువారం జిల్లా అంతటా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నిబంధనలు ఉల్లఘించిన చోదకులు, వారి తల్లిదండ్రులకు శుక్రవారం నగరంపాలెం పోలీస్ కవాతు మైదానంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 842 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 206 వాహనాలు సీజ్ చేయగా, 636 వాహనాలకు రూ.3.36 లక్షల జరిమానా విధించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహన డ్రైవ్ చేపట్టామని అన్నారు. మైనర్ల డ్రైవింగ్, ర్యాష్/ ట్రిపుల్ రైడింగ్లు, లైసెన్సు, బీమా, హెల్మెట్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు గుర్తించామని చెప్పారు. మైనర్లకు ప్రేమతో తల్లిదండ్రులు వాహనాలు అప్పగిస్తే, తర్వాత వారి పిల్లల ప్రాణాలకే ముప్పు అని చెప్పారు. డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అబ్దుల్ అజీజ్ (గుంటూరు తూర్పు), శ్రీనివాసులు (ఎస్బీ), సీఐలు ఎ.అశోక్కుమార్ (తూర్పు ట్రాఫిక్), సింగయ్య (పశ్చిమ ట్రాఫిక్), గంగా వెంకటేశ్వర్లు (పట్టాభిపురం పీఎస్), శివప్రసాద్ (లాలాపేట పీఎస్), ఆరోగ్యరాజు (అరండల్పేట పీఎస్), సత్యనారాయణ (నగరంపాలెం పీఎస్), ఆర్ఐ శ్రీహరిరెడ్డి పాల్గొన్నారు. లక్ష్మీపురం: గుంటూరు చంద్రమౌళినగర్లోని ఆక్స్ఫర్డ్ కళాశాల యాజమాన్యానికి చెందిన ఐదుగురిపై పట్టాభిపురం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు చంద్ర మౌళినగర్లోని ఆక్స్ఫర్డ్ కళాశాలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చిన విషయం విదితమే. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆక్స్ఫర్డ్ కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. రూ.లక్షల ఫీజులు వసూలు చేసి భవితవ్యంతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు ఆక్స్ఫర్డ్ కళాశాల సీఈఓ సన్ని, కళాశాల డీన్ మురళీకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ దీప, హాస్టల్ ప్రిన్సిపల్ ప్రసన్న, కంప్యూటర్ ఆపరేటర్ మూర్తిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్ జగన్తోనే సంక్షేమ పాలన సాధ్యం
బాపట్ల: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమ పాలన సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. బాపట్ల జిల్లా బూత్ కమిటీ సమావేశంలో స్థానిక వీ కన్వన్షన్ హాలులో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మేరుగ నాగార్జున మాట్లాడుతూ అబద్ధాలతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు పాలనపై ప్రజల్లో విశ్వాసం లేదన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని వివరించారు. ప్రజల నుంచి వ్యతిరేకతను రెండేళ్లకే చవిచూడాల్సిన పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానికి పట్టిందన్నారు. ప్రజల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆదరణ పెరిగిపోతోందనే విమర్శలు రోజురోజుకు పెంచుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ మరో రూ. 2లక్షల కోట్లు ఖర్చుపెడితే అందులో కమీషన్లు నొక్కేందుకు భారీ స్కెచ్ వేశారని దుయ్యబట్టారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి మావిగన్ పేరుతో అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన ప్రతిపాదనకు ప్రజల్లో విశేష స్పందన వచ్చిందన్నారు. కచ్చితంగా కేవలం రూ.20 వేల కోట్లు పెడితే ఈ మూడు నగరాలను కలిపి మెరుగైన రాజధానిగా నిర్మించవచ్చని ఆయన చెప్పినట్లు గుర్తుచేశారు. బూత్ లెవల్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్క ఓటు విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి పదవులు తప్పక వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల సమన్వయకర్త కరణం వెంకటేష్బాబు, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, రేపల్లె సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు చేజర్ల నారాయణరెడ్డి, మోదుగుల బసవ పున్నారెడ్డి, యార్లగడ్డ మదనమోహన్, బాపట్ల పరిశీలకులు జి.సురేంద్ర, అద్దంకి పరిశీలకులు ప్రసాద్, పర్చూరు కోటేశ్వరరావు, పార్టీ నాయకులు వాసుమల్లి వాసు, కొక్కిలిగడ్డ చెంచయ్య, కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఇనగలూరి మాల్యాద్రి, కోకి రాఘవరెడ్డి, చల్లా రామయ్య, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, వడ్డిముక్కల డేవిడ్, దొంతిబోయిన సీతారామిరెడ్డి, కటికల యోహోషువా ఉన్నారు. ప్రతి ఓటును కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ బూత్ కమిటీ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అధ్యక్షుడు కె.సుధాకర్రెడ్డి సూచించారు. ఓట్లు ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా సీరియల్స్ ఉంటాయి, ఏ విధంగా చేర్పులు ఉంటాయని అనే విషయాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు. మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలకు దోచుకోవటం, దాచుకోవటంపై సీఎం చంద్రబాబు శిక్షణ ఇచ్చి మరీ ప్రజలపైకి పంపుతున్నారని పేర్కొన్నారు. ఒక పక్క అవినీతి పెరిగిపోతోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబునాయుడు అమరావతిని తెరపైకి తెచ్చారన్నారు. అమరావతి కాకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి మావిగన్గా అభివృద్ధి చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించటంతో కూటమి ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చిందన్నారు. దీంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కోన దుయ్యబట్టారు. కచ్చితంగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, కష్టపడిన ప్రతి నాయకుడికి మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులను ముంచేసిన ప్రభుత్వం ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు తూమాటి మాధవరావ మాట్లాడుతూ... మత్స్యకారులను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. వేట సమయంలో ఇతర దేశాలకు అనుకోని పరిస్థితులలో మన జాలర్లు వెళితే తిరిగి తీసుకువచ్చేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మన జలాలలోకి తమిళనాడు మత్స్యకారులు వచ్చి వేట సాగిస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. మన వారి పడవలు తమిళనాడుకు వెళ్లినప్పుడు అక్కడ భారీగా అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. -
బియ్యం బుక్కి... పేద కడుపు కొట్టి...
చీరాల అర్బన్: చీరాల నియోజకవర్గంలో రేషన్ బియ్యం దారి మళ్లుతోంది.. ఇదంతా ఒంగోలుకు చెందిన దివ్యాద్రి అనే నల్లబజారు వ్యాపారి కనుసన్నల్లో జరుగుతోంది. అందుకు కీలక నేత, యువనేత అండ ఉండటమే కారణం. ఈ క్రమంలో నల్లబజారు వ్యాపారి పలువురు డీలర్లపై జులుం ప్రదర్శిస్తున్నాడు. అందుకు సంబంధిత అధికారులు స్వామి కార్యం.. స్వకార్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారని చెప్పుకొంటున్నారు. తాము చెప్పిన మేరకు బియ్యం ప్రతి నెలా ఇవ్వాల్సిందేనని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో డీలర్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందని చెప్పుకుంటున్నారు. బియ్యం బదులు డబ్బులు తీసుకోమంటే పలు చోట్ల కార్డుదారులు వ్యతిరేకిస్తున్నారు. తమకు బియ్యమే కావాలని డిమాండ్ చేస్తున్నారు. వైకుంఠపురంలో జరిగిన సంఘటనలు అందుకు నిదర్శనమని ఆయా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో నల్లబజారు వ్యాపారి చెప్పినట్లు వినకపోతే డీలర్లును మారుస్తామని బెదిరిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. ఇప్పటికే పలువురు డీలర్లను మార్చారని సమాచారం. గతంలో ఇలాంటి ధోరణి లేదని పలువురు డీలర్లు వాపోతున్నారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులు స్వామి కార్యం... స్వకార్యం అన్నట్లు డీలర్లలో అస్మదీయులైతే ఒక రకంగా, తస్మదీయులైతే మరో రకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చర్యలు శూన్యం నల్లబజారు వ్యాపారికి అనుకూలంగా వ్యవహరించే డీలర్ల నుంచి రేషన్ బియ్యం సేకరించే సమయంలో ఎవరన్నా సమాచారం ఇచ్చినా సంబంధిత అధికారులు స్పందించటం లేదు. వారిపై చర్యలు చేపట్టకుండా రవాణాకు రైట్ రైట్ అంటున్నారు. గత నెలలో కారంచేడు గేటు సెంటర్లో రాత్రి వేళ రేషన్ బియ్యం లోడింగ్ జరిగే సమయంలో సమాచారం అందించినా స్పందించకపోవటం అందుకు నిదర్శమనే వాదనలు వినిపిస్తున్నాయి. వెలుగులోకి వచ్చిన సంఘటన ఇదొక్కటే. అయితే ప్రతి నెలా 5 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజు రేషన్ బియ్యం నల్లబజారుకు తరలుతూనే ఉందని విషయం తెలిసిన వారు చెబుతున్నారు. రేషన్ బియ్యం నల్లబజారుకు తరలే క్రమంలో నైట్ బీట్ పోలీసులకు ఎప్పుడు కూడా కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అలానే సివిల్ సప్లయిస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పరంగా చర్యలు కూడా లేవని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అన్నీ నిజాలే.. కార్డుదారులకు ప్రతి నెల పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని కొంత ఇచ్చి, మరికొంత కార్డుదారుల అంగీకారంతో, ఇంకొంత డీలర్ల చేతివాటంతో సమీకరిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో రేషన్ షాపుల్లో వెలుగులోకి వస్తున్న అక్రమాలు అందుకు నిదర్శనం. అధికారులు ఎప్పుడు చర్యలు చేపడతారో .. వేచి చూడాల్సిందే. బుధవారం ఉదయం స్వర్ణరోడ్డులో ఆటోలో రేషన్ బియ్యం తరలుతున్నాయనే సమాచారంతో వన్టౌన్ పోలీసులు వలపన్ని ఆ ఆటోను పట్టుకున్నారు. అందులో 12 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఆటో సహా స్టేషన్కు తరలించారు. సంబంధికులపై కేసు నమోదు చేశారు. అవి నల్లబజారు వ్యాపారి దివ్యాద్రి , అతని అనుచరులకు తెలియకుండా ఇళ్ల వెంట తిరిగి ఓ మహిళ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. నల్లబజారు వ్యాపారికి ఎక్కడా గుప్పెడు బియ్యం కూడా తగ్గకుండా ఉండేందుకు, మరొకరు రేషన్ బియ్యం కొనుగోలు చేయకుండా ఉండేందుకు ఓ మహిళ ఇళ్ల వెంట తిరిగి సేకరించుకున్న రేషన్ బియ్యాన్ని తరలించే క్రమంలో పోలీసులు తమకు అందిన సమాచారం మేరకు పట్టుకున్నట్లు చెబుతున్నారు. ప్రతి నెల 5 నుంచి 15వ తేదీ వరకు వందల రేషన్ బియ్యం బస్తాలు నల్లబజారుకు తరలుతున్నాయని, వాటి సమాచారం పోలీసులకు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయిస్ అధికారులకు అందకపోవటం విస్మయం కలిగిస్తోందని ప్రజలు మండపడుతున్నారు. -
కోన ప్రభాకరరావు కీలక పాత్ర
దేశ రాజకీయాల్లో బాపట్ల: దేశ రాజకీయాల్లో కోన ప్రభాకరరావు కీలకపాత్ర పోషించారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. పాతబస్టాండ్లో ఏర్పాటు చేసిన కోన ప్రభాకరరావు విగ్రహాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. నాగార్జున మాట్లాడుతూ బాపట్ల ప్రాంత అభివృద్ధితోపాటు దేశ చరిత్రలోనే బాపట్లకు గుర్తింపు తీసుకువచ్చిన ఘనత కోన ప్రభాకరరావుకు దక్కిందన్నారు. కోన ప్రభాకరావు మహారాష్ట్ర గవర్నర్గా పనిచేయటంతోపాటు కాంగ్రెస్పార్టీలో కీలకమైన పదవులు ఎన్నో చేపట్టారని గుర్తు చేసుకున్నారు. కోన ప్రభాకరరావు తనయుడు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ కోన ప్రభాకరరావు కుమారుడుగా పుట్టడం తాను చేసుకున్న అదృష్టంగా పేర్కొన్నారు. క్రీడా, రాజకీయ, సినీరంగం, న్యాయవాది.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్నతంగా రాణించటం కోన ప్రభాకరరావుకే దక్కిందన్నారు. అనునిత్యం బాపట్ల ప్రాంత అభివృద్ధికి ఆయన కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. బాపట్లను విద్యకేంద్రంగా రూపాంతరం చెందేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈ ప్రాంతాభివృద్ధికి బీజాలు అని చెప్పారు. బాపట్ల నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా తాగు, సాగునీటిని అందించారని ప్రభాకరరావును ప్రజలు గుర్తు చేసుకోవటం తనకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. బాపట్ల ప్రాంతంలో పాతబస్టాండ్ రోడ్డు విస్తరణ సందర్భంగా విగ్రహాన్ని తొలగించారని, తిరిగి విగ్రహం ఏర్పాటు చేస్తారా... లేదా... అనే సందేహాల మధ్య విగ్రహం ఏర్పాటు చేయటం ఎంతో సంతోషకరమని చెప్పారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, సమన్వయ కర్తలు వరికూటి అశోక్బాబు, కరణం వెంకటేష్బాబు, పీటా నాగ మోహన్కృష్ణ, చింతలపూడి అశోక్, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, పార్టీ నాయకులు కొక్కిలిగడ్డ చెంచయ్య, వడ్డి ముక్కల డేవిడ్, దొంతిబోయిన సీతారామిరెడ్డి, కోకి రాఘవరెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, చల్లా రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
మాతృ మరణాలు పునరావృతం కాకూడదు
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి మాతృ మరణాలపై శుక్రవారం వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. అడిషనల్ డైరెక్టర్ మెటర్నల్ హెల్త్ డాక్టర్ కే.అనిల్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 వరకు జిల్లాలో సంభవించిన 14 మాతృ మరణాలపై సమావేశంలో సమీక్షించారు. మాతృ మరణాలకు గల కారణాలను సమీక్షించిన కమిటీ సభ్యులు పైన సంభవించిన మరణాలలో ఏడు నివారించదగినవని, మిగితా ఏడు నివారించలేనివని నిర్ధారించారు. డాక్టర్ అనిల్కుమార్ మాట్లాడుతూ ప్రతి మాతృమరణాన్ని సమాజ స్థాయిలో, ఆసుపత్రి స్థాయిలో సమగ్రంగా సమీక్షంచుకొని, మున్ముందు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఈ విషయాలపై వైద్యాధికారులకు, పారామెడికల్ సబ్బందికి రీ ఓరియంటేషన్ ట్రైనింగ్ నిర్వహించాలని తెలిపారు. గర్భిణులు, వారి కుటుంబసభ్యులకు, గర్భస్థ దశలో ప్రమాదకర పరిస్థితులపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు పరస్పరం కలిసి పనిచేసి మాతృ మరణాలు తగ్గించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్, స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సి.హెచ్.శిరీష, డాక్టర్ నిర్మలగ్లోరి, స్టేట్ కన్సల్టెంట్ యూనిసెఫ్ డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. -
బాపట్ల
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 2100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.0200 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 528.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 8,314 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,500, గరిష్ట ధర రూ.11,000, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. 7 -
ఆప్కాస్.. వెతనాలు!
