ప్రగతి.. తీరని కలే!
వనరులను వినియోగించుకోవటంలోనూ విఫలం
● వాడరేవులో ప్రారంభానికి ముందే
శిథిలమవుతున్న ప్రభుత్వ అతిథి గృహం
● వాడరేవు, పొట్టిసుబ్బయ్యపాలెం
మధ్య కనుమరుగవుతున్న చెట్లు
● రామాపురం రోడ్డులో సా...గుతున్న
కల్వర్టులు, తారు రోడ్డు నిర్మాణ పనులు
చీరాల అర్బన్: చంద్రబాబు ప్రభుత్వంలో తీరప్రాంత అభివృద్ధికి, పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని పాలకులు, అధికారులు పదే పదే చెబున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎం.ఎం కొండయ్య కూడా పలు సందర్భాల్లో తీరంలో పర్యాటరంగం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఇది ఒక కోణం. అయితే తీరప్రాంతంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పర్యాటకులు, ప్రజలు అంటున్నారు. ఉన్న వనరులను వినియోగించుకోలేకపోవటం. మొంథా తుఫాన్ సమయంలో దెబ్బతిన్న రోడ్డు, కల్వర్టుల నిర్మాణ పనులు నత్తకు పోటీపడుతూ సా..గుతుండటం అందుకు నిదర్శనమంటున్నారు.
కనుమరుగవుతున్న మడ చెట్లు
సముద్రతీరంలో రక్షణ కోసం ఉండే మడచెట్లు క్రమేణా కనుమరుగవుతున్నాయి. వాస్తవానికి తీరంలో మత్స్యకారులకు సంధికాలం సమయంలో భృతికి కొంత ప్రాంతాన్ని అప్పట్లో ప్రభుత్వం కేటాయించింది. అందులో సర్వి, యూకలిప్టస్ వంటి చెట్లు పెంచుకుని వాటిపై వచ్చే ఫలసాయంతో జీవించేందుకు. తుఫాన్లు, వరదలు, సునామీ లాంటి విపత్తుల సమయంలో సముద్రపు అలల తాకిడిని నియంత్రించేందకు మడచెట్లు ఉండేవి. అయితే అటు మత్స్యకారులకు కేటాయించిన ప్రాంతాల్లోను, సహజసిద్ధంగా ఉన్న మడచెట్లు క్రమేణా కనుమరుగవుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం సునామీ వచ్చింది. అప్పట్లో పొట్టిసుబ్బయ్యపాలెం తీరంలో సుమారు 10 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో క్రమేణా మడచెట్లు పూర్తిగా మాయమైతే సునామీ లాంటి విపత్తులు ఏర్పడితే జరిగే దుష్పరిణామాలను ఊహించలేమంటున్నారు. వాటి సంరక్షణపై పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో కురిసిన వర్షాలకు వాడరేవు, రామాపురం మధ్య పలుచోట్ల కల్వర్టులు, కొంతమేర రోడ్డు, లో లెవల్ బ్రిడ్జి దెబ్బతిన్నాయి. తుఫాన్ ప్రభావం పోయి నెలలు అవుతోంది. తిరిగి వాటి నిర్మాణ పనులు మాత్రం సా..గుతూనే ఉన్నాయి.
చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో ఓ అతిథి గృహం ఉంది. ఆ గృహం ప్రారంభానికి ముందే ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. అందులోని కలప, ఇతర విలువైన సామాను చోరుల పాలయ్యింది. ఈ క్రమంలో దానిని వినియోగంలోకి తెస్తే ఒక వైపు పలు శాఖల అధికారులకు, మరో వైపు పర్యాటకులకు తక్కువ ఖర్చుతో గదులు అద్దెకు ఇవ్వొచ్చు. ఇప్పటి వరకు దీనిపై ఎవరూ దృష్టి పెట్టలేదని, ఇది వైఫల్యం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రగతి.. తీరని కలే!
ప్రగతి.. తీరని కలే!


