కౌలు రైతులందరికీ రుణాలివ్వాలి
లక్ష్మీపురం: భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులిచ్చి, వెంటనే పంట రుణాలు మంజూరు చేయాలని, అన్నదాత సుఖీభవ కౌలు రైతులందరికీ వర్తింపచేసి రూ.20 వేలు ప్రతి కౌలు రైతుకు ఇవ్వాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు హెచ్చరించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు బొట్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ సాగు భూమిలో 70 శాతం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని, ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు పలు హామీలు ఇచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కౌలురైతుల ప్రస్తావనే లేదని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలని, జిల్లాలోని లంక భూములను సాగు చేసుకుంటున్న పేదలకు పట్టాలివ్వాలని కోరారు. కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి మన్నవ మల్లేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా భూ సేకరణ చేస్తోందని పేర్కొన్నారు. 2013 భూ సేకరణ చట్టం, ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం నాయకులు ప్రకాశరావు, రాజేంద్ర, పల్లె కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బాలరాజు, బి.కోటేశ్వరి, భద్రయ్య, రైతు సంఘం నాయకులు సాంబిరెడ్డి, కొత్తా శివరావు, కాకుమాను నాగేశ్వరరావు, సీఐటీయూ నాయకులు ఎన్. శివాజి తదితరులు పాల్గొన్నారు.
కౌలు రైతు సంఘం గుంటూరు జిల్లా
ఉపాధ్యక్షుడు పాశం రామారావు