నెహ్రూనగర్ : ఇచ్చేదే అంతంతమాత్రం జీతాలు.. అవీ సకాలంలో అందకపోవడంతో ఆప్కాస్ కింద పనిచేసే ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. గుంటూరు నగరపాలక సంస్థలో ఆప్కాస్ కింద సుమారు 3 వేల మంది వరకు ఉన్నారు. ఈ నెల ఇంకా జీతాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం దీనిపై స్పష్టత ఇచ్చేవారు లేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. స్పందించే వారేరి? గుంటూరు నగరపాలక సంస్థలో 9వ తేదీ వచ్చినప్పటికీ జీతాల జమపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ప్రజారోగ్య విభాగంలో పనిచేసే పారిశుద్ద్య కార్మికులు, ఇంజనీరింగ్, ఇతర విభాగాల్లో పనిచేస్తే ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం వారికి జీతాలు జమ చేసే అంశంలో స్పందించడం లేదు. నగరపాలక సంస్థ అధికారులు ఏం సమాధానం చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీతం సమయానికి పడకపోవడంతో ఈఎంఐలు కట్టాల్సిన వారు సకాలంలో కట్టకపోవడంతో చెక్లు బౌన్స్ అవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జీతాలు అందే విధంగా తగిన చొరవ చూపాలని కార్మికులు కోరుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి నెల చివరి మాసం కావడంతో ఏప్రిల్ నెలలో 2026– 27 సంవత్సరానికి ఆస్తి డిమాండ్ జనరేట్కు సంబంధించి సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్) సైట్ ప్రాసెస్ చేస్తుంటారు. ఈ ప్రాసెస్ ఇంకా పూర్తి కాకపోవడంతో ట్యాక్సులు చెల్లించే వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు జనన, మరణ ధ్రువపత్రాలు, ఇతర సేవలు పొందేందుకు సీడీఎంఏ పోర్టల్ ద్వారానే లావాదేవీలు జరుపుతుంటారు. 9వ తేదీ వస్తున్నప్పటికి సైట్ అందుబాటులోకి రాకపోవడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై న ప్రభుత్వం స్పందించి త్వరితగతిన సీడీఎంఏ సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు సేవలందించాలని నగర వాసుల కోరుతున్నారు. -
రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలి
బాపట్ల : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. బాపట్ల టౌన్ పోలీసు స్టేషన్ వేమూరి రాధాకృష్ణపై గురువారం ఫిర్యాదు చేశారు. మహిళలపై అసభ్యమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న చంద్రబాబుపై అభినందనల వర్షం కురిపించే రాధాకృష్ణ మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణను భగ్నం చేసేందుకు కుట్ర పూరితమైన రాతలు రాస్తున్నారని కోన వివరించారు. ప్రజాస్వామ్య విలువలు సైతం దెబ్బతినేవిధంగా రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, బాపట్ల మండల అధ్యక్షుడు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఇనగలూరి మాలాద్రి, అడే చందు, నర్రావుల వెంకట్రావు, కటికల ఝెహోషువ, పాలపర్తి గోపి, తదితరులు పాల్గొన్నారు. మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి డిమాండ్ -
టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లిన కారు
చిలకలూరిపేట: టిఫిన్ సెంటర్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మద్యం, గంజాయి మత్తులో వేగంగా వాహనం నడుపుతూ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలో గురువారం దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.... విజయవాడకు చెందిన ఇందుపల్లి హరీష్, విశాఖపట్నానికి చెందిన దూషిక్, మరో ముగ్గురు యువతులు కలసి విజయాబ్యాంకు సెంటర్కు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వీరంతా డ్యాన్సర్లు. బుధవారం వేరే ప్రాంతంలో నృత్య ప్రదర్శనలు ఇచ్చి వచ్చాక రాత్రంతా మద్యం తాగుతూ గడిపారు. దీనికి తోడు గంజాయి తీసుకుంటారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కారు తీసుకొని ఇరువురు సిగరెట్లు తెచ్చుకొనేందుకు బయలుదేరారు. మత్తులో మునిగిపోయి ఉన్న ఇరువురు జాతీయ రహదారి పక్కన విజయా బ్యాంకు సెంటర్లోని ఈగల్ రెస్టారెంట్ సమీపంలోని టిఫిన్ సెంటర్లోకి దూసుకువెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే ఈ సెంటర్లో అదృష్టవశాత్తు కారుకు ఎవరూ అడ్డు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు వేగానికి రెస్టారెంటుకు సంబంధించిన భారీ విద్యుత్ బోర్డు వాహనంపై పడిపోయింది. టిఫిన్ సెంటర్లోని వస్తువులు ధ్వంసం అయ్యాయి. వేగంగా వచ్చి కారు పెద్ద శబ్దంతో ఢీకొనడటంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. టిఫిన్ ఇతర అవసరాల కోసం వచ్చిన ప్రజలు కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు కారు ప్రమాదానికి కారణమైన ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. వాహనం నడిపిన ఇందుపల్లి హరీష్కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. -
సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్
పెట్రోల్ బాటిల్తో బెదిరింపు మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో గురువారం ఓ వ్యక్తి సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ, అక్రమ కేసులు బనాయించారంటూ పెట్రోల్ బాటిల్తో సెల్ టవర్ ఎక్కి న్యాయం చేయాలంటూ ఆందోళన చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ, రూరల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది ఆ వ్యక్తిని శాంతింపజేసేందుకు గంటల తరబడి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే... మంగళగిరి పట్టణానికి చెందిన గోలి రామాంజనేయులుపై మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో పలు కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల రౌడీషీట్ కూడా తెరిచారు. ఒక కేసులో రిమాండ్ నుంచి బయటకు వచ్చిన రామాంజనేయులును కొన్ని రోజుల కిందట నార్త్ సబ్ డివిజన్ ఉన్నతాధికారి పిలిపించి బెదిరించారంటూ రామాంజనేయులు భార్య ఆరోపించింది. అక్రమ కేసులు ఎత్తివేయాలని, రౌడీషీట్ తొలగించాలని సెల్ టవర్ ఎక్కిన రామాంజనేయులు టవర్పై నుండి నినాదాలు చేస్తూ హల్చల్ చేశాడు. నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ హైడ్రామాలో పరిశీలన చేస్తామని పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో రామాంజనేయులు సెల్ టవర్ దిగి కిందకు వచ్చాడు. అయితే గురువారం ఉదయం తాడేపల్లి ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని రామాంజనేయులు హడావుడి చేశాడు. అక్కడి పోలీసులు అడ్డుకుని పంపించివేశారు. గతంలో మంగళగిరి పట్టణం రత్నాల చెరువులో మహిళలను కులం పేరుతో ధూషిస్తూ దిగంబరంగా రామాంజనేయులు హల్చల్ చేసిన వీడియాలో అప్పట్లో సంచలనం రేపాయి. గోలి రామాంజనేయులపై రెండు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు, మహిళపై దాడి కేసు పట్టణ పోలీస్స్టేషన్లో నమోదు అయ్యాయని, రౌడీషీట్కూడా తెరిచినట్లు పోలీసులు తెలిపారు. రామాంజనేయులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు పేర్కొన్నారు. -
జీజీహెచ్లో బకాయిల రోగం
● రూ. లక్షల్లో పేరుకుపోయినా చెల్లించని వ్యాపారులు ● వసూలుకు కనీసం చర్యలు చేపట్టని ఆసుపత్రి అధికారులు ● హెచ్డీఎస్కు నిధుల కొరత ఉన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం కనీసం నోటీసూ లేదు.. హెచ్డీఎస్ ఆదాయానికి గండి గుంటూరు జీజీహెచ్లో వ్యాపారాలు చేస్తున్న వారిలో కొందరు నెలల తరబడి.. మరికొందరు సంవత్సరానికి పైబడి కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. అద్దెలు కట్టడం లేదు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒక్కొక్కరు రూ. లక్షల్లోనే కరెంటు బిల్లులు, అద్దె చెల్లించాల్సి ఉంది. ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకపోయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చర్చనీయాంశం అయింది. -
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలి
పెదకాకాని: భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయ రంగమే ప్రధానంగా జీవిస్తున్నారని, అలాంటి వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు చిన్న చూపుచూస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. పెదకాకానిలో గురువారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం గుంటూరు జిల్లా నాలుగవ మహాసభ నిర్వహించారు. కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్ల రామకృష్ణ జెండాను ఆవిష్కరించారు. సభకు అధ్యక్షవర్గంగా బి రామకృష్ణ, కందుల శ్రీనివాసరావు వ్యవహరించారు. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు కార్యవర్గ నివేదిక ప్రవేశపెట్టారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతు ప్రాధాన్యతను గుర్తించడం లేదని వ్యవసాయ రంగానికి సబ్సిడీలు, రుణాలు నానాటికీ తగ్గిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అధిక భాగం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారన్నారు. వ్యయ ప్రయాసలకు ఓర్చి కౌలు రైతులు వ్యవసాయం చేస్తుంటే అధిక వర్షాలు, చీడపీడలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. గుంటూరు ఛానల్ అభివృద్ధి చేస్తామని చెబుతున్నారే తప్ప పనులు ఎక్కడ జరగట్లేదన్నారు. పల్నాడులో నాగార్జునసాగర్ పక్కనే ఉంచుకొని రైతులు తాగు, సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై రాధాకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో కౌలు రైతులది కీలకపాత్ర అన్నారు. -
సీఎం ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన ప్రజలు
భట్టిప్రోలు(వేమూరు): మండలంలోని సూరేపల్లిలో గురువారం జరిగిన సీఎం సభలో ప్రజలు మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. మధా్య్హ్నం 12 గంటలకు ప్రజావేదిక సభ ప్రారంభం కాగా.. సీఎం చంద్రబాబు నాయుడు 12.30 నిమిషాలకు మాట్లాడడం ప్రారంభించారు. మీటింగ్ వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, డ్వాక్రా గ్రూపుల మహిళలు మధ్యాహ్నం 1 గంటకల్లా సగం మంది వెళ్లి పోయారు. సీఎం ప్రసంగం మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా గ్రూపుల మహిళలు వెళ్లి పోవడంతో కుర్చీలు ఖాళీ అయ్యాయి. అసలే ఆశించినంత మంది ప్రజలు సభకు రాక స్థానిక టీడీపీ నేతలు తలలు పట్టుకోగా.. సీఎం ప్రసంగిస్తుండగానే చాలామంది లేచి వెళ్లిపోవడంతో చేసేదేమి లేక చూస్తు ఉండిపోయారు. బాపట్లటౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాపట్లకు చెందిన ఇరువురికి పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించింది. పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీగా బాపట్లకు చెందిన చెరుకూరి కిరణ్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరిగా బాపట్లకు చెందిన జి.ఎ.మణిభూషణ్లు నియమితులయ్యారు. కారంచేడు: కొనుగోలు చేసిన మిరపకాయల డబ్బు ఇవ్వకపోవడంతో రైతు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణ జరిపిన పర్చూరు కోర్డు నిందితునికి రెండేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.5000 జరిమానా విధించారు. కారంచేడు ఎస్సై షేక్ ఖాదర్బాషా అందించిన సమాచారం మేరకు.. మండలంలోని కేశవరప్పాడు గ్రామానికి చెందిన రైతుల నుండి అదే గ్రామానికి చెందిన కొసరాజు నాగేశ్వరరావు, మరో వ్యక్తి రామిశెట్టి కోటేశ్వరరావు రూ.19 లక్షల విలువైన మిరపకాయలు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వారు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో 2021 జూన్ 14వ తేదీన కారంచేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తగిన సాక్షులను సేకరించి కోర్టుకు హాజరుపర్చడంతో ప్రథమ నిందితునిగా ఉన్న నాగేశ్వరరావుకు కోర్టు రెండేళ్ల జైలుశిక్షతోపాటు, రూ.5 వేల జరిమానా విధించించిట్లు తెలిపారు. గుంటూరువెస్ట్(క్రీడలు): మూలపాడులో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఏసీఏ సీనియర్ టీ–20 పురుషుల అంతర్ జిల్లాల మ్యాచ్లలో పాల్గొనే క్రికెట్ జట్టును ఎంపిక చేశామని జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రీమెన్ కమిటీ సభ్యుడు టీవీ శివరామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న క్రికెటర్ల వివరాలు.... ఓ.రషీద్(కెప్టెన్) కె.మహీప్, ఎం.వంశీకృష్ణ (వికెట్ కీపర్), ఎస్.అఖిల్, జి.సమన్విత్, సిహెచ్.సిద్ధార్థ, ఎ.ప్రణయ్కుమార్, ఎం.రేవంత్కుమార్, ఎస్.కె.అస్లాం బేగ్, జి.ఆకాష్, పి.సిద్దు కార్తీక్రెడ్డి, కె.మనోహర్, ఎస్.కె.తౌఫిక్, జె.జయచంద్రకేశవ్, ఓ.బాజీ. స్టాండ్ బైస్: కె.పి.సాయి రాహుల్, పి.శరత్ చంద్ర, ఈ.రోహ్ని అమోల్, ఎస్.గోపికృష్ణ, అబ్దుల్ షరీఫ్, డి.హేమంత్. కోచ్గా వి.వి.బి.సరస్వతిరెడ్డి వ్యవహరిస్తారన్నారు. శావల్యాపురం: గుంటూరు–కర్నూలు జాతీయ రహదారి మార్గంలో మండలంలోని కనమర్లపూడి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. ఎస్ఐ మోర్ల వెంకటేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకు చెందిన నంబూరి రవీంద్ర (16) ఉదయం టిఫిన్ తీసుకొని రావటానికి తన తాతాయ్య నంబూరు పేరయ్య చెందిన మోపెడ్పై దుకాణానికి వస్తుండగా,అదే సమయంలో వినుకొండ వైపు నుంచి నరసరావుపేటకు వెళుతున్న మినీ ట్రక్కు వాహనం డ్రైవరు చలంచర్ల వెంకటేశ్వర్లు అతివేగంతో వచ్చి ఎదురుగా వస్తున్న మోపెడ్ను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయాలు కావటంతో సంఘటన స్థలంలో బాలుడు రవీంద్ర మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో నంబూరి రవీంద్ర పదో తరగతి పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. నంబూరి డేవిడ్కు ఇద్దరు సంతానం కాగా మొదట కుమారుడు అకాలంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వినుకొండ ప్రభుత్వ వైద్యశాల్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేశామని ఎస్ఐ మోర్ల వెంకటేష్ బాబు తెలిపారు. -
మధురం.. అ‘పూర్వ’ జ్ఞాపకం
