జాగా పేరిట బాబు దగా
డబ్బులు పడటం లేదు
చంద్రబాబు మార్క్ రాజకీయం మరోసారి రుజువైంది. ఎన్నికల ముందు ఒక మాట... అధికారంలోకి వచ్చాక మరో మాట అనే విషయం మళ్లీ తేలిపోయింది. ఎన్నికల వేళ పేదలకు రెండు సెంట్ల స్థలం ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ సంగతి పట్టించుకోవడం లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలంగా ఒక సెంటు ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక రెండు సెంట్లు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి నేడు తుంగలో తొక్కారు.
చీరాల అర్బన్: గత ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో ఒక్కొక్కరికి సెంటు స్థలం కేటాయించారు. అందులో గృహ నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు. వాటికి జగనన్న కాలనీలుగా నామకరణం చేశారు. లబ్ధిదారులలో సింహభాగం గృహనిర్మాణాలు పూర్తిచేసుకుని గృహ ప్రవేశాలు చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇళ్ల స్థలం ఒక్కరికీ ఇవ్వలేదు. కళ్లు కాయలు కాస్తున్నాయని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఆ మాట బహిరంగంగా చెప్తే ఏం సమస్య వస్తుందోనని మౌనంగా ఉంటున్నారు.
స్థల సేకరణ పేరుతో కాలయాపన
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరణ పేరుతో పాలకులు, అధికారులు కాలయాపన చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు రెండు సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ స్థల సేకరణ జరగలేదు. ఇంకెన్ని సంవత్సరాల సమయం కావాలో వారే చెప్పాలి. చీరాలలో ఎస్టీ సామాజిక వర్గంలో నక్కల సామాజిక వర్గం వారికి అద్దె చెల్లించే స్థోమత కూడా ఉండదు. దీంతో వారు ఎక్కడ పడితే అక్కడ డేరాలు వేసుకుని జీవిస్తున్నారు. వీధుల వెంట తిరిగి దువ్వెనలు, పిన్నీసులు, అద్దాలు తదితరాలు విక్రయిస్తూ నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు. వాటితో పొట్ట పోసుకుంటారు. వారి ఓట్లు మాత్రం కావాలి కానీ వారి అవసరాలు తీర్చేందుకు పాలకులు ముందుకు రావడం లేదు. వారికి ఆధార్కార్డు, రేషన్ కార్డు, ఓటు కార్డులున్నాయి. తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మిస్తారని ఎదురు చూస్తున్నారు.
నాకు ఆరు పదుల వయస్సు. సొంతింటి కల తీరుతుందో లేదో. ఇళ్లకు జాగాలిచ్చి కట్టిస్తామని చెప్పారు. ఎప్పుడని అడిగితే ఎవరూ కచ్చితంగా చెప్పటం లేదు. మా పని మాకు తప్పదు. కానీ గూడు ఉంటే అదో ధైర్యం. సున్నా ఖాతాలను బ్యాంకులో పుస్తకాలు తీసుకోమన్నారు. అందుకు రెండు, మూడొందలు ఖర్చయ్యాయి. రూ.1500 పడతాయన్నారు. అయితే ఖాతాల్లో కూడా డబ్బులు పడటం లేదు.
– పి.ప్రమీల, చీరాల
జాగా పేరిట బాబు దగా


