వలస వేదన
ప్రభుత్వం నుంచి సాయం శూన్యం
మన వారికి ఎంతో డిమాండ్
● నిషేధానికి ముందే వలసలు
పోతున్న మత్స్యకారులు
● సాయం కోసం ఎదురుచూసినా
ఫలితం శూన్యం
● ఉమ్మడి గుంటూరు జిల్లాలో
11,500 మందికి ఉపాధి కరువు
వేట నిషేధానికి ముందే మత్స్యకారులు వలసబాట పట్టారు. గత ఏడాది వేట నిషేధ సమయంలో అందించాల్సిన సాయం మళ్లీ నిషేధం సమీపిస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఒక్కపైసా ఇవ్వలేదు. కనీసం ఆ విషయం పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు.
బాపట్ల : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 11, 500 మంది, ఇప్పుడు చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో మరో 5 వేల మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా వేట నిషేధ కాలానికి సంబంధించి మత్స్యకారులకు రూ.10 వేలు వారి ఖాతాల్లో జమ చేసేవారు. కూటమి ప్రభుత్వంలో మత్స్యకారుల గురించి పట్టించుకునే నాథుడే కనిపించలేదు. దీంతో ఈ ఏడాది ఎక్కువ మంది వలస వెళుతున్నారు.
పరిస్థితి ఇదీ...
రాష్ట్రంలో ఏప్రిల్ 15 నుంచి మే 31వ తేదీ వరకు వేట నిషేధం ఉంటుంది. దీంతో పలు రాష్ట్రాలకు వేట నిమిత్తం ఈ ప్రాంతం మత్స్యకారులు వెళుతుంటారు. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. బెంగళూరు, గోవా వెళ్లేందుకు మత్స్యకారులు సిద్ధం అవుతున్నారు. సముద్ర జీవరాశులు ఏప్రిల్ 15 నుంచి మే 31వ తేదీ వరకు గుడ్లు ఉత్పత్తి చేసే దశ కావటంతో వేట నిషేధం విధిస్తారు. తరువాత జూన్ ఒకటో తేదీ నుంచి వేటకు గ్రీన్సిగ్నల్ ఇస్తారు. సాధారణంగా ఈ ప్రాంతంలో వేట నిషేధ సమయంలోనే ఇతర రాష్ట్రాలకు వేట కోసం వెళ్లే మత్స్యకారులు ఈ ఏడాది ముందే వెళుతున్నారు.
ఇతర రాష్ట్రాలకు పయనం
ఉపాధి కోసం బెంగళూరు, గోవా ప్రాంతాల్లో వేటకు సాధారణంగా ఇక్కడి వారు వెళుతుంటారు. ముందుగా రెండు నెలలు కలుపుకొని మొత్తం నాలుగు నెలలుపాటు ఇతర రాష్ట్రాల్లో ఉండిపోతున్నారు. బాపట్ల నియోజకవర్గంలోనే ఎక్కువ తీరప్రాంతం ఉంది. ఏనిమిది వేల మంది మత్స్యకారులు ఉన్నారు. అడవిపల్లిపాలెం, దానవాయిపేట, కృపానగర్, రామచంద్రపురం, పాండురంగాపురం, సూర్యలంక, రామానగర్, ముత్తాయిపాలెం, హనుమాన్నగర్ వంటి గ్రామాల్లో సుమారు ఐదు వేల మందికిపైగా మత్స్యకారులు జీవనం సాగిస్తుంటారు. వీరిలో ఎక్కువ శాతం మంది ఇతర రాష్ట్రాలకు వేటకు వెళుతుంటారు.
మత్స్యకారులను గత ప్రభుత్వం ఆదుకుంది. గతంలో వేట నిషేధానికి సంబంధించిన భత్యం కూడా ఈపాటికే అందించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. రేపల్లె ప్రాంతంలో ఉన్న సబ్సిడీ డీజిల్ను కూడా వైఎస్సార్సీపీ బాపట్లకు తెచ్చి మేలు చేసింది.
– కొక్కిలిగడ్డ చెంచయ్య,
మత్స్యకార కార్పొరేషన్ మాజీ డైరెక్టర్
బాపట్ల ప్రాంతానికి చెందిన మత్స్యకారులకు ఎంతో డిమాండ్ ఉంటుంది. మన రాష్ట్రంలో వేట నిషేధం సమయంలో ఇతర రాష్ట్రాలకు వేట నిమిత్తం వెళ్లటం సహజం. ఈ నెలాఖారు నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాం.
–బాలచంద్ర, మత్స్యకారుడు
వలస వేదన
వలస వేదన
వలస వేదన


