గుర్తింపు సంఖ్య ఉంటేనే ప్రభుత్వ పథకాలు
వేటపాలెం: అన్నదాతలకు గుర్తిపు ఐడీ నంబరు ఉంటేనే ఇక నుంచి ప్రభుత్వ పథకాలు అందుతాయి. ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డుల తరహాలోనే ఫార్మర్ రిజస్ట్రీ కార్డులను ప్రభుత్వ యంత్రాంగం జారీ చేస్తుంది. ఫార్మర్ రిజిస్ట్రీ పేరిట ప్రత్యేక యాప్ ద్వారా చేపడుతున్న నమోదు ప్రక్రియ ద్వారా 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను ప్రతి రైతుకు జారీ చేస్తారు. సాగుచేసే ప్రతి రైతు ఈ గుర్తింపు నంబర్ను కలిగి ఉండటం ద్వారా భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పీఎం కిసాన్ ఆర్థిక సహాయం, పంట బీమా, వ్యవసాయ పరికరాల డ్రోన్లు పెట్టుబడి సాయం, బ్యాంకు రుణాలు ఎరువులు, విత్తనాలు రాయితీలు, పంటలు అమ్మేటప్పుడు సౌలభ్యం తదితర ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాలను పొందడానికి అర్హుడు అవుతారు. అంతే కాకుండా ఈకేవైసీ పథకానికి ఫార్మర్ రిజిస్ట్రీ విశిష్ట సంఖ్య అవసరం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడంతో విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో వేగవంతం చేశారు. చీరాల రూరల్, వేటపాలెం మండల పరిధిలో దాదాపు 1000 హెక్టార్లులో ప్రస్తుతం వరి పంట కొంత మంద కోతలు కోసి ఉండగా మరి కొంత మంది కోతలు కోయాడానికి సిద్ధంగా ఉన్నారు. తీర ప్రాంత ఇసుక భూముల్లో వేరుశనగ మొక్కజొన్న పంటలు సాగు చేసి ఉన్నాయి. భూమి కలిగిన రైతులు అందరికి విశిష్ట నంబరు తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంది.
నమోదు చేసే విధానం..
భూమి కలిగిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం, 1 బీ అడంగళ్ల, ఆధార్ కార్డు కాపీలతో పాటు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న ఫోన్ నంబరు వారి గ్రామంలోని సచివాలయానికి అనుబంధంగా ఉన్న రైతు సేవా కేంద్రానికి తీసుకు వెళ్లాలి. అక్కడ గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) సంబంధిత పోర్టల్లో ఫార్మర్ నమోదు ప్రక్రియను చేపడతారు. ఈ క్రమంలో ఫోన్ నంబర్కు వచ్చే మూడు ఓటీపీలు చెప్పాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతం అయినట్లు ఫోన్కు సమాచారం వస్తుంది. దీంతో నమోదు ప్రక్రియ పూర్తియినట్లు భావించాలి. ఇలా నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు పక్కాగా అందుతాయి. విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే రైతు సంక్షేమ కార్యక్రమాలు అర్హులుగా అందించేందుకు వీలవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నమోదు ప్రక్రియ పూర్తయిన తరువాత రైతులకు జారీ చేసిన విశిష్ట గుర్తింపు సంఖ్యను భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ గుర్తింపు సంఖ్యను మర్చిపోయినా రైతు సేవా కేంద్రానికి వెళ్లి, తమ భూమి వివరాలు ఇచ్చి సదరు నెంబరు సంఖ్యన తెలుసుకొనే అవకాశం ఉంటుంది.
అన్నదాతకు విశిష్ట గుర్తింపు సంఖ్య
జారీ చేస్తున్న కేంద్రం


