పిన్నెల్లిలో హింసను రూపుమాపేందుకు చర్యలు
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్
నరసరావుపేట: పిన్నెల్లి ఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ బుధవారం మున్సిపల్ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ గ్రామ ప్రజలు శాంతిని బలంగా కోరుకుంటున్నారని, పోలీసులు, ప్రజ లు, అధికారుల సహకారంతో హింసను రూపు మాపేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. ఎస్పీ బి.కష్ణారావు, డీఆర్వో నారదముని, ఆర్డీవో మురళీకృష్ణ, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.
సాల్మన్ హత్య బాధాకరం
గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో జరిగిన మందా సాల్మన్ హత్య చాలా దురదృష్టకరం, బాధాకరమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్.జవహర్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంఘటనలో దాడిచేసిన వారు, దాడికి గురైన వారు ఇరువురూ దళితులే అన్నారు. ప్రాణం పోయింది దళితుడిది కాబట్టి తమ కమిషన్కు బాధ్యత ఉందన్నారు. చాలా పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో నిజనిర్ధారణకు ఒక కమిటీని వేశామని, వీరు బాధితులతోపాటు మిగిలిన వారి నుంచి సమాచారం సేకరించి ఒక నివేదికను తయారుచేశారని చెప్పారు. ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగతమైన వివాదాల వలనే సంఘటన జరిగినట్లుగా నిజనిర్ధారణ కమిటీ నిర్ధారించిందన్నారు. ఇది ప్రేరేపితమైన సంఘటన కాదని, కేవలం యాధృచ్ఛికమైందన్నారు.
తాడికొండ: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పనున్న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపనకు జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రద్యుమ్న, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాలు బుధవారం పరిశీలించారు. ఉద్దండరాయునిపాలెం వద్ద స్థల పరిశీలన చేసి పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఆర్టిజీఎస్ అధికారులు ప్రకార్ జైన్, గీతాంజలి శర్మ, రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి కోమలి పద్మ పాల్గొన్నారు.
కొరిటెపాడు(గుంటూరు): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులోని శ్యామలానగర్లో గల రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరసన, వంట– వార్పు కార్యక్రమం ఏడవ రోజుకు చేరుకుంది. బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పీఏసీఎస్ల ఉద్యోగులు పాల్గన్నారు. ప్లకార్డులు చేతబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు నిరసన, వంట వార్పు కార్యక్రమం, 13వ తేదీన కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయాల ముట్టడి, కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. అప్పటికీ ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోతే, 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల రాష్ట్ర నాయకులు తోట వెంకట రామయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, బి.రఘురామ్, ఎస్.ఖాజామొహిద్దీన్, జీబీ రంగనాథ్, యెర్నేని పాపినాయుడు, ఎం.సత్యనారాయణ, పి.విజయభాస్కర్, పి.కృష్ణశాస్త్రి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.
తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో అక్షర ఆంధ్రా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో అక్షర ఆంధ్రా క్రింద శిక్షణ పొందుతున్న వయోజనుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, రానున్న పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని సూచించారు. పటిష్ట పర్యవేక్షణ ఉండాలని, కేంద్రంలో అభ్యసిస్తున్న ప్రతీ ఒక్కరూ చక్కని చదవడం, రాయడం రావాలని ఆదేశించారు. అక్షర ఆంధ్రాలో గుంటూరు జిల్లా ఆదర్శంగా నిలవాలని సూచించారు. తమ కేంద్రంలో 140 మంది శిక్షణ పొందుతున్నారని, మండలంలో 4100 మంది అక్షర ఆంధ్రా కార్యక్రమంలో ఉన్నారని అక్షర ఆంధ్రా పర్యవేక్షకులు దాసరి వెంకటస్వామి వివరించారు. ప్రతి రోజూ సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నామని. డ్వాక్రా, ఉపాధి హామీ సభ్యులు ఇందులో అభ్యాసకులుగా, అక్షరాస్యులుగా ఉన్న సభ్యులు వాలంటీర్లుగా ఒక్కొక్కరు 10 మందికి బోధిస్తున్నారని చెప్పారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి కె శిల్ప పాల్గొన్నారు.


