నకరికల్లు– వాడరేవు జాతీయ రహదారి పనులు కొలిక్కి
నరసరావుపేట: నకరికల్లు– వాడరేవు జాతీయ రహదారి(167ఏ) పనులు నరసరావుపేట నియోజకవర్గంలో మొదలు కాబోతున్నాయి. దీనికి సంబంధించిన సర్వేను అధికారులు దాదాపుగా పూర్తి చేసి హద్దు రాళ్లు వేశారు. నేషనల్ హైవే చీరాల, చిలకలూరిపేట, నరసరావుపేట, నకరికల్లు మండలాల మీదుగా నాలుగు వరుసల్లో 45 మీటర్ల వెడల్పున 107 కి.మీ దూరం సాగుతుంది. ఇది నరసరావుపేట నియోజకవర్గంలో రైతుల వ్యతిరేకత కారణంగా కొంతకాలం పాటు సర్వే పనులు సాగలేదు. హైవే కేసానుపల్లి, నరసరావుపేట రూరల్, నకరికల్లు మండలాల మీదుగా 1.89 కిలోమీటర్ల దూరం సాగుతుంది. దీని వలన పట్టా భూమి 17.49 ఎకరాలు, ప్రభుత్వ భూమి 1.65 ఎకరాలను రైతులు కోల్పోతున్నారు. 42 మంది చేతిలో పట్టాభూమి ఉండగా 15 మంది చేతిలో ప్రభుత్వ భూమి ఉంది. దీంతో పాటు తొమ్మిది లే అవుట్లు కూడా హైవేలో కలవటం వలన 148 మంది ప్లాటుదారులు నష్టపోతున్నారు. వీరందరూ తమకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం పెంచి ఇవ్వాలని కోరుతూ కోర్టు కెక్కారు. తాత్కాలిక స్టే మంజూరు కావటం, ప్రభుత్వాధికారుల వివరణతో ఆ స్టేను కోర్టు తొలగించటం జరిగింది. ఇటీవల జాయింట్ కలెక్టర్ సంజనా సింహా సర్వే పనులను పరిశీలించి బాధిత రైతులతో కూడా మాట్లాడారు. వారికి అందాల్సిన నష్టపరిహారంపై ధైర్యం చెప్పారు. ఎట్టకేలకు జిల్లా కేంద్రంలో పనులు ప్రారంభమవుతుండడంతో ఆ రహదారి చుట్టుపక్కలనున్న భూములకు ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే ఎకరా రూ.2 నుంచి రూ.5 కోట్లు వరకు ధర పలుకుతున్నాయి. వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముకొని చేతులు దులుపుకునే పనిలో రియల్టర్లు ఉన్నారు.
సర్వే దాదాపుగా పూర్తిచేసిన అధికారులు


