ఆది పరాశక్తిగా బగళాముఖి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం ఆదిపరాశక్తి అలంకరణలో పూజలు అందుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు జరిగాయి. అనంతరం భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది.
పెదకాకాని: శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయాన్ని మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. శివాలయంలో చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 9 నుంచి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 5.30 నుంచి 9 గంటలలోపు మాత్రమే భక్తులకు స్వామి వారి దర్శనం, అభిషేకాలు, వాహన పూజలు, రాహుకేతు పూజలు, ఇతర అన్ని ఆర్జిత సేవలకు అనుమతి ఉంటుందన్నారు. అన్నప్రసాదం నిలుపుదల చేయనున్నట్లు తెలిపారు. మార్చి 4న బుధవారం ఉదయం ఆలయ ప్రోక్షణ తర్వాత భక్తులకు ఉదయం 7 నుంచి స్వామివారి దర్శనం, ఇతర అన్ని ఆర్జిత సేవలకు యథావిధిగా అనుమతి ఉంటుందని తెలిపారు.
రేపల్లె: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు కథనం ప్రకారం.. మండలంలోని మైనేనివారిపాలెం గ్రామానికి చెందిన చంద్రకళ తన భర్తతో గొడవల కారణంగా మనస్తాపానికి గురైంది. ఆదివారం రాత్రి పిల్లలతో కలిసి పెనుమూడి పులిగడ్డ వారధి వద్దకు చేరుకుంది. వారధిపై నిలబడి రోదిస్తూ కృష్ణా నదిలోకి దూకేందుకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని తల్లి, పిల్లలను సురక్షితంగా స్టేషన్కు తరలించారు. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఆది పరాశక్తిగా బగళాముఖి


