భూసార పరీక్షలపై అవగాహన అవసరం
బాపట్లటౌన్: భూసార పరీక్షలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల తెలిపారు. మండలంలోని ఈస్ట్ బాపట్లలో బుధవారం భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించారు. జేడీఏ ఎం.విజయనిర్మల మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని దానికి తగినట్లుగా ఎరువులను వినియోగించుకోవాలన్నారు. విచక్షణా రహితంగా ఎరువులు వాడటం వలన పొలంలో శత్రు పురుగులతోపాటు మిత్రపురుగులు చనిపోయి పైరుకు నష్టాన్ని కలిగిస్తాయన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనంతరం వ్యవసాయ, రైతు సాధికార సంస్థ సిబ్బందికి మట్టినమూనాల సేకరణపై శిక్షణ, అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సయ్యద్ అత్తర్ హుస్సేన్, ఏడీపీఎం జక్కుల మోహన్, ఏఓ కె.శారద, వీఏఏ టి.గోపికృష్ణ, రైతు సాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు రూరల్: సంస్కృతీ సంప్రదాయాలు, మానవత్వం కలిగిన వారు వైఎస్సార్ సీపీ శ్రేణులని బుధవారం మరోసారి నిరూపించారు. విషయమేమిటంటే.. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు రానుండగా.. స్వాగతం పలికేందుకు ఏటుకూరు బైపాస్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు, అశేష జనసందోహం ఆయన రాకకోసం ఎదురు చూస్తున్నారు.. ఈక్రమంలో జాతీయ రహదారి నుంచి గుంటూరు నగరంలోకి వెళ్లేందుకు అంబులన్స్ రావడంతో అంతా అడ్డుతొలగి.. స్వచ్ఛందంగా దారి ఇచ్చారు. అంతేకాకుండా.. దారిపొడవునా మరికొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై వెళుతూ రోడ్డుపై ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులకు అంబులెన్స్ వస్తుంది... పక్కకు తొలగండి అంటూ అంబులెన్స్కు దారిచ్చి పంపారు.
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో జాతీయస్థాయిలో నిర్వహించనున్న యూత్ ఫెస్టివల్ విజ్ఞాన్ మహోత్సవ్–2కే26కు సన్నాహాలు పూర్తయ్యాయని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గురువారం జరిగే ప్రారంభ వేడుకలకు ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్, కంపోజర్, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్ కొమండూరి రామాచారి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. 7వ తేదీన జరిగే ముగింపు వేడుకలకు 2025 ఏసియన్ చాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్, భారత హెప్టాథ్లెట్ నందిని అగసారా ముఖ్య అతిథిగా పాల్గొంటారని ప్రకటించారు. మహోత్సవ్లో రెండో రోజున ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం, మూడో రోజున ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి సందడి చేస్తారని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 50 వేల మందికి పైగా విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. పోటీల విజేతలకు మొత్తం రూ.15 లక్షలకు పైగా నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవంలో మొత్తం 80కు పైగా ఈవెంట్లు నిర్వహించనున్నారు.
భూసార పరీక్షలపై అవగాహన అవసరం


