ఇళ్ల మధ్య నుంచి హైటెన్షన్ విద్యుత్లైన్
గృహాలకు ఇబ్బంది లేకుండా చూస్తాం..
వేటపాలెం: దేశాయిపేట పంచాయతీ ఎస్సీ కాలనీ మధ్యలో నుంచి నూతనంగా నిర్మాణం చేపట్టిన 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల నిర్మాణం పనులను కాలనీ వాసులు బుధవారం అడ్డగించారు. దేశాయిపేట సిలోన్ కాలనీ వద్దగల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నుంచి కొత్తగా 33 కేవీ విద్యుత్ లైన్ చల్లారెడ్డిపాలెం పంచాయతీ బైపాస్ రోడ్డు వద్ద గల సబ్ స్టేషన్ వద్దకు హైటెన్షన్ విద్యుత్ లైన్ నూతనంగా వేస్తున్నారు. సిలోన్ కాలనీ వద్దగల సబ్ స్టేషన్ నుంచి నూతనంగా కొత్త లైన్ గ్రామ పంచాయతీ వరకు ప్రధాన రహదారి పక్క నుంచి వేశారు. అక్కడ నుంచి గ్రామం, ఎస్సీ కాలనీ మీదుగా చల్లా రెడ్డిపాలెం సబ్స్టేషన్ వరకు నిర్మాణం జరగాల్సి ఉంది. రెండు నెలల క్రితం రెండు పర్యాయాలు కాలనీ నుంచి విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్న సమయంలో కాలనీ వాసులు అడ్డుకున్నారు. దీంతో అప్పడు తాత్కాలికంగా లైన్ నిర్మాణం నిలుపుదల చేశారు. బుధవారం తిరిగి విద్యుత్ లైన్ల నిర్మాణం కోసం విద్యుత్ సిబ్బంది ట్రాక్టర్ విద్యుత్ స్తంభాలు తీసుకొని రాగా కాలనీ మధ్య నుంచి లైన్ ఏర్పాటు చేయడాని వీల్లేదని అడ్డగించారు. సమాచారం అందుకున్న ఏడీఏ పెరుగు శ్రీనివాసరావు కాలనీకి వచ్చి కాలనీ వాసులతో మాట్లాడారు. అయితే కాలనీలో నివాసులు నివాస గృహాల మధ్యలో హైటెన్షన్ విద్యుత్ లైన్లు వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇళ్ల మధ్య అధిక ఓల్టేజీ విద్యుత్ లైను వేయడానికి వీల్లేదని ఏడీఏ దృష్టికి తీసుకొచ్చారు. హైటెన్షన్ లైన్ని గ్రామ చివర నుంచి తరలించుకోవాలని కాలనీ వాసలు ఏడీఏని కోరారు. కాలనీలో కాకుండా గ్రామం చివరగా హైటెన్షన్ లైన్ డిజైన్ మార్చుకోవాలన్నారు.
పనులు అడ్డగించిన దేశాయిపేట పంచాయతీ ఎస్సీ కాలనీ వాసులు
ఎస్సీ కాలనీలో నివాసాలకు ఇబ్బంది లేకుండా లైన్ నిర్మాణం చేపడతాం. విద్యుత్ స్తంభాలు 30 అడుగుల ఎత్తులో ఉంటాయి. విద్యుత్ వైర్లు 30 అడుగుల ఎత్తులో వెళుతుంటాయి. ఇళ్లకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
– పెరుగు శ్రీనివాసరావు, ఏడీఏ, వేటపాలెం


