డిపోలు, గ్యారేజీల ప్రైవేటీకరణ విరమించాలి
చీరాల: డిపోలు, గ్యారేజీల ప్రైవేటీకరణను విరమించాలని కోరుతూ ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నానుద్దేశించి ఎస్డబ్ల్యూఎఫ్ డిపో కార్యదర్శి బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండులు, గ్యారేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్యారేజీలు, డిపోలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా ఆర్టీసీ ఆస్తులను కోల్పోవడంతో పాటు వేల మంది కార్మికుల ఉపాధి, ప్రజల సౌకర్యం దెబ్బతింటుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటికీ అందుకు తగిన బస్సులు, సిబ్బందిని పెంచకుండా ఉన్న సిబ్బందిపై భారం మోపిందన్నారు. పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త బస్సులను ఆర్టీసీ యాజమాన్య నిర్వహణలో నడపాలని కోరారు. వేల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయకుండా ఔట్సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని తీసుకునేందుకు ప్రయత్నం చేయడమే కాకుండా ప్రైవేటీకరించాలని చూడడం ప్రజల ప్రయాణ సౌకర్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడమేనన్నారు. జీఓ నెం. 88ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ప్రమాదాల తీవ్రత పెరుగుతుందని, ప్రయాణికుల భద్రత ఉండదన్నారు. చార్జీల భారం ప్రయాణికులపై పడుతుందన్నారు. ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలన్నారు. నాయకులు కేబీకే రెడ్డి, తులసిరావు, వైవీ రావు, వెంకటేశ్వర్లు, జయరావు, బాష, ఎస్ఆర్ఎం రావు, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం.మాణిక్యరావు, సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.బాబూరావు, ఎం.వసంతరావు, జేవీవీ నాయకులు నారపరెడ్డి, బీఎస్ఎన్ఎల్ యూనియన్ నాయకులు బట్టు సుబ్బారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో
ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా


