రీ సర్వే సక్రమంగా నిర్వహించాలి
కర్లపాలెం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమం సక్రమంగా నిర్వహించాలని బాపట్ల ఆర్డీవో పి.గ్లోరియా ఆదేశించారు. గురువారం ఆర్డీవో యాజలి గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ యాజలి గ్రామ సచివాలయ పరిధిలో రీ సర్వే పనులు మందకొడిగా జరుగుతున్నాయని రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులలో అలసత్వం వహించే సిబ్బందిపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూముల రీసర్వేతో పాటు ప్రభుత్వ సర్వేలన్నీ సకాలంలో పూర్తి చేయాలని సచివాలయం సిబ్బందికి చెప్పారు. ఆర్డీవో వెంట కర్లపాలెం తహసీల్దార్ శ్రీదేవి ఉన్నారు.
ఎన్పీటీఈఎల్ ర్యాంకింగ్స్లో విజ్ఞాన్ యూనివర్సిటీకి ‘ఏఏ గ్రేడ్’
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీకి ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన జాతీయస్థాయి స్వయం ఎన్పీటీఈఎల్ ర్యాంకింగ్స్లో ప్రతిష్టాత్మక ‘ఏఏ గ్రేడ్’ లభించిందని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జి వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ స్వయం ఎన్పీటీఈఎల్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో విజ్ఞాన్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 29వ ర్యాంక్ సాధించి ‘ఏఏ గ్రేడ్’ను సొంతం చేసుకుందన్నారు.
ఎన్పీటీఈఎల్ నిర్వహించిన వివిధ ఆన్లైన్ కోర్సులలో విజ్ఞాన్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొత్తం 4,881 కోర్సు సర్టిఫికెట్లు సాధించారని తెలిపారు. వీటిలో 145 గోల్డ్ సర్టిఫికెట్లు, 424 సిల్వర్ సర్టిఫికెట్లు, 2,136 ఎలైట్ సర్టిఫికెట్లు, 2,176 సాధారణ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ఉన్నాయని వివరించారు. 61 ఎన్పీటీఈఎల్ స్టార్స్ సర్టిఫికెట్లు లభించడంతో పాటు, 106 మంది విద్యార్థులు టాపర్స్గా నిలిచారని వెల్లడించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ వరుసగా తొమ్మిదవ సారి జాతీయ స్థాయిలో టాప్–100లో స్థానం సంపాదించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ‘ఏఏ గ్రేడ్’ సాధించడానికి కృషి చేసిన టీం సభ్యులను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు.
రీ సర్వే సక్రమంగా నిర్వహించాలి
రీ సర్వే సక్రమంగా నిర్వహించాలి


