పచ్చనేతల ఆక్రమణలపై చర్యలు తీసుకోండి
పచ్చనేతల ఆక్రమణలపై చర్యలు తీసుకోండి ● ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ సీమౌత్ వద్ద సముద్రాన్ని పూడ్చివేసి సుమారు 10 ఎకరాల తీరం భూమిని చీరాల టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమించి, గుంటూరుకు చెందిన భ్రమర ఇన్ర్ఫ్రాకు అమ్మకానికి పెట్టినట్లు ఆరోపణలున్నాయి.
● పచ్చనేతల ఆక్రమణలతో చీరాల, బాపట్ల మండలాల పరిధిలో 9 గ్రామాలకు చెందిన 20 వేలమంది మత్స్యకారులు ఈపూరుపాలెం స్ట్రెయిట్కట్ నుంచి సముద్రంలోకి పడవలను తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది.
● ఏడాది క్రితమే సీమౌత్ కబ్జాకు గురికాగా మత్స్యకారులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. టీడీపీ గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావుకు చెందిన భ్రమర ఇన్ఫ్రాతోపాటు చీరాల టీడీపీ నేత బుర్ల వెంకట్రావులపై చర్యలు తీసుకొని తీరం ఆక్రమణలు అడ్డుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
● ఈ ఆక్రమణలపై సాక్షి దినపత్రిక కథనాలను ప్రచురించింది. కానీ అధికార యంత్రాంగం సర్వే పేరుతో కాలయాపన చేసి చేతులు దులుపుకుంది.
● ఆక్రమణదారులు అధికారపార్టీ కీలక నేతలు కావడంతో అధికారులు తీరం కబ్జాల జోలికి వెళ్లలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ నాగార్జునరెడ్డి జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
● స్పందించిన కమిషన్ ఫిర్యాదుపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని గురువారం జాతీయ మానవహక్కుల కమిషన్ న్యాయ విభాగం అధికారి పంకజ్ కుమార్ కయెన్ జిల్లా కలెక్టర్కు మెయిల్ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశం నాలుగు వారాల్లో చర్యలకు మెయిల్ ద్వారా ఉత్తర్వులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాలోని బాపట్ల మండలం ఈపూరుపాలెం స్ట్రెయిట్కట్ను సముద్రతీరంలో కలిసేచోట ధ్వంసం చేసి రూ.50 కోట్ల విలువైన భూములను ఆక్రమించిన గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావుకు చెందిన భ్రమర ఇన్ఫ్రా, చీరాల టీడీపీ నేత బుర్ల వెంకట్రావులపై పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 5,10, 19ల ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న వేటపాలెంకు చెందిన జర్నలిస్ట్ నాగార్జునరెడ్డి ఫిర్యాదుకు జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. ఈ మేరకు తీరం భూములు కబ్జాచేసి పర్యావరణానికి విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని గురువారం జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ను ఆదేశించింది. ఆక్రమణ దారులతోపాటు వారికి సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని సూచించింది.