బాపట్ల: వ్యవసాయ కళాశాల 1980 బ్యాచ్ విద్యార్థులు గురువారం సందడి చేశారు. కళాశాలలో పూర్వ విద్యార్థుల పదో సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కళాశాలను చూసేందుకు పదేపదే రావటం ఎంతో ఉత్సాహాన్ని నింపుతుందని పూర్వవిద్యార్థులు పేర్కొన్నారు. వ్యవసాయ కళాశాల బాపట్ల మాజీ ఏడీ ఏ.శ్రీనివాసరావు తనకు ఈ కళాశాలతో 24 ఏళ్ల అనుబంధం ఉందని తెలియజేశారు. 1980 బ్యాచ్ విద్యార్థులు కళాశాల అభివృద్ధి కోసం చాలా సాయం చేశారని తెలియజేశారు. పి.ప్రసన్న రాణి, ఎ.శ్రీనివాసరావు, ఎస్.హరిప్రసాద్, ఎండీ ఆఫ్ మీవా గ్రూప్స్ నిర్వహకులను సన్మానం చేశారు. హరిప్రసాద్ రూ.50 లక్షలు ఎటిక్ బిల్డింగ్ కోసం విరాళం ఇచ్చారు. ఉగాది పురస్కారం అందుకున్న వి.గోపీచంద్ను ఘనంగా సన్మానించారు. -
అభివృద్ధికి పరిశుభ్రత కీలకం
మంగళగిరిటౌన్: జాతీయ అభివృద్ధికి పరిశుభ్రత ఒక ప్రాథమిక స్తంభం అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్లో గురువారం స్వచ్ఛత పక్షోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఏప్రిల్ 1 నుండి 15వ తేదీ వరకు జరుగుతున్న స్వచ్ఛత పక్షోత్సవ కార్యక్రమాన్ని సమీక్షించి అండర్ గ్రాడ్యుయేషన్ గర్ల్స్ హాస్టల్ను శ్రీవాస్తవ ప్రారంభించారు. క్యాంపస్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛత పక్వాడాపై ఎయిమ్స్ తయారుచేసిన ఐ.ఇ.సి. సామాగ్రి ప్రదర్శన స్టాల్ను సందర్శించి అభినందించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ నమూనాలను ప్రదర్శించారు. అనంతరం శ్రీవాస్తవ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ దార్శనికతకు అనుగుణంగా స్వచ్ఛత పక్షోత్సవాలను అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్య సంరక్షణ, నివారణ, ప్రోత్సాహక అంశాలను బలోపేతం చేయడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ రంగం సంరక్షణ రంగంలో మంగళగిరి ఎయిమ్స్ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని తెలిపారు. కాన్వాస్ పెయింటింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు అవార్డులు అందజేశారు. ఎనిమిది రోజులు జరుగుతున్న స్వచ్ఛత పక్షోత్సవ ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలను అభినందించి సత్కరించారు. ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ విభాగం, అబా రిజిస్ట్రేషన్ ప్రాంతం, మామోగ్రఫీ, బ్రాకీ థెరపి మొదలైన అధునాతన క్యాన్సర్ సౌకర్యాలు వున్న రేడియేషన్ అంకాలజీ యూనిట్, ఇన్పేషెంట్ వార్డులు, క్యాజువాలిటీని సందర్శించారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ డాక్టర్ అహంతమ్ శాంతాసింగ్ సంస్థ సాధిస్తున్న పురోగతిని శ్రీవాస్తవకు వివరించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ -
స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద ఆందోళన
గుంటూరు ఎడ్యుకేషన్: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) మలిదశ పోరాటంలో భాగంగా గురువారం నల్లచెరువురోడ్డులోని మహావీర్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఫ్యాప్టో గుంటూరు జిల్లా చైర్మన్ కె.నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న నాలుగు విడతల డీఏను మంజూరు చేయాలన్నారు. ఎస్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేసి, విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ (257) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. బసవలింగారావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు రద్దు చేయడంతోపాటు ఉపాధ్యాయుల అంతర మున్సిపాలిటీల బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్పాట్ వాల్యుయేషన్ విధులకు హాజరైన ఉపాధ్యాయులందరూ సాయంత్రం 4.00 గంటల నుంచి గంటసేపు సమస్యలపై నిరసన గళం విన్పించి న్యాయ పోరాటాన్ని విజయవంతం చేసినట్లు నరసింహారావు తెలిపారు. ధర్నాలో జిల్లా ఫ్యాప్టో కో–చైర్మన్ ఫైజుల్లా, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్రావు, మహమ్మద్ ఖాలీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ బాజీ, దాసు, జిల్లా నాయకులు మేకల సుబ్బారావు, ఎంవీ ప్రసాద్ జె.విజయానంద్, బి.ప్రసాద్, వై.మనోజ్ కుమార్, బి.గోపీకృష్ణ పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మ్యూజియాన్ని సందర్శించిన పల్నాడు జిల్లా కలెక్టర్
అమరావతి: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రమైన అమరావతిలోని కాలచక్ర మ్యూజియాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గురువారం సందర్శించారు. మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న జిల్లా పర్యాటక మండలి సభ్యులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అభ్యర్థన మేరకు కలెక్టర్ మ్యూజియాన్ని సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాలచక్ర మ్యూజియంలో శుభ్రత పనులను తక్షణమే ప్రారంభించాలని పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు. విదేశాలకు తీసుకువెళ్లిన శిల్పాలను వీలైనంత త్వరగా ఇక్కడకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న విద్యుత్ పనులను అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కనీస అవసరమైన పనులను పూర్తిచేసి, మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. 15వ తేదీన అమరావతిలో పర్యాటకశాఖ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, ఏపీటీడీసీ యూనిట్ ఇన్చార్జి మణికుమార్, డీఈ కుమార్, తహసీల్దార్ డానియేల్, ఎంపీడీఓ పార్వతి పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. చందోలు(కర్లపాలెం): పిట్టలవాని పాలెం మండలం చందోలులో వేంచేసియున్న శక్తి స్వరూపిణి బగళాముఖి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుంచి మే 3వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి, ఈవో నరసింహ మూర్తి తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారి భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు పండ్లు, తాంబూలం, అమ్మవారి ప్రసాదాలను వారికి అందజేశారు. అభివృద్ధి కమిటీ చైర్మన్, ఈవో మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా క్యూలైన్లలో వెళ్లి అమ్మ వారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. యడ్లపాడు: చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచే కొండవీడు కోట, ఇప్పుడు సాహస పర్యాటకానికి వేదిక కానుంది. జిల్లా పాలన యంత్రాంగం, అటవీశాఖ, అవుట్ రైవల్ అడ్వెంచర్స్ బృందం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నుంచి కొండవీడు కొండలపై నైట్ టెంట్ క్యాంప్ ఫైర్ను ఏర్పాటు చేయనున్నారు. కొండల నడుమ గడిపేలా ప్యాకేజీని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. సాహసయాత్ర శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతుందని, అతిథుల కోసం కొండపై అత్యాధునిక సౌకర్యాలతో కూడిన టెంట్లను సిద్ధం చేసినట్లు వివరించారు. రాత్రి వేళ మ్యూజికల్ నైట్ స్వరాలు, క్యాంప్ ఫైర్ వెలుగులు పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతాయన్నారు. వీటికి తోడు స్థానిక రుచులతో కూడిన అల్పాహారం, విందు ఉంటుందని, మరుసటి రోజు ఉదయం ప్రకృతి అందాల మధ్య సాగే ట్రెక్కింగ్, ఉత్సాహాన్ని నింపే బోటింగ్, కయాకింగ్ వంటి సాహస క్రీడలు ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. పెద్దలకు రూ.2 వేలు, ఎనిమిదేళ్లలోపు పిల్లలకు రూ.వెయ్యిగా రుసుమును నిర్ణయించారు. ఇందులో భోజన, వసతి సదుపాయాలన్నీ కలిపి ఉండటం పర్యాటకులకు కలిసొచ్చే అంశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. -
కొండవీటి గడ్డపై కళా సౌరభం
యడ్లపాడు: కొండవీటి గడ్డపై మళ్లీ కళాకారుల సందడి మొదలుకానుంది. చరిత్రకు నిలువుటద్దంగా నిలిచే కొండవీడు కోట నీడన, లింగారావుపాలెం వేదికగా నాటక వైభవం మళ్లీ పురుడుపోసుకోనుంది. మొన్ననే సుందరయ్య కళానిలయంలో జరిగిన ప్రదర్శనల మధుర స్మృతులు ఇంకా మనసుల్లో మెదులుతుండగానే, అప్పుడే కొండవీటి కళా పరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు రోజుల సంబరం, అటు చారిత్రక వారసత్వాన్ని, ఇటు ఆధునిక కళా చైతన్యాన్ని మేళవించి తెలుగు నాటక రంగానికి కొత్త ఊపిరి పోయనుంది. పాతికేళ్ల ప్రస్థానం... పాతికేళ్లకుపైగా నాటక కళే శ్వాసగా సాగుతున్న ఈ పరిషత్ ప్రయాణం అభినందనీయం. గ్రామీణ వాతావరణంలో జాతీయ స్థాయి నాటికలను ప్రదర్శిస్తూ, కళామతల్లి సేవలో తరిస్తున్న ఈ సంస్థ వెనుక నిర్వాహకుల అకుంఠిత దీక్ష కనిపిస్తోంది. సినీ నటులు పోసాని కృష్ణమురళి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ పరిషత్ను కట్టా శ్రీహరిరావు, తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, మండెపూడి శ్రీనివాసరావు, మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, నంబూరు బ్రహ్మవరప్రసాద్, జరుగుల రామారావులు నిబద్ధతతో సమన్వయంగా ముందుకు నడిపిస్తున్నారు. కేవలం వినోదం కోసమే కాకుండా భవిష్యత్తు తరాలకు మన సాంస్కృతిక వారసత్వాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో ఈ వేదికను తీర్చిదిద్దారు. కళలకు మారుపేరు.. చారిత్రక కొండవీటి కోట వైభవాన్ని స్మరించుకుంటూనే, నేటి సమాజానికి కళల ద్వారా చైతన్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ పోటీలు సాగనున్నాయి. గ్రామ ప్రజలను, దూర ప్రాంతాల నుంచి వచ్చే కళాభిమానులను అలరించేందుకు సర్వం సిద్ధం చేసిన ఈ నాటక సంబరాలు, రాబోయే మూడు రోజుల పాటు ఈ ప్రాంతాన్ని ఒక కళా ప్రపంచంగా మార్చనున్నాయి. కళల కోలాహలంతో కొండవీటి గడ్డ మరోసారి తన ఘనకీర్తిని చాటుకునేందుకు ముస్తాబైంది. ● 12వ తేదీ ఆదివారం.. ముగింపు రోజున రాత్రి 8 గంటలకు నంబూరు నరసింహరావు జ్యోతిప్రజ్వలన చేయనున్నారు. లింగారావుపాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ షేక్ కరీమూన్ మాబుసుభాని నటరాజ పూజతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. 8.30 గంటలకు హైదరాబాద్ గోవాడ క్రియేషనన్స్ వారి అమ్మ చెక్కిన బొమ్మ నాటిక, గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇది అతని సంతకం నాటిక ప్రదర్శితం కానున్నాయి. అనంతరం మానవత సాగరి బృందం వారి అందరూ మంచివారే కానీ నాటిక ప్రదర్శితం కానుంది. ప్రదానోత్సవం జరుగుతుందని నిర్వాహక కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. తొలిరోజు 10వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ఏపీ తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు. పుడమి మైన్స్ డైరెక్టర్ ముత్తవరపు అరుణకుమారి నటరాజ పూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు ఆకెళ్ల సత్యనారాయణ కళాప్రాంగణంలో కాకినాడ జీవీకే క్రియేషన్స్ వారి కన్నీటికి విలువెంత నాటికతో పోటీలు మొదలవుతాయి. ఆ తర్వాత 10.30 గంటలకు ఉషోదయ కళానికేతన్ వారి మంచి మనుషులు, రాత్రి 11 గంటలకు శ్రీరమణ కళానిలయం వారి మాతృత్వం నాటికలు ప్రదర్శితం కానున్నాయి. రెండో రోజున శనివారం రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ స్వర్ణసూర్య డ్రామా లవర్స్ వారి సీ్త్రమాత్రే నమః నాటికతో ప్రదర్శనలు పునఃప్రారంభమవుతాయి. అనంతరం రాత్రి 11 గంటలకు విజయవాడ సాంస్కృతిక సమితి వారి మమ్మల్ని బ్రతకనివ్వండి, అర్ధరాత్రి 12 గంటలకు గుంటూరు కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ వారి తరమెల్లిపోతున్నదో నాటికలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల సమక్షంలో సభా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. -
‘శిరో రక్ష – ప్రాణరక్ష’ స్టాల్ సందర్శన
భట్టిప్రోలు: మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లిలో గురువారం నిర్వహించిన ప్రజా వేదిక సభకు ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిరోరక్ష – ప్రాణ రక్ష స్టాల్ను సీఎం పరిశీలించారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ సీఎంకు వివరించారు. శిరో రక్ష–ప్రాణరక్ష కార్యక్రమం ద్వారా హెల్మెట్ వాడకంపై విసృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి హెల్మెట్ ధరించడం తప్పని సరి చేస్తున్నామని చెప్పారు. నిరంతర కృషి వల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 9.47 శాతం తగ్గుదల, మరణాల్లో 11.63 శాతం గణనీయమైన తగ్గుదల నమోదయిందని తెలిపారు. ఈ గణాంకాలను పరిశీలించిన సీఎం జిల్లా ఎస్పీని అభినందించారు. జిల్లా ఎస్పీకి ఐజీ అభినందనలు.. భట్టిప్రోలు: పటిష్ట ప్రణాళికతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సమర్ధవంతంగా బందోబస్తు నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ను గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి అభినందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అద్భుతమైన ప్రణాళికతో బందోబస్తును సమర్ధవంతంగా నిర్వహించిన విధానాన్ని త్రిపాఠి అభినందించారు. అదేవిధంగా బందోబస్తు విధులను సమర్ధవంతంగా నిర్వహించిన పోలీస్, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
తెలంగాణ నుంచి ధాన్యం రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు
నరసరావుపేట: తెలంగాణ రాష్ట్రం నుంచి పల్నాడు జిల్లాకు ధాన్యం రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ మిల్లర్లు అందరూ జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు గురజాల, మాచర్ల మండలాల రైతులు వద్ద నుంచి ఫిర్యాదులు వచ్చాయని, వీటిని విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2025–26కు సంబంధించి రబీలో 51 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, మిల్లర్లు అందరూ బ్యాంకు గ్యారెంటీలు అందజేయాలని, కావాల్సిన గోనెసంచులు, రవాణా వాహనాలకు జీపీఎస్ అమర్చి సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసఫరాల శాఖ అధికారి జీవీ ప్రసాదు, మిల్లర్ల అసోసియేషన్ నాయకులు ఊర భాస్కరరావు పాల్గొన్నారు. -
చావులో ఒక్కటయ్యారు..
