ఆలయ పునఃప్రతిష్ట అదృష్టంగా భావించాం
బాపట్ల: బాపట్లలోని క్షీరభావన్నారాయణస్వామి దేవాలయాన్ని పునఃప్రతిష్ట చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. దేవాలయ పునఃప్రతిష్ట సందర్భంగా చేపట్టిన పనులు, సేకరించిన నిధులకు సంబంధించిన లెక్కల ఆడిట్ రిపోర్టును మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, అప్పటి పునరుద్ధరణ కమిటీ సభ్యులతో కలసి శుక్రవారం విడుదల చేశారు. కోన మాట్లాడుతూ భావదేవున్ని ఊరేగింపునకు కాగడాల్లో నూనె కూడా లేని పరిస్థితి బాధ కలిగించినట్లు తన తండ్రి కోన ప్రభాకరరావు అప్పట్లో దీక్షితులు రచించిన భావదేవుని చరిత్ర పుస్తకంలో ముందు మాటగా రాశారని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దేవాలయాన్ని పునఃప్రతిష్ట చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమానికి అప్పటి అర్బన్ బ్యాంకు చైర్మన్ కొల్లిమర్ల సత్యనారాయణను కమిటీ అధ్యక్షులుగా ముందుకెళ్లామని చెప్పారు. ఆయన మరణంతో లెక్కలకు సంబంధించి కొద్దిపాటి ఆలస్యం జరిగిందని వివరించారు. రూ.40 నుంచి రూ.50 లక్షలలోపు విరాళాలు వస్తాయని, ఆ మేరకు పనులు పూర్తి చేద్దామని మొదలుపెట్టగా రూ.2.34 కోట్లు వరకు విరాళాలు రావడం సంతోషకరమన్నారు. స్వామివారికి వెండి, బంగారాన్ని రూ.1.11కోట్లతో కొనుగోలు చేయగా వాటి విలువ ప్రస్తుతం రూ.నాలుగు కోట్లకు పెరిగిందన్నారు. వీటితోపాటు తనకు వచ్చిన 13 వెండి కిరీటాలు, వెండి తోడుగు వంటివి తాను స్వయంగా చేయించానని చెప్పారు. ఆలయానికి దీర్ఘకాలిక ఆదాయాన్ని సమకూర్చేందుకు మాకర్లపూడి రామాంజనేయ కూటమిని అభివృద్ధి చేశామని, నెలకు రూ.2లక్షలు వరకు ఆదాయం వచ్చేవిధంగా ఏర్పాటు చేశామని చెప్పారు.పాతబస్టాండ్లోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయానికి రూ.15లక్షలు ఇవ్వటం జరిగిందన్నారు. రెండు ధ్వజస్తంభాలు కొత్తవి ఏర్పాటు చేశామని చెప్పారు. గాలిగోపురం నిర్మాణానికి అధికారులు తనతో టెంకాయలు కొట్టించారని, ఆ స్వామి ఆ పనులను మాతో చేయించుకోవటం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. వీటికి సంబంధించిన పూర్తి లెక్కలను అడిట్ చేయించామని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు చేజర్ల నారాయణరెడ్డి, వక్కలగడ్డ శ్రీనివాసరావు, రామకృష్ణ భరధ్వాజ్, గురువులు తదితరులు పాల్గొన్నారు.


