మాజీ మంత్రి అంబటికి పరామర్శ
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : గుంటూరు సిద్ధార్థనగర్లోని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబును పలువురు నేతలు పరామర్శించారు. అంబటితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గం సమన్వయకర్త కంభం విజయరాజుతో పాటు ఆ నియోజకవర్గ మండల అధ్యక్షులు, పలువురు ఎంపీటీసీలు రాయకుల సత్యన్నారాయణ, శాంతారావు, తమ్మిశెట్టి గిరిజ, బొల్లు వెంకట సత్యన్నారాయణలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు అంబటి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ టీడీపీ గూండాలు రాజకీయంగా అంబటిని ఎదుర్కోలేక భౌతిక దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.
దివ్యాంగుల విభాగం నేతల పరామర్శ
వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బందెల కిరణ్రాజు, నాయకులు కొమ్మిరెడ్డి శివారెడ్డి, శంకర్, కొండరాజు, షేక్ బాబ్జీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి తదితరులు రాంబాబును పరామర్శించారు.
హైకోర్టు ఉత్తర్వులు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణపై పోలీసులు మోపిన అక్రమ కేసులో ఎలాంటి అరెస్టు చేయవద్దని సూచిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సోమవారం అందాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 31వ తేదీన గుంటూరు సిద్ధార్థనగర్లోని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు చెందిన ఇల్లు, కార్యాలయంపైనా, ఆయనపైనా టీడీపీ గూండాలు దాడి చేశారు. అనంతరం పోలీసులు రాంబాబుపైనే కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 4వ తేదీన గుంటూరు నగరానికి విచ్చేశారు. ఆ పర్యటనలో పాల్గొన్న వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పోలీసు యాక్ట్ 30ను అతిక్రమించారని, నిబంధనలకు విరుద్ధంగా జనాన్ని సమీకరించారని, రోడ్డు దిగ్బంధం చేశారని గుంటూరు పట్టాభిపురం పోలీసులు అభియోగం మోపుతూ అక్రమ కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన మురళీకృష్ణ హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఏడు సంవత్సరాల లోపు శిక్ష ఉన్న ఏ కేసులోనూ అరెస్ట్ చేయడానికి వీలులేదని, నోటీసు ఇచ్చి విచారణ జరుపుకోవచ్చని తేల్చి చెప్పారు. ఎటువంటి అరెస్ట్లు చేయవద్దని స్పష్టంగా పేర్కొన్నారు.