యడ్లపాడు: కొండవీడు కోట సాక్షిగా ఒక ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రేమకు పెద్దలు నిరాకరించడంతోపాటు యువతికి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసినా తమ ప్రేమను మరిచిపోలేక ఆ జంట మృత్యువు ఒడికి చేరుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమికులు... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... గుంటూరు స్వర్ణభారతినగర్కు చెందిన రసిక మణికంఠరాజు (20), కలెక్టరేట్ సమీపంలోని అంకమ్మనగర్కు చెందిన యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన మణికంఠరాజు తల్లిదండ్రులు యువతి ఇంటికి వెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అందుకు యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. వెంటనే తమ కుమార్తెకు సుమారు 20 రోజుల కిందట వేరొక యువకుడితో వివాహం జరిపించారు. అయినప్పటికీ తన ప్రియుడు మణికంఠ రాజును మరువలేని ఆ యువతి, భర్తతో కలిసి ఉండలేనని చెప్పి గుంటూరుకు తిరిగి వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రేమికులిద్దరూ కొండవీడు కోటకు చేరుకున్నారు. అక్కడ తమ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. వారిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్లో చావుబతుకుల మధ్య పోరాడుతూ మణికంఠ రాజు బుధవారం రాత్రి చనిపోగా, యువతి కూడా గురువారం మృతి చెందింది. మణికంఠరాజు తల్లి నళిని, యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు ఎస్ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మణికంఠ రాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవగా, యువతి మృతదేహానికి శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. -
అర్జీలు స్వీకరించిన జేసీ
భట్టిప్రోలు: భట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. దీనివల్ల భట్టిప్రోలు మండలం నుంచి ప్రజలు సులువుగా తమ సమస్యలను విన్నవించేందుకు అవకాశం ఉంటుందని జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట అన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధరగౌడ్, డీఎంహెచ్వో డాక్టర్ ఎస్. విజయమ్మ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయ నిర్మల, డీఎస్వో జమీర్ బాషా, ఎంపీడీవో సాతులూరి వెంకటరమణ, ఇన్చార్జి తహసీల్దార్ వి. వెంకటేశ్వర్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కాగా, పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ఉంటుందని అధికారులు ప్రకటించారు. కానీ 11:30 గంటలకు ప్రారంభమైంది. కలెక్టర్ రాకపోవడంతో జాయింట్ కలెక్టర్ 72 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. రెండున్నర గంటలపాటు అర్జీదారులు అధికారుల కోసం నిరీక్షించారు. -
అదనపు కోర్టుల కోసం భవనాల పరిశీలన
అమరావతి: అనుమతించబడిన అదనపు కోర్టుల ఏర్పాటు నిమిత్తం మంగళవారం స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను పలువురు న్యాయమూర్తులు పరిశీలించారు. ఈ పరిశీలనలో గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ చక్రవర్తి, సత్తెనపల్లి సీనియర్ సివిల్ జడ్జి విజయకుమార్ రెడ్డి, సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అహ్మద్, ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రియ దర్శిని, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సృజన్కుమార్, సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి రాములు, తహసీల్దార్ డానియేల్, ఎంపీడీఓ పార్వతి, సీఐ అచ్చియ్య, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిరూరల్: తాడేపల్లిలోని బాలాజీ హెచ్పీ గ్యాస్ కంపెనీలో పౌర సరఫరాల డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ మంగళవారం తనిఖీలు చేశారు. ఆన్లైన్ గ్యాస్ బుకింగ్ నమోదులను, డెలివరీ బాయ్స్ గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేసే విధానాన్ని గ్యాస్ ఏజన్సీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ కంపెనీ వద్ద ఉన్న వినియోగదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గ్యాస్ బుకింగ్ తేదీ ప్రకారం ముందుగా బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. గ్యాస్ గోడౌన్ల వద్ద సిలిండర్లను డెలివరీ చేయవద్దని, తప్పని సరిగా డోర్ డెలివరీ చేయాలన్నారు. వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు. ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే ఆయా ఏజన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు గ్యాస్ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్స్కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గుంటూరు డీఎస్ఓ కోమలి పద్మ, తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య, మంగళగిరి సివిల్ సప్లయీస్ డీటీ శ్రీనివాసరావు, వీఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. -
జై చెన్నకేశవ.. జై జై చెన్నకేశవ..
మాచర్ల: పల్నాడు ప్రజల ఆరాధ్య దైవం, భక్తుల కొంగుబంగారంగా పిలుచుకునే శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా సాగింది. వేలాది మంది భక్త జన సందోహంతో కనుల పండువగా వేడుక జరిగింది. శ్రీదేవి భూదేవి చెన్నకేశవ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి రథం పైకి ఎక్కించి కుమ్మరి వారు కుంభం పోసి హారతి రథం ఊరేగింపునకు సిద్ధం చేశారు. అర్చకులు అడిగొప్పల చెన్నకేశవాచార్యులు, శ్రీనివాసాచార్యులు, చైర్మన్ కొమెర అనంతరాములు, ఈఓ సైదారావుల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి రథోత్సవంలో పాల్గొన్నారు. అర్చకులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హారతినిచ్చి రథం ముందు దిష్టి గుమ్మడికాయ దిష్టి తీసి రథం ఊరేగింపును ప్రారంభించారు. రథంపై నగారా మోగిస్తూ జై చెన్నకేశవ అంటూ భక్తులు గొలుసులు చేతబట్టి రథాన్ని పురవీధుల్లో నడిపించేందుకు ఉత్సాహంగా పోటీ పడ్డారు. రథశాల నుంచి లక్ష్మీదేవి మిద్దెల మీదుగా బురుజు సెంటర్ వరకు జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ నినాదాల మధ్య, గోవింద నామస్మరణతో రథోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. బ్రహ్మోత్సవాలలోని ప్రముఖ ఘట్టమైన రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పల్నాటి ప్రాంతం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పారవశ్యంతో పులకించారు. ఆర్యవైశ్య సంఘం, ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం, ప్రసాదాలు పంపిణీ చేశారు. ముందుగా తెల్లవారుజాము నుంచి ఆలయంలో శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి శ్రీదేవి, భూదేవి లను ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. యువకులు పోటీ పడి రథాన్ని లాగారు. ఏఎస్పీ సంతోష్, గురజాల ఇన్చార్జి డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు తరలివచ్చి బందోబస్తు నిర్వహించారు. పలు సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రసాదాలు, పానీయాలు, అన్నదానం చేశాయి. మాచర్ల పట్టణంలో ఎటుచూసినా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి తిరునాళ్ల సందడి కనబడింది. సాయంత్రం రథోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. -
ఘనంగా పోలేరమ్మ తిరునాళ్ల
గుంటూరు రూరల్: కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవాలు మంగళవారం కనుల పండువగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలను నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ప్రజల యోగక్షేమాల కోసం ప్రత్యేకంగా అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సిడిమాను ఊరేగింపు మహోత్సవానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయించి, బ్యారికేడ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గుడికి వచ్చే రాకపోకల మార్గాల్లో 12 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేశామని తెలిపారు. ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు, ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, ఆలయ ఈవో జక్కా శ్రీనివాసరావు, కాకుమాను ఎస్సై హరికృష్ణ, ప్రత్తిపాడు ఎస్సై నరహరి, ఇతర శాఖల అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
మోతీలాల్ నగర్లో కూల్చివేతల కలకలం
నెహ్రూనగర్: ‘మీకు ఓట్లు వేసి గెలిపించిన పాపానికి మమ్మల్ని ఇప్పుడు రోడ్లపాలు చేయాలని చూస్తున్నారా.. ఎమ్మెల్యే గారు.. మా ఇళ్లు కూల్చేందుకు రైల్వే అధికారులు వస్తున్నారు.. మీరు వచ్చి అడ్డుకోవాలి. లేదంటే మాపైనుంచి జేసీబీలు పంపి ప్రాణాలు తీశాకే నివాసాలు కూల్చండి’ అంటూ నెహ్రూనగర్ పరిధిలోని మోతీలాల్ నగర్ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెహ్రూనగర్ రైల్వే గేటు దగ్గరలోని మోతీలాల్నగర్లో గత 60 సంవత్సరాలుగా పలు పేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ట్రాక్ పక్కనే డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఆ పనులతో సుమారు 80 కుటుంబాలకు చెందిన నివాసాలు పూర్తిగా తొలగించే పరిస్థితి నెలకొంది. కూల్చివేతలకు చర్యలు తీసుకుంటున్నారని తెలిసి వారు దిక్కుతోచని స్థితిలో ఆందోళన బాట పట్టారు. ప్రత్యామ్నాయం చూపాకే తొలగించండి అర్ధంతరంగా మా ఇళ్లును తొలగించాలని రైల్వే అధికారులు వస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వద్దకు వెళితే కనీస వసతులు లేని ప్రాంతాల్లోకి వెళ్లి ఉండాలని ఆయన చెబుతున్నారని వాపోయారు. అక్కడ ఉండే పరిస్థితులు లేవని తెలిపారు. కనీసం ఉండేందుకు మౌలిక వసతులు కల్పిస్తే అక్కడికి వెళ్తామని చెప్పినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేసి గెలిపిస్తే ఏసీ రూముల్లో ఉంటూ తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికా తాము ఓట్లు వేసి గెలిపించిందంటూ ఆగ్రహిస్తూ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మా ఇళ్లను కూల్చ వద్దంటూ రైల్వే అధికారులను కోరినప్పటికీ బుధవారం ఉదయం జేసీబీలతో వచ్చి కూలుస్తామని చెప్పారని బాధితులు వాపోయారు. మంగళవారం రాత్రి కరెంట్ కట్ చేసేందుకు వచ్చారని వాపోయారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వచ్చి ఈ కూల్చివేతను ఆపాలని, లేకపోతే తమను చంపిన తరువాత కూల్చాలని బాధితులు విలపిస్తూ కోరారు. తమకు తగిన న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
సీఎం సభావేదిక పనుల పరిశీలన
చంద్రబాబు రాకతో యంత్రాంగం అప్రమత్తం భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ ఉమామహేశ్వర్.. భట్టిప్రోలు: సీఎం జిల్లా పర్యటన పురస్కరించుకుని అడ్వాన్డ్స్ సెక్యూరిటీ లైజన్ క్లోజ్ను మంగళవారం బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి గురువారం నియోజకవర్గంలోని భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామానికి విచ్చేయనున్నారు. ఈసందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్లను ఏఎస్జీ, ఇతర విభాగాల అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు. హెలికాప్టర్ దిగేందుకు నిర్ణయించిన ప్రాంతంలో భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. హెలిపాడ్ ప్రాంతానికి వచ్చే వాహనాల పార్కింగ్, పార్టీ కేడర్ సమావేశం జరుగు ప్రదేశం, ప్రజావేదిక, పార్కింగ్, వీఐపీ, వీవీఐపీ వాహనాల పార్కింగ్ ప్రదేశాలను, సీఎం కాన్వాయి వెళ్లే మార్గాలు క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు పోలీసు అధికారులు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంట రేపల్లె డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ పి.నారాయణ, ఏఎస్జీ, అధికారులు, పోలీసు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. – అధికారులకు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే ఆనందబాబు -
బాలుడి ప్రాణాలను బలిగొన్న ఈత సరదా
చిలకలూరిపేటటౌన్: ఈత కొడదామని వెళ్లిన ఆ బాలుడు విగతజీవిగా తిరిగిరావడంతో స్థానిక సుభాని నగర్లో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణంలోని ఓగేరు వాగులో మునిగి ఐదో తరగతి విద్యార్థి చందు (11) మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. తమ ఇంటి సమీపంలోని వాగు వద్దకు వెళ్లాడు. నీటి లోతుపై అవగాహన లేకపోవడంతో, లోపలికి వెళ్లిన చందు ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చిలకలూరిపేట అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత నీటిలో మునిగి ఉన్న చందుని బయటకు తీయించారు. అయితే అప్పటికే శ్వాస ఆగిపోవడంతో బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లముందే ఆడుకోవాల్సిన బిడ్డ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆటపాటలతో గడపాల్సిన వయసులో ఈత సరదా ఇలా ప్రాణాలు తీయడం స్థానికులను సైతం కలచివేసింది. -
అంజుమన్ ఇస్లామియాభూమిని లాక్కుంటే ప్రజా ఉద్యమం
