బొక్కేస్తారో.. ఇచ్చేస్తారో?
మీకేం కాదు .. మేమున్నాం
నల్లబజారుకు తరలుతున్న రేషన్ బియ్యం
చీరాల అర్బన్: రపజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పింది. చౌక ధరల దుకాణాల్లో కార్డుదారులకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. కొందరు డీలర్లు బియ్యం బదులు, డబ్బులు ఇచ్చి కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. కొందరు డీలర్లు బియ్యం బదులు డబ్బులు తీసుకోవాలని కార్డుదారులను ఒత్తిడి చేస్తున్నారు. అలా సేకరించిన రేషన్ బియ్యం ఎక్కువ ధరకు నల్లబజారు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు మరికొంత లాభం చూసుకుని ఇతర ప్రాంతాల్లోని మిల్లులకు, జిల్లాల సరిహద్దులను దాటించి పోర్టులకు తరలించి దేశ ఎల్లలు దాటించి భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. అందులో తిలా పాపం, తలా పిడికెడు. పలు సందర్భాల్లో రేషన్ బియ్యం నల్లబజారుకు తరలుతూ పట్టుబడటం, గత నెలలో చీరాలలో పలువురు మహిళలు (కార్డుదారులు) తమకు డీలర్లు ఇచ్చే డబ్బులు వద్దని, బియ్యం ఇవ్వాలని ఆందోళనకు దిగటం దీనికి సాక్ష్యం. ఇక మార్చి నెలకు సంబంధించి ఆదివారం నుంచి రేషన్ పంపిణీ కానుంది.
మాల్ తీసుకుంటాడు.. డబ్బులు ఇస్తాడు.. మనకేం ఇబ్బంది లేదు
రేషన్ మాఫియాగా గుర్తింపు పొంది, ఒంగోలులో షాడో ప్రజాప్రతినిధిగా అధికారం చెలాయిస్తున్న వ్యక్తి గురించి ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. కొందరు డీలర్లు తమ ఆంతరంగిక సమావేశాల్లో మాల్ (రేషన్ బియ్యం)తీసుకుంటాడు. మనకు డబ్బులు ఇస్తాడు. మనకేం ఇబ్బంది లేదు. అంతా అతనే చూసుకుంటాడని చర్చించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతనికి ఏమేర అండ ఉంటే ఆ స్థాయిలో డీలర్లు చర్చించుకుంటున్నారోనని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
బియ్యం బదులు నగదు బదిలీ చేస్తే మేలు!
ప్రభుత్వం పేదల ఆహార భద్రతనే కోణంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు ఇవ్వడం మంచిదే. అయితే ఆ ప్రక్రియ సక్రమంగా జరగటం లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్డుదారులకు అత్యంత నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని అందుకు కేజీకి సుమారు రూ.40 వరకు ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో కార్డుదారులకు బియ్యం బదులు ఎవరికి ఎన్ని కేజీలు వస్తాయో, ఆ మేరకు కేజీకి రూ.40 చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తే బాగుంటుందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. మీ కేం కాదు. మేమున్నాం. అంటూ నల్లబజారు వ్యాపారులు డీలర్లుకు అభయం ఇస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కలెక్టర్ వి.వినోద్ కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించి రేషన్ బియ్యం నల్లబజారుకు తరలకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
బొక్కేస్తారో.. ఇచ్చేస్తారో?


