శ్రీశైలం మల్లన్న తలపాగా గ్రామోత్సవం
మంగళగిరి టౌన్: మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలం మల్లి కార్జున స్వామికి అలంకరించే తలపాగాకు మంగళగిరిలో గ్రామోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. మంగళగిరి పట్టణంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో తలపాగాకు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఓం నమశ్శివాయ నామస్మరణతో తలపాగాను శిరస్సుపై ఉంచుకుని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఊటుకూరు సుబ్రహ్మణ్యస్వామి, మాడిశెట్టి శివశంకరయ్యలు మాట్లాడుతూ మల్లికార్జున స్వామి వారి పెండ్లికుమారుని ఉత్సవం, దేవాంగులు నేసిన తలపాగా వస్త్ర విశిష్టత గురించి కొనియాడారు. రాష్ట్ర పద్మశాలీయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మంగళగిరి అధ్యక్షులు బల్లా వెంకటరమణ, అల్లక తాతారావు పాల్గొన్నారు.