తెనాలి: ముస్లిం ధార్మిక సంస్థ అంజుమన్ ఇస్లామియాకు చెందిన మంగళగిరి మండలం చినకాకానిలోని భూమిని చంద్రబాబు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు కోసం చేసిన భూసేకరణ ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ భూమిని తీసుకోవాలని చూస్తే ముస్లింలంతా రోడ్డుపైకి వస్తారని, అందరం ఏకతాటిపైన ఉన్నామని స్పష్టంచేశారు. చినకాకానిలోని అంజుమన్ ఇస్లామియాకు చెందిన 71.57 ఎకరాల వ్యవసాయ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు కోసం సేకరించేందుకు డిసెంబరులో నోటిఫికేషన్ జారీచేసిందని, దీనిపై సంస్థ జీవితకాల సభ్యులు, వివిధ ముస్లిం సంస్థల నాయకులు ప్రభుత్వానికి అభ్యంతరాలను తెలియజేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో తెనాలి సబ్కలెక్టర్ స్వయంగా వచ్చి తమ అభ్యంతరాలను తెలియజేయాలని నోటీసులు పంపారు. ఆ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం అంజుమన్ ఇస్లామియా సంస్థ జీవితకాల సభ్యులతో కలిసి నూరి ఫాతిమా రాతపూర్వక అభ్యంతరాలను ఇన్చార్జి సబ్కలెక్టర్ లక్ష్మీకుమారికి తెలియజేశారు. గతేడాది జూన్లో ఆ భూమికి సంబంధించి 25 శాతం నష్టపరిహారం ఇచ్చినట్టుగా సబ్కలెక్టర్ నోట్లో ఉందనీ, పీపీపీ పద్ధతిలో తీసుకుంటామని చెప్పినట్టుగా వక్ఫ్బోర్డు చైర్మన్ అజీజ్ బోర్డు మీటింగులో వెల్లడించారని నూరి ఫాతిమా అన్నారు. ఇలా రకరకాలుగా ప్రభుత్వం ఎర వేస్తోందన్నారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ కలీం మాట్లాడుతూ చినకాకానిలో అంజుమన్ ఇస్లామియాకు గల భూమి 1915లో దాతలు ఇచ్చినదిగా గుర్తుచేశారు. 1962లో ప్రభుత్వ గెజిట్లో, తర్వాత సర్వే కమిషన్ రిపోర్టులో, 1998లో రెవెన్యూ రికార్డుల్లోనూ ఇంజుమన్ ఇస్లామియాను యజమానిగా నమోదై ఉందని గుర్తుచేశారు. అలాంటి భూమిని వక్ఫ్ పర్యవేక్షణలో ఉన్నట్టుగా చూపుతూ భూసేకరణ నోటిఫికేషన్ జారీచేయటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. వెంటనే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లింకు గల ఏకై క ఆస్తిని ప్రభుత్వం తీసుకోవాలని చూడటాన్ని చందోలుకు చెందిన ముస్లిం సమైక్య కమిటీ నాయకుడు మౌలా బేగ్ తీవ్రంగా ప్రశ్నించారు. ప్రాణాలైనా వదులుతామనీ, భూమిని వదులకోమని స్పష్టంగా చెప్పారు. ఆ భూమిని తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల ప్రజాఉద్యమం తప్పదని పలువురు హెచ్చరించారు. అన్ని అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని ఇన్ఛార్జి సబ్కలెక్టర్ లక్ష్మీకుమారి తెలిపారు. వీరితో మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర కూడా ఉన్నారు. -
గంజాయి నిందితుల అరెస్ట్
తాడేపల్లిరూరల్: గంజాయి కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ వీరేంద్రబాబు తెలిపారు. తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వివరాలు వెల్లడించారు. రూరల్లో ఈగల్టీమ్ మెరుపుదాడి చేసి పాత నేరస్తుడితో పాటు మరో ముగ్గురు కొత్త నేరస్తులను గంజాయితో సహా పట్టుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, ఎస్ఐలు ఖాజావలి, అపర్ణ మరికొంతమంది సిబ్బందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేసి మంగళవారం ప్రాతూరు కరకట్ట వద్ద పట్టుబడిన నలుగురితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచినట్లు చెప్పారు. ఇందులో ప్రాతూరు గ్రామానికి చెందిన బండ్ల ప్రసాద్, గతంలో తాడేపల్లి పోలీస్స్టేషన్లో మూడు కేసుల్లో నిందితుడని, మంగళగిరిలో ఒక కేసులో ఉన్నట్లు వివరించారు. ప్రాతూరు కిరణ్ ఒక కేసులో, వల్లపనేని పవన్కళ్యాణ్పై విజయవాడ, దుగ్గిరాల, తాడేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో ఆరు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వీరితో పాటు పాతూరు కిరణ్, పాతూరు సతీష్, గుండిమెడ జోజిబాబు, కొవ్వూరు లాజర్ను అరెస్ట్ చేశామని, ఒక్కొక్కరి వద్ద 50 గ్రాముల చొప్పున 400 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వీరందరికి విజయవాడకు చెందిన చైతన్య అనే గంజాయి నేరస్తుడు గంజాయి సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని వెల్లడించారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నేడు ఏఎన్యూలో ఈడబ్ల్యూఎస్ వర్క్షాప్ ఏఎన్యూ(పెదకాకాని): ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంట్రప్రెన్యూర్షిప్ ఒకరోజు శిక్షణ శిబిరం ఏన్ఎన్యూలో నిర్వహించనున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.సునీత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో బుధవారం జరిగే వర్క్షాప్ను ఈడబ్ల్యూఎస్, బీసీ, చేతివృత్తులు, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్, వస్త్రాలు, చేతివృత్తులు, హస్తకళలు వంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాల్లో ఉన్న అవకాశాలతో పాటు, యుద్ధానంతర ప్రపంచ పరిస్థితుల్లో వాటి భవిష్యత్ను ఈ శిబిరంలో చర్చిస్తారని తెలిపారు. -
ఉత్తమ నైపుణ్యం కలిగిన వైద్యులుగా తీర్చిదిద్దుతాం
గుంటూరు మెడికల్: ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ విభాగాలు కలిగిన సాయి భాస్కర్ హాస్పిల్కు ఆర్థో విభాగంలో రెండు డీఎన్బీ సీట్లు కేటాయిస్తూ ఎన్.బి.ఇ.ఎం.ఎస్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్(ఎన్.బి.ఇ.ఎం.ఎస్) సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను జాతీయస్థాయిలో ఆర్థోపెడిక్ పీజీ ట్రైనింగ్ సెంటర్గా గుర్తిస్తూ డిప్లమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డీఎన్బీ) సీట్లను కేటాయించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్లో గుజరాత్కు చెందిన డాక్టర్ జీల్ కటిరా, రాజస్థాన్కు చెందిన డాక్టర్ యశా జైన్, హాస్పిటల్ను ఎంపిక చేసుకున్నారు. మంగళవారం అరండల్పేటలోని హాస్పిటల్ లో డాక్టర్ నరేంద్రరెడ్డి ఎదుట తమ తొలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ వైద్య విద్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైన డీఎన్బీ సీట్లను తమ హాస్పిటల్కు కేటాయించడం గర్వంగా ఉందని తెలిపారు. మూడు సంవత్సరాల పాటు డీఎన్బీలో విద్యను అభ్యసించాల్సి ఉంటుందన్నారు. ఎముకలు కీళ్ల విభాగంలో ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్ది తద్వారా జాతీయస్థాయిలో గుంటూరుకు గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని డాక్టర్ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కొనకల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి -
శ్రామిక మహిళలకు కనీస వేతనాలివ్వాలి
లక్ష్మీపురం: ఇంటి పనులు, బయట పనులతో శ్రమిస్తూ ఉత్పత్తిలో ముఖ్య భూమిక పోషిస్తున్న శ్రామిక మహిళలకు హక్కులు కల్పించటంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీఐటీయూ ఆలిండియా సెక్రటరీ ఎస్.వరలక్ష్మి అన్నారు. సీఐటీయూ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర 10వ సదస్సు మంగళవారం విజయలక్ష్మి, శేషకుమారి, జి.నాగమణి, సీత అధ్యక్షతన గుంటూరు బ్రాడీపేటలోని జాషువా విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాల ప్రకారం సముచిత, గౌరవప్రదమైన ఉద్యోగాలు భారతదేశంలో లేవన్నారు. ఐఎల్ఒ ప్రకారం కార్మికులకు న్యాయమైన వేతనాలు అమలు చేయాల్సి ఉందని, కానీ కనీస వేతనాలు కూడా అమలు చేయట్లేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ్యాంగం సీ్త్ర, పురుషులకు సమానహక్కులు కల్పించినా వేతనాలలో వివక్ష కొనసాగుతుందన్నారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కట్లేదన్నారు. శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి నివేదిక ప్రవేశపెట్టారు. పలు తీర్మానాలు ఆమోదించారు. -
వేటపాలెం పోలీస్ స్టేషన్లో తెలంగాణ బాలుడు
వేటపాలెం: తెలంగాణ మంచిర్యాల ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు తప్పిపోయి వేటపాలెం పోలీస్స్టేషన్ సంరక్షణలో ఉన్నట్లు ఎస్సై సురేష్ మంగళవారం తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన వేటపాలేనికి చెందిన బాలగోపి విజయవాడ నుంచి వేటపాలెం రైలులో వస్తున్న సమయంలో బాలగోపిని.. ఓ బాలుడు కలిసి ఆకలి వేస్తుందని డబ్బులు ఇవ్వాలని కోరాడు. బాలుడు తప్పిపోయి వచ్చినట్లు గుర్తించిన బాలగోపి ఆ పిల్లవాడిని వేటపాలెంలోని తన ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి వివరాలు అడిగాడు. బాలుడు ఎటువంటి వివరాలు చెప్పలేదు. దీంతో బాలుడిని తీసుకొచ్చి వేటపాలెం పోలీస్స్టేషన్లో అప్పగించాడు. ఎస్సై బాలుడిని వివరాలు అడగ్గా తన పేరు సంతోష్ అని తెలంగాణలోని మంచిర్యాల రైల్వేస్టేషన్ దగ్గర వాళ్ల నాన్న రోడ్డు పని చేస్తుంటాడని వివరాలు తెలిపాడు. లారీ ఢీ కొని వ్యక్తి మృతి వేటపాలెం: బైక్పై రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జాతీయ రహదారి 216లో రామన్నపేట జంక్షన్ వద్ద సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల మేరకు రామచంద్రాపురానికి చెందిన మత్స్యకారుడు బసంగారి రాజు (36) బైక్పై వేటపాలెం వచ్చి సొంత పనులు చూసుకొని తిరిగి రామచంద్రాపురం వెళుతున్నాడు. బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద రోడ్డు దాటే సమయంలో వేగంగా వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. బైక్ పై నుంచి కింద పడిన రాజు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ను ఢీకొట్టిన లారీ ఆగకుండా వెళ్లిపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీస్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాగర్ కాల్వలో విద్యార్థి గల్లంతు కారెంపూడి: సాగర్ కాల్వలో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన ఘటనలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామంలోని వడియరాజుల కాలనీకి చెందిన కొమెర రాజారావు తోటి స్నేహితులతో కలసి దగ్గర్లో ఉన్న సాగర్ కుడి కాల్వకు ఈతకు వెళ్లారు. అందరూ ఈత కొడుతుండగా విద్యార్థి రాజారావు(13) ప్రవాహవేగానికి గల్లంతయ్యా డు. స్నేహితులు చూసిన వారు తల్లిదండ్రులు, బంధువులకు సమాచారం అందించారు. మృతదేహం కోసం గాలిస్తున్నారు. కొమెర ఏసు రాజు దంపతులకు రాజారావు ఒక్కగానొక్క కుమారుడు, 7వ తరగతి పరీక్షలు రాశాడు. ఈ కాల్వలోనే చాలా మంది ఈతలు కొడుతుంటారు. పిల్లలను కాల్వలకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. -
స్థిరంగా ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ సరఫరా
ఏపీ ఆయిల్ ఇండస్ట్రీస్ స్టేట్ లెవెల్ జనరల్ మేనేజర్ ఎన్.భాస్కర్రెడ్డి తాడేపల్లిరూరల్: రాష్ట్రంలో ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ సరఫరాలు స్థిరంగా ఉన్నాయని ఏపీ ఆయిల్ ఇండస్ట్రీ స్టేట్ లెవెల్ జనరల్ మేనేజర్ ఎన్.భాస్కరరెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి పట్టణ పరిధిలోని రిటైల్ రీజనల్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు హెచ్పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం సంస్థలు సమన్వయంతో సరఫరాలను సజావుగా కొనసాగిస్తున్నాయని తెలిపారు. గృహ వినియోగ సిలిండర్ల సరఫరా 100 శాతం జరుగుతోందని తెలిపారు. హాస్పిటల్స్, స్కూల్స్, రైల్వే క్యాంటీన్స్, ఇండస్ట్రియల్ క్యాంటీన్స్, నూరుశాతం సరఫరా అందిస్తుమని రెస్టారెంట్లు, వ్యవసాయం ఇతర రంగాలకు 70శాతం కంటే ఎక్కువ సరఫరా కొనసాగుతోందని పేర్కొన్నారు. రోజుకు సుమారు 2.3 లక్షల నుంచి 2.4 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని ఓటీపీ ఆధారిత డెలివరీ విధానం ద్వారా 90 శాతం వరకు పారదర్శకత సాధించారని అన్నారు. బ్లాక్ మార్కెటింగ్ నివారణ కోసం(1079) దాడులు నిర్వహించి, 4300 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో గ్యాస్ దొరకదని భయంతో బుకింగ్ చేయవద్దని సరఫరాల విషయంలో ఎలాంటి కొరత లేదని సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హెచ్పిసిఎల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉపేంద్ర, చీప్ రీజినల్ మేనేజర్ హెచ్పిసిఎల్ అభిషేక్ ప్రదీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ గుంటూరు లీగల్: బాల్య వివాహాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు మంగళవారం నిర్వహించారు. వంద రోజుల అవగాహన సదస్సులో భాగంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ గుంటూరు అండ్ మెప్మా ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అన్నారు. గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆశ (అవేర్నెస్, సపోర్ట్ అండ్యాక్షన్) సోప్– 2025 అనే కొత్త కార్యాచరణను రూపొందించిందని వివరించారు. జిల్లా స్థాయిలో యూనిట్ ఏర్పాటు చేసి ఈ యూనిట్ ద్వారా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, పోలీసులు, న్యాయ సేవాధికార సంస్థలు సమష్టిగా పని చేస్తాయని చెప్పారు. సీడబ్ల్యూసీ, జేజేబీ సంస్థలు పిల్లలకు అవసరమైన అన్ని చట్టపరమైన సేవలు ఉచితంగా అందుతాయని అలాగే పిల్లల హక్కుల రక్షణ కోసం చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణంలో న్యాయం జరిగేలా చూడటం మన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సి. హెచ్. విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం తెల్లవారుజామున మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి పట్టణం సలామ్ హోటల్ సెంటర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఈ కార్యక్రమంలో పాల్గొని గతంలో గంజాయి, ఇతర కేసుల్లో పట్టుబడిన వారి నివాసాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపుగా 200 నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎస్పీతోపాటు నార్త్జోన్ డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, జిల్లా కేంద్రంతోపాటు తాడేపల్లి, మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల నుంచి దాదాపు 100 మంది సిబ్బంది పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్ అనంతరం ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి విక్రయించడంతో పాటు తాగుతున్నారని సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 39 ప్రాంతాల్లో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. తాడేపల్లిలో పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేశామని, సలాం హోటల్ సెంటర్లో నిర్వహించగా 65 ద్విచక్రవాహనాలకు ఎటువంటి పత్రాలు లేకుండా ఉన్నాయని, వాటన్నింటి పత్రాలను పరిశీలించి డాక్యుమెంట్ ఉన్న వాహనాలను ఇచ్చివేస్తామని, లేని పక్షంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
ఉత్తమ ప్రదర్శన ‘అమ్మ చెక్కిన బొమ్మ’
యడ్లపాడు: పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం వేదికగా మూడు రోజులపాటు సాగిన 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఆద్యంతం పారదర్శకంగా, హృద్యంగా సాగిన ఈ వేడుక నాటక ప్రేమికుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఉత్తమ ప్రదర్శనగా ‘అమ్మ చెక్కిన బొమ్మ’ ఉత్తమ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్(హైదరాబాద్)వారి ‘అమ్మచెక్కిన బొమ్మ’ నాటిక, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా విజయవాడ సాంస్కృతిక సమితి(విజయవాడ) వారి ‘మమ్మల్ని బ్రతకనివ్వండి’ నాటిక. ఉత్తమ తృతీయ ప్రదర్శన స్వర్ణసూర్య డ్రామా లవర్స్ (హైదరాబాద్) వారి ‘సీ్త్రమాత్ర నమః’ నాటిక. చతుర్థ ప్రదర్శన ఉషోదయ కళానిలయం(కట్రపాడు) ‘మంచి మనసులు’ నాటిక. వీటితోపాటు ‘కన్నీటికి విలువెంత..‘మాతృత్వం’ నాటికలు ప్రత్యేక ప్రదర్శన బహుమతుల్ని సాధించుకున్నాయి. తెరవెనుక కృషీవలురు ఉత్తమ నాటక రచనకు..మంచి మనసులు, అమ్మచెక్కిన బొమ్మ, ఉత్తమ దర్శకులు, ఉత్తమ సంగీత దర్శకులు అమ్మచెక్కిన బొమ్మ, ఉత్తమ రంగాలంకరణ మమ్మల్ని బ్రతకనివ్వండి, ఉత్తమ ఆహార్యం చిటికెన వేలు నాటికలకు లభించాయి. వేదికపై వెలిగిన కళాకారులు ఉత్తమ నటీమణులు..అనసూయ పాత్రధారి జ్యోతిరాజ్ భీశెట్టి (అమ్మచెక్కిన బొమ్మ), రమణమ్మ పాత్రధారి ఆర్ రాజేశ్వరీ (మమ్మల్ని బ్రతకనివ్వండి), ఉత్తమ నటులు చిట్టి పాత్రధారి కార్తీక్ (సీ్త్రమాత్రే నమః), శశి–2 పాత్రధారి భానుప్రకాష్ (అమ్మచెక్కిన బొమ్మ), సోమన్న పాత్రధారి కె సత్యనారాయణ (చిటికెలవేలు) బహుమతుల్ని గెలుచుకున్నారు. ద్వితీయ ఉత్తమ నటులు..వైబీ చౌదరి (దీపం కింద చీకటి), పొగర్తి నాగేశ్వరరావు (మాతృత్వం), ఉదయ భాగవతుల (సీ్త్ర మాత్రే నమః), పీఎస్ పవన్కుమార్ (మమ్మల్ని బ్రతకనివ్వండి), అమృత వర్షిణి (మంచి మనసులు) నటులకు దక్కాయి. కళా సేవకులకు సన్మానం... కళా, సామాజిక రంగాల్లో విశేష కృషి చేసి, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలు అందుకున్న ఈదర హరిబాబు, రాయప్రోలు భగవాన్, నన్నపనేని రాఘవరావు, జాస్తి వెంకట మోహన్రావు, బుడ్డా వెంకట రామారావు, అన్నమనేని ప్రసాదరావు, కాట్రగడ్డ కృష్ణప్రసాద్లను కమిటీ సన్మానించారు. అనంతరం ముఖ్య అతిధి నాటక రంగ విశ్లేషకులు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, సన్మానితులు ప్రసంగించారు. నాటక కళను బతికించేందుకు సురేష్బాబు దంపతులు చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. కార్యక్రమంలో పరిషత్ కార్యవర్గం జరుగుల రామారావు, శంకర్రావు, నూతలపాటి కాళిదాసు, ఆలోకం పెద్దబ్బయ్య, నూతలపాటి మాధవరావు, చెరుకూరి సృజన, షేక్ బాజి, నంబూరి శ్రీనివాసరావు, ఎం పద్మారావు, పోపూరి అనంతలక్ష్మి, సీహెచ్ హనుమంతరావు, కె సులోచన, తోకల కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, కట్టా శ్రీహరి, సాంబశివరావు, పోపూరి శివరామకృష్ణ, జగన్, మాణిక్యమ్మ, మానుకొండ రామారావు ఉన్నారు. రంగస్థల చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా స్టేజీపై నటించిన 19 మంది మహిళా కళాకారులకు ఆడపడుచు లాంఛనాలతో (చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు) సత్కరించారు. గ్రామవాసి డాక్టర్ ముత్తవరపు భార్గవిచౌదరి ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా, ఉత్తమ రచన, దర్శకత్వ విభాగాలకు నగదు బహుమతులు అందజేశారు. అలాగే నాటికలను వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులకు లక్కీ డ్రా నిర్వహించి, మూడు రోజుల్లో మొత్తం 120 మందికి బహుమతులు అందజేశారు. ప్రతిరోజూ రాత్రి ప్రేక్షకులకు అల్పాహారం ఏర్పాటు చేయడం విశేషం. -
పేలుడులో గాయపడ్డ పోలీసులకు అండగా ఉంటాం
మంగళగిరి టౌన్: కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీస్స్టేషన్లో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన బాధితులకు అండగా ఉంటామని రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చల్లపల్లి పోలీస్స్టేషన్ ఎస్ఐ దుర్గ ఆంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజులను సోమవారం హోమ్ మంత్రి అనిత పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులకు ధైర్యం చెప్పి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చికిత్స పొందుతున్న పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించినట్లు పేర్కొన్నారు. కానిస్టేబుల్ అబ్దుల్లా 50–60 శాతం గాయాలతో ఉన్నారని చికిత్సకు సహకరిస్తున్నట్లు వైద్యులు తెలిపారన్నారు. మిగిలిన ఇద్దరిని ప్రాణాపాయం లేదని తెలిపారు. గాయపడిన పోలీసుల ఆరోగ్య పరిస్థితులను కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం చికిత్సపొందతున్న వారికి మెరుగైన వైద్య అందించాలని ఎన్ఆర్ఐ వైద్యులను ఆదేశించారు. మాచవరం: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి వాటిలో ఉన్న రాగి తీగను దొంగిలించిన సంఘటనలో ఐదుగురు నిందితులతోపాటు, వాటిని కొనుగోలు చేసిన మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు గురజాల ఇన్చార్జి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మాచవరం పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పొలాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు లక్ష్యంగా చేసుకొని తెనాలి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన ఓ ముఠా ఈ చోరీలకు పాల్పడుతుందని వెల్లడించారు. మాచవరం మండలం గోవిందపురం గ్రామానికి చెందిన వేముల ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఉదయం మండలంలోని గోవిందపురం బల్లకట్టు వద్ద కొందరు వ్యక్తులు అనుమానంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించగా రాగి తీగలను దొంగతనం చేసే వ్యక్తులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో మొలిక ముత్యం, ఏ గసిరి కోటయ్య , పెండ్ర , వెంకటేష్ కట్టా వెంకటేశ్వర్లులు ఉన్నారు. వీరు దొంగిలించిన రాగి తీగను మంగళగిరి ప్రాంతానికి చెందిన బత్తుల తారకేశ్వరరావు, వారణాసి సతీష్లకు విక్రయిస్తున్నారు. వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 20 కేసుల్లో సుమారు 85 ట్రాన్స్ఫార్మర్ల నుంచి దొంగిలించిన 350 కిలోల రాగి వైర్కుగాను 170 కిలోల రాగి వైర్ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రైతులు పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనీ సూచించారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు దొంగతనానికి గురైనట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అన్నారు. నిందితులను అరెస్టు చేసిన మాచవరం ఎస్సై పవన్ కుమార్ పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. హోం మంత్రి అనిత -
చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల సభకు వైఎస్సార్ సీపీకి ఆహ్వానం
గుంటూరు మెడికల్: బీపీ మండల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో సోమవారం కలిశారు. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై జరిగే సమావేశానికి ఆహ్వానించారు. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏప్రిల్ 19న విజయవాడలోని మాకినేని బసవపునయ్య విజ్ఞాన కేంద్రంలో చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల ఆవశ్యకత అనే అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొని చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లపై తమ వైఖరిని వెల్లడించాలని సజ్జల రామకృష్ణారెడ్డిని కోరారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు అనుకూలమని తెలిపారు. తమ పార్లమెంటరీ పార్టీ గతంలోనే రాజ్యసభలో ఈ విషయం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. 19న జరిగే అఖిలపక్ష సమావేశంలో తమ పార్టీ పాల్గొని తమ వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. సజ్జలను కలిసిన వారిలో రైల్వే ఓబీసీ సంఘ అధ్యక్షుడు బీవీఎన్ సత్యనారాయణ, నాయకులు ఉన్నారు. భట్టిప్రోలు: భట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయం సమావేశపు హాలులో మంగళవారం ఉదయం 9 గంటలకు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సాతులూరి వెంకట రమణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ పాల్గొంటారని తెలిపారు. ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. బాపట్ల: బాపట్ల జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు 2026–2027 సంవత్సరానికి సోమవారం జరిగిన ఎన్నికలలో నూతన అధ్యక్షులుగా విన్నకోట సత్యప్రసాద్ ఘన విజయం సాధించారు. బాపట్ల జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఉపాధ్యక్షులుగా కంచర్ల రవిబాబు, ప్రధాన కార్యదర్శిగా సి ప్రేమ్చంద్, లైబ్రరీ కార్యదర్శిగా కారుమూరి సురేంద్ర నాథ్, సాంస్కృతిక కార్యదర్శిగా చాపల వెంకట ప్రవీణ్ కుమార్లు గెలుపొందారు. నూతనంగా ఎన్నికై న వారిని పలువురు ప్రముఖులు అభినందించారు. మంత్రి లోకేష్కు జెడ్పీ చైర్పర్సన్ వినతిగుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్కు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.34 కోట్ల రిజిస్ట్రేషన్ సర్చార్జి నిధులు విడుదల చేయించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా విజ్ఞప్తి చేశారు. సోమవారం మంత్రి లోకేష్ను ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసిన హెనీ క్రిస్టినా, కత్తెర సురేష్కుమార్ దంపతులు జెడ్పీకి రావాల్సిన నిధులు, బకాయిల విషయమై ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన లోకేష్ నిధుల విడుదలకు హామీ ఇచ్చినట్లు హెనీ క్రిస్టినా తెలిపారు. మాచర్ల: సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో ఆమె తండ్రి కామనబోయిన చంద్రశ్రీను, మేనమామ పచ్చిపాళ్ల శ్రీనులను సోమవారం రాత్రి గురజాల ఇన్చార్జి డీఎస్పీ వెంకటరమణ అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన చంద్ర శ్రీను కుమార్తె ప్రేమించిన నాగరాజుతో వెళ్లి వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించి చౌడేశ్వరి అదృశ్యమైనట్లు, దానికి కారణం జమ్మలమడక గ్రామానికి చెందిన నాగరాజు అని మృతురాలి తల్లిదండ్రులు చంద్రశ్రీను, గంగమ్మలు పోలీసులను ఆశ్రయించారు. ఆ తరువాత ఈ నెల 18న చౌడేశ్వరి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పారు. అయితే ఇది హత్య కేసుగా పోలీసు పరిశోధనలో తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్య కేసులో నిందితులు చంద్రశ్రీను, పచ్చిపాళ్ల శ్రీనులను అరెస్టు చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అర్థరాత్రి హాజరుపర్చనున్నారు. -
విజ్ఞాన్ నిరులా విద్యార్థినికి గోల్డ్ మెడల్ ప్రదానం
గుంటూరు రూరల్: ఇటీవల కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన 12వ స్నాతకోత్సవ వేడుకల్లో విజ్ఞాన్ నిరులా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఐటీ విభాగ విద్యార్థిని గుండా ప్రియాంకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం విశేష గౌరవంగా నిలిచిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ రాధిక తెలిపారు. సోమవారం పెదపలకలూరు రోడ్డులోని కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థిని అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ గుండా ప్రియాంక తన కృషి, పట్టుదల, అంకితభావంతో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకుని సంస్థకు మరింత ఖ్యాతిని తీసుకువచ్చిందన్నారు. ఆమె సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. ప్రియాంకను విజ్ఞాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ఉపాధ్యక్షులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఐటీ విభాగాధిపతి డాక్టర్ కె.వి.ఎస్. రామకృష్ణ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. -
రిసార్ట్స్, అక్రమ లేఅవుట్స్పై చర్యలు తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే ఆమంచిబాపట్ల: చీరాల ప్రాంతంలో పర్యావరణ, అటవీ సంరక్షణ చట్టానికి విరుద్ధంగా రిసార్ట్స్, అక్రమ లేవుట్స్ను ఏర్పాటు చేయటంపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ను సోమవారం కలెక్టరేట్లో కలిసి వినతిపత్రం అందించారు. చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలంలోని చల్లారెడ్డిపాలెం గ్రామం పంచాయతీ, కఠారివారిపాలెం పరిధిలో రిసార్ట్స్, నిబంధనలకు విరుద్ధంగా లేవుట్స్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఏవిధంగా అనుమతులు ఇచ్చారో అర్థంకావటంలేదని వివరించారు. సముద్రతీరం అనుకుని నిర్మాణం చేపడుతున్న మౌనంగా ఉండటంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రిసార్ట్స్ నిర్వహణను నిలుపుదల చేయటంతోపాటు అక్రమ లే అవుట్స్ను తొలగించాలని కోరారు. వేటపాలెం మాజీ ఎంపీపీ బండ్ల తిరుమలాదేవి, కొత్తపేట మాజీ సర్పంచి చుండూరు వాసు, సుధార్, బుజ్జిబాబు, బొనిగల పేతురుబాబు, మల్లెల బుల్లిబాబు, పృద్వి, రమేష్, ముంగర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భూగర్భ జలాలను సంరక్షించుకోవాలి భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. జలభద్రత, సాగునీటి సంఘాల బాధ్యతపై సోమవారం స్థానిక బాపట్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సాగు, తాగునీటి చెరువులన్నీ అభివృద్ధి చేసుకోవాలన్నారు. నాణ్యమైన, పరిశుభ్రమైన జలాలను ప్రజలకు సరఫరా చేయాలన్నారు. చెరువు కట్టలు, పంట కాల్వల కట్టలు బలోపేతం చేయాలన్నారు. జలాల సంరక్షణలో భాగంగా 100 రోజుల కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విలువైన ప్రతి నీటి చుక్కను భద్రం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లాలో ఉన్న 133 చెరువులు, వాటి కట్టల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. మే నెల 15వ తేదీన సాగర్ నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన సాగునీటి కాల్వల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. భూగర్భ జలాలను పెంచడానికి యుక్త ధార కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, ప్రజలు సహకరించాలని డ్వామా పీడీ విజయలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో జల వనరుల శాఖ అధికారులు సత్యనారాయణ, ధనలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, నీటి సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
