దళితులపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
●బాణసంచా ప్రమాద బాధితులకు కోటి పరిహారం చెల్లించాలి
●కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్
చీరాల రూరల్: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి విమర్శించారు. ఆదివారం పేరాలలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కులాంతర వివాహాలకు ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కులాంతర వివాహాల ద్వారానే కుల నిర్మూలన జరుగుతుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పారని, ఆయన ఆశయాలకు ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని మండిపడ్డారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణసంచా ప్రమాదంలో 20 మంది వరకు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్ణకరమని అన్నారు. ఆ ఘటనలో అశువులు బాసిన కార్మికులకు ప్రభుత్వం నామమాత్రంగా ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రకటించిందని, అవి ఏమాత్రం సరిపోవని, ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫైర్ ఇంజిన్ కూడా వెళ్లలేని చోట ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసి ప్రజల ప్రాణాలు తీసేందుకు పరోక్షంగా దోహదపడిందని ఆరోపించారు. ఆడ పిల్లల విషయంలోగానీ, కల్తీ పాల విషయంలోగానీ, బాణసంచా విషయంలోగానీ ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా అటువంటి అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. మార్చి 14 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాయకులు లింగం జయరాజు, కోలా శరత్, నలతోటి బాబూరావు పాల్గొన్నారు.


