బాపట్లలో టీడీపీ విగ్రహాల రాజకీయం
● రాజన్న స్మృతి వనం ప్రతిపాదన
స్థలంలో ఎన్టీఆర్ విగ్రహం
ఏర్పాటుకు సన్నాహాలు
● కౌన్సిల్ తీర్మానాలు ఉన్నా
కేపీఆర్ సర్కిల్కు అభ్యంతరాలు
● బాపట్లలో తీవ్ర చర్చనీయాంశం
బాపట్ల: జిల్లాలో టీడీపీ రోజుకో కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చి వివాదాలను రెచ్చగొడుతోంది. కొద్ది రోజుల కిందట చీరాలలోని వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కిల్లో ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని నిబంధన ఉన్నా టీడీపీ నాయకులు తిరుమల లడ్డూ విషయమై ఫ్లెక్సీ ఏర్పాటుచేసి కవ్వింపునకు పాల్పడ్డారు. తాజాగా బాపట్లలో విగ్రహాల ఏర్పాటు పేరుతో వివాదానికి శ్రీకారం చుట్టారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్మృతి వనం, చీలు రోడ్డులోని కోన ప్రభాకరరావు సర్కిల్కు కౌన్సిల్ తీర్మానం ఉన్నప్పటికీ వాటిని పెడచెవినపెట్టారు. మహానేత స్మృతి వనానికి కేటాయించిన స్థలంలో ఏకంగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు టీడీపీ నాయకులు నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం హడావిడిగా స్థల పరిశీలన చేశారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది.
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి
స్మృతివనం
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న మహానేత డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని రోడ్డు విస్తరణలో తొలగించారు. ఈ మేరకు బాపట్లలోని మార్కెట్ యార్డు వద్ద జాతీయ రహదారి పక్కన 1.5 ఎకరాలలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్మృతివనం నిర్మాణం చేపట్టేందుకు అప్పటి డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ముందుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా 2023 సంవత్సరంలో పనులకు శంకుస్థాపన చేశారు. పోలవరం నిర్మాణదాతగా ఉన్న మహానేత గుర్తుగా అదే నమూనాతో అక్కడ స్మృతివనం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు కౌన్సిల్ తీర్మానం కూడా చేపట్టారు. కొద్దిపాటి ఆలస్యం, కొంతమంది కల్పించిన కోర్టు అడ్డంకులతో ఆ పనులు నిలిచిపోయాయి. తాజాగా అదే ప్రదేశంలో ఎన్టీఆర్ విగ్రహానికి కూటమి ప్రభుత్వం ముందుకువచ్చింది. అక్కడే వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ పంతానికి పోయి స్మృతివనం కేటాయింపు స్థలం జోలికే వస్తున్నారు.
కేపీఆర్ సర్కిల్ విషయంలోనూ...
పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద ఉన్న మాజీ గవర్నర్ కోన ప్రభాకరరావు విగ్రహాన్ని రోడ్డు విస్తరణలో తొలగించారు. బాపట్ల అభివృద్ధి ప్రదాత కోన ప్రభాకరరావు జ్ఞాపకార్థం చీలు రోడ్డు సెంటర్లో కోన ప్రభాకరరావు సర్కిల్ ఏర్పాటు చేయాలని కౌన్సిల్ తీర్మానం చేసింది. కోన ప్రభాకరరావు తనయుడు రఘుపతి ఈమేరకు ఆ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. అక్కడ రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టారు. తాజాగా ఈ ప్రాంతాన్ని కేపీఆర్ సర్కిల్ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పలు సాకులు చెబుతూ కాలం గడుపుతోంది.


