కోర్టు భవన నిర్మాణంలో నాణ్యత పాటించండి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు
పర్చూరు (చినగంజాం): పర్చూరు కోర్టు భవన నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అన్నారు. పర్చూరులోని కోర్టు భవనం శిథిలావస్థకు చేరడంతో అద్దె భవనంలోకి కోర్టును మారుస్తున్న క్రమంలో ఆదివారం అద్దె భవనాల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు పర్చూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.జాన్బాబు అధ్యక్షత వహించారు. హైకోర్టు జడ్జిలు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వై.లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. కోర్టు పాత భవనం శిథిలావస్థకు చేరినందున దాని స్థానంలో కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు అద్దె భవనంలో కోర్టు కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. కొత్త భవన నిర్మాణంలో ఎటువంటి నాణ్యత లోపాలు లేకుండా కోర్టు నిర్వహణ అవసరాలను గుర్తించి ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత విభాగాలకు సూచించారు. కోర్టు భవనాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తులు జస్టిస్ టి.సునీల్ చౌదరి, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు, ప్రకాశం జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి టి.రాజ్యలక్ష్మి, జిల్లా సెషన్స్ రిటైర్డ్ జడ్జి ఎ. భారతి తదితరులు పాల్గొన్నారు.


