రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది
అంబటిని పరామర్శించిన పలువురు ఎమ్మెల్సీలు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును గురువారం ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, టి.మాధవరావు, బొమ్మి ఇజ్రాయేల్, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, ఇస్సాక్ బాషా, వంకా రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్బాబు, కాసు మహేష్ రెడ్డి, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్బాబు), వినుకొండ, పెదకూరపాడు పార్టీ పరిశీలకులు యెనుమల మురళీధర్రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ మాట్లాడుతూ రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఒక మాజీ మంత్రికే రక్షణ లేకపోతే..సామాన్యుడి పరిస్థితి ఏంటని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ బిహార్ రాష్ట్రం కంటే దిగజార్చి చంద్రబాబు పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ అంబటి ఇంటిపై దాడిని దేశం అంతా చూసిందన్నారు. ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ అంబటిపై కావాలనే చంద్రబాబు ప్రభుత్వం దాడి చేయించిందన్నారు.