వాజ్పేయి చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ గుంటూరు మెడికల్: మాజీ ప్రధాని వాజ్పేయి చరిత్ర ప్రతి ఒక్కరికీ ఆదర్శమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్.మాధవ్ పేర్కొన్నారు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గుంటూరు లక్షీపురంలోని వాజపేయి సర్కిల్లో వాజపేయి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాధవ్ మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావం జరిగి నేటీకి 46 వసంతాలు పూర్తయ్యాయన్నారు. మన ఊరు–మన జండా కార్యక్రమం ఆరునెలలపాటు కొనసాగిస్తామని తెలిపారు. ప్రతి గ్రామానికి రూ.2 కోట్లు నిధులు కేంద్రం విడుదల చేసిందని తెలిపారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. అటల్ బీహారి వాజ్పేయి చరిత్ర బీజేపీ చరిత్రతో ముడిపడి ఉందన్నారు. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి అజండా ఉండాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా రూ.15 లక్షల కోట్లు ఏపీకీ కేంద్ర కేటాయించిందన్నారు. కార్యక్రమంలో బెహరా గాయత్రి, పాలపాటి రవికుమార్, డాక్టర్ స్రవంతి, లకరా, పవన్ సాయి, సోలంకి, మహాలక్ష్మి, మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, పనతల సురేష్, సయ్యద్ బాషా, యడ్లపాటి స్వరూపరాణి, కొత్తూరు వెంకట సుబ్బారావు, భీమినేని చంద్రశేఖర్, గంగాధర్, నేరళ్ల మాధవరావు, వక్కలగడ్డ తిరుమలరావు, నాగేశ్వరరావు, భజరంగ్ రామకృష్ణ, దేసు సత్యనారాయణ, కారంశెట్టి రమేష్, శ్రావణ కుమారి, అనుమోలు ఏడుకొండలు గౌడ్, రాచుమల్లు భాస్కర్, జితేంద్ర గుప్తా, ప్రవీణ్, రావుల రాజశేఖర్, అబ్రహం, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయం వాజ్ పేయి భవన్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీన్ మాధవ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. -
టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబు పత్రాలకు మూల్యాంకన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. నల్లచెరువు మెయిన్రోడ్డులోని మహావీర్ మెమోరియల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో మూల్యాంకన విధులకు నియమించిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో షేక్ సలీమ్ బాషా ఉపాధ్యాయులకు విధులను అప్పగించారు. గుంటూరుజిల్లాలో మూల్యాంకనం జరిపేందుకు ప్రభుత్వం 1,83,369 ఆన్సర్ స్క్రిప్ట్లను కేటాయించగా, వాటికి 10రోజుల వ్యవధిలో మూల్యాంకనం నిర్వహించాల్సి ఉంది. ఇందుకు గానూ చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్లతో పాటు స్పెషల్ అసిస్టెంట్స్ విధుల్లో వివిధ కేడర్లకు చెందిన 950 మంది ఉపాధ్యాయులను నియమించారు. అదే విధంగా అనారోగ్య పరిస్థితులతో పాటు వివిధ కారణాలతో స్పాట్ వాల్యూయేషన్ విధుల నుంచి మినహాయింపు కోరుతూ ఉపాధ్యాయులు అధికారుల ఎదుట క్యూ కట్టారు. ఉపాధ్యాయుల ఇబ్బందులు తెలుసుకున్న అధికారులు వారి నుంచి మెడికల్ సర్టిఫికెట్లు, ధ్రువపత్రాలు పరిశీలించి విధుల నుంచి మినహాయింపు కల్పించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన.. సమస్యలు పరిష్కరించని ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం నల్లచెరువు మెయిన్రోడ్డులోని మహావీర్ మెమోరియల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో ఫ్యాప్టో పిలుపు మేరకు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఫ్యాప్టో గుంటూరు జిల్లా చైర్మన్ కె.నరసింహారావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేశామని, ఇందులో భాగంగా నల్లబ్యాడ్జీలతో స్పాట్ వాల్యూయేషన్ విధులకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్రావు, మహమ్మద్ ఖాలీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ బాజీ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
పోలీసంటే.. అలుసు!
చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులకే భద్రత లేకుండా పోతోంది. కూటమి నేతల అండ చూసుకుని చోటా మోటా నాయకులు సైతం పోలీసులను బెదిరించడం.. దుర్భాషలాడడం.. దాడులకు సైతం పాల్పడడం పరిపాటిగా మారింది. తెనాలిలో నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండు సంఘటనలు పోలీసులపై కూటమి నేతల దాష్టికానికి నిదర్శనాలుగా మారాయి. గత నెలలో జనసేన నాయకుడు హెడ్ కానిస్టేబుల్పై దాడిచేయగా.. తాజాగా నడిరోడ్డుపై మద్యం తాగవద్దని వారించిన ఎస్ఐపై టీడీపీకి చెందిన వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. తెనాలి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులపై దాడులు పెచ్చరిల్లుతున్నాయి. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు విధినిర్వహణలో ఉన్న పోలీసులపై యథేచ్ఛగా దాడి చేస్తున్నారు. తాజాగా రద్దీగా ఉండే ప్రధాన రహదారి కూడలిలో మద్యం సేవిస్తూ, అదేమని అడిగిన ఎస్ఐపై దాడి చేయడం ఇందుకు నిదర్శనం. గతేడాది ఓ కానిస్టేబుల్పై దాడిచేశారంటూ ముగ్గురు దళిత యువకులను బహిరంగంగా పోలీసు అధికారులే భౌతిక హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. గత నెలలో హెడ్కానిస్టేబుల్పై దాడిచేసిన నిందితుడిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు. అసలేం జరిగిందంటే.. పట్టణంలోని సమైక్య వెండి వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు పఠాన్ ఫజల్ఖాన్ జన్మదిన వేడుకలను ఆదివారం మధ్యాహ్నం బోసురోడ్డులో ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ల ఫ్లెక్సీలతో తమ నాయకుడి ఫొటోతో కూడి న భారీ ఫ్లెక్సీని నడిరోడ్డు కూడలిలో ఏర్పాటుచేసి, జన్మదిన కేక్ను కట్ చేసి, వేడుక జరిపారు. అదేరోజు సాయంత్రం ఆ ఫ్లెక్సీని పట్టణంలో ఊరేగించేందుకని కొందరు వర్కర్లు ఆ కూడలికి చేరుకుని, తమ నాయకుడి పేరుతో అక్కడే జేజేలు చేస్తున్నారు. అక్కడికి సమీపంలోని గాంధీచౌక్లో ట్రాఫిక్ విధుల్లో ఉన్న వన్టౌన్ ఎస్ఐ కె.విజయ్కుమార్కు రోడ్డుపైనే యువకులు మద్యం సేవిస్తున్నారనే సమాచారం వచ్చింది. దీంతో ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య, కానిస్టేబుల్ కృష్ణమూర్తి, హోంగార్డ్ రాజుతో కలిసి ఎస్ఐ విజయకుమార్ అక్కడకు చేరుకున్నారు. పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించినవారిలో ముగ్గురిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరారయ్యేందుకు ప్రయత్నించినవారు వెనక్కివచ్చారు. నడిరోడ్డుపై మద్యం సేవించటం చట్టప్రకారం నేరం అని ఎస్ఐ విజయ్కుమార్ చెబుతుండగానే ఆయనపై దాడిచేశారు. రోడ్డుపైకి తోసివేసి పరారయ్యారు. ఈ ఘటనను పోలీసుల్లో ఒకరు రికార్డు చేశారు కూడా! దీనిపై వన్టౌన్ పోలీస్స్టేషనులో కేసు నమోదుచేశారు. నిందితుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మిగిలినవారికోసం గాలిస్తున్నారని తెలిసింది. ఇదిలావుంటే గత నెల రెండోవారంలో త్రీటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు ఘర్షణపడ్డారు. బీరు సీసాతో జరిగిన దాడిలో ఇండ్ల వెంకట్రావు అనే వ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెడికో లీగల్ కేసుగా త్రీటౌన్ పోలీస్స్టేషన్కు వచ్చిన సమాచారం ప్రకారం ఆసుపత్రి డ్యూటీలో ఉండే త్రీటౌన్ హెడ్కానిస్టేబుల్ టి.తిరుమలరావు, క్షతగాత్రుడి దగ్గరకు వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. అదే సమయంలో జనసేన పార్టీ నాయకుడు ఎయిర్టెల్ నాగేశ్వరరావు వెంకట్రావుపై దాడిచేసిన వ్యక్తిని వెంటబెట్టుకుని ఆసుపత్రికి చేరుకున్నారు. తిరుమలరావు దగ్గరకు వెళ్లి, ‘మావాడిని కూడా కొట్టారు. ముందు మా వాడు చెప్పిన వివరాలు తీసుకోండి’ అంటూ హుకూం జారీ చేశాడు. అది వీలుపడదని చెప్పిన హెడ్ కానిస్టేబుల్ తిరుమలరావుతో ఘర్షణపడి అక్కడే అతడిపై దాడిచేశాడు. దీనిపై తిరుమలరావు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం త్రీటౌన్ పీఎస్లో 42/2026 కేసు నమోదైంది. నిందితుడు ఎయిర్టెల్ నాగేశ్వరరావును ఇప్పటివరకూ అరెస్టు చేయలేదని తెలిసింది. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
చేబ్రోలు: చేబ్రోలులోని కొమ్మమూరు బ్రిడ్జి ప్రాంతంలో సోమవారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చేబ్రోలు శివారులోని కొమ్మమూరు బ్రిడ్జిపై నుంచి చానల్లోకి ప్రమాదవశాత్తూ టిప్పర్ బోల్తా పడిపోవటంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. పేరేచేర్ల ప్రాంతానికి చెందిన టిప్పర్ మెటల్ను లోడ్ చేసుకొని దిగుమతి చేసి తిరిగి బయలుదేరింది. చేబ్రోలు శివారులోని కొమ్మమూరు బ్రిడ్జి సమీపంలోకి వచ్చే సమయానికి టిప్పర్ అదుపుతప్పి బ్రిడ్జి రైయిలింగ్ను ఢీకొని సుమారు 25 అడుగుల లోతున ఉన్న కొమ్మమూరు చానల్లో బోల్తా పడింది. ఈ సంఘటనలో టిప్పర్ డ్రైవర్ కసుకర్తి లక్ష్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చేతులు, కాళ్లు, నడుంకు బలమైన గాయాలైన డ్రైవర్ లక్ష్మయ్యను 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ బ్రిడ్జి రైయిలింగ్ను ఢీకొని ఛానల్లో పడిపోయిన సమయంలో ఎదురుగా ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బ్రిడ్జి పై భాగంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఉంటే పెను ప్రమాదం జరిగిన ప్రాణ నష్టం జరిగే ఉండేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. పొన్నూరు వైపు నుంచి వస్తున్న టిప్పర్ కట్టెంపూడి అడ్డరోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. మునిపల్లె వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని, మంచాల గ్రామం వద్ద అతివేగంగా వాహనాన్ని నడిపిన డ్రైవర్ చివరకు కొమ్మమూరు బ్రిడ్జిపై నుంచి చానల్లోకి బోల్తా కొట్టినట్లు వాహనదారులు తెలిపారు. -
సమస్యలు సత్వరం పరిష్కరించండి
జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట కొల్లూరు: ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట అన్నారు. సోమవారం కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు కట్టుబడి ఉండాలన్నారు. పీజీఆర్ఎస్లో సమస్యలపై వచ్చిన అర్జీలను శాఖల వారీగా సంబంధిత అధికారులు పరిశీలించి, నెల రోజుల వ్యవధిలో క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. పలు సమస్యలపై 75 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా కృష్ణానదీ వరదలు, తుపాను కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని సీఐటీయూ నాయకులు అర్జీ అందించారు. జొన్న, మొక్కజొన్న పంట ఉత్పత్తులకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ జేసీకి అర్జీలు అందజేశారు. వీటితోపాటు స్మశాన స్థలాలు, చుక్కల భూముల సమస్యలు, వివాదాస్పద డొంకరోడ్డు సమస్యలను పరిష్కరించాలని అర్జీలు అందాయి. కార్యక్రమంలో భూ రికార్డ్స్ సర్వే శాఖ ఏడీ సాంబశివరావు, ప్రత్యేక అధికారిణి పద్మావతి, ఎంపీడీఓ ఎ.స్పందన, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి
బాపట్ల: అభివృద్ధి, సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం స్థానిక కలెక్టరేట్లో సోమవారం జరిగింది. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. అభివృద్ధి రేటులో బాపట్ల జిల్లా రానున్న మూడు నెలల్లో 10వ ర్యాంకులోకి వెళ్లాలని జిల్లా ప్లానింగ్ బోర్డ్ చైర్మన్, ఇన్చార్జి మంత్రి పార్థసారథి చెప్పారు. అన్ని రంగాల్లో జిల్లా ఎదిగేలా అధికారులంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. జిల్లా అధికారుల్లో ఆరోగ్యకరమైన పోటీ రావాలి, స్ఫూర్తితో పనిచేయాలన్నారు. వ్యవసాయ, పాల ఉత్పత్తులు, చేపలు, రొయ్యల ఉత్పత్తులు జిల్లాలో అధికంగా ఉన్నందున ప్రాసెసింగ్ యూనిట్ల పెరగడానికి కృషి చేయాలన్నారు. ఇలాంటి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలన్నారు. గొర్రెలు, మేకలు పెంపకంతో పాటు మాంసం ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా మాంసం ఎగుమతులకు విదేశీ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్నందున ఆ దిశగా అధికారులు పనిచేయాలన్నారు. ఒప్పందాలు చేసుకున్న పెట్టుబడిదారుల వద్దకు అధికారులు వెళ్లి పరిశ్రమల స్థాపనకు ఆహ్వానించాలని మంత్రి సూచించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి -
ముందు బుక్ చేసిన వారికి సిలిండర్ డెలివరీ చేయాలి
