పచ్చమూకల పైశాచికం | - | Sakshi
Sakshi News home page

పచ్చమూకల పైశాచికం

Feb 25 2026 9:03 AM | Updated on Feb 25 2026 9:03 AM

పచ్చమూకల పైశాచికం

పచ్చమూకల పైశాచికం

వైఎస్సార్‌సీపీ నేత బీరవల్లి రామిరెడ్డిపై హత్యాయత్నం ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి.. విరిగిన కాళ్లు, ఎడం చేయి పల్నాడు జిల్లా జూలకల్లులో ఘటన

పిడుగురాళ్ల రూరల్‌/పిడుగురాళ్ల: అధికారం అండతో పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్‌ చేసి.. విచ్చలవిడిగా హత్యాయత్నాలు, హత్యలకు పాల్పడుతూ రక్త దాహం తీర్చుకుంటున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా జూలకల్లులో ఓ వైఎస్సార్‌సీపీ నాయకుడిపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేశారు. ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో.. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాలు.. జూలకల్లు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు బీరవల్లి రామిరెడ్డి వర్షం పడేలా ఉండటంతో సోమవారం అర్ధరాత్రి పొలానికి వెళ్లాడు. మొక్కజొన్న కండెలపై పట్టాలు కప్పి ఇంటికి బయల్దేరాడు. అప్పటికే ఆయనపై నిఘా పెట్టిన టీడీపీ గూండాలు ఇనుముక్కల సామేలు, షేక్‌ దాదాసాహెబ్‌, చల్లా మోజెస్‌, సింహాద్రి మరికొందరు ఒక్కసారిగా రామిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. రామిరెడ్డి స్పృహ కోల్పోవడంతో.. వారంతా వెళ్లిపోయారు. అనంతరం కొద్దిసేపటికి అటుగా వెళ్లిన కొందరు.. రామిరెడ్డిని చూసి కుటుంబసభ్యులకు, బంధువులకు సమాచారమిచ్చారు. కుటుంబసభ్యులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని రామిరెడ్డిని పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. రామిరెడ్డి కాళ్లు, ఎడం చేయి విరిగినట్లు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, బీరవల్లి రామిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్‌రెడ్డి పరామర్శించారు. గురజాల నియోజకవర్గంలో గూండా రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. జూలకల్లులో ఇప్పటికే ఆరుగురిపై టీడీపీ గూండాలు దాడి చేశారని చెప్పారు. ఇంకా మూడేళ్లు మాత్రమే ఉందని.. దాడులు చేసే వారు, చేయించే వాళ్లు ఇంతకింతా అనుభవించే రోజులు వస్తాయన్నారు. చట్టపరంగా శిక్షలు పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

గురజాలలో రౌడీ రాజ్యం

పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి పట్టణంలోని పల్నాడు హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న బీరవల్లి రామిరెడ్డిని ఆయన పరామర్శించారు. మహేష్‌రెడ్డి మాట్లాడుతూ పాపం పండే రోజు త్వరలోనే వస్తుందన్నారు. జూలకల్లు గ్రామంలో ఇప్పటికే ఆరుగురిపై విచక్షణా రహితంగా దాడి చేశారని, ఏ కారణం లేకపోయినా కేవలం బెదిరించటానికి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. చేసిన వాళ్లు, చేయించిన వాళ్లు గుర్తు పెట్టుకోవాలని, ఇంకా మూడేళ్లు మాత్రమే ఉంటుందని, మూడేళ్ల తర్వాత పాకిస్తాన్‌ వెళ్తారా, ఆప్ఘనిస్తాన్‌కు వెళ్తారా, భారతదేశంలోనే కదా ఉండేది, ఇంతకంతకు అనుభవించే రోజులు వస్తాయని, చట్టపరంగా శిక్షలు పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. కావాలని కాపు కాచి కొడుతున్నారని, పోలీసుల అండ చూసుకొని, ప్రభుత్వం మారిన రోజున ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, దీనికి రెట్టింపు పునరావృతం అవుతాయని, ఆ రోజు మీకే తెలుస్తుందని పేర్కొ న్నారు. అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గూండాయిజం చేస్తున్నారని అన్నారు.వైఎస్సార్‌ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు మాదాల కిరణ్‌కుమార్‌, చింతా సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ అలుప పిచ్చిరెడ్డి, జూలకల్లు సర్పంచ్‌ లంజపల్లి అంకారావు, ఎంపీటీసీ రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement