అ‘పూర్వ’ కలయిక
బాపట్ల: బాపట్ల వ్యవసాయ కళాశాల విజయ పరంపరను కొనసాగించడం తమకు గర్వకారణంగా ఉందని పూర్వ విద్యార్థి, రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్ డి.పాపిరెడ్డి అన్నారు. వ్యవసాయ కళాశాలలో 1965 – 69 బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థి సంఘం నిర్వహించిన ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ తాము ఈ తరహా వేడుకలను ఐదవసారి నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య అతిథిగా కళాశాల అసోసియేట్ డీన్ డా. పి. ప్రసూన రాణి మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిని వివరించారు. ఈ విషయంలో పూర్వ విద్యార్థులు పాత్ర చిరస్మరణీయం అన్నారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంబీ నాగేశ్వరరావు, యూకో బ్యాంక్ చైర్మన్ వై.వేణుగోపాల రావు, సీనియర్ మేనేజర్ కె.కోటేశ్వర రావు, పి.వెంకటేశ్వర రావు, మస్తాన్ రెడ్డిలతో పాటు మొత్తం 30 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పాపిరెడ్డి, జి.వెంకయ్య తమ సమ్మేళన లక్ష్యాలను వివరించారు. అందరూ కుటుంబ సభ్యులతో పాల్గొనడం ఈ కార్యక్రమ విశేషం. 90 సంవత్సరాల వయసుగల పట్టాభిరామయ్య ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా పరస్పరం జ్ఞాపికలతో అభినందించుకొన్నారు. కళాశాల యూజీ చివరి సంవత్సరం అగ్రికల్చరల్ జర్నలిజం విద్యార్థులు వీరితో మాట్లాడి స్ఫూర్తి పొందారు.


