వివరాలు వెల్లడించిన గుంటూరు డీఆర్ఎం సుధేష్ఠ సేన్ గత ఏడాది కంటే 7.65 శాతం వృద్ధి సరుకు రవాణాలో రూ.452.13 కోట్లు ఆదాయం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ రూ.766.57 కోట్ల ఆదాయం సమకూరిందని, ఇది గతేడాది కంటే 7.65 శాతం వృద్ధి అని డీఆర్ఎం సుధేష్ఠ సేన్ చెప్పారు. గుంటూరు పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని సరుకు రవాణాకు రూ.452.13 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. మార్చి నెలలో 0.6 మిలియన్ టన్నుల అత్యధిక లోడింగ్ జరిగిందని, దానికి సంబంధించి రూ.61.6 కోట్లు ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చిందన్నారు. సరుకు రవాణాలో 1376 క్రాక్ స్పెషల్ రైళ్లు 2154 రేకుల నిర్వహణ, న్యూ గుంటూరులో ఎక్స్క్లూజివ్ కార్గో టెర్మినల్ పునరుద్ధరణ జరిగిందని తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కోసం జీసీటీ ద్వారా మెరుగైన రవాణా చేశామని తెలిపారు. పండుగల సమయంలో 2,226 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద 16 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే మంగళగిరి, కంభం స్టేషన్లు సిద్ధమయ్యాయని తెలిపారు. గుంటూరు డివిజన్ పనితీరు, భద్రత, సేవలలో నూతన ప్రమాణాలు నెలకొల్పుతూ రైల్వేలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని తెలిపారు. సమావేశంలో డివిజన్ సంబంధిత విభాగాధికారులు తదితరులు పాల్గొన్నారు.


