చిన్నారిని చిదిమేసిన టాటా ఏస్ వాహనం
తీవ్రగాయాలతో మృతి
చీరాల: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని మృత్యురూపంలో వచ్చిన టాటా ఏస్ వాహనం చిదిమేసింది. ఏం జరిగిందో తెలిసేలోపే తీవ్రగాయాలతో మృతి చెందింది. ఈ విషాద సంఘటన గురువారం రాత్రి చీరాల మండలం కొత్తపాలెంలో చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు... చీరాల మండలం కొత్తపాలెంలో నివాసముంటున్న కొమరగిరి పూజ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు రెండు సంవత్సరాల సాయిదుర్గ అనే పాప ఉంది. గురువారం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలను దించేందుకు వచ్చిన టాటా ఏస్ వాహనం అదుపుతప్పి ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సాయిదుర్గను బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. పాప తలకు తీవ్రగాయం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు హుటాహుటిన చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు చిన్నారిని పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న చిన్నారి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న చీరాల వన్టౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై జి.రాజ్యలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం హాస్పిటల్లో చిన్నారి తల్లితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే వాహనం డ్రైవర్ సంఘటన స్థలంలోనే వాహనాన్ని వదిలి పరారయ్యాడు. చిన్నారి మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


