ఆటో పల్టీ.. పలువురికి గాయాలు
నాగాయలంక: మండలంలోని నాగాయలంక – అవనిగడ్డ మెయిన్ రోడ్డుపై వక్కపట్లవారి పాలెం సమీపంలో బుధవారం ప్రయాణికులతో వస్తున్న ఆటోలో సాంకేతిక లోపాల కారణంగా ఆకస్మికంగా పల్టీ కొట్టిందని ఎస్ఐ కలిదిండి రాజేష్ తెలిపారు. బాపట్ల జిల్లా అల్లపర్రు గ్రామం నుంచి నాగాయలంక మండలంలోని పర్రచివర గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో పాలెం సమీపంలోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డుపై పంటకాలువ వైపు బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో పది మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో వర్రే శివయ్య(60)కు కాలు విరిగిందని, బండ్రెడ్డి రాఘవమ్మ(60) మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని ఎస్ఐ చెప్పారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ అలపర్రుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బంధువులని, ఆటో కూడా ఆ సభ్యుల్లో ఒకరిదని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు.
వక్కపట్లవారిపాలెం వద్ద ఘటన


