ఆటోను ఢీకొట్టిన లారీ
ఇంకొల్లు(చినగంజాం): ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. ఘటన ఇంకొల్లు మండలంలోని దుద్దుకూరు గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన 8 మంది వ్యవసాయ కూలీలు దుద్దుకూరు ఉత్తరపు పొలాల్లో శనగ కోసే పనులు పూర్తి చేసుకొని ఒకే ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో వారికి సమాంతరంగా వస్తున్న సిమెంట్ లోడు లారీ ఆటోను కుడివైపున బలంగా ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో కుడివైపును కూర్చొన్న ఇరువురు దునిమిద్దుల తిమోతి (25), గుంటూరు గౌరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని దుద్దుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. గాయాలపాలైన వారిలో తిమోతికి అతనికి ఎడమ వైపున మెడ వద్ద పుట్టుకతో వచ్చిన గడ్డ పగలడంతో తీవ్ర రక్తస్రావమై చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుంటూరు గౌరి కుడి కాలు, కుడి చేయి విరిగింది. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ జీ సురేష్ తెలిపారు.


