పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భావన వశిష్ట చీరాలలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర ర్యాలీ
చీరాల టౌన్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటుగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భావన వశిష్ట సూచించారు. శనివారం పట్టణంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖరనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. చీరాల రైల్వేస్టేషన్ నుంచి ఎన్ఆర్ అండ్ పీఎం హైస్కూల్ వరకు ప్రభుత్వ అధికారులు, కళాశాలలు, హైస్కూళ్ల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. వీధుల్లో వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచడం వలన కలిగే ఫలితాలపై ప్లకార్డులతో విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలతో కలిసి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ మానవహారం ఏర్పాటు చేయడంతో పాటు ‘నాఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతానంటూ కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అలానే ఈనెల 26న రేపల్లెలో నిర్వహిస్తున్న జాబ్మేళాకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల స్టాళ్లతో పాటుగా చేనేత వస్త్రాల స్టాల్ను ప్రత్యేకంగా సందర్శించి చేనేత వస్త్రాల గొప్పతనం గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జి కలెక్టర్ భావన వశిష్ట మాట్లాడుతూ అభివృద్ధి చెందే దేశాల సరసన భారత దేశం నిలిచిందని.. అభివృద్ధి, ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. ప్రజలంతా దీనిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చీరాల ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు మాట్లాడుతూ వ్యర్థ రహిత పాలనకు ప్రజలంతా సహకరించాలన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ను నిషేధించాలని.. అందుకు అధికారులు కూడా పూర్తి సహకారం అందించాలన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాలను నిషేధించి గుడ్డ సంచులు, జూట్ బ్యాగులు వాడాలన్నారు. మున్సిపల్ కమిషనర్ డానియేల్ జోసఫ్, సీపీఓ షాలేమ్రాజ్, నైపుణ్యాభివృద్ధి మేనేజర్ మాధవి, ఆర్టీసీ డీఎం శ్యామల, సర్వే ఏడీ ముసలయ్య, మున్సిపల్ డీఈ రఘురామ్, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిద శాఖల అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.


