చిలకలూరిపేట టౌన్: కఠిన శ్రమ, తండ్రి మార్గదర్శకత్వంతో విజయం వరించిందని చిలకలూరిపేటకు చెందిన సాతులూరి యమున తెలిపారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఆమె సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. యమున తండ్రి భాగ్యరావు పట్టణంలో ప్రముఖ న్యాయవాది. ఆయన బాటలోనే యమునతోపాటు ఆమె సోదరి కూడా న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. కేఎల్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేసిన తర్వాత, తండ్రి వద్దే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. రెండేళ్లుగా కోర్టు పరిసరాల్లో ఉంటూ మరింత నేర్చుకున్నారు. తండ్రి వృత్తి పట్ల ఉన్న గౌరవంతోనే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు యమున తెలిపారు. గత రెండేళ్లుగా తండ్రి పర్యవేక్షణలోనే ఉంటూ, ఆయన అందించిన శిక్షణతో సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమైనట్లు వివరించారు. తన విజయానికి స్ఫూర్తి ఆయనేనని తెలిపారు. తొలి ప్రయత్నంలోనే జడ్జిగా ఎంపికై తండ్రి పేరును, పట్టణ కీర్తిని నిలబెట్టిన యమునను న్యాయవాదులు, పట్టణ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: జిల్లాలో ‘మనబడి – మన భవిష్యత్‘ కార్యక్రమంలో పాఠశాలల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యాశాఖ అధికారి, ఎంఈఓలు, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో తక్కువ మరమ్మతులు అవసరం ఉండి, త్వరగా అందుబాటులోకి వచ్చే తరగతి గదులు, టాయిలెట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమానికి ‘100 రోజులు – 100 తరగతి గదులు’గా నామకరణం చేస్తూ జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయిన తరగతి గదులు, మరుగుదొడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


