పాల డెయిరీల్లో తనిఖీలు నిర్వహించాలి
పాల డెయిరీల్లో తనిఖీలు నిర్వహించాలి
గుంటూరు మెడికల్: తెల్లనివన్ని పాలు కావని, పాలడెయిరీల్లో వెంటనే శాంపిల్స్ తీసి పరీక్షలు చేయాలని జాతీయ వినియోగదారుల సమాఖ్య సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు బాబు డిమాండ్ చేశారు. శనివారం పాతగుంటూరులోని గర్తపురి కన్జ్యూమర్స్ కౌన్సిల్ ఆఫీస్లో జరిగిన సమావేశంలో డాక్టర్ హరిబాబు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పాల ఉత్పత్తులకు సంబంధించి గత ఏడాది ప్రతి వంద శాంపిల్స్లో 38 శాతం పరీక్షల్లో విఫలం అవడం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమన్నారు. ప్రతి మూడు శాంపిల్స్లో ఒకటి కల్తీ రావడం చాలా బాధాకరమన్నారు. బడికి వెళ్లే పిల్లలు ఉదయం, సాయంత్రం గ్లాసు పాలు తాగుతుంటారని, పాలు నిత్యవసర వస్తువుల్లో ఒకటిగా మారాయన్నారు. అందరూ పాలల్లో పోషక విలువలు ఉంటాయని తాగితే ఆరోగ్యకరమని అనుకుంటారని పేర్కొన్నారు. కాని, నేడు పాలు తాగాలంటే భయమేస్తుందన్నారు. మనం తాగుతుంది విషమా, పాలా అనే ఆలోచనలో అందరూ ఉన్నారన్నారు. ఐపీఎం డైరెక్టర్ నీలకంఠారెడ్డి దీనిపై దృష్టి సారించి, 26 జిల్లాల్లో ఉన్న పాలడెయిరీలపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి, శాంపిల్స్ సేకరించి ఫలితాలు బహిరంగంగా ప్రకటించాలని కోరారు. దీనిపై తక్షణమే స్పందించాలని కోరుతూ వినియోగదారుల సంఘం తరఫున లేఖ పంపుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా వినియోగదారుల రక్షణ సమితి సభ్యుడు బి.నాగేశ్వరరావు, మునిపల్లి కవిత, బేబి సరోజిని, జొన్నలగడ్డ వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.
చీరాల వాసి తెలంగాణలో మృతి చీరాల రూరల్: చీరాలకు చెందిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు చీరాల జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య శనివారం తెలిపారు. మృతుని వయసు సుమారుగా అరవై ఏళ్లకు పైగా ఉంటాయని, మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. చీరాల నుంచి సికింద్రాబాద్ వరకు రైలు టికెట్ మాత్రమే అతని వద్ద ఉందని తెలిపారు. మృతునికి సంబంధించిన సమాచారం ఎవరికై నా తెలిసినట్లయితే చీరాల జీఆర్పీ పోలీసులకు సమాచారం 8712658602 నంబర్కు తెలియజేయాలని కోరారు.
లైంగిక వేధింపుల కేసులో జైలు
పెనమలూరు: బాలికను లైంగికంగా వేధించిన నిందితుడికి జైలు శిక్ష పడిందని సీఐ వెంకటరమణ తెలిపారు. శనివారం ఈ కేసు వివరాలను సీఐ తెలిపారు. 2021 సంవత్సరంలో వణుకూరు గ్రామంలో 11 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల కలపాల స్వామియేలు ఆమెను తాగడానికి నీళ్లు అడిగి, ఆమెను తాకి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఎనిమిది మంది సాక్షలను విచారించిన న్యాయమూర్తి వేల్పుల భవాని ఈ నెల 20వ తేదీన తుది తీర్పు ఇచ్చారు. నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు.
1/1
పాల డెయిరీల్లో తనిఖీలు నిర్వహించాలి