25న చలో విజయవాడను విజయవంతం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు గత ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీల అమలు కోరుతూ ఎస్టీయూ చేపట్టిన దశలవారీ ఉద్యమ కార్యచరణలో భాగంగా ఈ నెల 25వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు పిలుపునిచ్చారు. ఆదివారం కంకరగుంటలోని ఎస్టీయూ భవన్లో చలో విజయవాడ పోస్టర్లు విడుదల చేశారు. సుధీర్బాబు మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించడంతోపాటు పీఆర్సీ నివేదిక వచ్చేలోపు 30 శాతం మధ్యంతర భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు జిల్లాలోని ఉపాధ్యాయులందరూ పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.


