నకిలీ లాకెట్తో టోకరా
మాయమాటలు చెప్పి రూ.1500 తీసుకెళ్లిన ఘనుడు కేంద్ర ప్రభుత్వ పథకం అంటూ మోసం
చీరాల: మహిళలు, వృద్ధులే టార్గెట్గా చేసుకొని వారికి మాయమాటలు చెప్పి అందినకాడికి డబ్బులు తీసుకెళ్లాడో ఘనుడు. కేంద్ర ప్రభుత్వం రజక మహిళలకు, వృద్ధులకు పింఛన్ అందిస్తున్నారని, త్వరలోనే పింఛన్లు వస్తాయని నమ్మబలికి మోసం చేశాడు. ఈ సంఘటన పేరాలలో మంగళవారం వెలుగు చూసింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు... పేరాలకు చెందిన శివమ్మ అనే వృద్ధురాలు ఇళ్ళలో పనులు చేసుకుంటూ జీవిస్తుంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి టక్ చేసుకొని టోపి పెట్టుకొని బైక్పై ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. ఆమె ఇంటి పేరుతో సహా చెప్పి మీకు పింఛన్ రావడం లేదు కదా.. త్వరలోనే మీకు పింఛన్ వస్తోందని నమ్మబలికాడు. అలానే కేంద్ర ప్రభుత్వం రజకుల్లో పెద్ద ముత్తైదువులకు విజయవాడలో పూజ చేయించిన బంగారు లాకెట్ అందిస్తున్నారని, రూ.2600లు ఇస్తే అవి మీకు పంపిస్తామని చెప్పాడు. అంత డబ్బు తమ దగ్గర లేదని చెప్పడంతో ఉన్నంత వరకు ఇవ్వమని చెప్పడంతో ఆమె వద్ద ఉన్న రూ.1500 ఇచ్చింది. ఆమెకు లక్ష్మీ దేవిబొమ్మతో ఉన్న లాకెట్ ఇచ్చి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన ఆమె పరిశీలించగా అది నకిలీ అని తేలడంతో నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత పరిసర ప్రాంతాల్లో వాకబు చేయగా మరికొందరికి ఇదే తరహాలో ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి నగదు తీసుకెళ్లాడని తెలిసింది.


