బహిరంగంగా మద్యం తాగేవారిపై చర్యలు
మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, హాజరైన జిల్లాలోని పోలీసు అధికారులు
బాపట్ల టౌన్: బహిరంగంగా మద్యం తాగే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జిల్లాలోని పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తులపై పీడీచట్టం ప్రయోగించాలన్నారు. మహిళల సంబంధిత నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్ కేసులు, హత్యా నేరాలు, దొంగతనాలు, దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, నేరాలకు పాల్పడిన వారికి న్యాయస్థానాల్లో విధించబడిన శిక్షలు, డ్రోన్ నిఘా, స్మార్ట్ పోలీసింగ్, యాప్ల వినియోగంపై అధికారులకు పలు సూచనలు చేశారు. విచారణ దశలో ఉన్న కేసుల దర్యాప్తుపై ఆరా తీశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిర్దిష్ట గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానాలలో చార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. నేరాలు జరగకుండా ముందస్తుగా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీరి ఆగడాలు అరికడితే నేరాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రేపల్లె, చీరాల, బాపట్ల డీఎస్పీలు ఎ. శ్రీనివాసరావు, ఎం.డి.మోయిన్, పి.జగదీష్ నాయక్, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ
బహిరంగంగా మద్యం తాగేవారిపై చర్యలు


