విభిన్న ప్రతిభావంతులపై ప్రత్యేక శ్రద్ధ
ఎక్సప్షనల్ లెర్నెంగ్ ఫౌండర్ అండ్ సీఈవో జినో ఆరుషి
రేపల్లె: విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎక్సప్షనల్ లెర్నెంగ్ ఫౌండర్ అండ్ సీఈవో డాక్టర్ జినో ఆరుషి చెప్పారు. పట్టణంలోని భవిత కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించి విభిన్న ప్రతిభావంతులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. వైకల్యమనేది శరీరానికేగాని మనస్సుకు కాదన్నారు. వారి మనస్సులో ఎక్కడా వైకల్య ప్రస్తావన తీసుకురాకుండా ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు పిల్లలకు ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం కల్పిస్తే వారు అన్ని రంగాలలో ముందుకు సాగగలరన్నారు. చిన్నారుల అభివృద్ధికి దృష్టియాప్ను రూపొందించటం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు చిన్నారులకు కేంద్రంలో నేర్పించే అంశాలు, విధానాలు ఈ యాప్లో పొందుపరచటం జరుగుతుందన్నారు. ఈ యాప్ను సహిత విద్య రీసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్పీ)లతో పాటు తల్లిదండ్రుల ఫోన్లలో సైతం పొందుపరచబడునన్నారు. ఈ యాప్ను రాష్ట్రంలోని అన్ని భవిత కేంద్రాలలో ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. యాప్లో ఐఈఆర్పీలు బోధించే విధానాన్ని ఇంటి దగ్గరే ఉండి తల్లిదండ్రులు ఆ అంశాలను నేర్పిస్తూ చిన్నారులకు మరింత మానసికాభివృద్ధి చేయవచ్చన్నారు. కేంద్రాలకు వచ్చే తల్లిదండ్రులు తమ చిన్నారులతో పాటు వారి తోటి చిన్నారులకు సైతం బాసటగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా భవిత కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న బోధనా పద్ధతులు, బోధనోపకరణాలను పరిశీలించారు. భవిత కేంద్రం ద్వారా తల్లిదండ్రులు తమ చిన్నారులు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందుతున్న విధానాన్ని వివరించి, కేంద్రానికి శాశ్వతంగా ఫిజియోథెరఫిస్ట్ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లా స్థాయిలో విభిన్న ప్రతిభావంతులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో సెంటరుకు చెందిన హేమశ్రీని అభినందించారు. కార్యక్రమంలో సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్ మట్టా జ్యోత్న్స, సహిత విద్య రీసోర్స్ పర్సన్స్ ఎన్.అనురాధ, సుకన్య, సిబ్బంది సీతా మహాలక్ష్మి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


