‘సీఐఎస్ఎఫ్’ సైకిల్ యాత్ర అభినందనీయం
చెరుకుపల్లి: దేశంలోని తీరప్రాంతం రక్షణలో గానీ, ప్రగతిలో గానీ సీఐఎస్ఎఫ్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని అస్సాం సీఐఎస్ఎఫ్ కమాండెంట్ రోషన్ రాజా పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ యూనిట్ హెచ్పీసీఎల్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో గత 13 రోజుల క్రితం ప్రారంభమైన సైకిల్ ర్యాలీ సోమవారం చెరుకుపల్లి చేరుకుంది. సందర్భంగా స్థానిక తహసీల్దార్ సీహెచ్ పద్మావతి మండలంలోని అధికారులు, విద్యార్థులు, నాయకులతో కలసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ కమాండెంట్ రోషన్ రాజా మాట్లాడుతూ సీఐఎస్ఎఫ్ 57వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు తీర ప్రాంతంలో ఈ సైకిల్ ర్యాలీని 75మందితో పశ్చిమ తీరం గుజరాత్ నుంచి ఒక టీము, మరో 50మందితో తూర్పు తీరం పశ్చిమ బెంగాల్ నుంచి మరో టీం ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ రెండు టీములు ఈ నెల 28వ తేదీ నాటికి 1500 కిలో మీటర్లు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ గుజరాత్ నుంచి కేరళలోని కొచ్చిన్ బీచ్ కు చేరుకుంటాయని ఆయన తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీలో మహిళలు కూడా ఉన్నారని వారు కూడా పురుషులతో సమానంగా రోజుకు 100 కి.మీ వరకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం తీర ప్రాంత ప్రజలతో మమేకమవుతూ వారికి తీర ప్రాంతంలో జాతీయ భద్రత గురించి అవగాహన కల్పించటం, ఎక్కువగా తీరప్రాంతం నుంచే డ్రగ్స్ ఎగుమతులు జరుగుతుంటాయి కాబట్టి డ్రగ్స్ నియంత్రణ పై అవగాహన తో పాటు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన జాతీయ గీతమైన వందేమాతరం పాట యొక్క విశిష్టతను, జాతీయ సేవ భావనను ప్రోత్సహించటమేనన్నారు. కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ డిపూటీ కమాండెంట్ రిషబ్ దేవగన్, అసిస్టెంట్ కమాండెంట్ అరవింద్ కుమార్ శర్మ, మండల నాయకులు ఎంఆర్కే మూర్తి, దివి రాంబాబు, కొనకాల రవికిరణ్, మల్లాది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెరుకుపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మధ్యాహ్న భోజనం విరామం అనంతరం సైకిల్ ర్యాలీ కొనసాగింది.
తహసీల్దార్ సీహెచ్ పద్మావతి
చెరుకుపల్లి చేరుకున్న సైకిల్ యాత్ర