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: ముందు బుక్ చేసిన వారికి ముందు సిలిండర్ డెలివరీ చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. జిల్లాలో ఎల్.పి.జి సేల్స్ ఆఫీసర్స్, గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లుతో సోమవారం వీడియో కాన్ఫరెనన్స్లో జేసీ మాట్లాడుతూ ఎక్కువ పెండెన్సీ ఉన్న ఏజెన్సీలు అదనపు లోడ్స్ తెప్పించాలని సేల్స్ ఆఫీసర్స్కు సూచించారు. గ్యాస్ ఏజెన్సీలు ఖచ్చితంగా డోర్ డెలివరీ మాత్రమే చేయాలనని, ముందు బుక్ చేసుకున్నవారికి ముందు పంపిణీ చేసే పద్ధతిని పాటించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డెలివరీ బాయ్స్ను ఎక్కువ ట్రిప్పులు తిరిగి అధిక సంఖ్యలో పంపిణీ చేయాలని తెలిపారు. మార్చి నెలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐ.వి.ఆర్.ఎస్ సర్వేలో దీపం పథకానికి జిల్లా మొదటి స్థానం సాధించిందని అందరినీ అభినందించారు. ఇకపై కూడా ఇదే పనితీరును కనబరచాలని అన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, తహసీల్దార్లు పాల్గొన్నారు. కొండపాటూరుకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు పట్నంబజారు: కొండపాటూరు అమ్మవారి ఉత్సవాలు పురస్కరించుకుని ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం డి.సాంబ్రాజ్యం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 7న ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొండపాటూరులో వేంచేసియున్న పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవానికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 7వ తేదీ ఉదయం 5 నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సును ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఈ బస్సుల్లో గుంటూరు డిపో–1 నుంచి పొన్నూరు నుంచి 20 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. పెద్దలకు గుంటూరు డిపో–1 నుంచి రూ.55, పిల్లలకు రూ.30 ప్రయాణ చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. పొన్నూరు నుంచి పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30 నిర్ణయించామని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్పెషల్ బస్సులతోపాటు, నిత్యం తిరిగే సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు, దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. భట్టిప్రోలు: భట్టిప్రోలు మండలంలో గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సూరేపల్లి–వేమవరం మధ్య 216–ఎ జాతీయ రహదారి సమీపంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు అధికారుల బృందం బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించారు. వీరు అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట రేపల్లె ఆర్డీవో బి.శ్రీదేవి, డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, వేమూరు సీఐ వీరాంజనేయులు, ఇన్చార్జి తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు ఎస్ఐ ఎం.శివయ్య తదితరులు ఉన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం బంగారు మంగళ సూత్రాలను కానుకగా సమర్పించారు. విజయవాడ ఆచార్యరంగానగర్కు చెందిన జి.శరత్బాబు కుటుంబం సుమారు 22 గ్రాముల బంగారంతో రూ. 4లక్షలతో తయారు చేయించిన రెండు మంగళ సూత్రాలను ఆలయ చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
కరుణించమ్మా.. పోలేరమ్మా !
భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పేరాల పోలేరమ్మ తల్లి చీరాల: కోరిన కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పేరాల పోలేరమ్మ తల్లి శిడిమహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరగనుంది. పోలేరమ్మ గుడి స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సర తిరునాళ్ల జరగనున్నాయి. మంగళవారం శిడి మహోత్సవం, తిరునాళ్ల జరగనున్నాయి. చీరాల పట్టణంలో జరిగే పోలేరమ్మ తిరునాళ్లకు ఎంతో విశిష్టత ఉంది. స్థానిక హరిప్రసాద్నగర్లో పోలేరమ్మ తల్లి వేంచేసి ఉంది. గత 50 ఏళ్లుగా ప్రతి ఏడాది అమ్మవారి తిరునాళ్లను ఘనంగా నిర్వహిస్తారు. శక్తి స్వరూపం కలిగి, భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉండే పోలేరమ్మ అమ్మవారి గుడి అంటే చీరాల ప్రాంతంలో ప్రసిద్ధి. తొలుత స్థానిక గ్రామస్తులు చిన్న గుడిని ఏర్పాటు చేసి అమ్మవారిని స్థాపించగా ప్రస్తుతం ఆ దేవాలయం దినదినాభివృద్ధి చెంది పట్టణంలోనే విశిష్టత కలిగిన అమ్మవారిగా పేరు పొందింది. దేవాలయం అభివృద్ధిలో దేవస్థాన కమిటీ, సభ్యులు విశేష కృషి చేశారు. ప్రతి మంగళ, ఆదివారాల్లో భక్తులు విరివిరిగా వచ్చి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న భక్తుల కష్టాలు, కోర్కెలను తీర్చే తల్లిగా పోలేరమ్మ తల్లికి పేరుంది. -
బాబూ జగ్జీవన్రామ్ ఆదర్శనీయుడు
బాపట్ల: వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినప్పటికీ విద్యలోనూ, ఉన్నత విలువల సాధనలోను అకుంఠిత దీక్షతో పోరాడి సమానత్వ భావన కోసం విశేషంగా కృషి చేసిన మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ విద్యార్థి లోకానికి ఆదర్శనీయుడని వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు ఇనగలూరి మాల్యాద్రి పేర్కొన్నారు. బాబూ జగ్జీవన్రామ్ జయంతి కోన భవనంలో ఆదివారం నిర్వహించారు. మాల్యాద్రి మాట్లాడుతూ మహాత్మాగాంధీ ప్రారంభించిన అంటరానితనం వ్యతిరేక ఉద్యమంలోను, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలోను చురుకుగా పాల్గొన్నందుకు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించిన జగ్జీవన్రామ్ స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్లో కార్మిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఆ పదవికే వన్నె తెచ్చారన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా వ్యవసాయాన్ని ఆధునికీకరించడంలో ఆయన నిర్వహించిన పాత్ర గణనీయమైనదని, భారత దేశంలో హరిత విప్లవ సాధనలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనదన్నారు. 1974లో కరువు సంభవించినప్పుడు ఆహార ధాన్యాల కొరతను నివారించడం కోసం ఆయన అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించి, ఆ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించి రైతాంగం మన్ననలు పొందారన్నారు. తొలుత జగ్జీవన్రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో బాపట్ల పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్ బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. జగ్జీవన్రామ్ జీవితం యువతకు ఆదర్శం బాపట్లటౌన్: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జీవితాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళుర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ అణగారిన వర్గాలు వివక్షకు గురౌతున్న తరుణంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిస్వార్థ పోరాటాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు తన వంతు కృషి చేశారన్నారు. అలాంటి గొప్ప నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడుని స్మరించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆదర్శనీయమైన మహోన్నత వ్యక్తి నుంచి సద్గుణాలను అలవర్చుకుని సమాజం కోసం మనవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్బి సీఐ బి.నారాయణ, ఆర్ఎస్ఐ శ్రీనివాస్, సీసీ హరికృష్ణ, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జ్జీవన్రామ్ బాపట్లటౌన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆహర్నిశలు శ్రమించిన ఘనుడు బాబూ జగ్జీవన్రామ్ అని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని బాపట్లలోని ఎంపీ కార్యాలయంలో జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఎంపీ మాట్లాడుతూ యువతరం జగ్జీవన్రామ్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పటాన్ రాజేష్, భోగిరి రామారావు, నర్రా ఏడుకొండలు, బడుగు పృధ్వీరాజ్, ఆర్ నాగేశ్వరావు, నీలాంబరం, బోగిరి పృధ్వీరాజ్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు ఇనగలూరి మాల్యాద్రి -
మార్టూరులో ఐజీ ఆకస్మిక పర్యటన
మార్టూరు: గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆదివారం రాత్రి మార్టూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో స్టేషన్కు చేరుకున్న ఐజీ మొదట రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులు వాటి వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి, సిబ్బంది పని తీరుపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర్, సీఐ వై.శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె పట్టణానికి చెందిన మద్దుల ఏసుకుమారి(27) ఆదివారం అంబులెన్ ్సలోనే పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. పూరిటి నొప్పులతో ఆమెను రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా హీమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండటం, నొప్పులు అధికంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో 108లో తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవ వేదనలు పెరిగి అంబులెన్స్లోనే ప్రసవం జరిగింది. అనంతరం వారిని తెనాలి ఆసుపత్రికి చేర్చగా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఈఎంటీ కేసన మహేష్ బాబు తెలిపారు. దుగ్గిరాల: మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. యువకులు మద్యం సేవించి చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివానలా మారి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు...ఆదివారం కంఠంరాజుకొండూరు గ్రామంలోని అమ్మవారి దేవస్థానం దగ్గర ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. తాడేపల్లికి చెందిన పేరుపోగు వంశీని తలపై ఇనుపు రాడ్డుతో తెనాలికి చెందిన వ్యక్తులు కొట్టగా తల పగిలింది. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ వైద్యశాలకు తరలించారు. మద్యం షాపు పక్కనే ఉండటం వల్ల ఆలయానికి దర్శనం కోసం వచ్చిన వారు బాగా మద్యం సేవించి గొడలు పడుతున్నారని పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దుగ్గిరాల: కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీటి విడుదలను ఆదివారం నుంచి నిలిపివేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రబీ సాగు చేసిన మొక్కజొన్న, జొన్న మినుము, నువ్వులు, పెసర పంటలు కోతలు పూర్తయ్యాయని తెలిపారు. మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మైలవరం మండలం పుల్లూరులోని చిలుకూరువారిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రెడ్డిగూడెం మండలం రుద్రవరం తండాకు చెందిన దేవావతు రవి(30) ద్విచక్రవాహనంపై మైలవరం బయలుదేరాడు. ఈ క్రమంలో పుల్లూరు సెంటర్ సమీపంలో ఉన్న చిలుకూరువారిగూడెం జెడ్పీ హైస్కూల్ వద్దకు వచ్చే సమయానికి మైలవరం నుంచి తిరువూరు వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొని రవి రహదారిపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రవిని స్థానికులు 108 వాహనంలో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గొల్లపూడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. సంఘనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
వలస కూలీలపై నిర్లక్ష్య ధోరణి వీడాలి
నరసరావుపేట: రాష్ట్రంలోని వలస కార్మికులకు రక్షణ చట్టం తక్షణమే అమలు చేసి చనిపోయిన వారికి రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. వలస ప్రాంతాల్లో ఉచిత రవాణా, నివాసం, తాగునీరు, వైద్యం, రేషన్ సదుపాయాలు కల్పించడంతో పాటు పిల్లల విద్య ఆగిపోకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు జిల్లా నుండి మిర్చి కోత పనుల కోసం నరసరావుపేట మండలం కేసానుపల్లి, ఇర్లపాడు గ్రామాలకు వలస వచ్చిన కార్మికులను ఆదివారం సంఘం రాష్ట్ర నాయకుడు వి.వెంకటేశ్వర్లు, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల కార్యదర్శులు జి.రవిబాబు, ఈ.అప్పారావు, కంకణాల ఆంజనేయులు పరామర్శించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల దుస్థితి దారుణంగా మారిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి లేక గ్రామాలు ఖాళీ అవుతుండగా, వలసల బారిన పడిన కూలీల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని మండిపడ్డారు. నాలుగు నెలలుగా గ్రామాల్లో వ్యవసాయ కార్మికులకు పనులు లేకపోవడంతో పాటు, ఉపాధి హామీ పనులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ పరిస్థితుల వల్ల లక్షలాది మంది కూలీలు పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లాల్సి వస్తోందని, ఈ వలసలలో జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికే 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇటీవల కోసిగి మండలానికి చెందిన ఓ వ్యవసాయ కార్మికుడు వడదెబ్బతో మతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ, అతని కుటుంబం అనాధగా మారిందని, అయినా ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదని విమర్శించారు. -
డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ను ఆదర్శంగా తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: గొప్ప సామాజిక సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడైన డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. జగ్జీవన్రామ్ జయంతి మహోత్సవ కార్యక్రమం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అధికారులతో కలసి జగ్జీవన్రామ్ చిత్రపటానికి పుష్పమాలలతో నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని తెలుగు తల్లి గేయంతో ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జగ్జీవన్రామ్ దళిత కులం నుంచి తొలి రాజకీయ నాయకుడు, భారత ఉప ప్రధానిగా ఎదిగిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. మంత్రి పదవులను సమర్థంగా నిర్వహించారని, మంత్రిగా ఆయన పనిచేసిన కాలంలో హరిత విప్లవం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. పేదరికం నుంచి వచ్చిన జగ్జీవన్రామ్ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని, భారతదేశ సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్గౌడ్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ సాధికారత అధికారి రాజాదెబోరా, డీఆర్డీఏ పీడీ సింగయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ నాయకులు చార్వాక, ఎన్ మోహన్ కుమార్ ధర్మ, పల్నాటి శ్రీరాములు, భగవాన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.


